సూర్య లేక చంద్ర గ్రహణ సమయాలలో ఏమీ తినకూడదని శాస్త్రాలంటాయి. తినవచ్చని జనవిజ్ఞానవేదిక, హేతువాదం అంటాయి. ఐతే ఏది పాటించాలి అనే విషయంపై ఎన్నో వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. నాకూ శాస్త్రాలపై, సైన్సు పై గౌరవం ఉంది. ఐతే నేను శాస్త్రం చెప్పినదానికే ఓటు వేసి సూర్యగ్రహణ సమయంలో ఏమీ తినలేదు. ఒక్కటే కారణం "కృతజ్ఞత".
మన అందరికీ తెలుసు సూర్యుడి వలనే వానలూ, పంటలూ పండుతున్నాయని,మనం జీవనం సాగిస్తున్నామని. ఒక ఉదాహరణగా మనకు ఎంతో సహాయం చేసిన వ్యక్తి ప్రతిష్ఠకు అతని ప్రమేయం వలనో అతని తప్పు వలనో మచ్చ పడితే ఎంతో బాధపడతామే అలాంటిది అతని ప్రమేయం లేకుండానే ఏదైనా కళంకం కలిగిందంటే మనకు ఇంకెంత బాధ కలుగుతుందో ఊహించగలము.
నిత్యమూ మనకు సహాయపడే మనకు బాంధవులైన సూర్యచంద్రులకు గ్రహణం వలన తాత్కాలికముగా వారి సమయంలోనే వారి ప్రతిష్ఠ కు భంగం కలుగుతోంది. అంటే కనుమరుగు చేయబడుతున్నారు. లోక బాంధవులైన సూర్యుడు,చంద్రులకు సైన్సు చెప్పే ప్రకారం కావచ్చు లేక శాస్త్రాలు చెప్పే ప్రకారం కావచ్చు గ్రహణాలు ఏర్పడడం ద్వారా వారు మూసివేయబడుతున్నారు. వారి వలన ఆహారం తింటూ వారికి మచ్చ పడుతున్న సమయంలో ఆహారం తినడం కృతఘ్నత అని అనుకొంటున్నాను. అందుకే నేను తినలేదు. ఈ వాదం పిచ్చివాడి ప్రేలాపన అనుకొన్నా ఫర్వాలేదు కాని నా ఉద్దేశ్యం మాత్రం కృతజ్ఞత ప్రకటించడమే.
సచిన్ ఆట గురించి మనకు తెలుసు. క్రింది సంఘటన చూస్తే మన ప్రవర్తనతో ఎదుటివారి మనసులను ఎలా గెలుచుకోవచ్చో తెలుస్తుంది.
ఆ మధ్య ముంబాయిలో ఒక కొత్త ఇల్లు కట్టుకొన్నాడు. అతను అలా కట్టుకోవడం వలన తమ ప్రాంతంలో ఇళ్ళ ధరలు పెరిగాయని ,సచిన్ అంతటివాడు తమ మధ్యకు వస్తున్నాడని అందరూ ఆనందించారు. కాని సచిన్ ఇల్లు కట్టుకొనేప్పుడు ఎదుటివారికి కలిగే అసౌకర్యం గురించి ఎంత ఆలోచించాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటి వారికీ స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు. ఆ ఉత్తరం లోని విషయం ఇది.
అసలు సచిన్ రావడమే తమకు ఎంతో గొప్పగా, ఆనందముగా భావించారు ఆ ప్రాంతవాసులు. ఐనా వారు ఏమీ అనలేదని సచిన్ ఊరుకోలేదు. వారి అసౌకర్యం ఊహించి ఎంత గొప్పగా వ్రాశాడో కదా.
ఇలా ఎదుటివారికి కలిగే బాధను మన విధ్వంసకారులూ (చీటికీమాటికీ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగులబెడుతున్నవారు) తెలుసుకొంటే బాగుంటుంది కదా
ఈ సంఘటన నిజంగా జరిగిన సంఘటన. కంచి కామకోటి పీఠంలో జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతులవారు పీఠాధిపతిగా ఉన్న రోజులవి. ఒక రోజు ఆయన గదిలో ఉండగా ప్రొద్దునపూట అక్కడి వేదపాఠశాలలో చదివే పిల్లలు అరుస్తూ ఆడుకొంటున్న శబ్దం వినిపించింది. ఈ సమయంలో తరగతిలో చదువుకొనకుండా బయట ఎందుకు ఆడుకొంటున్నారని పరమాచార్యులవారు బయటికి వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు తరగతికి వెళ్ళలేదు? అని అడిగారు. గురువు గారు రాలేదని ఆ పిల్లవాడు చెప్పాడు. పక్కన ఆడుకొంటున్న ఇంకో పిల్లవాడు జోక్యం చేసుకొని "గురువు గారు పాఠం చెప్తున్నారు. మేమే బయటకు వచ్చి ఆడుకొంటున్నాము" అన్నాడు. ఇద్దరిలో ఎవరిది నిజమో కనుగొనడానికి పరమాచార్యులవారు ఇద్దరినీ వెంటబెట్టుకొని తరగతి గది వద్దకు వెళ్ళి చూస్తే గురువుగారు లేరు.
అప్పుడు పరమాచార్యుల వారు రెండవ పిల్లవాడితో అబద్దం ఎందుకు చెప్పావంటూ ప్రశ్నించారు. ఆ పిల్లవాడు ఏ మాత్రం భయపడకుండా " రోజూ వచ్చే మా గురువు గారు ఈ రోజు ఏదో అత్యవసర పని మీద రాలేకపోయుంటారు. వారు రాకపోయినా తరగతిలో కూర్చొని చదువుకోవలసిన బాధ్యత మాది. కాని మేము అలా చేయలేదు. అంటే తప్పు మాది. గురువుగారు రాలేదని మీరు ఆయనను కోప్పడతారు. మీ కోపాన్నుండి ఆయననను తప్పించడానికి చిన్న అబద్దం చెప్పడం నేను ధర్మమే అనుకొంటున్నాను. ఈ సమయంలో చదువుకోక ఆడుకోవడం మా తప్పే." అన్నాడు.
అంతటి నడిచే దేవుడిగా పేరొందిన పరమాచార్యులవారు కూడా ఆ పిల్లవాడి గురుభక్తిని చూసి ఆశ్చర్యం పొందారు. " నీవురా నిజమైన శిష్యుడివి "అంటూ ఆ పిల్లవాడి భుజం తట్టారు పరమాచార్యులవారు.
నేడు కళాశాల విద్యార్థులైనంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్లు ప్రవర్తిస్తూ గురువులను అవమానిస్తున్న వారిని, అలా చేయడానికి ప్రోత్సాహం ఇస్తున్న సినిమాలు,TVలు, పత్రికలు పైన పేర్కొనబడ్డ అబ్బాయి కాలి గోటికి సరిపోతారేమో ఆలోచించండి.