తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, March 19, 2014

మనం జయించామనుకుంటాం..కానీ ఇంతలో మళ్ళీ ప్రత్యక్షమవుతుంది..

నేను చాలా నాచురల్ గా ఉంటాను..ఏం పెట్టినా తింటాను..వాళ్ళ మనసు ముఖ్యం..వాళ్ళు మనస్పూర్తిగా అన్నం పెడ్తే చాలు..వాళ్ళ నుండి నాకు మర్యాద ఏమీ అవసరం లేదు..ఇలా సాగుతుంది మన ఆలోచనా వ్యవహారం.
కానీ అనుకున్నంతసేపు ఉండదు ఈ వ్యవహారం. నాకు అహంకారం అంటూ ఏదీ లేదని నేను అనుకోవచ్చు.కానీ అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. ఉదాహరణకు కలలో మనం చాలా భయపడిఉంటాము..మేల్కొన్న తర్వాత కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఈ అహంకారం కూడా అచ్చం అలాంటిదే. నేను దానిని పారద్రోలానని అనుకుంటాను.కాని అది ఎక్కడి నుండో ప్రత్యక్షం అవుతుంది.అప్పుడు నేను బాధపడుతూ"ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!" అంటాను.

గొప్పవారి నుండి సామాన్యులను దూరం చేస్తున్నదేమిటి?

ఒక చిన్నకథ.

శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి కలకత్తాలో సబ్‌జడ్జ్ గా పనిచేసి కాలధర్మం చెందిన కాశీశ్వరమిత్రా అనే వారి ఇంటికి మిత్రాగారి కొడుకులైన శ్రీనాథ్,యజ్ఞనాథ్ అనే వారి బలవంతం మీద వెళ్ళారు. వారిద్దరూ వయసులో చాలా చిన్నవారు.అక్కడ ఏదో ఉత్సవం జరిగిన తర్వాత రామకృష్ణులను మిగతా అతిథుల వద్ద ఉంచారు.కలకత్తాలోని కొందరు గొప్పవారు కూడా ఆ ఉత్సవానికి రావడం వలన వారి భోజన ఏర్పాట్లలో ఉండి రామకృష్ణులను పట్టించుకోలేదు.చాలా సమయం తర్వాత భోజనానికి పిలుపు వచ్చింది. వచ్చిన అతిథులు ఎక్కువ మంది ఉండడం చేత రామకృష్ణులకు భోజనశాలలో ఒకమూల స్థలం దొరికింది.అంతేకాక ఆ కూర్చున్న స్థలం కూడా శుభ్రంగా లేదు.

ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము?

నిజాయితీగా చెప్పాలంటే మొదట భోజనానికి ఆలస్యం అయినందుకే మనకు కోపం ఎలా ఉంటుందంటే అమిత జ్వరం వచ్చినవాడి నోటిలోని ధర్మామీటర్లో పాదరసం మట్టం ఎలా పెరుగుతూంటుందో అలా పెరుగుతూంటుంది.సరే అదలా ఉండనివ్వండి తర్వాత భోజన స్థలం,ఆ ఇరుకులో కూర్చోవడం...నిజం గా మన రక్తం ఉడికిపోతూంటుంది కదా.కోపంతో అక్కడి నుండి లేచిపోవాలనిపిస్తుంది.మనకు గతిలేక అక్కడకు వచ్చామా అని కూడా మనం అనవచ్చు.

కాని రామకృష్ణులు ఏమి చేసారు? పిలిచినవారు ఇద్దరూ వయసులో చిన్నవారు,వారికి అతిథులను సముచితరీతిలో గౌరవించడం ఇంకా అంతగా తెలియదు అనుకొని కోపం చెందలేదు.వారి ఆతిథ్యాన్ని నవ్వుతో స్వీకరించారు.
ఇక్కడ మనం రామకృష్ణుల వంటి గొప్పవారం కాదే అని అనుకోనవసరం లేదు అలా ప్రవర్తించడానికి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం.ఒక వ్యక్తి గొప్పతనం అనేది అతడు చేసే గొప్పపనుల వలన కాక నిత్యజీవితంలో చిన్నచిన్న సమస్యల పట్ల అతడి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".

ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు