తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, December 7, 2010

భగవద్గీత సారం తెలిసినవారు(అర్థమైనవారు) విశ్వంలో ఎంతమంది ఉన్నారు?

భగవద్గీత సారం తెలిసిన వారిని ఊహించండి ఎంతమంది ఉంటారో! మనము ఊహించడానికి కూడా వీలు లేని ప్రశ్న ఇది. సరే చెబుతున్నాను.

పరమశివుడు ఈ విషయం గురించి ఇలా అన్నాడు.

" నారాయణుడికి తెలుసు,నాకు తెలుసు ,శుకుడికి తెలుసు,వ్యాసుడికి తెలిసి ఉండవచ్చు కొద్దిగా. అంతే!"

చూసారా విన్న అర్జునుడికే కాదు వ్రాసిన వ్యాసుడికి కూడా సారం పూర్తిగా తెలియదన్నమాట. కాని వ్యాసపుత్రుడైన శుకుడికి తెలుసు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. శుకుడి గురించి వివరం నా టపా శుకమహర్షి - మన పురాణ ఋషులు లో ఉంది.


మరి నేటికాలంలో భగవద్గీతను గురించి తమకే అంతా తెలుసు అన్న అవాకులుచవాకులు మాట్లాడేవారి సంగతి కాస్త ఆలోచించండి.



Wednesday, December 1, 2010

గురువుకు ఏమైనా కొమ్ములు మొలిచాయా? (ఆధ్యాత్మికంలో హాస్యము)

ఒక భక్తుడు ఉండేవాడండి. అతడికి ఒక గురువు ఉండేవాడు. ఈ భక్తుడికి తన గురువుగారంటే చాలా భక్తివిశ్వాసాలు.

ఒకసారి ఒకవ్యక్తి ఈ భక్తుడిని బాధపెట్టాలని "ఏం! గురువంటే అంత గొప్పవాడా? అతడికేమైనా రెండు కొమ్ములు ఉన్నాయా?" అన్నాడు.

భక్తుడు అతడితో "రెండు కాదు మూడు ఉన్నాయి. గ కు కొమ్ము వస్తే గు, ర కు కొమ్ము వస్తే రు, వ కు కొమ్ము వస్తే వు.ఇలా మూడు కొమ్ములు ఉన్నాయి. ఏం తెలీదా?" అన్నాడు.

Tuesday, November 30, 2010

అద్వైతం లో ద్వైతం,విశిష్టాద్వైతాలు ఎలా కలిసిపోతాయో చూడండి - గణితం (లెక్కలు) ప్రకారం నిరూపణ

మనకు తెలుసు
ద్వైతం అంటే మనలోని జీవాత్మ,పరమాత్ముడు వేర్వేరు అని,
విశిష్టాద్వైతం అంటే జీవుడిలోనే పరమాత్మ ఆత్మగా వెలుగుతున్నాడని,
అద్వైతం అంటే జీవాత్మే మేఘాల(మాయ)చే కప్పబడిన సూర్యుడు(పరమాత్మ) అని అంటే జీవాత్మ కు పరమాత్మకు భేధం లేదని .

ఇంకా సరళంగా చెప్పాలంటే

ద్వైతం అనగా నేను వెలుగు లో ఉన్నాను అని,
విశిష్టాద్వైతం అనగా నాలో వెలుగు ఉందని,
అద్వైతం అంటే నేనే వెలుగు అని చెప్పవచ్చు.

ఇప్పుడు గణితం ప్రకారం చూద్దాం.


ద్వైతం ను A అని, విశిష్టాద్వైతమును B అని అనుకుందాము.

ఇప్పుడు ద్వైతం,విశిష్టాద్వైతములను అనగా A,B లను కలుపుదాము. అంటే నేను వెలుగులో ఉన్నాను,నాలో వెలుగు ఉంది అనే ఈ రెండు భావనలను కలిపామనుకోండి. అంటే (A+B). అపుడు నేను కు బయటా,లోపలా వెలుగు ఉంది అని అర్థం అవుతుంది. అంటే మొత్తం వెలుగే ఉంది, కేవలం నేను
అనే భావనే బయటి వెలుగును, లోపలి వెలుగును విడదీస్తోంది.

ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే కుండ లోని నీరు (విశిష్టాద్వైతం) , అదే కుండను ఒక నదిలో పూర్తిగా ముంచితే అపుడు కుండ నీటిలో ఉంటుంది (ద్వైతం) కదా. ఇపుదూ కుండలోనూ, కుండ బయటా కూడా నీరే ఉంది కదా. ఇపుడు బయటి నీరుకూ, కుండలోని నీటికీ అడ్డం కుండ కదా. ఈ కుండే నేను అనే భావన.

ఇప్పుడు కుండను పగలగొట్టేసామనుకోండి అప్పుడు బయటి నీరు,లోపలి నీరూ ఒక్కటే అయిపోయి కుండ అందులో కరిగిపోతుంది. ఇప్పుడు కుండకు అస్థిత్వం,లేక ఉనికి (Existance)ఎక్కడ ఉంది?కుండ కరిగిపోయి అంతా ఒకటే (నీరే) అయిపోయింది కదా! అదే కదా అద్వైతం.

అంటే ద్వైతం, విశిష్టాద్వైతాల కలయికే అద్వైతం అని గణితం ప్రకారం నిరూపించవచ్చు.

ఇక అద్వైతంలోని విభాగాలే ద్వైతం,విశిష్టాద్వైతం అని నిరూపిద్దాం.

గణితంలో సమితులు అనే భావన వినేఉంటారు.
ద్వైతం ను A అనే సమితి గానూ, విశిష్టాద్వైతం ను B అనే సమితిగానూ అనుకొందాము.
అప్పుడు A,B లను రెండూ కలిపితే A union B అంటే (A ∪ B).
ఇంతకుముందు నిరూపణ ప్రకారం A,B ల కలయికే అద్వైతం కదా. అంటే ఇక్కడ ఆ A(ద్వైతం),B(విశిష్టాద్వైతం) ల కలయిక (A ∪ B).

గణితంలోని సమితుల ప్రకారం A,B లు రెండు సమితులైతే A,B లు రెండూ (A ∪ B)కి ఉపసమితులు అవుతాయి.

అంటే A ⊂ (A ∪ B). ==>> A is subset of (A ∪ B) (A అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

B ⊂ (A ∪ B) ==> B is subset of (A ∪ B) (B అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

ఇలా నిరూపణ చేయవచ్చు.

అంటే నేను అనే భావనకు బయట ద్వైతం, లోపలి వైపు విశిష్టాద్వైతం ఉన్నాయని ఆ నేను అనే భావనను తొలగిస్తే అద్వైతం అనే భావన అని అర్థం చేసుకోవచ్చు. ఈ టపాలో "నేను" అనే భావనను "మాయ" అని, సూర్యుడిని కప్పిన "మేఘం", శరీరం అని ప్రయోగించాను. రమణమహర్షుల ప్రకారం "నేను" ను
ప్రయోగించలేదు.


Friday, November 12, 2010

సమాధి స్థితి, శృంగారం, గాఢనిద్ర - ఈ మూడింటిలో ఉన్న సారూప్యత ఏమిటి?

మనందరికీ తెలుసు ప్రతి మనిషీ పై మూడింటిలో మొదటిదైన సమాధి స్థితిని కాకపోయినా శృంగారం, నిద్రలను ఖచ్చితంగా కోరుకొంటారు. శృంగారాన్ని కోరుకోని సన్యాసులు కూడా ఉంటారనుకోండి. నిద్రను మాత్రం అందరూ కోరుకొంటారనే విషయంలో సందేహం లేదు.


సమాధి స్థితి విషయాన్ని కాసేపు పక్కన పెడదాము.
ఇంతకూ నెను చెప్పదలచుకొన్న విషయం ఏంటంటే ఎందుకు ప్రతి మనిషీ ఇంకా చెప్పాలంటే దాదాపు ప్రతిజీవీ నిద్రను,శృంగారాన్ని ఖచ్చితంగా కోరుకొంటాయి?

శరీరం అలసిపోతే అది నిద్రను కోరుకొంటుంది. గాఢనిద్ర నిద్రపోయి లేచినవారు ( ఎవరూ లేపకుండా వారంతకువారే మామూలుగా లేచినవారు ) ఎంత ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారో మనము చూస్తూనే ఉన్నాం. ఏమి నిద్రపోయానురా,బలే నిద్రపట్టిందిరా అంటూంటారు వారు. అంటే గాఢనిద్రలో వారు ఏదొ ఆనందం పొందారు అన్నమాట. అదేంటి?


ఇక శృంగారం లో సంపూర్ణ తృప్తి ని పొందిన వారు కూడా శృంగారం అయిపోయిన తర్వాత ఎంతో ఆనందంగా,ఉల్లాసంగా ఉండటాన్ని చూస్తున్నాము కదా. అక్కడవారు కూడా ఏదో ఆనందం పొందారన్నమాట.అదేంటి?


ఇక యోగుల,ఋషుల సమాధిస్థితి విషయానికి వస్తే సమాధిస్థితి లో మరియు అందు నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా వారు బ్రహ్మానందం లో విహరిస్తుంటారని మహాత్ముల జీవితాలలో ( ఉదా: రామకృష్ణులు, వివేకానంద, పరమహంసయోగానంద ) చూడవచ్చు. అంటె అందులో కూడా ఏదో ఆనందం ఉందన్న మాట. అదేంటి?

నిద్రకు, సమాధిస్థితికి గల తేడా ఏంటంటే నిద్రపోకముందూ,నిద్రపోయి లేచిన తర్వాత కూడా మనిషి కి ఉండే జ్ఞానంలో ఏ మార్పూ ఉండదు. అదే సమాధిస్థితి పొందిన మనిషి ఆ స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత పరమాత్మజ్ఞానం పొందుతాడని వేదాంతం చెబుతుంది.

పై మూడూ విషయాలకూ ఒకదానితో ఒకదానికి సంబంధం లేకపోయినా పై మూడింటిలో పొందే ఆనందానికి ఒకే మూలసూత్రం ఉందంటే మీరు నమ్మగలరా?


ఆ మూలసూత్రమే "తననుతాను మరిచిపోవడం" లేక వేదాంతపరిబాషలో "అద్వైతం". అంటే ఆ సమయంలో మరే భావనా చివరికి తను ఒకడిని ఉన్నాననే భావన కూడా లేకపోవడం. ఇంకా చెప్పాలంటే తనే ఆనందం,ఆనందమే తను అయిపోవడం.

ఇంతే విషయం. అయిపోయింది.

కాకపోతే కొద్దిగా కొనసాగింపు ఉంది.

గాఢనిద్రలోనూ, శృంగారం లోనూ ఈ అద్వైత భావన ఆ సమయంలో మాత్రమే ఉంటుంది. ఆ రెండూ లేని మామూలు సమయాలలో ఆ అద్వైతాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. అంటే పై రెండు విషయాలలోనూ ఈ అద్వైతాన్ని అనుభవించడం తాత్కాలికం మాత్రమే అంతే కాకుండా అక్కడ మన ఎరుక లేకుండానే మనము ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాము అంతే.

నిద్రల్లో గాఢనిద్ర ఎంత ఉన్నతమైనదో సమాధిస్థితులలో సహజసమాధిస్థితి అంత కన్నా ఉన్నతమైనది అని వేదాంతం చెబుతోంది. ఈ సహజసమాధిస్థితి పొందిన మనిషి ఎల్లప్పుడూ అంటే నిద్రలోనూ,మెలకువలోనూ కూడా అంతే కాక ఏ పని చేస్తున్నా కూడా ఆ అద్వైతస్థితిని అనుభవిస్తూనే ఉంటాడని వేదాంతం చెబుతోంది.
అందుకే శృంగారంలోని ఆనందం కన్నా సమాధిస్థితిలోని ఆనందం కోటిరెట్లు ఉన్నతమైనదని, అధికమని అందుకే సమాధిస్థితి పొందిన వ్యక్తి అంతకు ఎంతో క్రింది స్థాయి అయిన శృంగారం పై శ్రద్ద,ఆసక్తి ఏ మాత్రం చూపడని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మికతలోని లోతైన భావాలవైపు ఈ టపా పోతుంది. అవన్నీ చెప్పడానికి సందర్బం కాదు కాబట్టి ఈ టపాను ఇంతటితో ముగిస్తున్నాను.

Wednesday, November 10, 2010

ఎవరు నిజమైన త్యాగులు?

సాధువులు, యోగులు, భక్తులు,సన్యాసులు మొదలైన వారు మేము భగవంతుడి కోసం అన్నీ త్యాగం చేసామంటారు. కాని క్రింది విషయాన్ని గమనించండి.

సకల ఐశ్వర్యవంతుడు,సకల సద్గుణవంతుడు అయిన భగవంతుడి కొరకు చిన్నచిన్న అల్పమైన డబ్బు,బంగారం,కామం లాంటి వాటిని వదులుకునే యోగులు,భక్తులు నిజమైన త్యాగులా?

లేక

అల్పమైన పై వాటి కోసం భగవంతుడినే వదులుకునే వ్యక్తులు నిజమైన త్యాగులా?

ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన త్యాగులో?

Friday, October 8, 2010

హస్టల్లో ఉంచి చదివించినందుకు ప్రతిఫలం వృద్ధాశ్రమమా? ఒక యదార్థ సంఘటన.

సంఘటన నిజంగా రోజు నేను చూసిన సంఘటన.

స్టీరింగ్ (సెవెన్ సీటర్) ఆటోలో నేను వెళ్తుంటే అదే ఆటోలో ఒక తల్లీ,కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ఇది.


తల్లి: "ఏరా! చిన్నప్పటినుండి కష్టపడి మిమ్మల్ని చదివించి,జీవితంలో వృద్ధిలోనికి తీసుకువచ్చినందుకు వృద్ధాశ్రమంలోచేర్పించి మాకు బానే బుద్ధిచెప్పారు .ఒకే కొడుకువి మాకు మీదగ్గర ఉండాలని ,శేషజీవితం గడపాలని ఉంటుంది కదా"


కొడుకు: "ఏం నెలనెలా డబ్బు నేనేకదా పంపుతున్నది మీకు. అదీగాక మీరు నన్ను చూడాలని అనినప్పుడలా నేనువస్తూనే ఉన్నాకదా. మీతో గడుపుతున్నాకదా"


తల్లి: అలా డబ్బు పంపడం కాదు. మాకు మీదగ్గర ఉండాలని, మనవడిని ఆడించాలని ఉంటుంది కదా"


కొడుకు : చూడమ్మా. నువ్వు,నాన్న నాకు మిగతా బంధువుల కన్నా ఏమంత ఎక్కువకాదు. తేడా ఏంటంటే మీరుకష్టపడి మీ డబ్బుతో నన్ను చదివించారు.అంతే. అసలు నన్ను 2 తరగతిలోనే హాస్టల్లో వేసి చదివించారు. అప్పటినుండి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లల్లోనే జరిగింది. అప్పుడప్పుడు నెలకొకసారి వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఇంటికొచ్చి చదువుకుంటానంటే నీ భవిష్యత్తు కోసమే కదా మేము ఇద్దరమూ కష్టపడుతూ చదివిస్తున్నాము అన్నారు. ఏం నాకు మాత్రం మీవద్ద ఉండాలని అప్పుడు ఎంతబాధపడ్డానో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఐన విషయం ఎన్నిసార్లు చెప్పాలి. మీలాగే నేను కూడా డబ్బు పంపుతున్నా కదా. మీరన్నా అప్పుడు నెలకుఒకటిరెండుసార్లే వచ్చే వారు చూడడానికి.నేను మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నా కదా. ఇక టాపిక్ ఎప్పుడూమాట్లాడకు.


ఇక్కడ నేను ఆటో దిగేసాను. తర్వాత ఏం వాదం జరిగిందో నాకు తెలీదు.ఆమె చేతిరుమాలు అడ్డుపెట్టుకొని ఏడుస్తున్నట్లుఅనిపించింది.

కాని సంఘటన నాలో నేటి మానవసంబంధాలను గూర్చి ఏవేవో అస్పష్ట ఆలోచనలను రేకెత్తిస్తోంది .

Thursday, October 7, 2010

నేర్చుకోవడం అంటే ఇదీ............ నేటి మనుషులు అనుకుంటున్నట్లు కాదు

చాలా పెద్ద విరామం తర్వాత మళ్ళీ బ్లాగులోక దర్శనం. ఒక చిన్న కథ.

కౌరవపాండవులు ద్రోణాచార్యుల గురుకులం లో విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. ఒకసారి ద్రోణులు ఏదో పనిమీద కొన్ని రోజులు బయటకు నేర్చుకోవడం వచ్చింది. వెళ్తూవెళ్తూ తన శిష్యులకు కొద్దిగా ఇంటిపని(home work) ఇచ్చి వెళ్ళాడు. అతను వచ్చిన తర్వాత శిష్యులు తాము చదివినదంతా ద్రోణులకు అప్పజెపుతారు.

కాని ధర్మరాజు మాత్రం "ఒక వాక్యాన్ని మాత్రం చదివాను.అందులొని విషయాన్నే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్తాడు. ఇన్నిరోజులుగా ఒక్కవాక్యం మాత్రమే చదివి నేర్చుకొన్నావా? అంటూ కోపంతో ధర్మరాజును దండిస్తాడు.


ఐనా ధర్మరాజు ఏ మాత్రం చలించకుండాఉండడం చూసి ద్రోణులు ఆలోచనలో పడి ధర్మరాజును పిలిచి "నాయనా! నువ్వు చదివిన ఆ వాక్యం ఏమిటి?" అన్నాడు. అప్పుడు ధర్మరాజు పుస్తకం చూపాడు."ఎన్నడూ కోపం తెచ్చుకోవద్దు" అన్నదే ఆ వాక్యం. ద్రోణులు ఆనందభాష్పాలు రాలుస్తూ "నాయనా! నాకు నువ్వు ఈరోజు "నేర్చుకోవడం"అంటే ఏమిటో నేర్పావు" అన్నారు.


పైన చెప్పిన విధం నిజముగా నేర్చుకోవడం కాని చిలకలలా నేర్చుకొని తిరిగి వల్లించడం,వప్పచెప్పడం కాదు.

ఇప్పుడు చెప్పండి నేర్చుకోవడం అంటే ఏదో.

Thursday, July 29, 2010

ఏ విషయమైనా సమగ్రంగా నేర్చుకోవడానికి వేదాలు చెప్పిన పద్దతి చూడండి. ఎంత బాగుందో!

సాధారణంగా వేదమంత్రం ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి ఆరు పద్దతులు ఉన్నాయి. ఆ ఆరు పద్దతులనే మనం నిత్యజీవితంలో కూడా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

ఆ పద్దతులు ఏంటంటే ఉపక్రమం, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వత, ఫలం, అర్థవాదం, ఉపపత్తి.


ఉపక్రమమంటే ప్రారంభం. ఉపసంహారమంటే చివర. మొదటి పద్ధతి ఈ రెంటినీ గమనించటం - దీనినే ఉపక్రమ - ఉపసంహార పద్ధతి అంటారు. ఈ రెండూ ఒకే విషయం గురించి చెప్తే మొత్తం విషయమదేనని గ్రహించవచ్చు.


అభ్యాసమంటే ఒక విషయాన్ని పదేపదే చెప్పటం లేక వల్లెవేయటం లేక మననం చేయటం.


ఏ వ్యాసంలోనైనా ఒకే విషయం గురించి పదే పదే చెప్తూంటే విషయం యొక్క సారాంశమదేననీ, మనస్సుకి బాగా హత్తుకోవటానికే తిరిగి తిరిగి దాని ప్రస్తావనే జరుగుతోందని గ్రహించవచ్చు.
అపూర్వత అంటే అంతకు పూర్వం చెప్పబడనిది అని అర్థం. అంటే విషయసారాంశమదే నన్న మాట.


''ఉపపత్తి'' అంటే విషయం గురించి చెప్పి ఆ విషయం యొక్క మూలమూ, ఉద్దేశమూ, ఔచిత్యమూ గురించి తెలుసుకోవడం. వీటి వల్ల ఆ విషయం స్పష్టమవుతుంది.


అర్థవాదం అంటే విషయాన్ని అనేక కోణాలలో విషయాన్ని చర్చించడం. వివిద రకాలుగా అర్థవంతమైన వాదాలు చేసుకోవడం.


'ఫలం'' అంటే ప్రతిఫలం. ''ఈ విధంగా చేస్తే ఈ ఫలితం లభిస్తుంది'' అనటం లాంటిదన్నమాట. అంటే మనం నేర్చుకోవలసినదాని వైపు లేక పొందవలసినదాని వైపు మనలను నడిపించటం. దీనిని ''ఫలం'' అంటారు.



Wednesday, July 28, 2010

వేదాల ముందు,వెనుకలను నిర్ణయించడానికి నేటి పరిశోధకుల ప్రామాణికత్వం ఏంటి?

నేటికాలపు పరిశోధకుల దృష్టిలో ఋగ్వేదం పురాతనమైనది. తర్వాత యజుర్వేదం,సామవేదం, అధర్వణవేదం వచ్చాయి. అందరూ దీనినే నమ్ముతున్నారు.

ఈ పరిశోధకులు దేనిని ప్రామాణికంగా తీస్కొని ఇలా వర్గీకరించారో తెలియడం లేదు.

ఇలా ఎందుకంటున్నానంటే అసలు ఋగ్వేదంలోనే యజుర్వేదానికీ, సామవేదానికీ సంబంధించిన సమాచారం ఉంది.
అందుకే వేదాల ముందు,వెనుకల సందేహం వచ్చింది.

మనలో పురుషసూక్తము చాలామందికి తెలుసు. ఋగ్వేదం 10వ మండలంలోని పురుషసూక్తములోని 10 వ శ్లోకం చూడండి.

తస్మాద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాద జాయత ||


అర్థం:

ఈ సర్వహుత యజ్ఞం నుండి ఋగ్వేద మంత్రాలు పుట్టాయి,సామవేద మంత్రాలు పుట్టాయి.ఛందస్సు పుట్టింది,యజుర్వేదం పుట్టింది.


మరి ఋగ్వేదం తర్వాత పూర్తైన తర్వాత యజుర్వేదం,సామవేదాలు వచ్చాయనాలా? లేక ఋగ్వేదం రచిస్తుండగానే యజుర్,సామవేదాలు సమాంతరంగా(parallel) గా రచించారనాలా? లేక అన్నీ ఒకేసారి ఉన్నాయనాలా లేక పుట్టాయనాలా? కాని ఎవరూ ఇలా అనలేదు. అందరూ అనేదేమంటే మొదట చెప్పినట్లుగా ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం మొదలగునవి.


కాని పై శ్లోకం వలన
ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం అనే భావన ఎలా నిలబడగలదు?


ఇంకా ఇలాంటి ప్రస్తావనలు కల శ్లోకాలు ఏమైనా ఉన్నాయేమో నేనింకా చూడలేదు కాని పై శ్లోకం నాకు కనిపించింది.

Tuesday, July 27, 2010

ఈ తెలుగు పాటకు ఇంగ్లిష్ పాట ఎదో కనుక్కోండి చూద్దాం

క్రింది పాట ఒక తెలుగు సినిమాలోనిదే, కాకపోతే మొత్తం పాట అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆ పాట ఏదో కనుక్కోండి.

నా మొహం అద్దంలో చూస్కొని

ఆశ్చర్యపోయా కనిపించింది చూసి

నేను కేవలం ప్రయాణించే సిపాయిని

నేనవగలను కాగలిగిందంతా

ఇప్పుడు అసలు పాట ఏంటో కనుగొని ఆ శృతిలోనే ఈ పాట కూడా పాడుకొని నవ్వుకోండి.

Monday, July 26, 2010

ప్రాచీన భారత ఋషులు ఆఫర్లు పెట్టి సరుకులు అమ్మినారా?

టపా పేరు చూసి ఇదేదో బిజినెస్ కు సంబంధించినది అనుకోకండి.
ఇది నేను ఇంతకు ముందు రాసిన టపా "మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?" కి కొనసాగింపు.

రామాయణం లో ఒక శ్లోకం ఉంది. విభీషణుడు రావణుడితో చెప్పే శ్లోకం

సులభాఃపురుషా రాజన్‌ సతతంప్రియవాదినః

అప్రియస్యతుపథ్యస్య వక్తా శ్రోతాచదుర్లభః

అర్థం:
రాజా! నిత్యం ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా లభిస్తారు. కాని మన మనసుకు నచ్చకపోయినా మన మేలు కోసం చెప్పేవారూ, చెప్పినా వినేవారూ దొరకడం కష్టం.


కాని అందరికీ మంచిది అవుతుంది అన్న విషయం చెప్పితీరాలి. చెప్పినా వినేవారు దొరకడం కష్టం. ఇక్కడే మన ప్రాచీనఋషులు ఆలోచించారు. నేటి వ్యాపారస్థులు తమ సరుకులు అమ్ముడుపోవడం కోసం "ఒకటి కొంటే ఇంకోటి ఉచితం" లాంటి పథకమే ఆ ఆలోచన.

చెప్పాల్సిన విషయం లేదా సందేశం సరుకులాంటిది. ఆ విషయాన్ని లేక సందేశాన్ని కల్గి ఉన్న కథ ఆఫర్ లాంటిది. అంటే అసలు సరుకు చెప్పాల్సిన విషయం, కథ ఆఫర్ అన్నమాట. సరుకు అమ్ముడు పోవడం కోసం వ్యాపారి ఆఫర్ ఇస్తాడు. జనంలో చాలా మంది మళ్ళీ ఇలాంటి ఆఫర్ ఉండదేమోనని సరుకు కొంటారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కొందరైతే ఆఫర్ ఉంటేనే సరుకులు కొంటారు. ఎలాగైనా సరుకు అమ్ముడుపోవడం అనేది వ్యాపారికి ఎలా ముఖ్యమో, మంచి విషయం ప్రజలకు అందాలనేది ఋషి ఉద్దేశ్యము.

మనము సరుకు కొన్న తర్వాత అసలు సరుకు చూపించకుండా ఆఫర్లో వచ్చిన సరుకునే ఎక్కువగా పక్కింటివారికి లేక మరెవరికో ఎలా చూపిస్తామో కథలోని సందేశాన్ని కాకుండా కథనే ఎక్కువగా
పట్టించుకొంటాం. అది వేరే సంగతి.

సరే కథ చదివినంత మాత్రాన సందేశం అందుతుందా అంటే సందేహమే. ఇక్కడే మరో ఆలోచన వచ్చింది ఋషులకు.

మనిషి విన్నదాని కంటే చూస్తే ఎక్కువ గా ఆకర్షితుడవుతాడు.

కాబట్టి నాటకాలలో సందేశాలను జొప్పించి నాటకాలు వ్రాశి వాటిని ప్రదర్శిస్తే చూస్తున్నంతసేపు తనను తాను మరిచిపోతాడు. పాత్రలను మరిచిపోయి వాటిని నిజంగా భావించి అందులో లీనమవుతాడు.

బయటకు వచ్చినా ఆ ప్రభావం పోదు. నేటి సినిమాలు, సీరియళ్ళ లో ఈ విషయాన్ని బాగా గమనిస్తూనే ఉన్నాం కదా.

Sunday, July 25, 2010

ఈ ఇంగ్లీష్ పాటకు తెలుగు పాట కనుక్కోండి

గాడ్ హ్యాస్ గివెను స్ట్రీట్ వన్ను
నవ్ వై టౌను ,వై ఓన్ హౌసు
ఓ సిస్టరు

Saturday, July 24, 2010

ఈ పాటకు అసలు తెలుగు పాట ఏదో కనుగొనండి చూద్దాం

క్రింది పాట తెలుగు పాట. నేను పేరడీగా తెలుగు లోని పాటను ఆంగ్లం లోనికి అనువదించాను. అసలు పాట ఏదో కనుగొని ఆ పాట లాగే దీన్ని కూడా పాడుకోండి.



స్టైలు క్వీను యు ఆర్, స్టైలు మ్యాను ఐ యాం ( style queen you are, style man i am)

ఏజు మ్యాచు, కపులు మ్యాచు (age match, couple match)

డిసెండ్ ఫ్రం టెర్రస్ (desend from terrus)

Friday, July 23, 2010

చేసే ఏ పని కైనా ప్రేమే ముఖ్యకారణంగా ఉండాలి - శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు

మీరు చేసేపని ఏదైనాసరే! దానికి ప్రేమ ఒక్కటే ముఖ్యకారణంగా ఉండాలి. కార్యం అంటూ ఎప్పుడుఆరంభం అవుతుందో - ఆ కార్యానికి కర్త, కర్తకు వేరైన ఇతరులు ఉండనే ఉంటారు. కార్యం ఏదైనాసరే! దాని ఉద్దేశము, ప్రయోజనము, కారణము ప్రేమతప్ప ఇంకోటి కారాదు. ఇచ్చట నేను గాంధీగారు అవలంబించిన అహింసావ్రతాన్ని గురించి చెప్పటంలేదు. ఒక్కొక్కప్పుడు మనం హింసా పూర్వకములైన కార్యాలు కూడ చేయవలసివస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నేరములకు తగిన శిక్షను కూడ విధించవలసి వస్తుంది. యుద్ధాలు చేయవలసిన అవసరం కూడ కలుగుతుంది. కాని ఏ కార్యం చేసినా సరే! కర్తయొక్క ముఖ్యోద్దేశము ప్రేమయే అయిఉండాలి. ఇచ్ఛాద్వేషాలకు క్రోధమాత్సర్యాలకు అందులో తావుండరాదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఈ ప్రేమ అనేది అల్లుకోనిపోయి ఉంటే ప్రపంచంలో ఎట్టి గడ్డు సమస్యలనైనాసరే, మనం అవలీలగా సాధించగలం.

-శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు

Thursday, July 22, 2010

పండ్లు తినడానికి పండ్ల తోటలోనికి వెళ్లి పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెట్టడం ఎందుకు?

చాలా ఆకలి మీద పండ్ల తోటలోనికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక తీరా పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెడుతుంటే ఎవరికి నష్టం? కావాలంటే ఆకలి తీరాక ఆ పని చేసుకోవచ్చు.

కాని మన దురదృష్టం ఏంటంటే నేడు మనం చేస్తున్న పని లెక్కెట్టుకోవడమే, తిని ఆకలి తీర్చుకోవడం కాదు.సాధారణంగా వేదాలు కాని, మరేవైనా గ్రంధాలు కాని చదవాలని ఎందుకు అనుకొంటాము.

మనకు కావలసినది మనం చదివే పుస్తకాలలో నుండి మన జీవనమార్గాని కొక దీపం... నిజానికి ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైన చర్చలు అసలువిషయాన్ని మన దృష్టినుండి ప్రక్కకు తొలగిస్తున్నాయి. ఇట్లాంటి ప్రశ్నలవల్ల మన దృష్టిలో ఆ పుస్తకాల విలువ తగ్గిపోవడమేకాక వాటిపై నిరాదరణ ఏర్పడి వానిపై మనము ఉంచవలసిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా ఉంచలేకపోతాము. అది పిల్లలు తినడం కోసం పెంచబడుతున్న పండ్ల తోటలను బాటనీ లాబొరేటరీలుగా మార్చినట్లు అవుతుంది. అలా ప్రయోగశాలలుగా మార్చామనుకోండి, వివిధ రసాయనాలు అవీ కలపవలసివస్తుంది. అప్పుడు అసలు దేనికోసం ఆ పండ్ల తోటను పెంచుతున్నామో ఆ అసలు పని ఇక వీలు కాదు. మనం ప్రస్తుతం శాస్త్రాలను,గ్రంధాలను చదివేపద్దతి కూడా ఇలానే ఉంది.

లేదు, ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైనవి కనుగొనాలి అనేవారు ఉన్నారంటే అది వేరే సంగతి.వారు అందుకు చదువుతారు.అది వారు చదువుతున్న కారణం.

మన కారణం అది కానప్పుడు మన కారణం అందులోని విషయాలు ఏంటి? మనకు పనికొచ్చేవా,కాదా? ఆచరణలో పెట్టగలమా లేక పెట్టవచ్చా?అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? అయినప్పుడు కూడా పైన చెప్పినవారి పనే చేస్తుంటే ఎవరికి నష్టం?

మనం ఒక పదానికి అర్థం కావాలని నిఘంటువు(Dictionary) చూస్తాం. కాని ఆ పదానికి అర్థం వెదికే క్రమంలో అనేక ఇతరపదాలు కనపడి వాటి అర్థం కూడా చూస్తూ ఒక్కొక్కసారి మనం అసలు ఏ పదానికి అర్థం చూడాలనుకొంటామో ఆ పదాన్ని మరచిపోతుంటాం. తర్వాత ఆ పదం గుర్తుకు రాక అదేంటో అని ఆలోచిస్తూ నరకయాతన పడుతుంటాం. ఇది అందరికి అనుభవమే అనుకొంటున్నాను. మిగతా పదాల అర్థాలు తెలిసాయి కదా అని అంటారేమో మంచిదే, కాని మన అసలు పని కాలేదు కదా.

ఒక అడవిలో రాత్రి పూట అడవి జంతువులు,పురుగులు,పాములు మొదలగునవి మన వద్దకు రాకుండా మనం కాపాడబడడం కోసం మనం కట్టెలు పేర్చి మంట పెట్టామనుకొందాం. ఇక్కడ
"రక్షణ" అనేది ప్రధాన కారణం,లక్ష్యం. ఆ మంట వెలుగులో మన వద్ద ఏమైనా దుంపలు అవీ ఉంటే వాటిని ఉడికించడం,తినడం అంతేకాక చలిగా ఉంటే మనకు వెచ్చదనం రావడం అనే ప్రయోజనాలు
అనుషంగికం.అంటే మన అసలు కారణం చెడకుండానే ఇతర ప్రయోజనాలు కలగడం.

అలానే మనం దేనికోసం పుస్తకాలు చదువుతున్నామో దాని కోసం చదివేటప్పుడు ఇతర విషయాలు మనకు తెలిస్తే తెలియనీ! మేలే, కాని అసలు విషయం మాత్రం మనం మరిచిపోకూడదు.

ఎవరెందుకు చదువుతున్నారో అందుకే మొదట చదవాలి. కావాలంటే చదివిన కారణం తీరాక ఆ పుస్తకాన్ని వ్రాసిన రచయిత ఎవరు? అతను ఏ కాలం వాడు లాంటివాటిపై దృష్టి పెట్టి కనుగొనడానికి ప్రయత్నించవచ్చు.

Wednesday, July 21, 2010

యోగ్యుడైతే నీ విద్యను చెప్పు,ఎవరూ దొరకకపోతే నీలోనే ఉంచుకో - ఇదే వేదాల అభిప్రాయం

ఇది నా ౨౦౦(200)వ టపా.

మన వేద విద్య లేక విజ్ఞానం అన్నది గురుశిష్య పరంపరగా ప్రసరిస్తూ ఉంది. వ్రాతమూలకంగా వేదాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వేదాలు స్వరప్రధానం అయినందువలన విని వల్లెవేస్తూ నేర్చుకోవడం అవసరం అయింది. అందుకే వేదాలను ఇలా విని నేర్చుకోవడం వలెనే "శ్రుతి" అని కూడా పిలుస్తున్నాం. మనము వేదాలలోని విజ్ఞానాన్ని చూస్తూనే ఉన్నాం.

అసలు ఈ విజ్ఞానం లేక విద్య ఎవరికి అందాలి అన్న విషయంలో వేదాలు ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. క్రింది శ్లోకాలు చూడండి.

సామవేదం లోని ఉపబ్రాహ్మణమైన "సంహితోపనిషద్ బ్రాహ్మణం" లోని శ్లోకాలు ఇవి.

"విద్య వై బ్రాహ్మణం ఆజగామ తవహం అస్మి త్వం మాం పాలయస్వ-అనర్హతె మానినెమాదా
గోపాయ మా శ్రేయసీతె అహమస్మి విద్యా సార్ధం మ్రియెత్ నా విద్యాం ఊషరెవపెత్"(3-9,10)

అర్థం:
ఒకసారి "విద్య" ఒక తపస్వి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించింది." నేను నీ దానిని. నన్ను చక్కగా అభ్యసించి పాలించు. అయోగ్యుడు,దురభిమాని అయిన శిష్యుడికి నన్ను ఇవ్వకు.నన్ను
నీలోనే ధరించి కాపాడు. నీకు ఎన్నటికైనా మంచి(శ్రేయస్సు)నే చేస్తాను. ఎప్పటికీ ఊషరక్షేత్రం(ఉప్పుచవిటి నేల) లాంటి అయోగ్యుడి చేతిలో మాత్రం ఉంచకు."

ఈ శ్లోకపు భాష్యం:

"యోగ్యుడైన శిష్యుడు దొరక్కపోతే తన విద్యను తనలోనే ఉంచుకోవాలే కాని ఎన్నటికీ అలాంటి వారికి తను నేర్చుకొన్న విద్యను చెప్పరాదు. దానివల్ల వాడు లోకకళ్యాణం సాధించకపోగా
లోకవినాశనానికే కారణం అవుతాడు."

విజ్ఞానం లేక విద్య అనేది ఎవరికి,ఎలాంటివారికి అందాలి అనే విషయాన్ని వేదాలు ఇంత విస్పష్టంగా ప్రకటించాయి.

గార్గి - స్త్రీ జాతిలో ఒక ఆణిముత్యం

గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి.ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది.ఆ కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు.

ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగా కనిపించేది.ఈమె బ్రహ్మచారిని.పరబ్రహ్మం యొక్క ఉనికిని అన్వేషిస్తూ ఈమె అనేక సూక్తాలను రచించింది.జనక మహారాజు యొక్క సభలోని నవరత్నాలలో ఈమె కూడా ఒకరు.ఈమె యొక్క పేరు జనకమహారాజు నిర్వహించిన బ్రహ్మజ్ఞానుల సభ ద్వారా వ్యాప్తి చెందినది.ఆ సభలో ఆ కాలంలో అందరికన్నా గొప్పవాడైన "యాజ్ఞవల్క్య ముని"ని ఆత్మ,పరమకారణమైన పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలు అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

ఉపనిషత్తులలో గార్గి యొక్క ప్రస్తావన వస్తుంది. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్నవల్క్యముని తో సంభాషణలలో ఈమె జ్ఞానపు వెలుగులు మనలను,అందరిని నిశ్చేష్టులను చేస్తాయి. ఉపనిషత్తులలో ఆమెను ఒక గొప్ప సహజ వేదాంతజ్ఞాని గా పేర్కొన్నారు.

మహాతల్లి గార్గి వేదకాలం నాటిదైనందున
ఇంతకన్నా ఎక్కువ వివరాలు దొరకడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

Tuesday, July 20, 2010

పగలు,రాత్రి ఏర్పడే విధానాన్ని వేదకాలంలోనే స్పష్టంగా చెప్పిన మన పూర్వీకులు

నేను గతంలో భూమి గుండ్రం (వేదాలు) అని ఒక టపా వ్రాశాను. అందులో మన ప్రాచీనులు భూమి గుండ్రంగా ఉన్న విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో వ్రాసాను. ఈ టపాలో ఇంకా ఎంత చాలా స్పష్టం గా వివరించారో చూడండి. ఋగ్వేదం ఎంత పురాతనమైనదో మనకు తెలుసు.

ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో క్రింది శ్లోకాన్ని చూడండి.

" వా ఏష న కదాచనాస్తమేతి నోదేతి, తం యచస్తమేతీతి మన్యంతేహ్న ఏవ తదంత్వమిత్వాథాత్మానం విపర్యస్యతే- రాత్రీమేవావస్తాత్ కురుతేహః పరస్తాత్ ... య ఏవం వేద" 14.6

అర్థం:

సూర్యుడు ఉదయించడం,అస్తమించడం అంటూ అనేది ఎప్పటికీ ఉండదు. సాయంకాలం అతడు విపర్యాసాన్ని పొంది మనకు కనబడడు. మళ్ళీ తెల్లారేసరికి కనబడతాడు.ఈ గోళంలో
కొంతభాగానికి కొంతసేపు మిగతాభాగానికి కొంతసేపు చీకటి,వెలుగులను ప్రసాదిస్తూ రాత్రి,పగలు అనే వ్యవహారాన్ని కలిగిస్తాడు.

ఇందులో విపర్యసం అనే పదం నాకు అర్థం కాలేదు.

అసలు రాత్రి,పగలు అనేవాటిని ఎంత స్పష్టంగా ఆ కాలంలోనే వివరించారో చూడండి.
అంతేకాక గోళం అంటూ భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్తున్నారు.

వేదాల్లోని ఈ విషయాన్ని చూసి 19వ శతాబ్దపు వేద పరిశోధకుడు మోనియర్ విలియంస్ (Monier Williams) భారతీయుల సునిశిత మేధాశక్తిని ప్రశంసించిన విధానం చూడండి.

"Indians had made some shrewd astronomical guesses more than 2000 years before the birth of Copernicus" (The Vedas p.39)

ఇంకో తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే ఈ ఋగ్వేదపు ఐతరేయ బ్రాహ్మణంలోనే మొదటిసారిగా "ఆంధ్ర దేశం" అని ఉపయోగించబడింది.
ఇందుకు సంబంధించిన శ్లోకం

"తుంగా కృష్ణా తథా గోదా సహ్యాద్రి శిఖరావధి|
ఆ ఆంధ్రదేశ పర్యంతం బహ్వృచశ్చాశ్వలాయనీ" (33.6)

స్త్రీ మాత్రమే కాదు, మగవాడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణమైన మగవాడు అవుతాడు

అదేదో చిత్రంలో కథానాయకుడు ఒక స్త్రీ పరిపూర్ణత గల స్త్రీ ఎప్పుడు అవుతుంది అని మార్కులు వేస్తూ సంతానవతి ఐన తర్వాతనే ఆమె పరిపూర్ణత పొందుతుందని చెప్తాడు.

మరి మగవాడు పరిపూర్ణ మగవాడు ఎప్పుడు అవుతాడు? ఈ విషయం చాలా మందికి తెలియదు.

ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి.

శుక్ల యజుర్వేదం లోని "శథపథ బ్రాహ్మణం" లోని క్రింది శ్లోకాన్ని చూడండి.


అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి
సర్వో భవతి! సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి (5.2.1.10)


అర్థం :

భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.


కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.


మనం ఇంకోటి గమనిస్తే కనుక ఒకటి అర్థం అవుతుంది. పై శ్లోకంలో భార్య ద్వారా సంతానం పొందేవాడే పరిపూర్ణత పొందుతాడని చెప్పబడింది. అంటే కట్టుకొన్న భార్య ద్వారానే పొందాలి, ఇతరత్రా కాదు అన్న విషయం స్పష్టమవుతోంది.

Monday, July 19, 2010

జనానికి మంచి బదులు చెడు జరుగుతుందనే విమాన నిర్మాణం వ్రాయడం లేదు - భోజరాజు

భోజరాజు గురించి అతను ఒక గొప్ప మహారాజుగా మనందరికీ తెలుసు. ఇతని ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు ఉండేవాడని చరిత్ర చెప్తోంది.


కానీ ఇతను "సమరాంగణసూత్రం" అనే గ్రంధం వ్రాశాడని చాలామందికి తెలీదు.


ఈ గ్రంధంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయబడ్డాయి. "యంత్రాలు ఎలా తయారు చేయాలి?","ఆకాశంలో ప్రయాణించడం ఎలా సాధ్యం?" అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి.



అమరకోశం లో 'వ్యోమయానం విమానోస్త్రీ' అని ఉంది. అంటే "ఆకాశంలో ప్రయాణించే వాహనానికి విమానమని పేరు" అని అర్థం.


భోజరాజు తన 'సమరాంగణసూత్రం'లో విమాన నిర్మాణవిధానం గూర్చి వ్రాస్తూ భోజరాజు "విమాన నిర్మాణం గురించి స్థూలంగా తత్త్వము(theory) మాత్రమే వ్రాస్తున్నాను. దానిని నిర్మించే విధానం తెలిసే వదిలేస్తున్నాను,వ్రాయడం లేదు.చేయడం ఎలాగో చెప్పడం వల్ల సామాన్య జనానికి సుఖం బదులు కష్టమే ఏర్పడుతుంది అని ఇది వ్రాయడంలేదు' అని వ్రాశారు.



చిత్తశుద్ధి లేని వారి చేతిలో ఇలాంటివి పడితే పసిపిల్లల చేతిలో విషం ఉన్నట్లే కదా!


భోజరాజు గారు ఏమి ఆలోచించాడో ఏమో మనకైతే తెలియదు.


1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.


ఇతర దేశాలలో నూతనశాస్త్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మనదేశంలో ఉన్నశాస్త్రాలు కూడా నామరూపాలు లేకుండ నశిస్తున్నాయి. ఉన్న శాస్త్రాల ను ఉపయోగించుకొనే పద్దతి మనకు తెలియడంలేదు.


ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసికొనడానికి పరిశోధనలు చెయ్యాలి. మనకు అర్థము కాకపోయినా మన తర్వాతి తరం కొరకైనా వానిని రక్షించాలి. ఇప్పుడు అర్థము కాకపోయినా మరియొక కాలంలోనైనా అవి ఉపయోగపడతాయి.


మిగిలిన దేశాలు మొదట అజ్ఞానదశలో ఉండి క్రమేణ జ్ఞానదశకు వచ్చాయి. మన దేశము ఆరంభ కాలములో ఉచ్చస్థితిలోఉండి క్రమేణ క్షీణస్థితికి వచ్చి మళ్లీ ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్తోంది.



ఇప్పటికే ఎన్నో శాస్త్రాలు మనకు దొరకడం లేదు. ఉన్న శాస్త్రములను మూర్ఖంగా పనికిమాలినవని పారవేస్తే మనకే నష్టం. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి. నిరూపణ కానిదే దేనినీ ఖండించుటకు మనకు అధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం ఉంది.


సముద్రంలో ప్రయాణాన్ని వేదాలలో నిషేధించలేదు

ఋగ్వేదం 4 అధ్యాయం,9 అనువాకం,48 సూక్తం



उवासोषा उछाच्च नु देवी जीरा रथानाम

ये अस्या आचरणेषु दध्रिरे समुद्रे न शरवस्यवः



అర్థము:


ధనము కోరువారు సముద్రమున నావలు నడుపుతారు.ఆట్లే ఉదయాకాశమును ఉషోదేవినడుపుచున్నది.ఇంతకు పూర్వము కూడా నడిపినది.ఇప్పుడూ నడుపుచున్నది.



సముద్రమున నావలు నడపడం ధనం కొరకు అని అన్నప్పుడు,సముద్రయానం వ్యాపారం కొరకే అని కదా అర్థము.దీనినిబట్టి వేదకాలములోనే మన పూర్వీకులు సముద్ర ప్రయాణం (ఇతర దేశాలతో కూడా అయ్యుండవచ్చు) ద్వారావ్యాపారము చేస్తున్నట్టు అర్థం అగుచున్నది.



అంతేకాక సముద్రయానము నిషేదము అన్నది వేదకాలం తర్వాత ఎవరో మన గ్రంధాలలో చొప్పించారు అన్నది అర్థంఅవుతోంది.

Sunday, July 18, 2010

ఎపిక్ (Epic) - మన భారతదేశపు బ్రౌజర్



ఈ మధ్యనే నేను ఎపిక్ బ్రౌజర్ ను వాడుతున్నాను. చాలా బాగుంది.

దీన్ని mozilla fire fox ను ఆధారంగా తీస్కొని రూపొందించారు.
మామూలు firefox లోని అన్ని features ఇందులో ఉన్నాయి.

ముఖ్యం గా బ్రౌజర్ లో నే Anti virus సౌకర్యం ఉంది. దాన్ని download చేసుకొని activate చేసుకొంటే తర్వాత మనం ఏ download చెసుకొన్నా బ్రౌజరే స్కాన్ చేస్తుంది. ఈ anti virus ను మన కంప్యూటర్ ను కూడా స్కాన్ చేసి శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. బాగానే పనిచేస్తోంది.

దీని ప్రత్యేకతలు :
1.direct గా ఆంగ్లం తో పాటుగా ఏ భారతీయ భాష లో నైనా టైప్ చేసుకొనే సౌకర్యం ఉంది.
2.ఎడమ వైపు ఒక బార్ ఉంటుంది. అందులో చాలా అదనపు సౌకర్యాలు ఉంచారు.
3.బ్రౌజర్లోనే మనం word pad open చేసుకొని ఆంగ్లం తో పాటుగా ఏ భారతీయ భాష లో నైనా వ్రాసుకోవచ్చు.
4.ఇంకా twitter, orkut, gmail, facebook,yahoo, book marks, ఇంకా చాలా సైట్ల short cut లు ఎడమ వైపు బార్ లో ఉంచారు.
5.ఇంకా my computer ని కూడా బ్రౌజర్ లో నే (open) చేసుకోవచ్చు.
.6. fire fox లాగానే ఇందులో కూడా addons పెట్టుకోవచ్చు.
7. గేములు, backup కూడా ఎడమవైపు బార్ లో ఉన్నాయి.
8. ఇంకా ఎడమవైపు బార్ కు మనమే చాలా అదనం గా చేర్చుకోవచ్చు.
9.history కూడా ఈ బార్ లోనే ఉంటుంది.
10. ఇంకా అలారం కూడా పెట్టుకోవచ్చు. మనం నెట్ ఉపయోగిస్తూ సమయం మరిచిపోకుండా ఉండేందుకు అలారం ఉపయోగించుకోవచ్చు.
11. అలానే చేయవలసిన పనులు గుర్తు చేయడానికి To Do కూడా ఇందులో ఉంది.
12. ఏదైనా సైట్ లో మనకు నచ్చిన విషయం ఉంటే దాన్ని కాపీ చేసుకోవడానికి snippets అనే సౌకర్యం ఇచ్చారు.

ఇంకా చాలా ఉన్నాయి. ఇందుకోసం http://www.epicbrowser.com/ చూడండి.


ఈ బ్రౌజర్ ను క్రింది లంకె నుండి దింపుకోవచ్చు.
ఎపిక్(Epic)
(http://http.cdnlayer.com/href/epic-setup.exe)

Saturday, July 17, 2010

ప్రతి మనిషి ఏ విషయానికి భయపడతాడు?

ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి.

99% మనుషులు ( బహుశా 100% అను కూడా అనుకోవచ్చేమో) ఏ విషయానికి భయపడతారు?

Friday, July 16, 2010

బ్రహ్మవిష్ణుశివులనూ పూజిస్తాం..... పోచమ్మ,మరిడమ్మ,పోలేరమ్మలనూ పూజిస్తాం. అదే మాకు తెలిసింది.

వేద కాలం నుండి ఏ ధర్మాలను భారతీయులు అనుసరిస్తున్నారో దానిని సనాతనధర్మం అని అంటారు. సనాతనం అంటే ఎప్పటినుండో ఉండి కూడా నిత్యనూతనం గానే ఉండేది. మనం ఈ సనాతన ధర్మాలనే పాటిస్తున్నాం.

ఈ ధర్మాన్ని పాటించే భారతదేశపు తత్వం "ఒక్కటి" కాదు. ప్రకృతి తత్వమే మన తత్వం. మనసు యొక్క తత్వమే మన అందరి తత్వం. మనసు నుండి అనేక ఆలోచనలు బయలుదేరినా, అవి వేర్వేరుగా ఉన్నా, ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు సంబంధం లేకపోయినా అన్నీ ఒకే మనసుకు చెందుతాయి. చివరికి నిద్రలోనికి మనం జారిపోయినప్పుడు అన్ని ఆలోచనలు తన మూలస్థానమైన మనసును చేరతాయి. ఆ మనసుకు అభిన్నం అవుతాయి. అంటే మనసులోనికి కలిసిపోతాయి.

ఇలాంటి మనసు లేక ప్రకృతి యొక్క తత్వమే మన తత్వం. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వమే మన జీవన విధానం.

వేదాలు,ఉపనిషత్తులు, రామాయణమహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు విభిన్నమైన తత్వాలను,సిద్ధాంతాలను చెప్తాయి. ఐనా కలిసి సహజీవితం గడుపుతాయి. "ఏకం సత్,విప్రా బహుదా వదంతి" అని అన్నీ అంగీకరిస్తాయి. మనం ఇవన్నీ మావే అని గర్విస్తాం. సిగ్గుపడము. ఒకే కూరగాయతో అనేకరకాల వంటలను మనం తినేటట్లు ఒకే దేవుణ్ణి మనం వివిధరకాలుగా ఆరాధిస్తాం.

అందుకే అవైదికాలైన(వేదాలను ఒప్పుకోని) బౌద్ధ,జైన,చార్వాక మతాలతో కలిసే జీవించాం. ఇప్పుడూ క్రైస్తవ,ఇస్లాం మతాలతో కలిసేఉంటున్నాం. అవి కూడా భగవంతుని చేరే వివిధమార్గాలే అని తెలిసి జీవిస్తున్నాం. నేటి యుగంలో శ్రీ రామకృష్ణపరమహంస గారు ఇదే అనుభవపూర్వకంగా ఋజువు చేసారు.

అందుకే మనం బ్రహ్మ,విష్ణు,పరమేశ్వర,కాళిక,గణేషలతో పాటుగా పోలేరమ్మ, మరిడమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మలను కూడా ఆరాధిస్తాము.

భారతీయులుగా మనం బహుదేవతారాధకులం. ఇది మన విధానం. మన విధానమే మన నాగరికత,మన సంస్కృతి.

"ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను.ఆ దేవతలందు శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేస్తున్నాను." - శ్రీ భగవద్గీత

1 = 2 కాదు. కాని నిరూపించా క్రింది విధంగా. తప్పు ఉంది. చెప్పగలరా?

సమస్య:
a=1 అనుకొందాం

(a^2 అంటే a square)

ఇప్పుడు
రెండు వైపులా a తో గుణిస్తే

a^2 = a

(a^2 - 1) = (a -1)

(a+1)*(a-1) = (a-1)

(a+1) = (a-1)/(a-1)

(a+1) = 1

(1+1) = 1

2 = 1

2 =1 కాదని మనకు తెల్సు. మరి పై చూపిన దానిలో తప్పు ఎక్కడ ఉందో చెప్పగలరా?

Thursday, July 15, 2010

దేశభక్తి అంటే అవసరమైనప్పుడు మాత్రం చూపేదా? లేక మనలో జీర్ణించుకు పోయుండాలా?

ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య చదివిన ఒక సంఘటన విషయం నన్ను ఎంతగానో స్పందింపజేసింది.

అదేమిటంటే ఒకసారి స్వామి రామతీర్థ జపాన్‌లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్‌లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.

ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్‌లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు "ఎందుకంత కష్టం తీసుకొన్నావు?" అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.
"స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు" అన్నాడు.
ఒక చిన్న విషయం దగ్గర కూడా జపాన్ వారి దేశభక్తి ఎలా వెల్లడైందో గమనించారా?

ఇక మన విషయానికి వద్దాం.మనకు దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడో కానీ లేక ఎక్కడో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడో కాని దేశభక్తి అన్నది గుర్తుకురాదు.

పై సంఘటనలో లాగా మనలో ఎంతమందికి నరనరానా దేశభక్తి జీర్ణించుకుపోయింది?
మనకు ఏదైనా పెద్ద సంఘటన జరిగితే దేశభక్తిని ప్రదర్శిస్తాము తప్ప మన నిత్యజీవితములో దానిని నిజముగా పాటిస్తున్నామా?

మనదేశము లోని కొన్ని కామకుక్కలు ఎంతగా దిగజారి పోయాయంటే మనదేశానికి వచ్చే విదేశీ పర్యాటక మహిళలను బలాత్కరిస్తున్నారు.డబ్బు కోసం ఆ పర్యాటకుల వద్ద యాచిస్తున్నారు.ఎంత చులకన? దీనివలన దేశానికి అంతర్జాతీయముగా ఎంత తలవంపులు వస్తున్నాయో మనకు తెలుసు.దేశభక్తి నిజముగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటారా?

ఈ టపా మనలోని డొల్లతనాన్ని విమర్శిస్తూ వ్రాసిందే కానీ నరనరానా దేశభక్తి నింపుకొన్న సైనికులను,పౌరులను ఉద్దేశించి వ్రాయలేదని గమనించగలరు.

సంఖ్యలను లెక్కించడంలో గ్రీకు,రోమనులకన్నా ముందున్న ప్రాచీన భారతదేశం

ప్రాచీన భారతీయుల గణితప్రతిభ క్రింద చూడండి.
1.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.(అనగా 0 నుండి 9 వరకు గల అంకెలతో లెక్కించు పద్దతి)
2.యజుర్వేదం 17వ అధ్యాయం,2వ మంత్రంలో పెర్కొనబడ్డ సంఖ్యల క్రమం
ఏక-1
దశ-10
శత-100
సహస్ర- 1000
ఆయుత-10000- పదివేలు
నీయుత- 100000-లక్ష
ప్రయుత- 1000000- పదిలక్షలు
అర్బుత- 10000000- కోటి
న్యార్బుద-100000000- పదికోట్లు
సముద్ర- 1000000000- వందకోట్లు
మధ్య- 10000000000- వేయికోట్లు
అంత- 100000000000- పదివేలకోట్లు
పరార్థ- 1000000000000- లక్షకోట్లు

క్రీ.పూ మొదటి శతాబ్దం నాటి "లలిత విస్తార"గ్రంథం లో "తల్లక్షణ" కొలమానం 10 ఘాతం 53(1 తర్వాత 53 సున్నాలు).
ప్రాచీన భారత జైనమతగ్రంథం ఐన "అనుయోగద్వార" లో 1 తర్వాత 140 సున్నాల వరకు గల సంఖ్య చెప్పబడింది.

3.ఆ కాలం నాటికి గ్రీకుల అతి పెద్ద సంఖ్య 10000(మీరియడ్).
4.రోమనులకు తెలిసిన పెద్ద సంఖ్య 1000(మిలి).

ఇక సున్న కనుగొన్నది మన భారతీయుడైన "ఆర్యభట" అని అందరికీ తెలుసు.
ఇతర గణిత ప్రక్రియలకు వస్తే నా గత టపాలైన "ఆర్యభటీయం","భాస్కరాచార్యుడు","ఆర్యభట" లలో వ్రాసాను.

"భారతీయులకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము.వారే సులభంగా లెక్కించే దశాంశపద్దతిని ప్రపంచానికి అందించారు.అదే గనుక లేకపోతే నేడు ఎన్నో విజ్ఞాన ఆవిష్కరణలు సాధ్యమయ్యేవి కావు". - అల్బర్ట్ ఐన్‌స్టీన్

Wednesday, July 14, 2010

నేను నా భార్యను అంత ప్రేమగా చూడడం లేదేమో!

టపా పేరు చూసి నాకు భార్య ఉందని అనుకొనేరు. నేను ఇంకా బ్రహ్మచారినే. ఇక్కడ నా స్నేహితుడి విషయం లో జరిగిన సంఘటనను వ్రాస్తున్నాను.

సరే ఇక విషయానికి వస్తాను.

నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. పేరు చెప్పడం లేదు. ఆ అబ్బాయికి పెళ్ళై రెండేళ్ళు అవుతోంది. నా స్నేహితుడిది ప్రేమవివాహం. పెద్దలను ఒప్పించే చేసుకొన్నారు.ఇప్పుడు తన భార్య ఎనిమిదవ నెల గర్భవతి. ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఆ అమ్మాయి గర్భవతి అని రూఢి (pregnancy conform) అయినప్పుడు జరిగింది.
ఆ సమయంలో ఆ అమ్మాయి పుట్టింటికి ఏదో పని మీద వెళ్ళింది. అక్కడ ఒంట్లో నలతగా ఉంటే వైద్యుని వద్దకు వెళ్తే ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. పక్కనే అమ్మాయి వాళ్ళ అమ్మ ఉండడం చేత వాళ్ళ అమ్మ కూడా సంతోషించింది. ఆ అమ్మాయి విషయం చెబుదామని నా స్నేహితునికి ఫోన్ చేయబోతోంది. ఇంతలో చెల్లి ఆసుపత్రికి వచ్చిందని తెల్సుకొన్న ఆ అమ్మాయి అన్నయ్యలు ఇద్దరూ ఏమయిందోనన్న అదుర్దా తో ఆసుపత్రికి వచ్చారు. విషయం వాళ్ళు కూడా తెల్సుకొని ఆనందపడ్డారు.నా మిత్రునికి ఫోన్ కలవడం లేదు. చాలాసేపు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు.

ఇంట్లో అమ్మాయి వాళ్ళ నాన్న కు విషయం తెల్సి ఆనందించి అల్లుడికి (నా మిత్రునికి) ఫోన్ చేస్తే ఫోన్ కలిసింది. విషయం చెప్తే నా స్నేహితుడు కూడా ఎంతో సంతోషం లో మునిగిపోయాడు.
తర్వాత అమ్మాయి కూడా వెంటనే వాళ్ళ నాన్న దగ్గరి నుండి ఫోన్ అందుకొని విషయం చెప్పింది.

ఫోన్ పెట్టేసిన తర్వాత పక్కనే ఉన్న మరో స్నేహితుడు ఊర్కే ఉండలేక " మొదట నీకు కదా చెప్పాలి. వారికి మొదట ఎందుకు చెప్పింది?" అంటూ ఏవేవో మాటలతో రెచ్చగొట్టాడు.
అందుకు వీడు "అలా ఏం ఉండదు. ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉందంట. అలా తెల్సుంటుంది" అన్నాడు.

అందరికీ ఫోన్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకొంటున్నాడు. అలానే అమ్మాయి అన్నయ్యలకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పబోతే వారు మాకు తెల్సు బావా! శుభాకాంక్షలు (congratulations) అన్నారు.

ఫోన్ పెట్టేసాక పక్కన ఉన్న స్నేహితుడు రెచ్చగొట్టే ధోరణి లో "చెప్పా కదా! మొదట మీఆవిడ నీకు చెప్పకుండా అందరికీ చెప్పేసింది" అన్నాడు. ఇలా అన్న స్నేహితుడే ఇంతకు ముందు వీరి పెళ్ళికి ఎంతో
సహాయపడ్డాడు. వీరు ప్రేమించుకొంటున్నప్పుడు చాలా సహాయంగా ఉన్నాడు. ఆ కృతజ్ఞత తో నా మిత్రుడు ఆ అబ్బాయి అలా అంటున్నా ఏమీ అనలేదు. లేకుంటే " నా సంసారం విషయం నీకెందుకు?" అంటూ క్లాస్ పీకేవాడు. కాని ఎంతో సహాయం చేసినందు వలన ఏమీ అనలేకపోయాడు. అతను రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఇంతకు ముందు ఆ అబ్బాయి అలా ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటిసారిగా అలా మాట్లాడుతున్నాడు. తన భార్య గురించి తనకు బాగా తెల్సు. ఆ అబ్బాయినీ ఏం అనలేకపోతున్నాడు. కాని మనసులో కొద్దిగా ఇతనికీ బాధ కల్గింది.

అంతకు ముందు నాకు ప్రెగ్నెన్సీ విషయం చెప్పి ఆనందం పంచుకోవడానికి ఫోన్ చేసున్నాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి " రే సూరీ(సురేష్)! నేను తనను(అమ్మాయిని) అంత ప్రేమగా చూసుకోవడం లేదేమో.వాడు మాకు చాలా సహాయం చేసాడు కదా. ఇప్పుడు ఇలా ఎందుకు రెచ్చగొట్టేలా మాట్లాడాడు." అన్నాడు. అబ్బాయి గొంతులో బాధ కనిపించింది.

"ఎందుకురా! ఇప్పుడే కదా విషయం చెప్పి సంతోషించావ్. మళ్ళీ ఈ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుకు బాధపడుతున్నావ్?" అన్నాను. వాడు ఇంకో స్నేహితుడు అన్న విషయాలన్నీ నాకు చెప్పాడు.నేనేదో సర్దిచెప్పాననుకోండి.

తర్వాత అమ్మాయికి మామూలుగా ఫోన్ చేసాడు. కాని అప్పటికే అమ్మాయి కూడా మొదట తన భర్త( నా మిత్రుడు) కి విషయం చెప్పకపోయానే అనే బాధలో ఉంది. ఏడుస్తూ ఉంది.ఈ అబ్బాయి ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తున్నావని అంటే బాధపడుతూ విషయం మొత్తం చెప్పి సారీ చెప్పింది.

తర్వాత ఈ అబ్బాయి కూడా ఇక్కడ జరిగిన విషయం ( నాకు ఫోన్ చేసిన విషయం కూడా) చెప్పేసాడు. మొదట అమ్మాయికి కోపం వచ్చినా ఆ అబ్బాయి నాతో అన్న మాట(నేను తనను(అమ్మాయిని) అంత ప్రేమగా చూసుకోవడం లేదేమో) తెల్సుకొని ఇలాంటి సున్నితమైన అంశాలలో కూడా ఇంత పాజిటివ్ గా ఆలోచించాడని చాలా సంతోషించింది.

ఇలా కథ సుఖాంతమయ్యింది.

నాకు అనిపించింది ఏమంటే భార్యాభర్తలు ఒకరి వలన ఒకరికి తెలిసో,తెలియకో బాధ కల్గినప్పుడు వీరిలా మనసు విప్పి అహం(Ego)లు లేకుండా మాట్లాడుకొంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి కదా అని.

ఇదండీ జరిగింది. అందరితో పంచుకోవాలనిపించింది. ఇలా బయట పెట్టాను.

Tuesday, July 13, 2010

పరమశివుడి నటరాజతాండవంలో వెలువడిన శబ్దాలు ఇవే!


మన అందరికీ తెలుసు పాణిని అనే మహాఋషి సంస్కృత వ్యాకరణాన్నిరచించాడని. పరమశివుడు నటరాజుగా నాట్యం చేసేప్పుడు పాణిని మహర్షి అప్పుడు ఆ నాట్యంలో పుట్టినశబ్దాలను గ్రహించి వ్యాకరణాన్ని వ్రాసాడు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. సాక్షాత్ పరమశివుడు నాట్యం చేస్తున్నప్పుడు వచ్చిన ఆ శబ్దాలేంటో తెల్సుకోవాలనే ఉత్సుకత చాలామందికి ఉంటుంది కదా. ఆ శబ్దాలేంటో చూద్దామా!

'అఇఉణ్‌, ఋఌక్, ఏఓఙ్, ఐఔచ్‌, హయవరట్‌, లణ్‌, ఞమఙణనమ్‌, ఝభఞ్‌, ఘఢధష్‌, జబగడదశ్‌, ఖఫఛఠథచటతవ్‌, కపయ్‌, శషసర్‌, హల్‌'

ఈ పదునాలుగు శబ్దాలనూ పదునాలుగు సూత్రాలు గా పాణిని మహర్షి గ్రహించి సంస్కృత వ్యాకరణాన్ని రూపొందించాడు, ఈ 14 సూత్రాలను మాహేశ్వరసూత్రాలు అంటారు.

అచ్చులకు ఆకారము మొదటిది. ఈ మాహేశ్వర సూత్రాలలో 'అ' అనేది మొదటవది. 'హల్‌' చివరిది. వీనిమధ్యలో ఇమిడిఉన్న అచ్చులనూ, హల్లులనూ 'అల్‌' అనేది సూచిస్తుంది. 'అలోంత్యస్య' అనేదొక పాణినిసూత్రం.

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి అసాధారణ జ్ఞాపక శక్తి మనకు ఆశ్చర్యం కల్గించక మానదు


"రామాయణ కల్పవృక్షం", "వేయిపడగలు" వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపకశక్తి ని తెల్పే క్రింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు. విశ్వనాథ గారు చెప్తుంటే వారి కొడుకులు వ్రాసేవారు. ఒక రోజు చూసుకొంటే 32 వ కాగితం నుండి 72 వ కాగితం వరకు కనిపించలేదు. ఇల్లంతా వెదికారు. కానీ కనబడలేదు. వారికి తమ తండ్రి గారైన విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి. అందువలన ఈ విషయం చెప్పడానికి సాహసించలేదు. గ్రంథం వ్రాయడం పూర్తయింది. ఇక ముద్రణకు వెళ్ళాలి. ఇక తప్పదనుకొని విశ్వనాథ గారికి చెప్పారు.

అందుకు విశ్వనాథ గారు " అందులో బాధపడాల్సింది ఏం లేదు" అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన 40 కాగితాలలో ఉన్నదంతా చెప్పేసారు.

తర్వాత ఇంట్లో ఇంతకుముందు కనబడకపోయిన 32 నుండి 72 వరకు 40 కాగితాలు దొరికాయి.
అత్యంత ఆశ్చర్యకరం గా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలలోని విషయం క్రొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాలలో ఉంది. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,తప్పు లేదు.

ఇంత అసాధారణ జ్ఞాపకశక్తి మనకు ఆశ్చర్యం కల్గించకమానదు.

Monday, July 12, 2010

నేను హిందువును, అతడు ముస్లిం ఇంకొకతను క్రిస్టియన్ ఐనంత మాత్రాన కొట్టుకోవాలా? తిట్టుకోవాలా?

మనం అందరమూ చదువుకొన్నవాళ్ళము. లోకజ్ఞానము ఇంతో అంతో కలిగినవాళ్ళము. కాని మనము కూడా అనాగరికులలాగా మతము పేరుతో గొడవలు పడడము ఎంతవరకు సమంజసం?

ఎవరి మతము వారికి ప్రియము. ఆ ప్రియత్వము అనేది ఇతరమతాలను ద్వేషించకుండా ఉన్నంతవరకే బాగుంటుంది. ప్రత్యేకముగా ఏదో ఒక మతాన్ని లక్ష్యము చేసుకొని ఎప్పుడూ దానిపైనే బురద చల్లడానికి ప్రయత్నించడం సమంజసము కాదని నా వ్యక్తిగత అభిప్రాయము.

ఎవరి మతాలను వారు పొగడుకుంటూ, వారి మతాల గొప్పతనం గురించి కావాలనుకొంటే వారు వ్రాసుకోవచ్చు. అప్పుడు ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండవు. అలా కాకుండా ఇతర మతాల లోటుపాట్ల గురించి వాదించుకోనవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం వాదించుకున్నంతమాత్రాన లేక వాటి గురించి గొడవ పడినంత మాత్రాన ఆయా మతధర్మాలు కాని, ఆచారసాంప్రదాయాలు కాని ఇసుమంతైనా మారవు కదా. ఊరికే మన మధ్య భేధాభిప్రాయాలు రావడం, వ్యక్తిగత కక్ష్యలు ఏర్పడడం( అసలు కనీసం ముఖపరిచయాలు కూడా లేకుండానే ) తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు.

కొందరి తిండి లేదని, బట్టలు లేవని, ఇల్లు లేదని బాధ. ఈ మూడూ ఉన్న మనకు అభిప్రాయప్రకటన, వాక్స్వాతంత్రము పేరుతో వాదోపవాదాల బాధ. మొత్తానికి మనకు సౌలభ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక బాధను మెడకు గుదిబండలా తగిలించుకొంటే తప్ప మనకు జిల తీరదనుకొంటా.

నేనొక హిందువును. నా మతధర్మాలు నేను పాటిస్తాను. నాకు ముస్లిములు, క్రైస్తవులలో కూడా మంచి స్నేహితులున్నారు. మేము ఎవరి మతధర్మాలు వారు పాటిస్తాము. మా మత ధర్మాల గురించి, ఆచారసాంప్రదాయాల గురించి ఒకరికొకరు చెప్పుకొంటాము. కొత్త విషయాలు తెలుసుకొని ఆనందిస్తాము.

నాకు సమీర్ అనే ముస్లిం స్నేహితుడున్నాడు. భగవద్గీత గురించి అతను, ఖురాన్ గురించి నేను అతడిని తెల్సుకొంటుంటాము. ఉన్నట్టుండి అతను జ్ఞానయోగం అంటే ఏంటని అడుగుతాడు. నాకు తెలిసింది చెప్తాను. అలానే నాకూ అతని మతధర్మాలు గురించి నాకు చెప్తుంటాడు. అలానే ఫణి అనే క్రైస్తవ స్నేహితునితో కూడా ఇటువంటి సంబంధాలే ఉన్నాయి. మాకు ఎప్పుడూ మామా మతాల విషయంలో గొడవలు కానీ, వాదోపవాదాలు కానీ రాలేదు.

ఒకరి పండుగలకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటాము. అంతవరకే. ఏ విషయములోనైనా మా మధ్య భేధాభిప్రాయాలు ఉండవచ్చు. కాని మా మతాల విషయాలలో, కుటుంబ విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే మత విషయాలు, కుటుంబవిషయాలు అత్యంత సున్నితమైనవని మాకు తెలుసు. వాటి విషయములో ఒక సారి అభిప్రాయభేధాలు గనుక వస్తే జీవితమంతా బాధపడవలసి వస్తుందని మాకు తెలుసు. అలా మా స్నేహాన్ని నిలుపుకొంటున్నాము.

అందరికీ తెలుసు వాదోపవాదాలు మనసుకు ఎంత అశాంతికి గురిచేస్తాయో. కాని వాదాలను వదలలేకుండా పోతున్నారు.

ఫలానా రాముడో లేక మహమ్మదో లేక ఏసుక్రీస్తో, వీరి గురించి మనం ఎందుకు పోట్లాడుకోవాలి? ఆయా మతాలవారు వీరిని పూజిస్తారు. వీరి వ్యక్తిత్వాలతో పోలిస్తే మన వ్యక్తిత్వాలు ఏ మూలకు? వారున్నరో లేదో మనకు ఎందుకు? ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. కాని వారున్నారని, వారు తమ వ్యక్తిత్వాలతో, జ్ఞానంతో, ప్రవర్తనతో సమాజాలను ప్రభావితం చేసారని పెద్దలు చెబుతారు. అలాంటప్పుడు వారు భోధించిన, ఆచరించి చూపిన విషయాలను మనకు నచ్చితే అనుసరిద్దాము. నచ్చకపోతే వద్దు. అంతేకాని వారిని దూషిస్తూ, మనలో మనం వారి పేరుపై పోట్లాడుకొంటూ మనం ఎందుకు మనశ్శాంతిని పోగొట్టుకోవాలి? అవసరమా?

ఈ బ్లాగులు, కంప్యూటర్లు, ఆంగ్లము ఏమీ తెలియని గ్రామాల ప్రజలే పరమతసహనముతో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకొంటూ ఆనందముగా ఉంటున్నారు. ఏ మతపండుగ వచ్చినా అందరూ కలిసి జరుపుకొంటూ సంతోషముగా ఉంటున్నారు. కాని ఇవన్నీ తెలిసిన మనం ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకొంటున్నాము. నిజమే కదా?

చివరిగా ఒక మాట. తప్పు మతం పేరుతో చేసే తప్పులు చేసే మనుషులదే కాని, మతానిది ఎన్నటికీ కానేరదు.
ఇకనైనా మనము మతాల పేరుతో కువిమర్శలకు, వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ఉండాలని నా అభిలాష.

Friday, July 9, 2010

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది?

మనకు తెలుసు హిందూమతం లో 108 సంఖ్యకు గల ప్రాముఖ్యత.జపమాలలోని పూసలు 108. ఇంకొన్ని ప్రత్యేకతలుచూద్దాం.
1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.

2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.

3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108

4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.

5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.

6.ఉపనిషత్తులు 108.

7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).

8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.

Thursday, July 8, 2010

వేదకాలం లో జంతుబలి ఉన్నంత మాత్రాన వారు అనాగరికులా? మనం కాదా?

ఈ మధ్య వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని విమర్శిస్తూ వ్రాసిన ఒక వ్యాసము(article)ఈ టపాకు ప్రేరణ.విచిత్రమేమిటంటే మన భారతీయులు కూడా ఆ వ్యాసానికి వంతపాడారు.అందుకే ఈ టపా వ్రాయవలసి వచ్చింది.

అందరికీ తెలుసు వేదకాలపు యజ్ఞాలలో జంతుబలులు ఉండేవని.ఈ విషయం ఒక్కటి తీసుకొని పాశ్చాత్యులు వేదకాలపు జనులు ఆటవికులని,అది ఆటవిక సమాజమని,ఆనాటివారు అనాగరికులని నిర్ణయించారు.లోపాలు తప్ప మంచిని గ్రహించని ఆ కాలపు ఆంగ్లేయుల వలన మన ప్రజలు కూడా వారికి వంత పాడారు,నేటికీ పాడుతూనే ఉన్నారు.సరే నేడు వారు కానీ,మనం కానీ చేస్తున్నది ఏమిటి.ఏ దేశపు ప్రజలు మాంసాహారం తినడం లేదు? కోళ్ళు,మేకలు,పొట్టేళ్ళు మొదలుకొని ఎద్దు(beef),పంది(fork),ఒంటె,పాములు,బల్లుల వరకు తినడం లేదా?దీనిని బట్టి నేటి సమాజం కూడా ఆటవిక సమాజం అనగలమా?ఏ మతం వారు,ఏ దేశం వారు పండుగలని,ఉత్సవాలని
జంతుహింసకు పాల్పడడం లేదు? ఇలా అని ప్రస్తుతం ఆటవిక సమాజం నడుస్తోందని అందామా? ప్రస్తుతం మనం కూడా అనాగరికులమని అన వీలవుతుందా? అలా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పటికీ ఆంగ్లేయులకు కానీ,అమెరికనులకు కానీ ఎద్దు మాంసం కానీ,పంది మాంసం అంటే కానీ ఇష్టం పోయిందా(శాఖాహారులు తప్ప)? వీరినే ఎందుకు ఉదహరించడం జరిగిందంటే వీరే ఇలాంటి వాదనలకు ఆద్యులు.

అప్పుడు వేదకాలం లో జంతుబలులకు పాల్పడ్డవారే కాలక్రమంలో శాఖాహార ప్రాముఖ్యతను గుర్తించి శాఖాహారానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు.ఇదంతా మానవ మనసు పరిణామ దశలలో భాగమని ఎందుకు అనుకోకూడదు? కాని ఒకరిలో లోపాలు ఎంచడానికే అధిక ప్రాముఖ్యత ఇవ్వడమే నేటి లోక నైజం. "ఎదుటివారి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో" అన్న ఏసుక్రీస్తు బోధన తెలియదా? తను బెల్లం తినడం మానివేసిన తర్వాతే పిల్లవాడికి బెల్లము ఎక్కువ తినడం హానికరమని బోధించిన రామకృష్ణపరమహంస గురించి తెలియదా?

ఒక్క మాట.మనుషులు చీమలకున్న పాటి జ్ఞానం కూడా కోల్పోతున్నారు.చీమలు ఇసుక,చక్కెర మిశ్రమం నుండి చక్కెరను మాత్రం గ్రహించి ఇసుకను వదిలివేస్తాయి.అంటే పనికిరాని విషయాన్ని వదిలివేసి పనికివచ్చే చక్కెరను మాత్రమే గ్రహిస్తాయి.లోకంలో చాలా మందిలో లోపాలు ఉన్నంత మాత్రాన లోకాన్నంతటినీ ఒకే గాటన కట్టగలమా?(for faults in many,judge not the whole). వేదాలలోని శాంతి మంత్రం(అసతోమా సద్గమయ మంత్రం) వారికి కనపడలేదా? అనాగరికులే ఈ మహోన్నత మంత్రాన్ని అందించారు."సర్వేజనా సుఖినో భవంతు" అని ఘోషించడానికి ఎంత పరిపక్వం చెందిఉండాలి? "సహనాభవతు,సహనౌ భునక్తు"(కలిసి ఉందాం,కలిసి తిందాం) అనే సంస్కారం ఆనాటి వేదాలలోనే ఉన్నదని గ్రహించరా?

"సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః
సమాన మస్తు వో మనో యథా వః సుసహాసతి"(అధర్వణవేదం 6-64-4)
అర్థం: మీ సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ భావం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ చింతన ఒక్కటైనదిగా ఉండుగాక!ఈ విధముగా మీ మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొను గాక!
ఇంతటి ఉపదేశం ఇచ్చినవారు అనాగరికులా? ఆలోచించండి.వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే గ్రహించి మొత్తం వేదాలనే నిందించడం తగదు.

మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం గారు తన ఆత్మకథ (ఒక విజేత ఆత్మకథ) లో ఒక విషయం చెప్పారు.అదేమిటంటే అతను అంతరిక్షశాఖ లో పని చేస్తున్నప్పుడు తరచూ శాస్త్రవేత్తల సమావేశాలు జరిగేవట.వాటిలో మన దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరైనా ఒక నూతన విషయం ప్రస్తావిస్తే తక్షణం అందరు శాస్త్రవేత్తలు వాదోపవాదాలు లేవదీసేవారు.కాని అదే ఎవరైనా విదేశ శాస్త్రవేత్త గనుక ప్రతిపాదిస్తే ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఏకగ్రీవంగా అంగీకరించేవారట.

అలానే ఆంగ్లేయులు చెప్పినంత మాత్రాన గొర్రెలా తలాడించి అవుననడమే తప్ప ఆలోచన లేకుండా తలాడించడమేనా? ఏదైనా ఒక విషయం పై అభిప్రాయం ఏర్పరుచుకునేముందు ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోనవసరం లేదా? " వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ " అని మన మహాత్ములు చెప్పిన విషయం తల కు ఎక్కదా?. మేలెంచి కీడెంచమన్న పెద్దలమాట మరిచిపోయారు.కనీసం కీడెంచి మేలు కూడా ఎంచడం లేదు.కేవలం లోపాలు వెదకడమే పనిగా
పెట్టుకున్నారు.వేదాలను ఎవరైనా పూర్తిగా చదివారా? చదవకుండానే,తెలుసుకోకుండానే ఆంగ్లేయులు చెప్పారు కాబట్టి అవన్నీ బూటకమని నిర్ణయించడమేనా?.

ఆంగ్లేయులు మనలను భౌతికముగా,సాంస్కృతికముగా బానిసలు చేసుకోవడంకోసం పన్నిన ఉచ్చులో మనం ఎంత బాగా పడ్డామో తెలుసుకోవాలి.ఇప్పుడు వారు లేరు కాని వారి ప్రభావము నుండి ఇంకా బయట పడలేకపోతున్నాము.ఒకరు చెప్పినది గ్రుడ్డిగా కాకుండా పూర్తిగా తెలుసుకొని,అన్ని కోణాలలోనూ విచారించి అప్పుడు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.వేదాల విషయమే కాదు ఏ విషయానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఇలాంటి కష్టం ఏ జీవికీ రాకూడదనే కోరుకొందాం.


క్రింది సంఘటన చదివితే ఇలాంటి సంఘటనలు కూడా జరుగాతాయా! అనే ఆశ్చర్యం కల్గక మానదు. ఒక జంట పెళ్ళి చేసుకొందామంటే వారికి కల్గిన కష్టాలు చూస్తే పగవారికి కూడా రాకూడదని అనిపిస్తాయి.


లండన్‌కు చెందిన కెన్నెత్, కరెన్ పోర్టర్ ఏడాదికిందట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లికూతురి గౌన్లు కుట్టమని ఓ షాపులో ఆర్డరిచ్చారు. ఆ షాపులో మంటలు చెలరేగి వెుత్తం కాలిపోయింది. మరో చోట కుట్టిస్తే కొలతలు కుదర్లేదు సరికదా, ఇస్త్రీ చేసేటపుడు అదీ కాలిపోయింది. హనీమూన్‌కు వెళ్లడానికి, ముందే విమాన టిక్కెట్లు బుక్ చేసుకుంటే ఆ విమానం కాస్తా కూలిపోయి టిక్కెట్ డబ్బులు తిరిగొచ్చేశాయి. ఇక పెళ్లయ్యాక రిసెప్షన్ కోసం ఆర్డరిచ్చిన హోటల్ దివాలా తీసి మూతబడిపోయింది. హనీమూన్‌కు మరోచోటికి వెళ్దామని మళ్లీ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈలోగా పెళ్లికూతురి కాలు విరిగి హాస్పిటల్ బెడ్ ఎక్కడంతో పెళ్లే వాయిదా పడింది. అలా యాదృచ్చికమో లేక దురదృష్టమో కానీ కెన్నెత్, పోర్టర్ ఏడాది కిందట చేసుకుందామనుకున్న పెళ్లి వాయిదాలు పడీ పడీ చివరికి ఆగస్ట్ 2009 లో జరిగింది. అందుకే, వీళ్ల పెళ్లికి ప్రపంచంలోనే అతి దురదృష్టకరమైన పెళ్లి అని పేరొచ్చింది. అన్నట్లు వీళ్లు మైఖేల్ జాక్సన్ సంగీత కార్యక్రమానికి కూడా టిక్కెట్లు బుక్ చేసుకున్నారట!

తర్కాల విషయం, హేతువు విషయం పక్కన పెడితే ఇలా ఎవరికీ జరగకూడదనే కోరుకొందాం.

Wednesday, July 7, 2010

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.

1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

3.శిల్పశాస్త్రం:రచయిత కశ్యపముని.ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

4.సూపశాస్త్రం:రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

5.మాలినీ శాస్త్రం:రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

6.ధాతుశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

7.విషశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం): రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.

9.మల్లశాస్త్రం: రచయిత మల్లుడు.వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.


10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.

11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

12.అర్థశాస్త్రం:రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.

13.శక్తితంత్రం: రచయిత అగస్త్యముని.ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

14.సౌధామినీకళ:రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

15.మేఘశాస్త్రం: రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

16.స్థాపత్యవిద్య:అదర్వణవేదం లోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.

Tuesday, July 6, 2010

మనసులను కదిలించే సంఘటనలు - మనం నేర్చుకోవలసింది

నిస్వార్థసేవ:
ఒకసారి మదర్‌థెరెసా శరణాలయపు జీపు టైరు పంచర్ అయ్యింది.ఓ మరమ్మత్తు దుకాణానికి వెళ్ళి టైరును బాగు చెయ్యమని ఇచ్చింది.ఆ యజమాని"అమ్మా!మేము టైరు బాగుచేసి శరణాలయానికి పంపిస్తాము.మీరు వెళ్ళిరండి" అని అన్నాడు.
థెరెసా అతనితో "మీరు ఈ టైరు ఎవరిచే పంపిస్తారు? అతనికి ఎంత ఇస్తారు?" అని అడిగింది."రిక్షాలో పంపిస్తాము.కిరాయి గా 10 రూపాయలు ఇస్తాము" అన్నాడు.
వెంటనే ఆమె"ఆ టైరు బాగుచేసేంతవరకు ఉండి నేనే స్వయముగా తీసుకొనిపోతాను.దయచేసి ఆ పది రూపాయలు నాకు ఇవ్వండి.దానితో పదిమంది అనాధల ఆకలి తీరుతుంది "అంది. ఆ మాటలు విన్న యజమాని హృదయం ద్రవించి అతనే 50 రూపాయల చందా ఇచ్చాడు.

అవరోధాలుగా మారే అవసరాలు:
సోక్రటీస్ ప్రతిరోజూ సాయంత్రం బజారంతా తిరిగి,ఏమీ కొనకుండానే ఇంటికి వచ్చేవాడు.ఒకరోజు ఆయన శిష్యుడు "గురువుగారూ! మీరు ప్రతిరోజూ సాయంత్రం బజారుకి వెళ్ళి ఏమీ కొనకుండానే తిరిగి వస్తున్నారు. అలాంటప్పుడు అసలు బజారుకు ఎందుకు వెళ్తున్నట్లు?"అని అడిగాడు."ఈ ప్రపంచంలో మనకు అవసరం లేని వస్తువులు ఎన్ని ఉన్నాయో తెలుసుకొందామని బజారుకి వెళ్ళి వస్తున్నాను" అని సోక్రటీస్ శిష్యునికి సమాధానం ఇచ్చాడు.

చాలామంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా లేనిపోని అవసరాలను పెంచుకుంటూ అప్పులపాలై అశాంతిని ఆహ్వానిస్తుంటారు.ఇతరులతో పోల్చుకొనే స్వభావమే ఇందుకు కారణం. నిజానికి మనకు అవసరం లేనివాటిని పొందాలనే తాపత్రయంలో మన మనశ్శాంతికి మనమే అవరోధాలను కల్పించుకొంటున్నాము.

Wednesday, June 30, 2010

మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?

రోముకు వెళ్ళినప్పుడు రోమన్ లాగా ఉండమని ఒక సామెత. అంటే వారి మనస్తత్వానికి తగ్గట్లు నడుచుకోవాలన్నమాట. అంటే ప్రతి దేశానికి కొన్ని విధివిధానాలు, సంస్కృతీసాంప్రదాయాలు
ఉంటాయి, అవి ఇంకో దేశంలో చెల్లుబాటు కావచ్చు,కాకపోవచ్చు. అలానే ప్రజల మనస్తత్వాలు కూడా. భారతదేశంలో ని ప్రజల వేషధారణ ఇంగ్లాండ్ వారికి ఎబ్బెట్టు గా కనిపించవచ్చు.
అలానే వారి స్వేఛ్ఛా మనస్తత్వాన్ని మనం విచ్చలవిడితనం గా భావించవచ్చు. ఇక్కడ ఇద్దరిదీ తప్పే కనిపిస్తుంది. ఎందుకంటే మనం మన విధానాల కళ్ళజోళ్ళ లో నుండి, వారు వారి
విధానాల కళ్ళజోళ్ళలో నుండి చూస్తున్నారు. అలా చూడకూడదు కదా. ఎవరి ప్రమాణాలు(Standards) వారివి.

ఇదే విషయం మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) విషయంలో కూడా వర్తిస్తుంది. వారి విధానం వేరు. ఇక్కడ మన ప్రాచీన శాస్త్రజ్ఞులను ఋషులని సంభోధిస్తున్నాను. భారతీయులు
ఎప్పుడూ దేవుడు,ఆత్మ,వేదాంత రంగాలలోనే విషయాలు కనుగొన్నారు కానీ సైన్సు పరంగా ఏమీ లేదనే అభిప్రాయం విదేశీయులలోనే కాదు, దురదృష్టవశాత్తూ మన భారతీయులలో కూడా
చాలా ఎక్కువగా ఉంది.

మన ఋషులు ఏవైనా సైన్సుకు సంబంధించిన విశేషాలు కనుగొంటే ఎందుకు చెప్పలేదు? అని చాలామంది అంటుంటారు. ఒకటే కారణం వారు చెప్పిన విధానం వేరు.

మన ఋషుల విధానం ఏమంటే సమాజంలో సామాన్యులే ఎక్కువగా ఉంటారు. మేధావుల శాతాన్ని మామూలు జనం సంఖ్యతో పోలిస్తే నిర్లక్ష్యం చేయవచ్చు(Negligible). సైన్సు యొక్క ఫలాలు సామాన్యులకు చేరినప్పుడే దానికి విలువ అని ప్రస్తుతం మనం అనుకుంటున్నదే వారి విధానం కూడా. సాధారణంగా మన పూర్వీకుల పద్దతి ఆధ్యాత్మిక సంబంధమైనది. ఆ పద్దతికి తగ్గట్లే మన ఋషులు కూడా తమ పద్దతిని రూపకల్పన(Design) చేసుకొన్నారు. తము కనుగొన్న విషయాలను కథల రూపంలోనూ, కట్టుబాట్ల రూపం లోనూ, నిషేధాల రూపం లోనూ జనానికి అందించారు. ఉదాహరణకు ఏదైనా ఆసనం పై (కుర్చీ లేదా గోడ ఏదైనా కావచ్చు) కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపరాదు అంటారు. అలా ఊపడం అలవాటైతే గనుక పక్షవాతం వస్తుందని నేటి సైంటిస్టులు కనుగొన్నారు. కానీ మనవారు అలా ఊపితే ఎదురుగా ఉన్న వారికి కాళ్ళు చూపినట్లవుతుందని ,వారికి అగౌరవమని నిషేధించారు.ఇది ఒక ఉదాహరణ
మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాలు కూడా ఇందులో కలిసిపోయుండవచ్చు. అంత మాత్రాన అన్నీ మూఢనమ్మాకాలేనని ఎలా నిర్ణయించగలం?

మనఋషుల విధానం లో ప్రజలలోనికి విషయం ఎలాగైనా చేరాలి, వారు ఆచరించాలి అంతే.
అసలు తాము ఒక విషయం కనుగొన్నమనే దానికి వారు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఉదాహరణకు సాయణాచార్యులు ఋగ్వేద భాష్యం చెప్తూ కాంతివేగాన్ని కూడా
పరోక్షం(indirect)గా చెప్పారు. తానేదో కొత్తవిషయాన్ని పరిచయం చేస్తున్నట్లు చెప్పలేదు.
మనకు తెలిసిన ఆర్యభటుడు , భాస్కరాచార్యుడు, చరకుడు,కణం అనే భావనను కనుగొన్న కణాదుడు మొదలగు వారు కూడా తమ ఆవిష్కరణలను ఏనాడూ ప్రచారం చేసుకోలేదు.
పేటెంటు కూడా తీసుకోలేదు. పేరును ఆశించలేదు. తమ కృషి ఫలితాలు కేవలం ప్రజలకు చేరడమే వారికి కావలసింది. అంతెందుకు మన కాలం నాటి జగదీశ్ చంద్రబోస్ కూడా ఎన్నో
కనుగొన్నా ఏనాడూ పేరు ఆశించకుండా కేవలం తన పరిశోధన ఫలితాలు జనానికి అందాలని ఆశించాడు. పేటెంట్లు కూడా తీసుకోలేదు.

ఇప్పుడంటే మనం మన పూర్వీకులు ఇది కనుగొన్నారు, అది కనుగొన్నారు అని చెప్పుకొంటున్నాం కానీ వారు ఏనాడూ పేరుప్రతిష్టలకై ఆశించలేదు.

ఇక విదేశీయుల పద్దతి ఏమిటంటే తాము ఏదైనా కనుగొంటే మొదట తమ పేరున పేటెంట్ పొంది తర్వాత జనాలకు ఆ అవిష్కరణను పరిచయం చేస్తారు. ఇక్కడ నేను విదేశీయులను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వారి విధానం ఇది అని చెప్తున్నాను. వారి విధానం వారికి సరైనదని అనిపించవచ్చు కాబట్టి అదే వారు అనుసరిస్తున్నారు.

ఇప్పుడు ఆలోచించండి విదేశీయుల విధానాలను ప్రాతిపదికగా తీస్కొని మన విధానాలను పోల్చడం ఎంత బుద్ధి తక్కువ పనో!

వనరులు:
కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)
ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)
భాస్కరాచార్యుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?

Tuesday, June 29, 2010

మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఇవ్వడు.అలాంటప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అవసరమా?

మొన్న మౌనిక అనే నర్సింగ్ చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకొంది. ఇంత చిన్న వయసులో పిల్లలు అలా ఆత్మహత్యలు చేసుకోవడం చూసి ఎందరు బాధపడరు? కొందరు పరీక్షలలో తప్పామనో, మరి కొందరు ప్రేమలు విఫలమయ్యాయనో, ఇంకొందరు తమకు అవమానాలు జరుగుతున్నాయనో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.

ఎన్నో విషాదకరసంఘటనలు జరుగుతున్నా బ్రతుకుతున్నామంటే మన వలన జరగవలసింది ఇంకా ఉందన్నమాటే కదా! పరీక్ష ఫెయిల్ అయినవెంటనే లేక ప్రేమ విఫలమైన వెంటనే లేక అవమానం పొందిన వెంటనే ప్రాణం దానంతట అది ఎందుకు పోవడం లేదు? అలా పోతే ఏం చెప్పలేము. కానీ 99% అలా పోవడం లేదే! అంటే ఇంకా అవకాశాలు ఉన్నాయన్న మాటే కదా!

ఏమైనా అంటే " మా పొజిషన్ లో మీరుంటే మీకు తెలుస్తుంది" అంటారు. ఎవరి స్థితి వారికి బాధాకరమైనదే. కాని అదే లోకమా? ఇంక ప్రపంచమే లేదా?

బ్రతకడానికి ధైర్యం కల్గించే మాటలు ఉపాధ్యాయులూ చెప్పరు, తల్లిదండ్రులూ చెప్పరు. అందరినీ అలా అనడం లేదు కానీ చాలా మంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఎప్పటికీ ర్యాంకుల, మార్కుల గోలే కానీ ఒక పిల్లవాడు వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? అని చాలామంది తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ చూడడం లేదు.

ఇక స్నేహితుల విషయానికి వస్తే తమ స్నేహితుడు(స్నేహితురాలు) ఒకరిని ప్రేమిస్తున్నామంటే మద్దతు బాగా ఇస్తారు కానీ ఎందుకు సపోర్ట్ చెయ్యాలి,అవుతుందాలేదా అనే ముందుచూపు కానీ ఉండదు. అంతే కాక వారి ప్రేమ విఫలం ఐతే ధైర్యం చెప్పడం కానీ ఉండదు. అందరినీ ఇలా అనడం లేదు కానీ చాలామందే ఇలా ఉంటున్నారు.

నా ఇంజనీరింగ్ చదువు అయిపోయి 7 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు నాకు పర్మనెంట్ ఉద్యోగం లేదు.ఎన్నో ఉద్యోగాలు చేతివరకు వచ్చి, చివరి క్షణంలో జారిపోయాయి. పార్ట్‌టైం ఉద్యోగాలే చేసుకొంటూ ఉన్నాను. ఇదే కారణాన వచ్చిన పెళ్ళిసంబంధాలు వెళ్ళిపోయాయి. ఇంట్లో వారి బాధలూ, బయటి వారి అవమానాలూ ఎన్నో భరిస్తున్నాను.బాధపడ్డాను ఎందుకంటే నేను కూడా ఒక మనిషిని మాత్రమే.అంతవరకే.కానీ ఏనాడూ ఒక స్థాయిని మించి బాధపడలేదు.

నాకు స్పూర్తిని ఇచ్చిన మహామంత్రం పరమహంస యోగానంద చెప్పిన" మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు ".
రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు.""చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది"అని.ఇలాంటి స్పూర్తిదాయక మాటలు చెప్పేవారుండరు.

ఎప్పుడూ సిలబస్ పుస్తకాలే లోకం కానీ మహాత్ముల పుస్తకాలు చదవరు, అలా చదవడానికి ప్రోత్సాహం కూడా చాలా తక్కువే. కొంతమంది ఒంటరితనం భరించలేక కూడా ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వీరికీ తోడు ఇవ్వలేనప్పుడు మహాత్ముల,గొప్పవారి జీవిత చరిత్రల పుస్తకాలు చదవడమే తోడు అవుతుంది. అలా అలవాటు చేయడం ఎంతో ముఖ్యం కదా!.

పెద్దలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వీరందరికీ నా మనవి ఒక్కటే చదువులు ఎన్నైనా చదివించండి లేక చెప్పండి అలాగే మనుషులను ధైర్యవంతులుగా చేసే మాటలు, బ్రతకడానికి
స్పూర్తిని కల్గించే బోధనలు చెప్పండి.
స్నేహితులను కూడా ఇదే వేడుకొంటున్నాను.

చివరిగా ఒక మాట "బలమే(ధైర్యమే) జీవితము, బలహీనతయే మరణము". కాబట్టి ఆత్మవిశ్వాసము, ధైర్యమూ కలిగించే మాటలనే ఎప్పుడూ తల్చుకొందాము.
అలా అందరూ తలచుకొనేలా ప్రయత్నిద్దాము.

Monday, June 28, 2010

వేదాలా! అవి ఒట్టి ట్రాష్! ఎందుకంటే విదేశీయులు అలా అన్నారు మరి!

మన జీవన సూత్రం ఏమంటే మన సొత్తు గురించి మనకు బయటి వారి సర్టిఫికేషన్(ధ్రువీకరణ) మనకు కావాలి. మన సొంత పరిశీలన చాలా తక్కువగా ఉంటుంది.

వేదాల విషయంలో కూడా జరిగింది, జరుగుతున్నదీ కూడా అదే.

వేదాలు మూడే అన్నారు. అధర్వణ వేదం వేదం కాదని తర్వాత చేరిందన్నారు.
'' చత్వారోహి ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేదః
సామవేదో బ్రహ్మవేద ఇతి'' అని గోపథ బ్రాహ్మణం (పూర్వభాగం) అంది. బ్రహ్మవేదమే అథర్వవేదం

'వేదత్రయి' అని మరొక విభజన ఉంది. 1. పద్య, 2. గద్య 3. గేయవిభజన. వేదాలు పద్యంలో దర్శించినవీ, 2. గద్యంలో దర్శించినవీ 3. గేయంలో దర్శించినవీ ఉన్నాయి. ఇది ఛందో విభజన.

వేదం మూడు విషయాలను ప్రతిపాదిస్తుంది. అవి. 1. బ్రహ్మ, 2. ఆత్మ, 3. బ్రహ్మ ఆత్మల ఏకత్వం. అందుకు కూడ అది 'వేదత్రయి' అయింది.
ఇవన్నీ తెల్సుకోరు కానీ వేదాలు మూడే అంటారు, అలానే అని మనలను నమ్మించారు.

వేదానికి 'శ్రుతి' అని కూడా పేరుంది. 'శ్రుతి' అంటే చెవిన పడింది- విన్నది.
ఇంకేం పాశ్చాత్యులకు మంచి అస్త్రం దొరికింది. మనపై మనకే అపనమ్మకం ఏర్పడేలా చేసారు.
శ్రుతి అంటే విన్నది కాబట్టి వేదకాలం నాటికి అక్షరం లేదని వ్యాఖ్యానించారు. తొలుత వేదం పలుకబడింది , వ్రాయబడలేదు అన్నారు. అదే నిజం అని మనం నమ్ముతున్నాం.

వేదమంత్రాలు స్వర ప్రాధాన్యం కలవి కాబట్టి విని నేర్చుకొని ఒక విధానంలో వాటిని పలకాలి. ఇలా వింటూ నేర్చుకొనే విధానం ఉండేది కాబట్టి "శ్రుతి" అన్నారు.అంతే కాకుండా వేద మంత్రాలను ఋషులు తమ తపో బలంతో తపస్సు లో వాటిని విని అక్షరబద్దం చేసారు(వ్రాసారు). వారు వాటిని విన్నారు కాబట్టి శ్రుతి అయింది. పాశ్చాత్యులకు ఈ విషయం తెలుసో లేదో లేక తెలిసే మనలను నమ్మించారో తెలియదు. మనవాళ్ళూ వారు చెప్పిందే నమ్మారు.

గౌతమ బుద్దుడూ, శ్రీ రామానుజాచార్యులూ వేదాలను నిరసించారని మనలనే నమ్మేలా చేసారు. నిజానికి వారు నిరసించింది వేదాలను కాదనీ, వేదం పేరున జరుగుతున్న కర్మలను మాత్రమే అని మనం తెలుసుకోలేదు. వేదం అంటే యజ్ఞ,యాగాలు మాత్రమే అనే నమ్మకం కలిగించారు.ఇది ఈనాటికి జరుగుతున్నది.

"దైవం స్థాణోపరపరాధః యదేనం అంధో న పశ్యతి పురుషాపరాధః న భవతి'' ఒక పదార్థం ఉంది. దాన్ని గ్రుడ్డివాడు చూడడు. తప్పు పదార్థానిది కాదు.గ్రుడ్డివాడిది అవుతుంది.
వేదానికి అర్థం ఉంది. దాన్ని తెలుసుకోనివాడు గ్రుడ్డివాడు . అతడికి వేదకర్మ కనిపిస్తుంది. వేదార్థం కనిపించదు.
క్రీస్తుకు వేయి సంవత్సరాల ముందు వాడైన యాస్కఋషి చెప్పినట్లుగా
''ఒకడు బరువు మోస్తాడు. మోసిందేమిటో తెలియదు. అలాంటివాడే అర్థం తెలియకుండా వేదాన్ని వహించేవాడు.
వేదం చదివి అర్థం చేసుకున్నవాడికి సకల శుభాలు కలుగుతాయి. జ్ఞాన తేజస్సు పాపాల్ను కడిగేస్తుంది.''

అసలు మనము మనవాటి పైన శ్రద్ద చూపనప్పుడు వారిని అని మాత్రం ఏం లాభం? పైన చెప్పిన ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఎన్నెన్నో ఉన్నాయి. మరో టపాలో ఎప్పుడైనా అవి పంచుకొనే ప్రయత్నం చేస్తాను.

Friday, June 25, 2010

భారతదేశం పై ఆర్యుల దండయాత్ర(లేక వలస) లో నిజానిజాలు ఎంత?

ఇదేదో హిందుత్వవాదమో మరొకటో అని అపార్థం చేసుకోకండి. సరే విషయానికి వద్దాము.
1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని "ఆర్యపుత్రా" అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.

2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని "రాయల్ ఏషియాటిక్ సొసైటీ" రహస్య సమావేశ తీర్మానం
"ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్‌వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు."
(వనరు:Proof of Vedic Culture's global Existence - by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్‌ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
"నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత "గొప్పగా" మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది."
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన "విలియం జోన్స్",మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ "ఆర్య" శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన "Who were the sudras?" అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో " పాశ్చాత్యులు సృష్టించిన "ఆర్యజాతి" సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది"
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో "ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు".

4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన "సింధు నాగరికత"తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్‌వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే "ఆర్య" శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది 'గుర్రాలపై దండెత్తి" ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.

1980లో ఉపగ్రహాల ద్వారా 'సరస్వతీ' నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్‌వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.

ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు.నేను నివశించే అనంతపురం జిల్లాలో కూడా ఈ ఆచారం లేదు.ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.

ముక్తాయింపు:
వ్యక్తిగత విమర్శలు చేస్తే అవి తొలగిస్తాను. మీ వద్ద గల అధారాలు, అభిప్రాయాలు మాత్రం చెప్పగలరు.

Thursday, June 24, 2010

ఎప్పుడూ తన పదవి పోతుందని భయపడే ఇంద్రుడికి వేదాలలో అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు?

ఏంటండీ ఇంద్రుడు ఎప్పుడూ తమ మానాన తాము దైవసాక్షాత్కారం కోసం తపస్సు చేసుకొనే ఋషుల తపస్సును భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూంటాడు. అలానే అతనికి ఒక మామూలు మనుషికి ఉండే దుర్గుణాలన్నీ ఉంటాయి. అంటే ఇతర స్త్రీలను ఆశించడం, పదవీ వ్యామోహం మొదలగునవి ఉంటాయి. మరి ఇలాంటి ఇంద్రునికి మనం ఎంతో గొప్పగా చెప్పుకొనే వేదాలలో అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు అనే సందేహం చాలామందికి ఉంది. విషయం తెలియక ఈ కారణంతోనే వేదాలను నింద చేసే వారున్నారు.

ఆ అనుమానంను నివృత్తి చేయడానికి ఈ టపా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.

మొదట మనం ఇక్కడ తెలుసుకోవలసింది పైన అనుకొన్న ఇంద్రుడు ఒక దేవత లేక దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. ఈ ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి.కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి. అందుకే ఇతను తన పదవి పోతుందనే భయము తో ఋషులు చేసే తపస్సును భగ్నం చేస్తుంటాడు.

ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.
అసలు విషయం ఏమిటంటే వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, "ఇంద్ర" అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.

ఈ "ఇంద్ర" అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం

13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.

14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే "నేను చూచితిని" అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున "ఇంద్ర" అనే పేరుతో వ్యవహరింతురు.


కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే.

అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.

గమనిక : గతంలో ఈ విషయానికి సంబందించిన టపా వ్రాసినప్పటికీ పొరపాటున అది తొలగింపబడడం వలన మళ్ళీ వ్రాస్తున్నాను.

Wednesday, June 23, 2010

ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి మీరు చేస్తున్న నిర్వాకానికి?

మొన్న ఉప్పల్,హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో అభం,శుభం ఎరుగని, కల్లాకపటం తెలియని చిన్నపిల్లలు ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. దీనికి కారణం మద్యం తాగి వాహనం నడపడమే.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మద్యం త్రాగండి, త్రాగి చంపండి, మీరూ చావండి" పథకం అత్యద్బుతంగా పనిచేస్తోంది. లేకుంటే ప్రజాసంక్షేమం మరిచి మద్యం ఏరులై పారిస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎండాకాలంలో వీధి వీధికో చలివేంద్రం ఉన్నట్లుగా వీధివీధికీ మద్యం అంగళ్ళ లైసెన్సులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వఖజానా నిండడం కోసం న్యాయమైన మార్గాలు వదిలి, ఇలాంటి మార్గాలు అనుసరిస్తూ ముక్కుపచ్చలారని పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రాణాలు తీస్తుంటే మనం ఇలా ఎన్నాళ్ళని చేతులు ముడుచుకొని కూర్చోవాలి? అనుభవజ్ఞులు కూడా ఏం చేయలేరా? కనీసం అనుభవజ్ఞులు ఒక ప్రణాళిక రచిస్తే ఇలాంటి సంఘటనల వలన బాధపడే యువత కూడా ముందుకొస్తుంది కదా!

Thursday, June 17, 2010

మంత్రాలకు చింతకాయలు ఎందుకు రాలకూడదు?

ఒక మనిషిని "ఓ మూర్ఖుడా!,నువ్వెందుకూ పనికిరావు" అంటే కృంగిపోవచ్చు లేక అన్నవాడిపై కోప్పడవచ్చు. అప్పటి వరకు అతను ఎంత ఆనందంగా ఉన్నా ఈ మాట అనేసరికి ముఖం అంతా మాడిపోయి,డీలా పడిపోయి ఇంతకు ముందు మనం చూసిన అతను ఇతనేనా అనుకొనేట్లు మారిపోతాడు.

అలానే " మీ అంత మంచివారు ఈ కాలంలో చాలా అరుదండీ!, మీరు చాలా గొప్పవారు" అంటే పొంగిపోతాడు. ఆ పొంగు బయటకు కనపడకపోవచ్చు కాని మనసు ఆనందపడుతుంది.

పైన చెప్పిన రెండు సందర్బాలలోనూ ఏమాత్రం పట్టించుకొనని వారు నూటికో,కోటికో కొందరే ఉంటారు. అంటే ప్రతిస్పందన(Reaction) చూపేవారు నూటికి 95 శాతం పైమాటే.

ఇక్కడ మనం మాట్లాడే మాటలు ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతున్నాయి కదా. అంటే మనసున్న ప్రతి మనిషీ మాట్లాడే విధానాన్ని బట్టి అతని స్వభావం, అందుకు తగినట్లు ముఖకవళికలు మారుతాయి కదా. చివరికి జంతువులు కూడా మన మనసు బాగా లేనప్పుడు, మనం కోపంతో గట్టిగా అరుస్తున్నప్పుడు అవి కూడా మన వద్ద ముభావం(Dull) గా ఉంటాయి కదా. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. అంటే మనసు పై మాటల ప్రభావం ఖచ్చితం గా ఉంటుందని అందరికీ తెలుసు.

ఇక అసలు విషయానికి వద్దాం.

నేటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పుణ్యమా అని మొక్కలకు,చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని అలానే మనసు కూడా ఉంటుందని, అవి కూడా తమ భావాలను(ఆనందం లేక బాధలను) వ్యక్తపరుస్తాయని తెలుస్తోంది. మనం పరిహాసం గా మాట్లాడితే ఆ మాటల పౌనఃపున్యము, స్థాయి ఒకలా ఉంటాయి. అలానే సీరియస్ గా మాట్లాడినప్పుడు కూడా ఆ మాటల పౌనఃపున్యము,స్థాయిలు వేరేగా ఉంటాయి. అందరికీ ఈ సైన్సు విషయాలు తెలియకపోవచ్చు. కాని తెలిసినా,తెలియకున్నా జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా.

అంటే ఎలా మాట్లాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయం పై మనకు ఒక అవగాహన(Idea) ఉంటుంది కదా. మరి మనలానే మనసు గల చెట్లపై నిర్ధిష్ట పౌనఃపున్యము, స్థాయి గల మాటలు మాట్లాడితే అవి కాయలు రాల్చనూవచ్చు, లేక చెట్టే పడిపోవనూవచ్చు అనే విషయం పై అనుమానం ఎందుకుండాలి. మంత్రాలంటే ఒక విధివిధానం గల మాటలే కదా.

ఋషులంటే కేవలం ఆధ్యాత్మికవాదులే కాదు కదా, ఏ శాస్త్రంలో నిష్ణాతులైనా వారిని ఋషులనే అంటాము. ఉదాహరణకు కణము అనే భావనను కనిపెట్టిన కణాదున్ని ఋషి అనే అన్నాము. మంత్రాలతో పనులు చేయవచ్చు అని అన్నది ఆ ఋషులే కదా.

మన కాలపు మనుషులకు తెలిసింది పూర్వకాలపు మనుషులకు తెలియకపోవచ్చు, అలానే వారికి తెలిసింది మనకు తెలియకపోవచ్చు. అంతమాత్రాన కేవలం హేతువును లేక తర్కాన్ని పట్టుకొని వారు చెప్పింది అసంభవం,బూటకం అని అనడం ఎంతవరకు సమంజసం? వారు చెప్పిన దానిపై పరిశోధన చేద్దాం. తప్పని ఋజువైతే అప్పుడు బూటకం అందాం. మనం ఏ పరిశోధన చేయకుండా ,ఊరకే పనీపాటాలేని పెద్దలు రచ్చబండ పైనో, చెట్ల క్రిందనో కూర్చొని చెప్పారు, అని అవి బూటకం అని ఎలా అనగలం.

గమనిక: మంత్రాలకు చింతకాయలు రాలడం అనే భావన ను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మంత్రాలను నమ్మమనీ చెప్పడం లేదు, అలాగే నమ్మవద్దనీ చెప్పడం లేదు. విశ్వాసం,నమ్మకం ఉన్న వారిని వారి మానాన వారిని వదిలెయ్యండి. పరిశోధనల ఫలితంగా మీరనుకొన్నదే ఋజువైతే కనుక అప్పుడు మాట్లాడవచ్చు. ఏ విషయమైనా మన ఊహకు అందనంత మాత్రాన ఆ విషయంపై అతి తొందరగా ఒక అభిప్రాయానికి రావద్దని మాత్రమే నేను చెప్పదలచుకొన్నది.

Tuesday, June 15, 2010

ఎప్పటికీ మెకాలేను తిట్టుకుంటూనే ఉందామా? మనం చేసేదేమైనా ఉందా?

మెకాలే అను ఆంగ్లేయుడు మన విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించడంలో అగ్రగణ్యుడని అంటుంటారు. దాని గురించి చర్చ మనకు అనవసరం. మన దురదృష్టమో లేక ప్రారబ్దమో విద్యావ్యవస్థ మారింది. నైతికవిలువల కన్నా మార్కులకే,ర్యాంకులకే ప్రాధాన్యం ఇచ్చే తల్లిదండ్రులే,పెద్దలే ఎక్కువయ్యారు. అందరూ అలానే లేరు కానీ అసలంటూ ఉన్నారని తెలుస్తోంది కదా.

ఇలా ఎందుకంటూ ఉన్నానంటే "ఆట" అనే ఒక TV కార్యక్రమం విషయంలో ఆ పిల్లల తల్లిదండ్రుల వాదన వింటే ఆశ్చర్యం,విస్మయం కగుతుంది. "మాకు లేని బాధ మీకెందుకంటూ?" వారు అన్న మాటలకు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు విస్తుపోయారు.

మెకాలే పై చర్చ అవసరం లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు లేడు. రామాయణం లో శ్రీరాముడు చెప్పినట్లు "ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా కావచ్చు కాని ఆ వ్యక్తి చనిపోవడంతోటే అతని పై శతృత్వాన్ని కూడా మనం చంపేసుకోవాలి". అందుకే వాదన అనవసరం అన్నాను.

జరిగిందేదో జరిగింది, మరి మనం చేసేది ఏంలేదా?

ఇక్కడ విద్యావ్యవస్థ లోని మూల(basic) సమస్యను గురించి చెప్పుకోవాలి."మొక్కై వంగనిది మానై వంగునా" అన్నది మన పెద్దలు చెప్పిన సత్యము.విద్య యొక్క మొదటి లక్ష్యము పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడము.తర్వాత నైతికముగా అభివృద్ధి చెందేలా చేయడము అనగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడము మొదలగునవి వస్తాయి.

ఇక్కడ నిజముగా జరిగిన విషయాన్ని గురించి చూద్దాము."ఒక సారి ఒక మంత్రిగారు మన దేశం నుండి జపాన్ కు పర్యటించడానికి వెళ్ళారు.వారి సాంకేతిక ప్రతిభ మొదలగునవి చూసి ఆశ్చర్యపడి అక్కడి ఒక మంత్రి గారితో "ఏమండీ!పురాణ కాలం నుండీ మన రెండు దేశాలు మంచి మిత్రులు.మీ ప్రజలకున్న తెలివితేటలే భారత ప్రజలకు కూడా ఉన్నాయి కదా.మరి అభివృద్ధి విషయంలో ఇంత తేడా ఎందుకున్నదో చెప్పగలరా?" అన్నారు.

అప్పుడు ఆ జపాన్ మంత్రిగారు "మీరన్నది నిజమే.మనము మంచి మిత్రులమే.ఇంకా చెప్పాలంటే భారతీయులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము.చాలా వైజ్ఞానిక విషయాలకు మీరే మాకు మార్గదర్శకులు.కాని ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే మా దేశంలో 10 కోట్లమంది "పౌరులు" ఉన్నారు."వ్యక్తులు" లేరు."అని సమాధానం ఇచ్చారు.ఇక్కడ మనం "పౌరులు" మరియు "వ్యక్తులు" మధ్య తేడా గమనించవచ్చు.

జపాన్ వారి విధ్యా విధానంలో విశేషం ఏమిటంటే వారి పిల్లలకు చిన్నపటి నుండే తమ దేశపు గొప్పతనం గురించి వారి సంస్కృతి గొప్పతనం గురించి భోధిస్తారు.వారి దేశపు ప్రఖ్యాత వ్యక్తుల గురించి చెపుతారు.ముఖ్యముగా తమ దేశము భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనదని అందుకే ప్రపంచములో మొట్టమొదట సూర్యుడు తమ దేశములోనే ఉదయిస్తాడని నూరిపోస్తారు.తద్వారా తమ దేశముపైన అపార గౌరవ విశ్వాసాలు పెంపొందేలా చేస్తారు. తమపైన తమకు విశ్వాసం పెంపొందేలా చేస్తారు.తము మహోన్నత వ్యక్తుల వారసులము అన్న భావన పెంపొందించుకొనేలా చేస్తారు.

తర్వాతే మిగతా విషయాలు అనగా సైన్సు,లెక్కలు మొదలగునవి వస్తాయి.ఇప్పుడు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.జపాన్ వారు అంతగా ఎందుకు అభివృద్ధి చెందారో. కొన్ని విషయాలలో వారూ వెనుకబడి ఉండవచ్చు అన్న విషయం కాని ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం అని భావిస్తాను.

మన దేశంలో ఇలాంటి విద్యా విధానాన్ని మనం కలలోనైనా ఊహించగలమా?మన సంస్కృతీసంప్రదాయాలు ఎంత ఉన్నతమైనవో అందరికీ తెలుసు. అవి మాత్రం అసలు చెప్పరు.

ప్రతి దేశపు సంస్కృతిలోనూ కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు, అవి మనకెందుకు? మనం మంచినే పిల్లలకు నేర్పుదాం.
"విద్య యొసగు వినయంబు" అన్న పెద్దలమాట ఎంత వృధాగా పోతోందో మనకు తెలుసు.మన ఇప్పటి విద్యావిధానం పిల్లలను మార్కులు తెచ్చుకొనే యంత్రాలుగా ,ర్యాంకులే పరమావధిగా మారుస్తోంది.ఇక నైతిక,సంస్కార విలువలు ఎలా నేర్పుతాయి?


ఇతర దేశాలవారి నుండి బట్టలు ఎలాంటివి వేసుకోవాలో, ఎలాంటి ఫ్యాషన్ ను అనుకరించాలో నేర్చుకొంటున్నాము కానీ మనకు నిజముగా పనికి వచ్చేది నేర్చుకోవడం లేదు.

Monday, May 24, 2010

శృంగార రసాన్ని మనసుకు హత్తుకొనేలా తిక్కన గారి లాగా ఎందరు వర్ణించగలరు?


మహాభారతములో తిక్కన గారు ఒకచోట ఒక పద్యాన్నివ్రాశాడు. పద్యం ఏంటో, పర్వం లోనిదో గుర్తులేదు.

పద్య అర్థం ఏంటంటే

" సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు తనస్థానానికి చేరాక ఆకాశం అనే పందిరి మంచం పై సంధ్యసాయం సంధ్య ) అనే కన్య తన ఎరుపెక్కిన బుగ్గలతో
( నక్షత్రాలు అనే పూలు చల్లుతుంది. తర్వాత ప్రొద్దున కూడాసిగ్గుతో ఎరుపెక్కిన మొహంతో ఎవరైనా చూస్తారేమోనని తననాథుడైన సూర్యుడు లేస్తుండగానే (ఉదయిస్తుండగానే) నక్షత్రాలు అనే పూలను పందిరిమంచం (ఆకాశం) పై నుండితొలగించివేస్తుంది."

సాయంకాలము, ఉదయము సమయాలలో దిక్కు ఎరుపెక్కడాన్ని ఎంత బాగా తీసుకొన్నాడో కదా.
అసభ్యత అనే దుర్గంధం సోకని శృంగారరస వర్ణన ఎంత బాగుందో కదా!

Sunday, May 23, 2010

మీ చేయి ఆగినా మీ పాట అమరం - వేటూరి సుందర్రామూర్తి గారికి నివాళి


కనికరం లేని కాలం, నియమాలపై నడిచే కాలం,

మీకై తన నిబంధనలను సడలించుకోరాదా,

ఓ కాలమా ఒక చేయిని ఆపగలిగావేమో కానీ,

ఆ సాహిత్య మధురిమను కాదు,

నీలో ఉన్న నవరసాలు తనలో కూడా ఉన్నాయని ఈర్ష్యపడ్డావో ఏమో,

తనను మాకు దూరం చేసావు, అంతే నీవు చేయగలిగింది ,

తన నాదోపాసనను ఎంత మాత్రం కాదు


ఆ మహోన్నత వ్యక్తికి ఆశ్రునివాళి .
తెలుగు ఉన్నంత కాలం మీరు ఉంటారు.

Friday, May 21, 2010

రామేశ్వరుడు అనే పదానికి అసలు అర్థం ఏంటి? (ఒక సరదా కథ)


రామేశ్వరం లో ఉన్న దేవుడిని (శివలింగాన్ని) రామేశ్వరుడు అంటారని అందరికీ తెలుసు. అసలు ఈ పదానికి అర్థం ఏంటి అని ఒకసారి దేవతలకు సందేహం వచ్చింది.

పరమశివుడి వద్దకు వెళ్ళి అర్థం అడిగారు.
అప్పుడు ఈశ్వరుడన్నాడు " రామేశ్వరుడు అంటే రాముడిని ఈశ్వరుడిగా గలవాడు అంటే రాముడిని భగవంతుడిగా గలవాడు" అని. అంటే అర్థం శివుడికి దైవం రాముడు అని. దేవతలు సరేనంటూ వెళ్ళిపోయారు.

కాని వారికి ఎందుకో సందేహం వీడక శ్రీమహావిష్ణువుని అడిగారు.

అప్పుడు విష్ణువు అన్నాడు " రాముడికి ఈశ్వరుడు ఐనవాడు" అని. అంటే రాముడు భగవంతుడిగా కొలిచేవాడు రామేశ్వరుడు (రాముడికి దైవం శివుడు) అని.
దేవతలు పూర్తి గందరగోళంలో పడ్డారు.

సరేననుకుంటూ చతుర్ముఖ బ్రహ్మ గారిని అడిగారు.
అప్పుడు ఆయన అన్నారు " శివకేశవులిద్దరూ అలానే మాట్లాడతారు. కాని అసలు అర్థం అదికాదు "రాముడే ఈశ్వరుడైన వాడు" అని అసలు అర్థం. అంటే వారిరువురూ ఒకటే. ఒకే భగవంతుడు వారిద్దరిగా ఉన్నాడు అని అర్థం ". అప్పుడు దేవతలకు విషయం పూర్తిగా అర్థమై సందేహం తీరిపోయింది.

ఈ కథ ఎందులోనిదో తెలియదు. విన్నది అంతే.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు