తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, May 24, 2010

శృంగార రసాన్ని మనసుకు హత్తుకొనేలా తిక్కన గారి లాగా ఎందరు వర్ణించగలరు?


మహాభారతములో తిక్కన గారు ఒకచోట ఒక పద్యాన్నివ్రాశాడు. పద్యం ఏంటో, పర్వం లోనిదో గుర్తులేదు.

పద్య అర్థం ఏంటంటే

" సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు తనస్థానానికి చేరాక ఆకాశం అనే పందిరి మంచం పై సంధ్యసాయం సంధ్య ) అనే కన్య తన ఎరుపెక్కిన బుగ్గలతో
( నక్షత్రాలు అనే పూలు చల్లుతుంది. తర్వాత ప్రొద్దున కూడాసిగ్గుతో ఎరుపెక్కిన మొహంతో ఎవరైనా చూస్తారేమోనని తననాథుడైన సూర్యుడు లేస్తుండగానే (ఉదయిస్తుండగానే) నక్షత్రాలు అనే పూలను పందిరిమంచం (ఆకాశం) పై నుండితొలగించివేస్తుంది."

సాయంకాలము, ఉదయము సమయాలలో దిక్కు ఎరుపెక్కడాన్ని ఎంత బాగా తీసుకొన్నాడో కదా.
అసభ్యత అనే దుర్గంధం సోకని శృంగారరస వర్ణన ఎంత బాగుందో కదా!

Sunday, May 23, 2010

మీ చేయి ఆగినా మీ పాట అమరం - వేటూరి సుందర్రామూర్తి గారికి నివాళి


కనికరం లేని కాలం, నియమాలపై నడిచే కాలం,

మీకై తన నిబంధనలను సడలించుకోరాదా,

ఓ కాలమా ఒక చేయిని ఆపగలిగావేమో కానీ,

ఆ సాహిత్య మధురిమను కాదు,

నీలో ఉన్న నవరసాలు తనలో కూడా ఉన్నాయని ఈర్ష్యపడ్డావో ఏమో,

తనను మాకు దూరం చేసావు, అంతే నీవు చేయగలిగింది ,

తన నాదోపాసనను ఎంత మాత్రం కాదు


ఆ మహోన్నత వ్యక్తికి ఆశ్రునివాళి .
తెలుగు ఉన్నంత కాలం మీరు ఉంటారు.

Friday, May 21, 2010

రామేశ్వరుడు అనే పదానికి అసలు అర్థం ఏంటి? (ఒక సరదా కథ)


రామేశ్వరం లో ఉన్న దేవుడిని (శివలింగాన్ని) రామేశ్వరుడు అంటారని అందరికీ తెలుసు. అసలు ఈ పదానికి అర్థం ఏంటి అని ఒకసారి దేవతలకు సందేహం వచ్చింది.

పరమశివుడి వద్దకు వెళ్ళి అర్థం అడిగారు.
అప్పుడు ఈశ్వరుడన్నాడు " రామేశ్వరుడు అంటే రాముడిని ఈశ్వరుడిగా గలవాడు అంటే రాముడిని భగవంతుడిగా గలవాడు" అని. అంటే అర్థం శివుడికి దైవం రాముడు అని. దేవతలు సరేనంటూ వెళ్ళిపోయారు.

కాని వారికి ఎందుకో సందేహం వీడక శ్రీమహావిష్ణువుని అడిగారు.

అప్పుడు విష్ణువు అన్నాడు " రాముడికి ఈశ్వరుడు ఐనవాడు" అని. అంటే రాముడు భగవంతుడిగా కొలిచేవాడు రామేశ్వరుడు (రాముడికి దైవం శివుడు) అని.
దేవతలు పూర్తి గందరగోళంలో పడ్డారు.

సరేననుకుంటూ చతుర్ముఖ బ్రహ్మ గారిని అడిగారు.
అప్పుడు ఆయన అన్నారు " శివకేశవులిద్దరూ అలానే మాట్లాడతారు. కాని అసలు అర్థం అదికాదు "రాముడే ఈశ్వరుడైన వాడు" అని అసలు అర్థం. అంటే వారిరువురూ ఒకటే. ఒకే భగవంతుడు వారిద్దరిగా ఉన్నాడు అని అర్థం ". అప్పుడు దేవతలకు విషయం పూర్తిగా అర్థమై సందేహం తీరిపోయింది.

ఈ కథ ఎందులోనిదో తెలియదు. విన్నది అంతే.

Tuesday, May 18, 2010

ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు సరే,ఐతే మనకు ప్రయోజనం ఏంటి ?


"విజయం సాధించటం ఎలా?", "విజయానికి ఇన్ని మెట్లు" లాంటి పుస్తకాలు కోకొల్లలు. సరే.
కానీ మన ఆదికావ్యమైన రామాయణమును తరచిచూస్తే ఇలాంటి విషయాలు ఇందులో ఉన్నాయా అన్న ఆశ్చర్యం కలుగక మానదు.

సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని దాటడం లో , ఒక పని సాధించాలనుకొనేవారికి ఆ పనిని ఎలా సాధించాలో, మనకు నేర్పిస్తుండడం మనము గమనిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

సముద్రాన్ని దాటడం సాధించాల్సిన పని. ఆంజనేయుడు తనకు సాధ్యము కాదని ఊరికే ఒకవైపు అమాయకముగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుని శక్తిని హనుమంతునికి గుర్తుచేసాడు. ఇక్కడ ఒక పని సాధించాలి అనుకొనేవాడు మొదట తన శక్తిని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేని పక్షంలో పని కావడానికి ప్రోత్సహించే మిత్రుడి లేదా శ్రేయోభిలాషి అవసరం ఎంతైనా ఉంది. అంటే మనకు ఎలాంటి మిత్రుల అవసరం అనే విషయములో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఆలోచించాలి.

హనుమ బయలు దేరుతూ రామబాణం లా దూసుకెళ్ళి పనిని సాధిస్తానని ప్రకటించాడు. అంటే నాదేమీ లేదు భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా ఉంటాను అనే భావము కలిగిఉండాలి. అంటే అహంకారము ఉండరాదు అని నేర్పుతున్నాడు.

ఇక సముద్రాన్ని దాటేప్పుడు మొదట బంగారు శిఖరాలు గల మైనాకపర్వతం ఆతిథ్యం తీసుకొమ్మని కోరింది. కాని హనుమంతుడు అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ "మీకు ఎన్నో కృతజ్ఞతలు. కాని అత్యవసరమైన పని మీద వెడుతున్నాను. ఆలశ్యం చేయడం నాకు తగదు.పని ఐన తర్వాత మళ్ళీ కలుస్తాను" అంటూ ఒకసారి ఆ కొండను ముట్టుకొని "నీవు ఆతిథ్యం ఇచ్చినట్లే" అంటూ సెలవు పుచ్చుకొన్నాడు.
అంటే కార్యసాధనలో అలసత్వం పనికిరాదు అని, అదెటువంటి ఆకర్షణ ఐనా లొంగరాదని, అదే సమయములో ఎదుటివారు ప్రేమతో మనకు ఆతిథ్యం ఇస్తామన్నప్పుడు వారిని నొప్పించకుండా ఎలా మాట్లాడాలి, నడుచుకోవాలి అనే విషయం మనకు నేర్పుతున్నాడు.

ఇక తర్వాత సురస అనే నాగమాత నిన్ను ఆహారంగా తింటానని హనుమతో అనగా చాలా చిన్నగా మారిపోయి ఆమె నోట్లోకి దూరి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసాడు.
ఇక్కడ "అనువుగాని చోట అధికులమనరాదు" అని, ఎంత పెద్ద సమస్య ఐనా సూక్ష్మబుద్ధితో ఆలోచించి దానిని ఎలా సామరస్యముగా పరిష్కరించుకోవాలి అని, అది మన పనికి ఆటంకము కాకుండా ఎలా చూసుకోవాలి అని, కండబలమే కాదు బుద్ధిబలము కూడా అత్యవసరము అని మనకు నేర్పుతున్నాడు.

తర్వాత సింహిక అనే రాక్షసి హనుమంతుని తినబోగా ఆమె కడుపులోనికి దూరి ఆమె లోపలి అంగాలను పిండి చేసి ఆమెను చంపేసాడు.
ఇక్కడ మన కార్యసాధనలో మనం భరించలేని,తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు ఆ సమస్య యొక్క మూలాన్ని కనుగొని మూలాన్ని కనుక దెబ్బతీస్తే పునాదులు లేని భవనములా ఆ సమస్య కూడా కూలిపోతుంది అంటే పరిష్కారమవుతుంది అని నేర్పుతున్నాడు. అదే సమయములో సమస్య మూలాన్ని అన్వేషించేటప్పుడు ఆ సమస్య మనలను ముంచేయకుండా ఎంత అప్రమత్తముగా ఉండాలి అని కూడా నేర్పుతున్నాడు.ఇంతకు
మునుపు సమస్యను కేవలం బుద్ధిబలముతో పరిష్కరించాడు. కాని ఇప్పుడు బుద్ధిబలముతో పాటు సాహసాన్ని కూడా కల్గి ఉండాలని నేర్పుతున్నాడు.

తర్వాత ఇక ఏ బాధా లేకుండా సముద్రాన్ని దాటాడు.

ఇదండీ నాకు అర్థమైన హనుమంతుడి సముద్ర లంఘనం.

ఇంకా సీతమ్మను వెతకడం లో కూడా మనం తెలుసుకోవల్సింది ఎంతో ఉంది. కాని ప్రస్తుతానికి ఇలా ముగిస్తున్నాను.

ఆదిశంకారాచార్యులను స్మరించి నమస్కరిద్దాం


భజగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, మహిషాసురమర్ధిని స్తోత్రం, గణేషపంచరత్నం వంటి ఎన్నో స్తోత్రాలను మనకు అందించి అంతేకాక శ్రీభగవద్గీత లాంటి గ్రంధాలకు భాష్యములు వ్రాసి మనకు భక్తి,జ్ఞానమార్గాలను బోధించిన సాక్షాత్ కైలాస శంకరుడైన కాలడి శంకరులకు మనసా,వాచా,కర్మణా ప్రణామాలు అర్పిస్తూ అందరికీ ఆదిశంకరచార్యుల జయంతి శుభాకాంక్షలు.

M.S. సుబ్బులక్ష్మి గారి నోట అమృత సమానమైన కన్నడ పాట ( లక్ష్మిదేవి పాట)

సంగీతానికి భాషాభేధాలు లేవని, ఎవరినైనా ఆనందడోలికలలో ఊగిస్తుందని నిరూపించే క్రింది పాటను వినండి.
సుబ్బులక్ష్మి గారి నోటి ద్వారా మనకు అమృతం కురిపించిన పాట ఇది.

ఈ కీర్తన వ్రాసినవారు పురందరదాసు గారు.
మనకు అన్నమయ్య ఎలాంటివాడో కన్నడిగులకు పురందరదాసు గారు అలాంటివారు. అన్నమయ్య,పురందరదాసు గారు సమకాలికులు. కాకపోతే పురందరదాసు గారు అన్నమయ్య కంటే వయసులో చాలా పెద్దవారు.




Monday, May 17, 2010

గొప్పవారికీ, సామాన్యులకూ గల తేడా ఎక్కడ ఉంది?


ఇక్కడ గొప్పవారు అంటే డబ్బులో ధనవంతుల గూర్చి కాదు చెప్పబడుతున్నది, శీలము (character) లో గొప్పవారి గురించి.
రమణ మహర్షి జీవితములో జరిగిన చిన్న సంఘటన. ఒకసారి ఒక దుష్టుడి గూర్చి కొందరు భక్తులు మహర్షి సన్నిధిలో మాట్లాడుకుంటున్నారు. అతని దుష్టత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి మహర్షిగారు కలుగజేసుకొంటూ " మీరు దుష్టుడు అని చెప్పుకొంటున్నతడు ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేస్తాడటనే" అన్నారు.
ప్రొద్దున సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేయడం ఎంత మంచిదో మనకు తెలుసు.
ఇక్కడ ఆ దుష్టుడిలోని చెడ్డగుణాలను పట్టించుకోకుండా ఉన్న ఒక్క మంచిగుణమును మాత్రమే శ్రీరమణులు గుర్తుపెట్టుకొన్నారు.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".

ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.

తెలుగు భాష విశిష్టత - కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతుల వారి మాటలలో


తెలుగుభాషను గూర్చితెలుగులిపిని గూర్చి కొంత పరిశీలిద్దాం. ఈ రెంటిలోనూ కొన్ని విశేషా లున్నవి. పరాశక్తి యంత్రానికి తెలుగులిపి ఉపయోగింపబడ్డది. పరాశక్తి స్త్రీస్వరూపిణి. అమ్మవారికి వామావర్త పూజ ఏర్పడిఉన్నది. తెలుగులిపి కూడా వామావర్తమైనది. అనగా ఎడమప్రక్క చుట్టివ్రాయబడేది. తక్కినవి దక్షిణావర్తమైనవి. అనగా కుడిప్రక్కకు చుట్టివ్రాయబడేది. ఆవర్త మనగా చక్రం. తెలుగు వర్తులాకారలిపి, అందులోనూ వామావర్తం. వామావర్తపూజ లందుకొనే అమ్మ వారి యంత్రంలోనూ చక్రంలోనూ తెలుగులిపి వున్నది. అందుచే తెలుగులిపి పరాశక్తి ప్రధానమై ఉన్నది. తెలుగుభాష శివప్రదానం. లిపి శక్తిస్వరూపం. భాష శివ స్వరూపం. వాగర్థాలు పార్వతీపరమేశ్వరులనికదా కాళిదాసు రఘువంశంలో అన్నాడు. తెలుగుభాష శివప్రధానమైన దని గుర్తించినది అప్పయదీక్షితులవారు. వారు పరమశివభక్తులు. దక్షిణాదిని, ఆరణి (తమిళనాడు) అనుఊరికి సమీపంలోఉన్న ఆడెయపాలెం వారు పుట్టినఊరు.దక్షిణ భారతాన శివోత్కృష్టత స్థాపించినవారు. ఈక్రిందిశ్లోకం చెప్పారు.

ఆంధ్రత్వ మాంధ్రభాషా చా ప్యాంధ్రదేశః స్వజన్మభూః,

తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసః ఫలమ్||

ఆంధ్రం త్రిలింగదేశం. దేశమే లింగావర్తం అనగా లింగములతో చుట్టబడినది. దక్షిణాన దక్షిణకాశి కాళహస్తిక్షేత్రం ఉన్నది. పడమట శ్రీశైలక్షేత్రమున్నూ, ఉత్తరమున కోటిలింగక్షేత్రమున్నూ ఎల్లలుగాకలది ఆంధ్రదేశం. అట్టి త్రిలింగదేశంలో తాను జన్మించలేదన్న విషయమూ ఆంధ్రభాష తన మాతృభాష కాకపోయినదే అన్నసంగతీ ఆయనకు కొరతయట. ఇవి రెండేకాక మరొక్క కొరతకూడా ఆయన కున్నదిట.

ఆంధ్రులు శైవులైనా సరే, వైష్ణవులైనాసరే, అక్షరాభ్యాస సమయంలో ''ఓం నమః శివాయ'' అని చదువు ప్రారంభిస్తారు. జన్మతారకమైన శివపంచాక్షరి జీవితానికి ప్రథమ సోపానంగా ఈభాష నేర్చేవారికి ఏర్పడిఉన్నది. పంచాక్షరి, యజుర్వేదమధ్యంలో ఉన్నది. అంటే యజుర్వేదం శివసంబంధమైనది. దానికి తగినట్టు తెలుగువారిలో యజుఃశాఖేయులు ఎక్కువమంది
. అంటే యజుర్వేదం పఠించేవారు ఎక్కువ. సామశాఖీయులులేనేలేరు. ఋగ్వేదుల సంఖ్యకూడా తక్కువ. ఇట్లా సామశాఖేయులున్నూ పరమశివ భక్తులు అయిన అయ్యప్ప దీక్షితుల వారు శివసంబంధమైన తెలుగు దేశంలో జన్మించకపోతినే అని విచారపడేవారట. తెలుగుకు లిపి శక్తిస్వరూపమై, భాష శివస్వరూపమై ఎల్లలుత్రిలింగములై, వేదము యజుర్వేదమై ఒప్పుతుండడం ఒక విశేషం.

Friday, May 14, 2010

తర్పణం వదిలే నువ్వులు,నీళ్ళు మొదలగునవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి?

ఈ టపా కేవలం శ్రాద్ధకర్మలను నమ్మినా అసలు ఇది ఎలా సంభవం? అనే వారి కోసం మాత్రమే. దయచేసి నమ్మనివారు వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.

ఈ కర్మలలో నువ్వులు,నీళ్ళు మొదలగునవి వదులుతారు కదా? మరి అవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి అనే సందేహము వస్తుంది. బ్రతికిఉన్నవారికి ఏమైనా ఇస్తే వాళ్ళు పుచ్చుకొంటారు. మరి చనిపోయినవారికి ఎలా అందుతాయి?
ఒక చిన్నకథ ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చు.

ఒక పెద్దమనిషి తన కుమారుణ్ణి చదవటానికి పట్టణంలో వదలి పెట్టినాడు. ఆ పిల్లవాడు పరీక్షకు డబ్బుకట్ట వలసి వచ్చింది. వెంటనే తండ్రికి నీవు డబ్బును మని యార్డరు చేయవలసినదని కోరినాడు. కుమారుడు అడిగిన డబ్బు తీసుకొని తండ్రి తపాలా ఆఫీసుకు వెళ్ళినాడు. ఈ పెద్దమనిషి ఒక పల్లెవాడు,అమాయకుడు. డబ్బును తంతీ(Telegram) ఆఫీసు ఉద్యోగికి అప్పచెప్పి దానిని పంపవలసిన దని కోరినాడు- తంతుల ద్వారా ఆ డబ్బు ఉద్యోగి పంపుతాడని, ఆ అమాయకుడు అనుకొన్నాడు. ఉద్యోగి డబ్బును తీసి, మేజాలో భద్ర పరచి, సరే పంపుతాను'- అని అన్నాడు. 'నే నిచ్చిన డబ్బు నీదగ్గరే వుంచుకొన్నావే ? అది మా వాడికి ఎట్లా పోయి చేరుతుంది?' అని అతని ప్రశ్న. 'ఎట్లా చేరుతుందా? ఇదో ఈ విధంగా' అని అతడు టెలిగ్రాఫ్ మీద తంతిని పంప సాగినాడు. డబ్బు ఇక్కడే వున్నదే? ఇతడేమో పోయి చేరుతుంది అని అంటున్నాడే. ఇదెట్లా సాధ్యం? అని పల్లెటూరి వాని సందేహం సందేహంగానే నిలచిపోయింది. మనియార్డరు మాత్రం పిల్లవానికి సురక్షితంగా పోయి చేరింది.

మనం పితరులకూ(అంటే చనిపోయినవారికి), దేవతలకూ అర్పించే వస్తువులు కూడా ఈ విధంగానే చేరవలసిన చోటుకుపోయి చేరుతాయి. శాస్త్రసమ్మతంగా మనం ఈ క్రియలను నిర్వర్తిస్తే పితృదేవతలు అవి ఎవరికి పోయి చేరవలయునో వారికి చేరేటట్లు చూస్తారు. ఒకవేళ చనిపోయినవారు ఆసరికే ఎక్కడో జంతువులుగానో లేక మనుషులుగానో లేక మరే విధముగానో పుట్టిఉంటే వారికి ఆహారరూపములోనో లేక మరే ఉపయోగకరమైన వస్తువుల రూపముగానో వారికి చేరుతాయి. ఈ విధంగా వస్తువులను తగిన రూపంలో చేరవేయటానికి వలసిన స్తోమతను పితృ దేవతలకు భగవంతుడుఇచ్చి వున్నాడు. అందు చేత శ్రాద్ధంలో మనము అర్పించే వస్తువులను స్వీకరించే దానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావలసిన పనిలేదు.

శ్రాద్ధము అనగా శ్రద్ధతో చేయవలసిన క్రియ అని అర్థము.
ఒక ఉత్తరం వ్రాసి దాన్ని పోష్టు చేయబోతూ " ఈ తపాలాపెట్టె (పోష్టుబాక్సు) అందముగాలేదు, నా వద్ద ఇంతకంటే మంచి పెట్టె ఉంది. అందులో వేస్తాను" అని అనుకొంటే ఆ ఉత్తరం చేరవలసిన వారికి చేరుతుందా? అందుచేత మనం ఏ పని చేయాలన్నా మనము సఫలము కావాలి అనుకొంటే వాటివాటి విధులను పాటించాలి. పెద్దలు అందులకే 'యథాశాస్త్రం, యథావిధి' అన్నారు. కర్మ సఫలం కావాలంటే శాస్త్రవిధులను పాటించక తప్పదు.

మరోసారి మనవి చేసుకొంటున్నాను. దయచేసి నమ్మనివారు ఈ టపాను పట్టించుకోవద్దని, వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.

Thursday, April 29, 2010

చాలారోజులైంది బ్లాగు వ్రాశి, ఇప్పుడు మళ్ళీ వ్రాయాలంటే అంతా కొత్తగా ఉంది.

చాలా రోజులైంది బ్లాగు వ్రాసి. దాదాపు రెండున్నరనెలలు కావస్తోంది ఈ బ్లాగు ప్రపంచములోనికి వచ్చి. అంతా కొత్తగా ఉంది. ఎంతో మంది కొత్తగా వచ్చినట్లున్నారు మన బ్లాగులోకములోనికి. అందరికీ నా ఆత్మీయ స్వాగతం మరియు శుభాకాంక్షలు.

హరిద్వార్ కుంభమేళాకు వెళ్ళి రావడముతో మొదటిసారి భారతదేశపు విశాలత్వాన్ని, విభిన్నప్రజలను మరియు మన సనాతనధర్మ వైభవాన్ని ప్రత్యక్షముగా చూసివచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. అందుకు ఆయనకు అనంతకోటి కృతజ్ఞతలు.

ఇంకా అరుణాచలము కూడా వెళ్ళిరావడముతో అరుణాచలేశ్వర దర్శనభాగ్యము,
భగవాన్ రమణుల అశ్రమ సందర్శన భాగ్యము, వారు తపస్సు చేసుకొన్న విరూపాక్షగుహ,స్కందాశ్రమము చూసే అదృష్టము, శ్రీశేషాద్రిస్వామి ఆశ్రమ దర్శనప్రాప్తి ఇంకా అగ్నిలింగ అరుణాచల ప్రదక్షిణము అబ్బో ఆ భగవంతుని కృపను ఏమని వర్ణింపను? ఒళ్ళు పులకరిస్తోంది, తలుచుకొన్నంతనే కళ్ళు ఆనందభాష్పాలు కారుస్తున్నాయి.

ఇక మళ్ళీ బ్లాగులోకములోని ప్రవేశిస్తూ నా అనుభవాలను పంచుకుందామనుకుంటున్నాను.
అందుకు భగవంతుడిచే ఆశీర్వదింపబడెదని కోరుకొంటున్నాను.

Wednesday, January 20, 2010

పుట్టినరోజుకు అబ్దుల్‌కలాం గారి నిర్వచనం


ఈ సంఘటన BBC వారు కలాం గారిని అడిగినప్పుడు జరిగింది.

"నీ జీవితములో నీవు ఏడ్చినప్పుడు మీ అమ్మ నవ్విన రోజు నీ పుట్టినరోజు మాత్రమే" (ప్రసవదినం).


Monday, January 18, 2010

నేను గ్రహణం సమయంలో ఏమీ తినలేదు, ఎందుకంటే.........కృతజ్ఞత


సూర్య లేక చంద్ర గ్రహణ సమయాలలో ఏమీ తినకూడదని శాస్త్రాలంటాయి. తినవచ్చని జనవిజ్ఞానవేదిక, హేతువాదం అంటాయి. ఐతే ఏది పాటించాలి అనే విషయంపై ఎన్నో వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. నాకూ శాస్త్రాలపై, సైన్సు పై గౌరవం ఉంది. ఐతే నేను శాస్త్రం చెప్పినదానికే ఓటు వేసి సూర్యగ్రహణ సమయంలో ఏమీ తినలేదు. ఒక్కటే కారణం "కృతజ్ఞత".

మన అందరికీ తెలుసు సూర్యుడి వలనే వానలూ, పంటలూ పండుతున్నాయని,మనం జీవనం సాగిస్తున్నామని. ఒక ఉదాహరణగా మనకు ఎంతో సహాయం చేసిన వ్యక్తి ప్రతిష్ఠకు అతని ప్రమేయం వలనో అతని తప్పు వలనో మచ్చ పడితే ఎంతో బాధపడతామే అలాంటిది అతని ప్రమేయం లేకుండానే ఏదైనా కళంకం కలిగిందంటే మనకు ఇంకెంత బాధ కలుగుతుందో ఊహించగలము.

నిత్యమూ మనకు సహాయపడే మనకు బాంధవులైన సూర్యచంద్రులకు గ్రహణం వలన తాత్కాలికముగా వారి సమయంలోనే వారి ప్రతిష్ఠ కు భంగం కలుగుతోంది. అంటే కనుమరుగు చేయబడుతున్నారు. లోక బాంధవులైన సూర్యుడు,చంద్రులకు సైన్సు చెప్పే ప్రకారం కావచ్చు లేక శాస్త్రాలు చెప్పే ప్రకారం కావచ్చు గ్రహణాలు ఏర్పడడం ద్వారా వారు మూసివేయబడుతున్నారు. వారి వలన ఆహారం తింటూ వారికి మచ్చ పడుతున్న సమయంలో ఆహారం తినడం కృతఘ్నత అని అనుకొంటున్నాను. అందుకే నేను తినలేదు.
ఈ వాదం పిచ్చివాడి ప్రేలాపన అనుకొన్నా ఫర్వాలేదు కాని నా ఉద్దేశ్యం మాత్రం కృతజ్ఞత ప్రకటించడమే.



Friday, January 8, 2010

సచిన్ టెండూల్కర్ లా ఆలోచిస్తే ఇంతటి విధ్వంసాలు జరుగుతాయా?


సచిన్ ఆట గురించి మనకు తెలుసు. క్రింది సంఘటన చూస్తే మన ప్రవర్తనతో ఎదుటివారి మనసులను ఎలా గెలుచుకోవచ్చో తెలుస్తుంది.

ఆ మధ్య ముంబాయిలో ఒక కొత్త ఇల్లు కట్టుకొన్నాడు. అతను అలా కట్టుకోవడం వలన తమ ప్రాంతంలో ఇళ్ళ ధరలు పెరిగాయని ,సచిన్ అంతటివాడు తమ మధ్యకు వస్తున్నాడని అందరూ ఆనందించారు. కాని సచిన్ ఇల్లు కట్టుకొనేప్పుడు ఎదుటివారికి కలిగే అసౌకర్యం గురించి ఎంత ఆలోచించాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటి వారికీ స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు. ఆ ఉత్తరం లోని విషయం ఇది.

" నేను మీ ప్రాంతములో ఇల్లు కట్టుకొంటున్నాను. అది పెద్ద ఇల్లు. ఇంటి నిర్మాణమప్పుడు ఎన్నో లారీలు పగలు,రాత్రీ తిరగవలసి వస్తుంది. ఇంకా ఇంటి నిర్మాణంలో బండలు పగలగొట్టవలసి వస్తుంది. చిన్నచిన్న డైనమెట్లు కూడా అందుకు ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికీ దెబ్బలు తగులకుండా ఏర్పాటుచేసాము. కాని శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. పగలురాత్రీ అని తేడా లేకుండా పని చేయాల్సి ఉండడం వలన మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను మన్నించగలరు. ప్రాంతంలోకి నేను చేరిన తర్వాత నేను మీ కాలనీ అనే కుటుంబంలో ఒక సభ్యుడను అవుతాను కదా.

ఒక కుటుంబములో ఒక కొత్త సభ్యుడు రావడం అనేది ఒక తల్లికి బిడ్డ పుట్టడం లాంటిది. తల్లి నవమాసాలూ మోసేటప్పుడు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. అప్పుడే బిడ్డ రాగలడు. అలానే మీ కాలనీ అనే కుటుంబములోనికి నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి అందుకు మీరు కొంత కష్టం పడవలసిఉంటుంది అని తెలుపడానికి బాధపడుతున్నాను.. నన్ను మీ కుటుంబములోనికి చేర్చుకుంటారని ఆశిస్తున్నాను."

అసలు సచిన్ రావడమే తమకు ఎంతో గొప్పగా, ఆనందముగా భావించారు ఆ ప్రాంతవాసులు. ఐనా వారు ఏమీ అనలేదని సచిన్ ఊరుకోలేదు. వారి అసౌకర్యం ఊహించి ఎంత గొప్పగా వ్రాశాడో కదా.

ఇలా ఎదుటివారికి కలిగే బాధను మన విధ్వంసకారులూ (చీటికీమాటికీ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగులబెడుతున్నవారు) తెలుసుకొంటే బాగుంటుంది కదా

పాఠాలు నేర్పే గురువులను చులకనగా చూసేవారికి ఈ సంఘటన ఒక కనువిప్పు కావాలి.

ఈ సంఘటన నిజంగా జరిగిన సంఘటన.
కంచి కామకోటి పీఠంలో జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతులవారు పీఠాధిపతిగా ఉన్న రోజులవి.
ఒక రోజు ఆయన గదిలో ఉండగా ప్రొద్దునపూట అక్కడి వేదపాఠశాలలో చదివే పిల్లలు అరుస్తూ ఆడుకొంటున్న శబ్దం వినిపించింది. ఈ సమయంలో తరగతిలో చదువుకొనకుండా బయట ఎందుకు ఆడుకొంటున్నారని పరమాచార్యులవారు బయటికి వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు తరగతికి వెళ్ళలేదు? అని అడిగారు. గురువు గారు రాలేదని ఆ పిల్లవాడు చెప్పాడు. పక్కన ఆడుకొంటున్న ఇంకో పిల్లవాడు జోక్యం చేసుకొని "గురువు గారు పాఠం చెప్తున్నారు. మేమే బయటకు వచ్చి ఆడుకొంటున్నాము" అన్నాడు. ఇద్దరిలో ఎవరిది నిజమో కనుగొనడానికి పరమాచార్యులవారు ఇద్దరినీ వెంటబెట్టుకొని తరగతి గది వద్దకు వెళ్ళి చూస్తే గురువుగారు లేరు.

అప్పుడు పరమాచార్యుల వారు రెండవ పిల్లవాడితో అబద్దం ఎందుకు చెప్పావంటూ ప్రశ్నించారు. ఆ పిల్లవాడు ఏ మాత్రం భయపడకుండా " రోజూ వచ్చే మా గురువు గారు ఈ రోజు ఏదో అత్యవసర పని మీద రాలేకపోయుంటారు. వారు రాకపోయినా తరగతిలో కూర్చొని చదువుకోవలసిన బాధ్యత మాది. కాని మేము అలా చేయలేదు. అంటే తప్పు మాది. గురువుగారు రాలేదని మీరు ఆయనను కోప్పడతారు. మీ కోపాన్నుండి ఆయననను తప్పించడానికి చిన్న అబద్దం చెప్పడం నేను ధర్మమే అనుకొంటున్నాను. ఈ సమయంలో చదువుకోక ఆడుకోవడం మా తప్పే." అన్నాడు.

అంతటి నడిచే దేవుడిగా పేరొందిన పరమాచార్యులవారు కూడా ఆ పిల్లవాడి గురుభక్తిని చూసి ఆశ్చర్యం పొందారు.
" నీవురా నిజమైన శిష్యుడివి "అంటూ ఆ పిల్లవాడి భుజం తట్టారు పరమాచార్యులవారు.

నేడు కళాశాల విద్యార్థులైనంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్లు ప్రవర్తిస్తూ గురువులను అవమానిస్తున్న వారిని, అలా చేయడానికి ప్రోత్సాహం ఇస్తున్న సినిమాలు,TVలు, పత్రికలు పైన పేర్కొనబడ్డ అబ్బాయి కాలి గోటికి సరిపోతారేమో ఆలోచించండి.




Tuesday, December 29, 2009

ఎవరికుంటుందండీ శ్రీరాముడికి, హనుమంతుడికీ ఉన్నంత వినయం?


"విద్య యొసగు వినయంబు" అంటారు కదా. ఆ వినయం నేటి విద్యార్థులలో ఏ మాత్రం ఉందో అందరికీ తెలుసు. ఏ చిన్న విజయం సాధించినా ఉద్రేకాన్ని అణచుకోలేక విపరీతంగా పొంగిపోయి అహంకరించే నేటి మనుషులు ( ముఖ్యంగా విద్యార్థులు ) ఉన్న సమాజంలో ఇలాంటి విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ రోజు రామాయణంలో శ్రీరాముడి వినయం ఎలాంటిదో, హనుమంతుని వినయం ఎలాంటిదో చూసాను.

మొదట రామచంద్రుడి వినయం చూద్దాం.

అందరికీ తెలుసు అహల్యను తన పాదాలతో పాపవిమోచనం కలిగించాడని. ఇక్కడ శ్రీరాముడు తనే శాపవిమోచనం కలిగించాననే అహంకారం ఏమాత్రం లేకుండా అహల్య శాపవిమోచనం పొందిన వెంటనే ఆమె తన కన్నా వయసులో పెద్దది అవటం చేత మరియు ఒక ఋషి భార్య అవడం చేత తనే ముందుగా మోకాళ్ళ మీద కూచుని అహల్యకు నమస్కారం చేసాడు.

అలానే విశ్వామిత్రుడి యజ్ఞాన్ని అడ్డుకుంటున్న రాక్షసులను చంపిన తర్వాత ఋషులందరూ రాముడిని "ఇంత చిన్న వయసులోనే అలాంటి రాక్షసులను చంపగలిగావు కదా" అంటూ పొగిడారు. రాముడు ఏమాత్రం అహంకరించకుండా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

ఇక హనుమంతుని వినయం ఎంతటిదో చూద్దాం.

లంకలో సీతమ్మను కలుసుకొన్న తర్వాత సీతమ్మ " హనుమా! నీవు ఎంత బలవంతుడివి. ఇంత సముద్రాన్ని దాటి నువ్వొక్కడివే దాటగలిగావు" అంది. ఇలాంటి మాటే గనుక నేటి పిల్లలతో కానీ, పోటీలలో పాల్గొని కొద్దిగా బాగా ప్రదర్శన ఇచ్చిన పోటీదారుతో కాని అంటే ఉద్రేకంతో ఎంతగా అరుస్తారో,ఎంత అహంకరిస్తారో టీవీ లలో మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ హనుమంతుడు చూపిన వినయం చూస్తే నేటి సమాజం ఆశ్చర్యపోక మానదు.

హనుమంతుడన్నాడు, " అమ్మా! మా సైన్యంలో నాతో సమానమైన బలవంతులూ, నా కన్నా అధికులూ ఐన వారు ఉన్నారు. అంతేకాని నాకన్నా తక్కువ వారు లేరు. ఒక ఇంట్లో ఆడవారికి ఏదైనా కబురు చేయడానికి ఒక పిల్లవాడినో, ఇంట్లో అందరికన్నా తక్కువ వారినో పంపిస్తారు. అంతేకాని పెద్దవారు రారు కదా !".

హనుమంతుడు ఎంత బలవంతుడో మనకు తెలుసు. ఎవరూ రాలేకనే కదా హనుమంతున్ని పంపింది. కాని హనుమంతుని వినయం ఎంతగా ఉందో చూసారా? కనీసం అలాంటి వినయాన్ని ఊహించగలమా?
ఇప్పుడు చెప్పండి నేటి యువత కానీ, సమాజం కానీ, చదువుకొన్న,చదువుకుంటున్న విద్యార్థులు కానీ ఎంత వినయం నేర్చుకోవాలో.

Thursday, December 24, 2009

నా మరో బ్లాగు "భక్తి సామ్రాజ్యం".

నా మరో బ్లాగు "భక్తి సామ్రాజ్యం" పూర్తి ఆధ్యాత్మికంగా భగవంతుడి లీలలను, భక్తుల చరిత్రలను వ్రాస్తున్నాను. ఆశీర్వదించగలరు.



Sunday, December 20, 2009

భక్తులతో, భగవంతునితో పెట్టుకొని నాశనం కాకండి, సమైక్యవాదులైనా ! తెలంగాణావాదులైనా !

సమైక్యరాష్ట్రం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. మంచిదే. పోరాడండి. కాని దేవుడిని, భక్తులను ఎందుకు ఈ విషయములోనికి లాగుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంపై కొన్ని జరిగిన సంఘటనలను చూద్దాం.

1. ఒక బ్లాగరి తన బ్లాగులో తెలుగు బాష విషయం పై వాదన చేస్తూ బమ్మెర పోతన తెలంగాణా వ్యక్తి అని వారే అసలైన తెలుగు వారని అందుకే భాగవతం చాలా బాగుంటుందని , నన్నయ ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అని అందుకే అతను వ్రాశిన మహాభారతం అంత బాగోదని తేల్చేసాడు.
మీ మూర్ఖత్వాన్ని, వాదనలను మీ వద్దే పెట్టుకోండి.
భక్తులకు విశ్వమంతా ఒక్కటే. వారికి దేవుడు తప్ప ఇతరాలు కానరావు. మన అజ్ఞానంతో భక్తుల పట్ల అపచారాన్ని చేస్తున్నాము. దేవుడు తనను ఏమైనా అన్నా ఉపేక్షిస్తాడేమో గానీ, భక్తుల జోలికి వస్తే ఊరుకోడు.

2. విజయవాడ అమ్మ వారి ప్రసాదాన్ని వేములవాడకు పంపిస్తే ఆ ప్రసాదం ఆంధ్రప్రాంతం వారిదని త్రిప్పి పంపేశారట. దుర్గమ్మ జగన్మాత, అంతే కాని ఆంధ్రామత అనో లేక తెలంగాణా మాత మాత్రమో కాదు. భధ్రాచలం రాముడైనా, తిరుపతి వెంకన్న ఐనా ఇద్దరూ ఒకటే అని తెలిసినా మూర్ఖవాదాలతో కాలం సాగిస్తున్నారు.

ఎవరైనా ఎంతైనా పోరాడండి. హద్దుల్లో ఉండి పోరాడండి. అంతేకాని దేవుడి విషయంలో కాని, ఇంకా ముఖ్యముగా భాగవతుల(భక్తుల) విషయంలో కాని పొరపాటున ఐనా తప్పు చేస్తే లేక మన ప్రాంతీయవాదాల్ని వారికి అంటగడితే నాశనం కాకతప్పదు.

గమనిక : ఈ టపా ఏ ఉద్యమానికీ వ్యతిరేకంగానో లేక మద్దతుగానో వ్రాయబడలేదు. ఆధ్యాత్మిక సంబంధంగానే వ్రాయబడింది.




Monday, December 14, 2009

దక్షిణామూర్తి పూర్తి కథ


రవిచంద్ర గారు తమ బ్లాగులో దక్షిణామూర్తి కథ వ్రాశారు. ఆ టపాకు వ్యాఖ్య వ్రాద్దామంటే ఒక టపా అంత అవుతుంది. అందుకే ఈ టపా వ్రాస్తున్నాను.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక,సనందన,సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

ఇక ఈ నలుగురూ గురువుకోసం వెదుకుతూ నారదమహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నారు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడనూ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు భోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు,మనసుకూ అందనివారు కాబట్టి అలా భోధించారు.


Friday, December 11, 2009

ఇదేనా చదివిన చదువు మనకు నేర్పింది ? సిగ్గుపడాలి.

తెలంగాణా విషయం మొదలైనప్పటి నుండి అసలు మన విద్యా వ్యవస్థ యొక్క పస ఏంటో, అది మనకు ఏం నేర్పుతోందో అర్థం అవుతోంది. అసలు విద్యార్థులు ఏం చదువుతున్నారో , ఎందుకు చదువుతున్నారో అర్థం కాకుండా ఉంది. "విద్య యొసగు వినయంబు " అంటారు , ఆ వినయంతో " విచక్షణా జ్ఞానం" వస్తుందని అంటారు. కాని ఎక్కడ వస్తోంది?

కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా, పాలిచ్చే ఆవును గాయపరిచినట్లుగా , పండిన పంటను తగలబెట్టినట్లుగా ఉంది విద్యార్థుల వ్యవహారం. లేకపోతే సమాజానికి ఉపయోగపడే బస్సులను, ఇతరుల వాహనాలను , పొట్టకూటికి జరుపుకొనే వ్యాపారాల పైనా వీరి ప్రతాపం? ఇప్పుడు బస్సులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు . మళ్లీ అంతా సద్దుమణిగాక ఆ నష్టపోయిన ఆస్తులకు పరిహారం ఎవరు, ఎలా ఇస్తారు? ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం ఎలా తెస్తుంది? అదనపు పన్నులు ప్రజల పైన వేయడం ద్వారా . అంతే కదా? ఈ మాత్రం మూల విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా ?

రాజకీయనాయకులు రెచ్చగొడతారు. రెచ్చగొడితే చేసేయడమే. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేక పొతే ఎలా ? అసలు ఈ మాత్రానికి చదవడం ఎందుకు ? డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు ? ఏదైనా సాధించాలంటే ఒక మార్గం అంటూ ఉంటుంది. అది తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరికి నష్టం? మన చదువు ఇదేనా మనకు నేర్పుతోంది?


కొన్ని పల్లెల ప్రజలు ఎన్నో రోజులు కష్టపడి, అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళావెళ్లా పడి తమ పల్లెలకు బస్సును వేయించుకొంటారు. ఇప్పుడు వీరు ధ్వంసం చేసే బస్సులలో అవి కూడా ఉన్నాయి. మళ్లీ ఆ పల్లెలకు బస్సులు తిరగాలంటే వారు ఎంత బాధపడాలి? ఎంతగా మళ్లీ తిరగాలి? మీ పైశాచికానందం కోసం, మీలోని శాడిసం ను తృప్తి పరచడం కోసం ప్రజల ఆస్తులను నాశనం చేస్తారా? అంతగా అవసరం ఉంటే మీ సొంత వాహనాన్ని అది సైకిలైనా , బైకైనా లేక కారైనా కావచ్చు, దాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చి మీ కసితీరా ధ్వంసం చేసుకోండి. ఎవరూ ఏమి అనరు. ఈ మాటను కూడా నేను అనకూడదు. కాని ఇతరులకు , అందరికి ఉపయోగపడే వాటిని నాశనం చేసే బదులు మీవే నాశనం చేసుకొంటే సరిపోతుందికదా.మీ పైత్యం తీరాలి కదా.

ఇతరుల వరకు వస్తే మీకు అది మలం తో సమానం, మీ వరకు వస్తే అది పరమాన్నమా?

ఇక ఈ రోజు హైకోర్టు న్యాయవాదులు చేస్తున్న గలాటాను చూస్తే ఒళ్ళు మండిపోతోంది. ఏంటి వారు చదువుకొన్నది? వీరా మనకు న్యాయవాదులు? ఇలాంటి మనస్తత్వం కలవారా న్యాయం కోసం వాదించేది? ఇలాంటి వారి వద్దకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని అనుకోగలమా?

ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. మీరు చేసే తప్పులు ఎంత వేగంతో మిమ్మల్ను అవి తాకుతాయంటే మీ మాటను కూడా వినడానికి ఎవరూ ఉండరు. మీరు చదివి వృథా. మీకు పెట్టిన డబ్బును ఏ జంతువుకో పెడ్తే అది జీవితాంతం ఋణపడి ఉంటుంది.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ఇలాంటివి చేయకుండా ఉంటే అందరికీ మేలు.

గమనిక: నేను ఈ టపాను అందరు విద్యార్థులను ఉద్దేశించి వ్రాయలేదు. ఎవరైతే చదువుకొని కూడా పై విధం గా ప్రవర్తిస్తున్నారో వారిని ఉద్దేశించి మాత్రమే వ్రాసాను. రాజకీయనాయకులు, కార్యకర్తలు, అసాంఘికశక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వారిలో కూడా విద్యార్థులు, చదువుకొన్నవారు ఉన్నారు కదా. వారిని ఉద్దేశించి మాత్రమే ఇదివ్రాసాను.




Monday, November 9, 2009

ఈ సంఘటనకు మీరైతే ఎలా స్పందిస్తారు? మేము లోకల్.

ఇది బెంగళూరులో నాకు నిజంగా జరిగిన సంఘటన.

పోయిన దీపావళి పండుగ రోజు బెంగళూరులో మేమున్న మారతహళ్ళిలో మేము మా రూం ముందు నిలుచునిఉన్నాము. అప్పుడు రాత్రి 7వ,8వ తరగతి పిల్లలు టపాకాయలు కాలుస్తున్నారు. కాల్చడములో ఎవరికీ అభ్యంతరము లేదు కానీ రోడ్డులో పోయేవాళ్ళపైకి చేత్తో టపాసులు కాల్చి విసురుతున్నారు. నేను,నా స్నేహితులు వద్దని వారించాము.

తర్వాత మేము వెనుకకు తిరగగానే ఒక పిల్లవాడు లక్ష్మీటపాసును మా మిత్రుడిపై విసిరాడు. దాంతో మా వాడికి కోపం వచ్చి వానిపై చెయ్యెత్తబోయాడు. కాని ఎందుకులే అని ఊరుకున్నాడు. కాని ఆ అబ్బాయిలు మా వద్దకు వచ్చి కన్నడంలో " మీరు ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.కానీ మేము ఇక్కడ Local. మా మీద చెయ్యెత్తేంత ధైర్యమా మీకు ? చెయ్యెత్తి ఇక్కడ ఉంటామనే అనుకుంటున్నారా?" అని అన్నాడు. మాకు చేష్టలుడిగిపోయాయి(shock). అన్నది పెద్దవారు కాదు. 13,14 ఏళ్ళు వయసు గల పిల్లలు. తప్పు వాళ్ళదే. ఐనా Local feeling వారికి ఎలా వచ్చినో ఇప్పటికీ అర్థం కావడం లేదు.

ఇక్కడ వ్యవస్థ తప్పా? లేక సినిమాల ప్రభావమా? లేక ప్రాంతీయ దురభిమానమా? ఏమో అస్సలు అస్సలు అర్థం కావడంలేదు.




Friday, October 30, 2009

"ఈశావాస్య ఉపనిషత్తు" ను బ్లాగులో ఇప్పుడే పూర్తిచేసాను.

భగవంతుడి దయవలన "ఈశావాస్య ఉపనిషత్తు"ను బ్లాగులో వ్రాయడం ఇప్పుడే పూర్తి చేసాను. తర్వాత "కేనోపనిషత్తు" ను వ్రాయాలని అనుకుంటున్నాను.

ఉపనిషత్తులు మన ప్రాచీన విజ్ఞానము. వేదాంతముగా ప్రసిద్దికెక్కినవి. వ్యాఖ్యానించడం, వ్యాఖ్యానించకపోవడం ఇక్కడ అప్రస్తుతం. దయచేసి మన ప్రాచీన విజ్ఞానమైన ఉపనిషత్తులను అందరూ చదవాలని కోరుతున్నాను. చదవనివారి కోసం మరియు తెలుగులో ఉపనిషత్తులు ఇంటర్‌నెట్ లో ఉంచాలని నేను సంకల్పించాను.

నా ఉపనిషత్తుల బ్లాగు "ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము" చూడండి.




Tuesday, October 27, 2009

ఈశావాస్య ఉపనిషత్తు


గత ఫిబ్రవరిలో ఉపనిషత్తులను బ్లాగులో వ్రాయాలని సంకల్పించాను. అది నేటికి కార్యరూపం దాల్చింది.
నా ఉపనిషత్తుల బ్లాగు "ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము" చూడండి.


Friday, September 18, 2009

64 విద్యలు(కళలు)అంటే ఏవి?


మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదట 64 విద్యలను తెలియజేసే శ్లోకం
వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.

అర్థము:

1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)

2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు
(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)

3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు

4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.

5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు

6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము

7. నాటకములు

8. గానము (సంగీతం)

9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము

10. కామశాస్త్రము

11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,

12. దేశభాషాజ్ఞానం

13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.

14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు

15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము

16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,

17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము

18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము

19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం

20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము

21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము

22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము

23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము

24. పాకకర్మ= వంటలు

25. దోహళము=వృక్షశాస్త్రము

26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు

27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య

28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .

29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.

30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.

31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.

32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య

33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య

34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య

35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,

36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.

37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,

38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,

39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.

40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.

41. వాణిజ్యము - వ్యాపారాదులు.

42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.

43. కృషి - వ్యవసాయ నేర్పు.

44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి

45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.

47. మృగయా - వేటాడు నేర్పు

48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.

49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.

50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.

51. చిత్ర - చిత్రకళ

52. లోహా - పాత్రలు చేయి నేర్పు

53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.

54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు

55. దారు - చెక్కపని

56. వేళు - వెదరుతో చేయు పనులు

57. చర్మ - తోళ్ళపరిశ్రమ.

58. అంబర - వస్త్ర పరిశ్రమ

59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు

60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము

61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము

62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము

63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము

64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య


Thursday, September 17, 2009

ఒక మంచికథ- విశ్వాసం,గాఢత కలిగిన పని శీఘ్రఫలసాధనం


ఆది శంకరాచార్యుల శిష్యుడైన పద్మపాదుని జీవితములో జరిగిన ఒక సంఘటన.
పద్మపాదులు నరసింహ మంత్రాన్ని ఉపదేశంపొంది దాని జపం కోసం అహోబిల క్షేత్రానికి వెళ్లి అక్కడ అడవిలో జపానికి కూర్చొన్నారు. ఒక ఎరుకవాడు ఆయనను సమీపించి ఎందుకోసంవచ్చారని తాను ఏదైనా చేయగలది ఉందాయని పరామర్శించాడు. తాను నరసింహాన్ని అన్వేషిస్తూ, ఆవనము లోనికి వచ్చినట్లు పద్మపాదులు చెప్పినారు. అట్టి మృగం లేదని ఆ ఎరుకవాడు అన్నాడు. ఉందని పద్మపాదులు అన్నాడు. ధ్యానశ్లోకంలో ఉన్న వర్ణనను ఆ ఎరుకవాడికి చెప్పాడు.

అంతటితో ఎరుకవాడు నరసింహాన్ని వెదకటం సాగించాడు. మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా తాను ఆ మృగాన్ని తెచ్చి పద్మపాదులముందు నిలబెటతానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంత వెదకినా మృగం కనబడదు. వెదకివెదకి ప్రతిజ్ఞాసమయం దాపురించేసరికి ప్రాణత్యాగం చేసికొందామని ఒక చెట్టుకుఉరిపోసుకుంటాడు.

అంతటితో నరసింహుడు ఆ ఎరుకువానికి ప్రత్యక్షమౌతాడు.

తనకోసం తయారుచేసుకొన్న ఉరిత్రాటితోనే నరసింహస్వామిని పద్మపాదులవద్దకు తీసికొని వెళతాడు. ఆ ఎరుకుధ్యానం రెండురోజులైనా, గాఢతలో చాలాగొప్పది. అందుచేత అతనికి స్వామి స్వరూపదర్శనం కల్గింది. పద్మపాదులకు ఇంకా జపసిద్ధి కాలేదు. అందుచేత అతనికి శబ్దబ్రహ్మస్వరూపంలో (అంటే కనబడకుండా తాను శబ్దం మాత్రం చేస్తూ తన ఉనికిని చెప్పడం) మాత్రం స్వామిగర్జిస్తూ అనుగ్రహించినారు. అవసరమైనప్పుడు ఇంకోసారి తన ఆవేశంలో లోకోత్తరమైన ఉపకారాన్ని చేస్తానని నరసింహస్వామి పద్మపాదులను అనుగ్రహిస్తారు.

శ్రీశంకరులవారిని కాపాలికుడొకడు సంహరించడానికి పూనుకొన్నపుడు వారిని రక్షించే అవకాశంలో నరసింహస్వామి పద్మపాదుడిని పూని కాపాలికుని దేహాన్ని ఛిన్నాభిన్నం చేసినారు.

ఈ ఎరుకువానికి పద్మపాదుల మాటలలో ఒక గొప్ప విశ్వాసం కల్గింది. ఆ విశ్వాసంతో తానుచూడని నరసింహాన్ని వర్ణనప్రకారం వెదకుతూ అఖండమయిన ఏకాగ్రతతో ఎంతోకాలానికి లభించని ధ్యానసిద్ధిని పొందినాడు. ఆ అన్వేషణలో రాగమూ లేదు, భక్తీ లేదు, ద్వేషమూ లేదు. ఒక్క విశ్వాసమూ, ఉపకారచింతనా మాత్రమే.

నరసింహము ఉన్నదని విశ్వసించాడు. ఆ సత్యం కోసం అన్వేషించాడు. సత్యాన్వేషణ అతనికి ధ్యేయమైంది.. దానికోసం తన ప్రాణాలనుకూడా ఒడ్డటానికి సిద్ధపడినాడు. అందుచేతనే అతనికి భగవద్దర్శనం కల్గింది.

Wednesday, September 16, 2009

M.S.సుబ్బులక్ష్మి - మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ


నేడు సుబ్బులక్ష్మి గారి పుట్టినరోజు. కేవలం ప్రతిభ ద్వారానే మనుషులు గొప్పవారు కాలేరు. అహంకారానికి లోనుకాకుండా మానవత్వం కలిగిఉండేవారే అచంద్రతారార్కం నిలిచిఉంటారనే దానికి సుబ్బులక్ష్మి గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన.

బాగాపేరువచ్చి ప్రపంచప్రఖ్యాతి పొందిన తర్వాత ఒకసారి సుబ్బులక్ష్మిగారు ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు. గేటు బయట ఒక ముసలావిడ సుబ్బులక్ష్మిగారిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మిగారు విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు.
ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ముసలావిడ సుబ్బులక్ష్మిగారితో " మీ కచేరి చూద్దామని 10మైళ్ళ నుండి నడుకొనివచ్చాను.నా దురదృష్టం కొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు" అంది. సుబ్బులక్ష్మిగారు ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధముగా సుబ్బులక్ష్మిగారు ఆ ముసలావిడ ఒక్కదానికోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు.

"ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి" అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి గారి జీవితమే ఒక ఉదాహరణ.


Tuesday, September 15, 2009

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు నేడే



ఏడుకొండలవాడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తుల వ్యధలను చూసి, శ్రీవారిని చేరుకునేందుకు సుళువైన రోడ్డు మార్గానికి సంబంధించిన డిజైన్ రూపొందించిన ఆ మహనీయుడెవరు..?

నేడు మన దేశం సుభిక్షంగా పంట, పొలాలతో... వరద ముంపులేని ప్రాంతాలతో తులతూగడానికి కారణం ఓ మహామనిషి. ఊళ్లకు ఊళ్లనే తన గర్భంలో కలిపేసుకునే ఉగ్ర గంగను ఆపిన మహా శక్తివంతుడాయన. ఏడుకొండలవాడా... ఎక్కడున్నావయ్యా.. అంటూ అలసిసొలసిన భక్తునికి వేంకటేశుని పాదాల చెంతకు వెళ్లే అతితేలికైన దారిని చూపించిన మహామేథావి. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సాంకేతిక రంగానికి పుట్టిల్లయినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని ముద్దెనహళ్లిలో సెప్టెంబరు 15, 1861న జన్మించారు విశ్వేశ్వరయ్య.
ఆనకట్టల రూపశిల్పి

ఒక్కసారి ఆ మహనీయుని చరిత్రను ఈ సెప్టెంబరు 15న ఒకసారి అవలోకిద్దాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన బాల్యంలో అనేక ఆటుపోట్లను చవిచూశారు. సంస్కృతంలో ఉద్దండులైన తండ్రి శ్రీనివాసశాస్త్రిను విశ్వేశ్వరయ్య కేవలం పదిహేనేళ్ల ప్రాయంలోనే పోగొట్టుకున్నారు. నిజానికి విశ్వేశ్వరయ్య తాత ముత్తాతల ఊరు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సమీపంలోని మోక్షగుండం గ్రామం.

అయితే మూడు దశాబ్దాల క్రితం మోక్షగుండం నుంచి మైసూరుకు వలస పోయారు విశ్వేశ్వరయ్య కుటుంబీకులు. అయితే వారి జన్మస్థలి నామధేయమైన మోక్షగుండం మాత్రం వారి వెన్నంటే వెళ్లింది. అందుకే మోక్షగుండం వారి ఇంటిపేరు అయింది. అందుకే ఆ పేరు విన్నప్పుడు చటుక్కున మన ఆంధ్ర రాష్ట్రంలోని గిద్దలూరులోని మోక్షగుండం మదిలో కదలాడుతుంది.

అదలావుంచితే 15 ఏళ్ల ప్రాయంలో తండ్రిని పోగొట్టుకున్న విశ్వేశ్వరయ్య, తన ప్రాథమిక విద్యను బెంగళూరులోని చిక్బల్లాపూర్‌లో పూర్తి చేశారు. 1881 సంవత్సరంలో మద్రాసు యూనివర్శిటీ నుంచి బీఏ పట్టా పొందారు. ఆ తర్వాత పూనెలో సివిల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత పబ్లిక్‌వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయనను ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లోకి ఆహ్వానించింది.

కమిషన్‌లోకి అడుగుపెట్టిన విశ్వేశ్వరయ్య దక్కను ప్రాంతంలో సాగునీటి సమస్యపై తీవ్రంగా కృషి చేశారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా 1903లో ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్ల పద్ధతిని కనుగొన్నారు. అంతేకాదు వాటిని పూనెలోని ఖండక్వస్ల రిజర్వాయిర్‌లో నెలకొల్పారు.

రిజర్వాయిర్‌లో భారీగా చేరే నీటిని నిలువవుంచగలిగే సదుపాయంతోపాటు డ్యామ్‌కు ఎటువంటి హాని తలపెట్టకుండా చూడటంలో ఈ ఫ్లడ్ గేట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సూత్రం విజయవంతం కావడంతో దేశంలో పలుచోట్ల ఇదే తరహా పద్ధతిని ప్రవేశపెట్టారు.

వరద ముప్పుతో అల్లాడే హైదరాబాదు నగరానికి శాశ్వత ప్రాతిపదికన ఆయన రూపొందించిన డిజైన్ సత్ఫలితాలనివ్వడంతో ఆయనకు విశేష గుర్తింపు లభించింది. ఇలా ఆయన దేశంలోని ఆయా ప్రాంతాల్లో పరుగులు తీస్తూ సముద్రంలో వృధాగా కలిసిపోయే గంగను ఆపడమేకాక నగరాలకు నగారలనే తన గర్భంలో కలుపుకునే ఉగ్ర గంగను సైతం బంధించాడు.

అంతేనా ఏడుకొండలవాడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తుల వ్యధలను చూసి, శ్రీవారిని చేరుకునేందుకు సుళువైన రోడ్డు మార్గానికి సంబంధించిన డిజైన్ రూపొందించారు. అలా గోవిందుని సన్నిధికి చేరేందుకు రాచబాటను ఏర్పాటు చేశారు విశ్వేశ్వరయ్య. ఇలా ఆయన రూపొందించిన డిజైన్లు, వాటివల్ల కలిగిన ప్రయోజనాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన మేథస్సుకు అంతేలేదు. ఆయన ఓ విజ్ఞాన గని. ఆయన మెదడు ప్రణాళికలమయం.

ఆ మేథస్సుకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఆయనను వెతక్కుంటూ వచ్చాయి. డాక్టరేట్లు, ఎల్ఎల్డీలు... ఇలా ఎన్నో ఆయన ముంగిట వాలాయి. ఇక ఆయన పేరిట మన దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు వెలిశాయి. భారతప్రభుత్వం ఆయనను అత్యున్నత భారత రత్న అవార్డుతో సత్కరించింది. అంతేకాదు ఆయన పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబరు 15ను "ఇంజినీర్స్ డే"గా ప్రకటించి ఆయనపట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంది.
వీరు 1962,ఏప్రిల్ 12 న పరమపదించారు.
-telugu.webdunia.com సౌజన్యముతో

అమ్మా!M.S.సుబ్బులక్ష్మీ కారణజన్మురాలవమ్మా!


"ఎందరో మహానుభావులు,అందరికీ వందనములు" అన్న త్యాగరాజ కీర్తన ఎన్నోసార్లు విన్నాను. కాని నాగయ్యగారు తమ చిత్రం త్యాగయ్య లో పాడిన ఈ పాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలాగే నిన్న నేను సుబ్బులక్ష్మి గారు పాడిన అదే పాట దైవికముగా వినడం జరిగింది. పాట వింటున్నంత సేపు,తర్వాత కూడా ఆ భావావస్థ అలానే కొనసాగుతోంది. తెలియకుండానే ఆనందభాష్పాలు రాల్చాను. ఆ పాటలో ఆమె ఎంత లీనమై పాడింది.ఈ పాటే కాదనుకోండి, ఆమే అన్ని పాటలు అంతే తన్మయత్వంతో పాడుతుంది. సుబ్బులక్ష్మి గారు పాడిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, విష్ణుసహస్రనామ స్తోత్రం అన్నీ మనకు తెలుసు.

కాని నిన్న నేను విన్న ఆమె పాడిన "ఎందరో మహానుభావులు" పాట ఎంతగా కదిలించినదంటే ఇంకా మనసు,శరీరం పులకరిస్తూనే ఉంది. కాని అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రేపు సుబ్బులక్ష్మిగారి పుట్టినరోజు అని నాకు ఈ రోజే తెలిసింది. నా ఆనందం రెట్టింపైంది. ఆమె పుట్టినరోజు సందర్బముగా భగవంతుడు ఆమె పాడిన పాట ద్వారా నాకు అనన్యమైన సంతోషం, బ్రహ్మానందం కలిగించినందుకు భగవంతునికి సహస్రకోటి వందనాలు, సుబ్బులక్ష్మిగారికి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను.

నేడు ఆమె మన మధ్య భౌతికముగా లేకపోయినా ఆమె తన పాటల ద్వారా ఆచంద్రతారార్కం మన మధ్య ఉంటుంది.

క్రింద ఆ పాట యొక్క వీడియో చూడండి.



Monday, September 7, 2009

కాపీ కొట్టినప్పుడు ధైర్యముగా చెప్పుకోండి

శ్రీ రామదాసు చిత్రములో నాగేశ్వరరావు, నాగార్జునల పాట "శుభకరుడు, సురుచిరుడు, భవహరుడు, భగవంతుడెవడు?" అన్న పాట వినే ఉంటారు.
అందులోని చరణాలు కొన్ని:

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ..

ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ..

ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తీ !

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పూ..

ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పూ..

ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ..
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పూ
!

ఈ పాట వింటుంటే ఎంతో ఆనందము అనుభవించాను.

ఈ మధ్య కాకతాళీయముగా ఒక అన్నమాచార్య సంకీర్తన విన్నాను. అదేమిటంటే
ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత-
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు

చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు


అరే ఈ పాట ఎక్కడో విన్నట్టుందే అనుకొంటుంటే శ్రీ రామదాసు చిత్రములోని "శుభకరుడు" పాట గుర్తుకు వచ్చింది. ఈ పాట వ్రాసిన వారు ఈ పాటను అన్నమాచార్య కృతుల నుండి తీసుకొన్నామని చెప్పిఉంటే ఇంకా సంతోషము కలిగిఉండేది. ఆ శృతి(Tuning) కూడా అలానే దింపివేసారు కదా. బాగుంది మంచి పాట అందించారు కాని అన్నమాచార్య కృతుల నుండి తీసుకొన్నామని ,కాస్త మార్పులు చేసి వ్రాశామని చెప్పిఉంటే ఇంకా సంతోషము కలిగిఉండేది.

క్రింద లంకె(link) లో ఆ అన్నమాచార్య కీర్తనను వినండి.

http://www.esnips.com/doc/56a1760e-2a4d-4a9a-b635-6b038b0bd4d9/nityAtmuDaiyumDi-nityuDai

Saturday, September 5, 2009

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు




ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః

Thursday, September 3, 2009

చనిపోయింది మీ దేహము మాత్రమే, మీరు కాదు. మీ ఆశయాలు అమరణము.


నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః

ఈ ఆత్మను ఏ ఆయుధాలు ఖండింపలేవు. అగ్ని దీనిని దహింపలేదు. నీరు తడిచేయలేదు,గాలి ఎండింపలేదు. ఈ ఆత్మ శాశ్వతము.


జయహో రాజశేఖరా!


మీరు మరణించలేదు.


మీ దేహము మరణించినా


మీ ఆశయాలు,మీ చిరునవ్వులు


మా మనసులలో కలకాలం ఉంటాయి.





Wednesday, September 2, 2009

Y.S.రాజశేఖరరెడ్డి గారు క్షేమంగా తిరిగి వస్తారు.


ముఖ్యమంత్రి గారు శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు క్షేమంగా తిరిగిరావాలని భగవంతుడిని ,ముక్కోటి దేవతలను, శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిద్దాం.


Friday, August 14, 2009

మనకు ఆదర్శము పరమేశ్వరుడి కుటుంబమే!


ఎప్పుడైనా శివపార్వతుల కుటుంబము ను గమనించారా?
మొదట వీరి కుటుంబ సభ్యులను చూద్దాం. శివపార్వతులు కాకవీరికొడుకులైన గణపతి, కుమారస్వామి కుటుంబ సభ్యులు. సరే, ఇక్కడ కుటుంబము మనకు ఎలా ఆదర్శమో చూద్దాము.

పరమేశ్వరుడు కేవలం మొలకు చర్మమును మాత్రం ధరించి, శరీరమంతటా విభూతిని ధరించి ఉంటాడు. ఇంత మాత్రమే మహాదేవుని వస్త్రాలు, అలంకారాలు. ఇక అమ్మ పార్వతీదేవిసర్వాలంకార భూషితయై ఉంటుంది.
సందర్బములో ఒకకుటుంబములోని భర్త తెలుసుకోవలసినవిషయం ఒకటి ఉంది. అదేమిటంటే తన కోసం చిన్నప్పటినుండీతనను ఎంతగానోప్రేమించిన తల్లిదండ్రులను, కుటుంబసభ్యులనుతన పుట్టింటినివదిలి వచ్చిన భార్యను ఎలా చూసుకోవాలనేది. భర్త ఎంత కష్టపడిఐనా తన అర్ధాంగిని ఆనందపరచాలి. అంటే భార్యకు నగలు కొనిపెట్టో,ఆస్తులు కూడబెట్టో లేక మంచి బట్టలు ఇచ్చోఆనందపరచమని అర్థం కాదు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు.అంటే తనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. ఆమాటకొస్తే శివుడి నివాసం రాజభవనంకాదు. అది ఒక కొండ మాత్రమే. ఉన్నంతలోనే తనూ,తన భార్య సుఖముగానే ఉన్నారు.


అమ్మవారు ఎంత సర్వాలంకారభూషితయై ఉన్నప్పటికీ అది పరమేశ్వరుని కొరకు మాత్రమే. కావాలంటే తనుకూడానార చీరలను మాత్రమే ధరించి ఉండగలదు. శివుడు లేని పార్వతి ఉండలేదు. అయ్యవారి సంతోషమేఅమ్మవారిసంతోషము. విషయం మనం దక్షయజ్ఞములో చూడవచ్చు. తన భర్తకు అవమానం జరిగిందని తనప్రాణాలనే త్యాగంచేసిన మహాసాధ్వి పార్వతీదేవి. ఇది ఒక భార్య తెలుసుకోవలసిన విషయం.


ఇక వీరి కుమారులు వినాయకుడు, కుమారస్వామి బిడ్డలు ఎలా ఉండాలనడానికి మంచి ఉదాహరణ. బిడ్డలకు అమ్మానాన్నలే ప్రపంచమని వారిచుట్టూ ప్రదక్షిణ చేయడమే సర్వతీర్థాలు,సర్వ పుణ్యక్షేత్రాలు,అందరు దేవతలూవీటన్నిటినీ దర్శించిన ఫలం కలుగుతుందని వినాయకుడు నిరూపించాడు. దీనిని తన తమ్ముడైనకార్తికేయునికిఉదాహరణగా ఒక అన్నగా గణేశుడు చూపించాడు. కార్తికేయుడు కూడా నిజం తెలుసుకొని తన అన్నయొక్కగణాధిపత్యాన్ని (గణాలకు అధిపతి పదవిని) సంతోషముగా అంగీకరించాడు. విధమైన పోట్లాటా పెట్టుకోలేదు.


ఇక శివపార్వతుల,గణేశకార్తికేయుల ఆభరణాలు,వాహనాల గురించి చూద్దాం.
శివుడి ఆభరణాలు పాములు, వాహనం నంది. అమ్మవారి వాహనము సింహము.
గణేశుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి.

మనకు తెలుసు సింహము అత్యంత భయంకర జంతువు,మృగరాజు. నెమలి,పాములు పరస్పర శత్రువులు. అలాగేపాములు,ఎలుకలు శత్రువులు.సింహము తన ఆహారముగా జంతువునైనా తినగలదు. అది ఎద్దు ఐనా, నెమలిఐనాసరే.
కాని కుటుంబములో ఇవేమీ ఒకదానికొకటి హాని తలపెట్టకుండా ఆనందముగా మసలుకొంటున్నాయి.

ఇక్కడి జంతువులను మనిషి మనస్తత్వాలుగా చెప్పుకోవచ్చు. ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు. అలాగేఒకకుటుంబములో కూడా విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాని ఎవరూ ఎవరినీ బాధపెట్టుకోకుండా, పరస్పరహానికలిగించుకోకుండా అందరూ సంతోషముగా ఉండాలి.

ఓం నమః శివాయ
ఓం జగన్మాతాయ నమః
ఓం గం గణపతయే నమః
ఓం స్కందాయ నమః

గమనిక : ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడ నేను శివపార్వతుల కుటుంబాన్ని ఒకదైవకుటుంబముగాకాక ఒక సాధారణ కుటుంబముగా మాత్రమే తీసుకొన్నాను.
,


Wednesday, July 8, 2009

వేదకాలము లో విష్ణువు చిల్లరదేవుడా? హవ్వ!

మధ్య ఏవో పరీక్షలు ఉండడం వలన బ్లాగ్ వ్రాసి దాదాపు నెలకు పైగానే అయ్యింది. మళ్ళీ మొదలు పెడుతున్నాను. సరే విషయానికి వస్తాను.
మధ్య కొన్ని బ్లాగులలో ఒక వింత అయిన విషయాన్ని చూసాను. అదేంటంటే "శ్రీ మహావిష్ణువు వేదకాలములో చిల్లరదేవుడు,తర్వాత లక్ష్మీదేవికి మొగుడు అయినాడు" అని. దీనికి ఉదాహరణగా క్రింద ఇచ్చిన వాక్యాన్ని ఉదహరిస్తున్నారు.
"సమాజానికి అనుగుణంగా దేవుడే మారాడు!...వేదకాలంలో చిల్లర దేవుడిగా ఉండిన విష్ణువు పురాణకాలానికి నాలుగు చేతులతో శంఖుచక్రగధా పద్మాము ధరించి,వర్గ సమాజానికి ఆరాధ్యదేవత అయిన లక్ష్మికి మొగుడై,పాల సముద్రంలో (లేదా వైకుంఠంలో) చేరాడు."
- కొడవటిగంటి కుటుంబరావు,
వ్యాసం:జీవితాలు - దేవుడి పాత్ర
పత్రిక: ప్రభంజనం పక్షపత్రిక
తేది: 16.11.1972
అసలు వీరు వేదాలు కనీసముగానైనా చదివారా అని అనిపించింది.
వారెవరో చెప్పారట, చెప్పినదానిలో నిజము ఉందా? లేదా ? అని కూడా ఆలోచించకుండా మన బ్లాగర్లు తమకు అనుకూలముగా ఉన్నదని ఉదహరిస్తున్నారు.
సరే మనకు తెలుసు ఋగ్వేదము చాలా పురాతనమైనదని. అందులోని 22 సూక్తము 16 నుండి 21 వరకు మంత్రాలు చూడండి.
अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे |
पर्थिव्याः सप्तधामभिः ||
इदं विष्णुर्वि चक्रमे तरेधा नि दधे पदम | समूळ्हमस्य पांसुरे ||
तरीणि पदा वि चक्रमे विष्णुर्गोपा अदाभ्यः |
अतो धर्माणि धारयन ||
विष्णोः कर्माणि पश्यत यतो वरतानि पस्पशे | इन्द्रस्य युज्यः सखा ||
तद विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः | दिवीव चक्षुराततम ||
तद विप्रासो विपन्यवो जाग्र्वांसः समिन्धते |
विष्णोर्यत परमं पदम

వీటి అర్థాలు:

విష్ణువు ,గాయత్రి(గాయత్రి అనేది ఛందస్సు పేరు) మొదలగు ఏడు ఛందస్సులతో భూమిపై పదవిన్యాసము చేసాడు. భూమిపై మానవులు ఉన్నారు. మనుషులను సకలదేవతలు రక్షించాలి.విష్ణువు జగములో సంచరించినాడు. మూడు విధాలుగా అడుగుపెట్టినాడు. విష్ణువు పాదధూళితో సమస్త విశ్వము నిండిఉన్నది.విష్ణువు అజేయుడు,సకల విశ్వమును పాలించు వాడు. అతడు ధర్మరక్షణకు గాను మూడు లోకాలలో మూడు అడుగులు పెట్టినాడు.విష్ణువు యొక్క కర్మలు చూడండి. మనము విష్ణువు గూర్చి కర్మలు చేయుచున్నాము.ఆకాశమున నిలిచి మనము అంతా చూడవచ్చు. అలాగే విద్వాంసులు విష్ణువు యొక్క మహత్తును ఎప్పుడూ అన్నిచోట్లా చూడగలరు.లోపరహితులు, జాగురూకులు ఐన ఋషులు(వేదకర్తలు) విష్ణువు యొక్క పరమపదమును లో ప్రకాశింపచేస్తారు(ప్రకాశిస్తారు).


ఇంత బాగా ఋగ్వేదం యొక్క 22 సూక్తములోనే విష్ణువు యొక్క మహత్వాన్ని వర్ణించారు.

ఇంతేకాక ఋగ్వేదం(10.8.90) లోని పురుషసూక్తం అలానే విష్ణుసూక్తము మరియు తైత్తిరీయరణ్యకం(4.10.13) (యజుర్వేదం) లోని నారాయణసూక్తం అన్నీ విష్ణువును స్తుతించేవే. ఇవన్నీ వేదాలలోనివే కదా.

ఇక లక్ష్మీదేవి విషయానికి వస్తే వేదకాలము నాటికే లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు భార్య అనే విషయం ఇంతకుమునుపు ఉదహరిచిన పురుషసూక్తం మరియు శ్రీసూక్తముల ద్వారా తెలుసుకోవచ్చు.

1.పురుషసూక్తములోని 24వ మంత్రములో "హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ" అంటే లక్ష్మీదేవి మరియు హ్రీదేవి భార్యలుగా కలిగినవాడవు అని.
2.ఇక శ్రీసూక్తం లో "లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం" అనే శ్లోకములో "శ్రీరంగధామేశ్వరీం" అనియు మరియు "వందే ముకుందప్రియం" అనియు ఉన్నాయి. శ్రీరంగధామేశ్వరీం అంటే శ్రీరంగములో వెలిసిన దానా అని అర్థము.శ్రీరంగములో ఉన్నది శ్రీరంగనాథుడు అంటే శ్రీమహావిష్ణువు అని మనకు తెలుసు. అలాగే ముకుందుడు అన్నా విష్ణువే అనియు ముకుందప్రియం అంటే విష్ణువుకు ఇష్టమైనదానా అని అర్థము కదా.
3. శ్రీసూక్తములోనే "పద్మప్రియే పద్మహస్తే" శ్లోకములో "విష్ణుమనోనుకూలే" అని, "ఓం విష్ణుపత్నీం క్షమాందేవీం" అనియు
4."సరసిజనిలయే సరోజహస్తే" శ్లోకములో" భగవతి హరివల్లభే మనోజ్ఞే" అనియు
5. ఇక లక్ష్మీదేవి గాయత్రీమంత్రములో " ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి, తన్నో లక్ష్మిః ప్రచోదయాత్" అని ఉన్నది కదా.

పైవన్నీ ఋగ్వేదములోని శ్రీ సూక్తములోనివే. ఋగ్వేదము అత్యంత ప్రాచీనము అని మనకు తెలుసు.
అందులోనే ఇవన్నీ ఉన్నాయంటే వేదకాలములోనే మహావిష్ణువుకు లక్ష్మీదేవి భార్యగా ఉందని కదా అర్థము. అంతేకాని పురాణాలకాలములో విష్ణువుకు ఎవరూ లక్ష్మీదేవిని అంటగట్టలేదు.

అలాంటిది విష్ణువును చిల్లరదేవుడని ఎలా అనగలరు? చెప్పేముందు కనీసము మూల గ్రంథాలను చదివితే బాగుంటుంది.
అలానే వారెవరో వ్రాసారని మనము మాత్రం ఆలోచించకుండా ఉదహరించడం మిగతావారిని బాధపెట్టడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి.
టపా కేవలము "విష్ణువు వేదకాలములో చిల్లరదేవుడు కాడని,వేదకాలమునాటికే విష్ణుపత్ని మహాలక్ష్మీదేవి అని" నిరూపించడానికే వ్రాశాను. వ్యాఖ్యలు విషయానికి సంబంధించే వ్రాయగలరు. అంతేకాని విషయసంబంధము లేకుండా వ్యాఖ్యానిస్తే తొలగిస్తాను



Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు