తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Sunday, May 17, 2009

మా ప్రాంతపు కొన్ని తెలుగు పదాలు - మా యాస - 1

ఈ శీర్షికను మన విభిన్న ప్రాంతాల మధ్య తెలుగు భాషా పదాలను తెలుసుకోవడానికి మొదలుపెడుతున్నాను. అలాగే ముందు మా ప్రాంతపు పదాలు వ్రాస్తాను. మా ఊరు అనంతపురం జిల్లా, కదిరి పట్టణము.

తొందరగా = బిరిన్న(బిర్న)
గరాటు = లొడిగి
పళ్ళెము = తట్ట ( మిగతా ప్రాంతాలలో తట్ట అనగా గంప అని అర్థము )
ఎల్లుండి = మర్నాడు లేక మన్నాడు
పురోహితుడు చేసే పెళ్ళిపనులు = సాంగ్యాలు
పొద్దస్తమానం = పల్లాపగలు
కొబ్బరిబోండాము = ఎల్లీరు కాయ
ఐదుగురు = ఐదుమంది ( మా ప్రాంతాలలో ఐదుగురు, ఆరుగురు అనే బదులు ఐదుమంది, ఆరుమంది ఇలా ఉపయోగిస్తాము)
పదిహేను = పదహైదు
పద్దెనిమిది = పజ్జెనిమిది

ఇవి కొన్ని పదాలు.  మిగతావి తర్వాత.



Wednesday, May 13, 2009

మనము మనుషులమేనా? లేక మానవత్వం లేని రాక్షసులమా?

ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఒక వార్త నాకు ఈ సందేహం తెప్పించింది. 
అదేమిటంటే కరీంనగర్ జిల్లాలో జరిగిన సంఘటన.

ఒక వృద్ధుడు రైలు వస్తున్నదని తెలియక పట్టాలు దాటుతూంటే అక్కడ ఉన్న మనుషులు ఎవరూ పట్టించుకొన్న పాపానపోలేదు. కాని ఈ విషయం గమనించిన ఒక శిల్ప అనే 22 ఏళ్ళ అమ్మాయి ఆ వృద్ధున్ని చేయి పట్టుకొని లాగబోయింది. ఆ అమ్మాయి పరీక్ష వ్రాయడానికి వెళ్తోంది.కాని అప్పటికే రైలు ఆ వృద్ధున్ని గుద్దివేయగా, ఆ వృద్ధునితో పాటు అతని చెయి పట్టుకొన్న శిల్ప కూడా ఆ విసురుకు దూరముగా విసిరివేయబడింది. జనము ఆ ఇద్దరూ చనిపోయారనుకొని చోద్యం చూసారే కాని ఒకరు కూడా సహాయానికి వెళ్ళలేదు. సుమారు గంట తర్వాత ఆ అమ్మాయి కదలడం చీసి ఎవరో గేట్‌మాన్ కు సమాచారం అందించారు. అతను అంబులెన్స్ కు ఫోన్ చేసారు. వారు వచ్చి తీసుకెల్లబోయేంతలో ఆ అమ్మాయి చనిపోయింది. సుమారు గంటసేపు ఆ అమ్మాయి కొనప్రాణంతో కొట్టుమిట్టాడి ప్రత్యక్షనరకం చూసింది.

ఇదంతా చదివిన తర్వాత ఏమనిపిస్తోంది. మనుషులు తమ మొగాలను ఎక్కడ పెట్టుకోవాలి. ఒక కోతికి ఏమైనా ఐతే అక్కడ ఉన్న కోతులు అన్ని అరిచి గోలపెట్టి బాధ పడతాయే. అలానే కాకులు కూడా అంతే కదా. అంటే మనుషుల పరిస్థితి ఎంత అధ్వాన్నముగా ఉందో తెలుస్తోంది. ఎప్పుడూ నేను, నావారు, నాది అనే స్వార్థం తప్ప ఇంకేమి పట్టని ఈ సమాజంలోని మనుషులకు మంచిరోజులు ఎందుకు రావాలి? అస్సలు అవసరం లేదు. మన కర్మలకు అంటే మనం చేసే పనులకు మనమే బాధ్యులం తప్ప ఇతరులు కాదు.నీవు ఇతరులు బాధపడుతున్నా పట్టించుకోకున్నప్పుడు  ఇతర మనుషులు కాని, ఆ దైవం కాని నిన్ను ఎందుకు పట్టించుకోవాలి? మనం మారనంత కాలం మన బ్రతుకులింతే. ఇంత కన్నా ఎక్కువ చెప్పుకోనవసరం లేదు.

Tuesday, May 12, 2009

ప్రజలారా! హక్కులే తప్ప బాధ్యతలు పట్టవా?

మూర్ఖుడైనా తనదైన రోజున మహత్కార్యాన్ని చేసి గొప్పపేరు సంపాదిస్తాడు. నిజమైన గొప్పతనం అనేది ఒకరు చేసిన గొప్పపనిని బట్టికాక అతను తన దైనందిన జీవితములో చేసే చిన్నచిన్న పనులను ఏవిధముగా చేస్తున్నాడనేదాన్ని బట్టి ఉంటుంది.ఇది స్వామి వివేకానందుని మాట.

1.మనము తాగడానికి నీరులేదని, పాలకులు సరిగా లేరని బాధపడతాము. అదే నీరు రోజూ వస్తూ నీటిగొట్టాలు పగిలిపోయి నీరు వృథాగా వెళ్ళిపోతున్నా పట్టించుకోము. లేక కుళాయికి ట్యాపులేక నీరు వెళ్ళిపోతుంటే కనీసము ఏదైనా అడ్డుపెడదామన్న ఆలోచనకూడా రాదు. వచ్చినా మిగతావారు చూసుకుంటారులే, నాకెందుకు అనుకొని వెళ్ళిపోతారు. నీళ్ళైతే పట్టుకొంటారు కాని నీరు వృథాగా పోతుంటే పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోకుంటే నీటిసరఫరా విభాగపు వారిని తిడతారు. అంతేకాని మన బాధ్యత మనకు పట్టదు. కనీసము వారికి ఫోను ఐనా చేసి చెపుదామన్న ఆలోచన కూడా రాదు. 

2.ఇంకొందరు విదేశాలకు వెళ్ళివచ్చి అక్కడ ఎంతో శుభ్రముగా ఉంటుందని మనదేశములో అలా ఉండదని తెగ బాధపడిపోతుంటారు. ఇక విదేశాలు చూడని వారైతే TV లో ఆయా దేశాలను చూసి మన దేశము అలా లేదని బాధపడుతుంటారు. ఏ ప్రభుత్వ పథకమైనా జనము పాటిస్తేనే ఆ పథకము విజయవంతము అవుతుంది. కనీసము మనము అంతరాత్మ చెప్పినట్లైనా నడుచుకోము. మనకు తెలుసు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసినా, ఉచ్చ పోసినా అనారోగ్యమని, మరియు శుభ్రతకు భంగము అని. కాని మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. విదేశాలలో ఉన్నప్పుడు అక్కడి నియమాలు పాటించినప్పుడు అవే నియమాలు ఇక్కడ ఎందుకు పాటించరు? మాటలైతే ఎన్నో మాట్లాడుతారు.

ఇలా ఒకటా,రెండా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. మొదట నిద్రలేవగానే "నేను" అనే స్పృహ కలిగిన తర్వాతే మిగతా ప్రపంచము గోచరిస్తుంది. అంటే ఏ పనైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. ప్రతి మనిషి తన బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయి. అలా రాకున్న పోరాడే హక్కు కూడా ఉంటుంది. అంతే కాని హక్కులే తప్ప బాధ్యతలు తెలుసుకోనంత కాలం జీవితాలు అలానే ఉంటాయి.

గమనిక: ఈ టపా అందరినీ ఉద్దేశించ్ వ్రాసినది కాదు. కాని చాలామంది ప్రజలనే ఉద్దేశించి వ్రాసినది.



Sunday, May 10, 2009

"అమ్మ" అను పదానికి గణిత నిర్వచనము:

1000 మంది తండ్రులు + 100000 పరమగురువులు + 1000000 సాధారణ గురువులు +........................అనంతము వరకు << అమ్మ

అమ్మ ప్రతిక్షణమూ పూజ్యనీయురాలైనప్పటికీ అమ్మలను పూజించుకొనేందుకు, గౌరవించుకొనేందుకు ఒక రోజును కేటాయించినందున 
" మాతృదినోత్సవ శుభాకాంక్షలు" 
మాతృమూర్తులందరికీ అనంతకోటి నమస్కారాలు.

Friday, April 10, 2009

బ్లాగుల వాతావరణాన్ని బాగుచేయడానికి ప్రయత్నిద్దాం.ఏమంటారు?

ఈ మధ్య బ్లాగులలో తీవ్రమైన మాటల యుద్ధాలు, సవాల్లు-ప్రతి సవాల్లు చాలా తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. బ్లాగుల వాతావరణం ఇలాంటి ధూళిమేఘాలతో కలుషితమవుతోంది. సీనియర్ బ్లాగర్లు, జూనియర్ బ్లాగర్లు, మహిళా బ్లాగర్లు అంటూ ఏవేవో పదాలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పదాలే మన మధ్య లేనిపోని అహాలు(ego), ఎక్కువతక్కువలను సృష్టిస్తున్నాయని అభిప్రాయపడుతున్నాను.

ఎప్పుడైతే మన వ్యక్తిగత అభిప్రాయాన్ని సామూహిక అభిప్రాయముగా సామాన్యీకరణ(Generalization) చేయాలని ప్రయత్నిస్తామో అప్పుడే గొడవలు ప్రారంభమవుతాయి. బ్లాగు అనేది వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకొనే వేదిక, సమాచారాలు ఇచ్చిపుచ్చుకొనే మాధ్యమము అని అనుకొంటున్నాను.

మన బ్లాగుల ప్రథమలక్ష్యము అంతర్జాలములో "తెలుగు వైభవము" అనుకొంటున్నాను. కాని ఈ లక్ష్యము ఉన్నదని ఇప్పుడు కొత్తగా బ్లాగులు వ్రాయడం మొదలుపెడుతున్న వారికి ఎంతమందికి తెలుసు? అసలు ఇలాంటి లక్ష్యము అంటూ ఒకటుందని వారికి తెలుసా? అలా తెలియకపోతే అది వారి తప్పిదము కాదు. సంవత్సరాలుగా బ్లాగులు వ్రాస్తున్న మనది.

ఈ మధ్య నిజముగా జరిగిన ఒక సంఘటన ఒకటి చెప్తాను. 10 రోజుల క్రితం నా స్నేహితుడికి కంప్యూటర్లో తెలుగు వ్రాయవచ్చని, తెలుగులో ఉత్తరాలు పంపుకోవచ్చని , తెలుగులో మన విషయాలు వ్రాసుకోవచ్చని చెప్తే అతను నమ్మలేదు. ఆ అబ్బాయి 10వ తరగతి వరకే చదువుకొన్నాడు. వాడికి కంప్యూటర్ గురించి కొద్దిగా జ్ఞానం ఉంది. సరే అని ఇంటర్నెట్ సెంటరుకు వెళ్ళి మన బ్లాగులు చూపించాను. కాని దురదృష్టము ఏమంటే అతను బ్లాగులలో మన వాగ్వివాదాలు కూడా చూసాడు. అప్పుడు వాడు నాతో అన్న మాట "ఏరా స్వామీ! ఇదేదో బాగుందే. మనకు కోపం వస్తే మొహాన కాకుండా ఇలా వ్రాసుకొంటూ తిట్టుకోవచ్చు" అన్నాడు. వాడు తెలుసుకొన్న నీతి ఇది.
తర్వాత ఒక వారం రోజులు వాడికి కంప్యూటర్లో తెలుగు ఎలా ఉపయోగించవచ్చో నేర్పించాను. త్వరలో వాడు కూడా ఒక బ్లాగు వ్రాయాలని అనుకొంటున్నాడు. అది వేరే సంగతి.

ఇక అసలు విషయానికి వస్తే కొత్తగా బ్లాగులు వ్రాస్తున్నవారు,వ్రాయాలనుకొంటున్నవారు ఇలాంటి వాగ్వివాదాలు,అసభ్యకర వ్యాఖ్యలు చూస్తే ఏమనుకొంటారు?

ఒకరిపై కోపం ఉంటే ఆ వ్యక్తి ఉన్న వ్యవస్థపైనే లేక వర్గంపైనే శత్రుత్వం పెంచుకోవడం సమంజసం కాదు. ఉదాహరణకు ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడజాతి పైనే కక్ష్య పెంచుకోవడం, ఎవరో కొందరు అబ్బాయిలు అసభ్యముగా ప్రవర్తిస్తున్నారని మగవారంటేనే అసహ్యం పెంచుకోవడం లాంటివి. ఇలాంటివి బ్లాగులలో చాలా కనపడుతున్నాయి.ఇలా చేయడం వలన ఎదుటివారికి వచ్చే నష్టమంటూ చాలాచాలా తక్కువ. ఇలా చేసేవారికే మానసికముగా బాధలు, మానసిక వ్యాధులు ఎక్కువై తద్వారా ఆరోగ్యాలు చెడిపోవడం వంటి పరిణామాలు జరుగుతాయి. నిద్ర కూడా సరిగా పట్టదు.

చివరగా నేను చెప్పదలుచుకొన్నదేమంటే బ్లాగులలో అసభ్యకర టపాలు, అసభ్య వ్యాఖ్యలు వ్రాయడం, ఒకరి బ్లాగుకే పోటీగా ఇంకో బ్లాగు మొదలుపెట్టడం లాంటివి మానుకొందాం.
చర్చించుకొందాం కాని వాదనలు,వ్యక్తిగత విమర్శలు వద్దు.






Tuesday, April 7, 2009

ఓ హనుమంతుడా! నిన్ను మేమెందుకు కొలవాలి?


ఓ హనుమా!
రామ భక్తుడైనందుకా,
సీతమ్మజాడను కనుగొన్నందుకా,
లంకను కాల్చివేసినందుకా,
లేక శివాంశుడైనందుకా,
లేక భూతప్రేతాలను దరికి చేరనీయనందుకా,
లేక సూర్యున్నే మింగబోయనందుకా నిన్ను కొలవడం?

కావు,కావు ఇవి అసలు కారణాలు

మడమ తిప్పని నీ సంకల్పం మాకు ఆదర్శం,
అంతులేని నీ ఆత్మవిశ్వాసం మాకు ఆదర్శం,
ప్రపంచాన్ని ఢీ కొట్టగల నీ ధైర్యం మాకు స్పూర్తి,
అనితర సాధ్యమైన నీ కార్యతత్పరత మాకు స్పూర్తి,
పరస్త్రీలను మాతృమూర్తులుగా చూడడం మాకు కావాలి ఆదర్శం,
నీ ఇనుపకండలు,ఉక్కునరాలు కావాలి నేటి యువవృద్ధులకు,
మీ సమాచారనైపుణ్యం నేటి లోకానికి అత్యవసరం.


ఎన్నని చెప్పాలి కారణాలు నిన్ను కొలవడానికి
ఓ ఆంజనేయా నీవే కావాలి ఆదర్శం నేటి లోకానికి,
ప్రతి మనిషి కావాలి నీ అంశ.

జయము జయము ఓ హనుమంతుడా!
ఇవే నీకు మా నమస్సుమాంజలులు.




Monday, April 6, 2009

బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్ర, ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది,తప్పదు

ఈ మధ్య ఎక్కడ చూసినా కులాల రాజ్యాధికారం గురించే చర్చ. మన బ్లాగులలో కూడా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.
సరే సూటిగా నేను చెప్పదలుచుకొన్న విషయానికి వస్తాను.
తమకు ఈ కాలములో సరైన గౌరవం లేదని మరియు అవమానాలు కలుగుతున్నాయని బ్రాహ్మణులు,క్షత్రియులు , తమకు సరైన గుర్తింపు లేదని వైశ్యులు మరియు తమపై వివక్ష కొనసాగుతూనే ఉందని దళితులు బాధపడుతున్నారు.
చరిత్ర యొక్క, కాలానుగుణ ధర్మం యొక్క రహస్యాన్ని విశ్లేషించి తెలుసుకొంటే పైన పేర్కొన్న అందరూ తాత్కాలిక ఆవేశాలకు,అశాంతికి లోనవుతున్నారని అనకతప్పదు.

చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది.

మానవ సమాజం ఆరంభమైన మొదట్లో శారీరకముగా బలవంతుడైన వాడిదే ఆధిపత్యముగా ఉండేది. ఎప్పుడైతే మనిషికి ప్రకృతిశక్తులను అంటే అగ్నిని, మెరుపులను, వానలను మొదలగువాటిని మొదటిసారిగా చూసాడో వాటి గురించి సరైన జ్ఞానం లేక భయపడ్డాడు. ఈ కారణం చేతనే సమాజములో దేవుడు, దుష్టశక్తులు, అతీంద్రియశక్తులు మొదలగు భావాలు ఏర్పడడం మొదలు అయ్యాయి. అప్పటికి ఇంకా కులాలు ఏర్పడకపోవడం వలన ఈ ప్రకృతిశక్తులు మొదలగువాటిని కొద్దిగానైనా అర్థం చేసుకొన్నవారు ఒక వర్గముగా తయారైనారు. వీరికి కూడా పూర్తిజ్ఞానం లేకపోవడం వలన ప్రకృతిశక్తులను శాంతపరచడం మొదలగు విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. వీరినే పురోహితవర్గం లేక బ్రాహ్మణ వర్గం అని అంటారు. ఆ కాలములో వీరే కొద్దిగా జ్ఞానవంతులు కావడం చేత అందరూ వీరి ఆజ్ఞలనే పాటించడం జరిగేది. అలా సమాజములో మొదట ఆధిపత్యాన్ని అంటే ప్రజలను శాసించేవారిగా తయారైనారు, ఈ విధంగా మొదట రాజ్యాధికారం మొదట బ్రాహ్మణుల చేతిలో ఉండేది.


తర్వాత కాలములో వివిధ ప్రదేశాలలోని ప్రజల మధ్య ఆధిపత్యం కొరకు ఒకరిపై ఒకరికి పోరాటాలు జరగడం వలన శారీరకముగా బలవంతులైన వారి అవసరం ఏర్పడింది. బ్రాహ్మణులు శారీరకముగా అంత బలవంతులు కాకపోవడం వలన ఇక్కడ వారి ఆధిపత్యము ఫలించలేదు. అప్పుడే బలవంతులైన క్షత్రియ వర్గం తయారైంది. వీరే జనసమూహాలను రక్షించగలవారయ్యారు. ఇక తప్పనిసరిగా అధికారం వారి చేతులలోనికి వెళ్ళిపోయింది. అలా క్షత్రియుల రాజ్యాధికారం మొదలైంది.


ఇక సమాజములో డబ్బు యొక్క అనగా సంపద యొక్క ప్రాముఖ్యత పెరగడం మొదలైన తర్వాత బ్రాహ్మణులు కాని,క్షత్రియులు కాని మరియు కాయకష్టం చేసుకొని బ్రతికే శూద్రవర్గం కాని ఆ ధనసంపాదన చేసే వారిపై ఆధారపడడం మొదలైంది. ఇలా ధనసంపాదన చేసేవారినే వైశ్యులు అంటారని మనకు తెలుసు. మనదేశములో కూడా మొదట ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తమే వచ్చారని మనము మరిచిపోకూడదు. ఇలా సమాజములో ఆధిపత్యము ధనసంపాదన చేసేవారివైపుకు వెళ్ళిపోయింది. ఈ సమయములో వైశ్యుల ఆధిపత్యము విపరీతముగా పెరిగిపోయింది. అలా వారే సమాజాన్ని శాసించేవారిగా తయారయ్యారు.

పై మూడు వర్గాల కాలం గడిచిపోయింది.


ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఎవరైతే కష్టపడతారో వారిదే అధికారం. ప్రాచీన పరిభాషలో చెప్పాలంటే కాయకష్టము చేసుకొని,శారీరకముగా అధికముగా కష్టపడేవారు శూద్రులు లేక దళితులు. ఇప్పుడు శ్రామికుడిదే రాజ్యం. ఆంగ్ల ప్రభుత్వం ప్రపంచమంతటా విస్తరించడానికి కారణం వారి దేశములో సంభవించిన "పారిశ్రామిక విప్లవమే" కారణం. కార్మికులు లేక శ్రామికులు లేకపోతే సమాజానికి మనుగడే లేదు. కాబట్టి ప్రస్తుత కాలములో లేక సమీపకాలములో సృష్టి ధర్మాన్ని అనుసరించి శూద్రులు లేక దళితులదే ఖచ్చితముగా రాజ్యము అవుతుంది. కాబట్టి ఒక వర్గముపై ఒకరు దుమ్మెత్తిపోసుకోకుండా,బాధపడకుండా ఉండడమే శ్రేయస్కరము. సహజముగా ఒక వర్గము ఆధిపత్యము ఉన్నప్పుడు మిగతా వర్గాలు దాని క్రిందే ఉండడము ప్రకృతి ధర్మము. దానికి బాధపడనవసరం లేదు. ఎందుకంటే ఈ ఆధిపత్యచక్రము లో ఇప్పుడు రావలసింది శూద్రులు లేక దళితులు మాత్రమే, మిగతా వర్గాల వారికి ఆ అవకాశం వచ్చి వెళ్ళిపోయింది. కాలధర్మం ప్రకారం ఇప్పుడు వీరికి రాదు. దళితులకే వస్తుంది.
ఇలా చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది.

గమనిక: ఇక్కడ నేను నాలుగు వర్ణాలను మొత్తం ప్రపంచానికే వర్తింపజేసాను. కేవలం భారతదేశానికి మాత్రమే కాదు. లేక హిందూమతానికి మాత్రమే కాదు. ఎందుకంటే పేర్లు వేరైనా ప్రపంచము మొత్తం మీద వర్గాలు ఇవే ఉన్నాయి.

ఈ టపాలోని విషయాలు పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.
ఈ టపా కేవలము అధికార బదలాయింపు ఎలా జరుగుతోందో తెలుపడానికి మాత్రమే. కులాలు ఎలా పుట్టాయి మొదలగువాటి కొరకు ఉద్దేశింపబడలేదు.
అలానే శూద్రులు అనే పదమును సౌలభ్యము కొరకు మాత్రమే వాడాను. ఎవరినీ కించపరచడానికి కాదు.


Friday, April 3, 2009

కర్ణాటక ప్రభుత్వం వారి కొత్త కన్నడ నిబంధన

ఈ నిబంధన ఏమిటంటే వాహనదారులు ఖచ్చితముగా తమ వాహనపు నమోదుసంఖ్యను (Regestration Number ) వాహనానికి ఏదో ఒకవైపున (అంటే ముందుగాని లేక వెనుక గాని) ఖచ్చితముగా కన్నడలో వ్రాయాలి.

ఉదాహరణకు KA 12 A 3456 అనే సంఖ్యను ఖచ్చితముగా కెఎ ౧౨౩౪౫౬ అని ఖచ్చితముగా ఒక వైపు వ్రాయాలి.

మొన్నామధ్య ద్విచక్రవాహనములో వెళ్తుంటే ఈ నిబంధనను ఇక్కడి రక్షకభటులు తెల్పారు. అలా వ్రాయనందుకు మొదటితప్పుగా 100 రూపాయలు జరిమానా కూడా విధించారనుకోండి అది వేరే సంగతి.




శ్రీ రామనవమి శుభాకాంక్షలు



రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

అందరి జీవితాలలోనూ సీతారాముడు సుఖసంతోషాలను కలిగించాలని కోరుకొంటూ

సురేష్ బాబు




Wednesday, April 1, 2009

పదండి ముందుకు! పదండి తోసుకు! పోదాం, పోదాం, పైపైకి!

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హృదయాంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడవునా గుండెనెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీనదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మనకడ్డంకి?
పదండి ముందుకు,
పదండి తోసుకు,
పోదాం, పోదాం పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా! రారండి!
''హరోం! హరోం హర!
హర! హర! హర! హర! హర!
హరోం హరా!'' అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావవేగమున ప్రసరించండి!
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు,
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణమండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసల కాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
మరో ప్రపంచపు కంచునగారా
విరామమెరుగక మోగింది!
త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్నికిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,

-శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి
హోమజ్వాలల భుగభుగలు?

Tuesday, March 31, 2009

కల్నల్ రాజు - తెలుగు వారి వైభవం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనగానే ఇంకా ఈ దేశంలో కోట్లాది మందికి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన సహచరుడిగా, వైద్యుడిగా యుద్ధాల్లో అనేక సార్లు త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకొన్న ఓ కల్నల్ మన తెలుగు వాడైనందుకు గర్విస్తాం. ఆయన వట్టి కల్నల్ మాత్రమే కాదు. అనేక ఆసుపత్రులు, కళాశాలలు స్థాపించి తెలుగు వారికి వెలుగునీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించిన వ్యక్తి. ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మాణంలో పాల్గొన్న యోధుడిగా, ఆజాద్‌హింద్ ఫౌజ్ నాయకుడిగా పొందిన అనుభవాన్ని కేంద్రమంత్రిగా చేతల్లో చూపిన కార్యశీలుడు. ప్రకృతి ఆరాధకుడు. ఈ దేశం నాకే మిచ్చిందన్నది కాక ఈ దేశానికి నేనేమిచ్చానని ప్రశ్నించుకొని త్యాగయమ జీవితం గడిపిన కల్నల్ డాక్టర్ డి.ఎస్.రాజు జీవిత పయనం ఎలా సాగిందో చూద్దాం.

1904 ఆగస్టు 28న శృంగవృక్షంలో మాతామహుల ఇంట్లో జన్మించారు సత్యనారాయణరాజు. తల్లిదండ్రులు అచ్చయ్యమ్మ, రామచంద్రరాజులు. స్వగ్రామం పోడూరు. నరసాపురం తాలూకా. అప్పట్లో అది కృష్ణా జిల్లాలో ఉండేది. 1924 తర్వాత పశ్చిమగోదావరి జిల్లాకు మారింది. పెద్ద వ్యవసాయ కుటుంబం. తండ్రి ఆయర్వేద వైద్యులు. అక్షరాలు దిద్దే వయసులోనే తల్లి కన్నుమూసింది. అమ్మ లేకున్నా పిన్ని, పెద్దమ్మలు ఎంతో ఆప్యాయంగా చూశారు. ప్రాథమిక పాఠశాలలైనా లేని ఊళ్లల్లో ఎన్నో కష్టాలకోర్చి విద్యాభ్యాసం ప్రారంభించారు. వీరవాసరంలో మాధ్యమిక పాఠశాల విద్య పూర్తిచేశాక నర్సాపురం టైలర్ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 1923లో మద్రాసులో ఇంటర్ మొదటి తరగతిలో పాసయ్యారు. రాజు డాక్టరు కావాలని తండ్రి కోర్కె. అదే సంవత్సరం విశాఖలో వైద్య కళాశాల ప్రారంభమైంది.

మొదటి బ్యాచ్ విద్యార్థిగా రాజు అందులో చేరారు. 28లో చదువు పూర్తయింది. పై చదువులు చదవాలన్నది రాజు కోరిక. తండ్రి ఆర్థికస్థితి సహకరిస్తుందో లేదోనన్న అనుమానం. అప్పటికే రాజుకి వివాహం కూడా అవ్వడంవల్ల ఎలా? అన్న ఆలోచనలో పడ్డారు రాజు. ఎట్టకేలకు రాజు లండన్ వెళ్లారు. ఎల్.ఆర్.సి.పి., ఎం.ఆర్.సి.ఎస్. డిగ్రీలు సాధించారు. అప్పట్లో క్షయ, శ్వాసకోశ వ్యాధుల వల్ల ఎంతో మంది చనిపోయేవారు. అందువల్ల రాజు లండన్‌లో ఉన్నత విద్య పూర్తయినా వియన్నా వెళ్లి అత్యున్నత విద్య సాధించాలనుకొన్నారు. వెళ్లారు. శ్వాసకోశ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి పోడూరు గ్రామం వచ్చారు. ప్రాక్టీసు మొదలు పెట్టారు. అప్పట్లో జాతీయోద్యమ ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండేది. దానికి బాగా ఆకర్షితులయ్యారు రాజు. ఓ పర్యాయం రాజుని ఏలూరులో వైద్య సంఘ సమావేశానికి ఆహ్వానించారు. అందులో రాజు అద్భుతంగా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఓ ఆంగ్ల మిలటరీ అధికారివిని భారతీయుల్లోనూ ఇంతటి ప్రజ్ఞావంతులుంటారా అని ఆశ్చర్యపోయారు. వెంటనే రాజుని కలిసి మిలిటరీలో చేరితే మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుందన్నారు. రాజు అంగీకరించారు. మిలిటరీలో పోస్టింగ్ రానే వచ్చింది. బెంగుళూరు, పూనెలో కొన్నాళ్లు పని చేశాక సౌదీ ఆరేబియాలోని ''ఎమన్''కి బదిలీ అయింది. ఏడెన్ నగరంలో ఉంటూ అబిసీనియా యుద్ధబాధితులకు సేవ చేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో రాజుకి సింగపూర్‌కి బదిలీ అయింది. ఆయన సింగపూరులో ఉండగానే రెండో ప్రపంచ యుద్ధం తూర్పు ఆసియా దేశాలకు పాకింది. 1941లో జపాన్, ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధ ప్రకటన చేసింది.

ఆ సమయంలోనే కల్నల్ రాజు ఇండియన్ నేషనల్ ఆర్మీ పట్ల ఆకర్షితులయ్యారు. సుభాష్‌చంద్రబోస్‌కి కుడిభుజంగా మారారు. అండమాన్ దీవులలోని సెల్యులర్ జైలును బ్రిటిషర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న సమయంలో కెప్టెన్ రాజు, సుభాష్ ఇద్దరూ ఉన్నారు. జాతీయ పతాక వందనం చేసిన వారు కూడా వీరిద్దరే. ఇండియన్ నేషనల్ ఆర్మీలో కీలక వ్యక్తిగా పరిణమించారు. కల్నల్ రాజు నేతాజీ ఆంతరంగిక వైద్యుడిగా పని చేశారు. 1944 ఫిబ్రవరి నాలుగో తేదీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధం ప్రకటించిన రోజు నుంచీ బర్మాలో ఉన్నంతకాలం కల్నల్ రాజు నేతాజీ ఆంతరంగికుడిగానే ఉన్నారు.

1944 ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఆజాద్ హింద్ ఫౌజ్ మణిపూర్‌లోని మెయిరాంగ్ ప్రాంతం చేరుకొని బ్రిటిషు సైన్యాన్ని ఎదిరించి పారదోలి స్వతంత్ర జెండా ఎగురవేసింది. ఆ తర్వాత ఫౌజ్ సైనికులు చాలామంది మరణించారు. బ్రిటన్ ఆధిపత్యం మొదలైంది. మంచూరియా మీదుగా రష్యా వెళ్లడానికి ప్రయత్నించిన నేతాజీ కల్నల్ రాజు కోసం ప్రత్యేకంగా కారు పంపారు. ఆకారు బాంబు దాడిలో గుల్ల అయింది. కల్నల్ రాజు మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు. అంతకు ముందు అలా ఎన్నో సార్లు జరిగింది! రాజు ప్రమాదానికి గురైన తరుణంలోనే నేతాజీ సింగపూరు నుంచి బ్యాంకాక్ వెళ్లిపోయారు. అందరూ రాజు హతులయ్యారని భావించే తరుణంలో ఆయన బయటికొచ్చారు. ఆనాటికి పదిహేడువేల మంది సైనికులు మిగిలి ఉన్నారు. క్షమాభిక్ష వేడుకొంటే వారిని విడుదల చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షమించమని అడగడానికి వారు అంగీకరించలేదు. అయితే భారత జాతీయ కాంగ్రెస్ సైనికుల పక్షాన నిలిచింది. కోర్టు మార్షల్ విచారణ జరిపి సైనికుల్ని విడుదల చేసింది. కల్నల్ రాజు పోడూరు చేరుకొన్నారు. తిరిగి వైద్యవృత్తి చేపట్టారు. మిలిటరీలో చేరమని వైస్రాయ్ ఆయనను ఆహ్వానించారు. బరోడా మహారాజు తన పర్సనల్ డాక్టర్‌గా రమ్మన్నారు. విజయలక్ష్మీ పండిట్ రష్యాకు రాయబారిగా వెళ్లినపుడు ఎంబసీలో చేరమని కోరారు. వాటన్నిటినీ తిరస్కరించిన కల్నల్ రాజు 1953లో ధవళేశ్వరంలో ఆరు ఎకరాల భూమిని సేకరించి ఆస్పత్రి నిర్మించారు. అప్పట్లోనే ఎక్స్‌రే తీసే యంత్రాలు కూడా తెప్పించారు. అలా ఆయన అధునాతన వసతులు కల్పించారు.
మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒరిస్సా మాజీ గవర్నరు కుమారస్వామి వంటి వారు కల్నల్ రాజును రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారు. సరోజినీనాయుడు కుమారుడు జయసూర్య వంటివారుప్రోత్సహించడంతో చివరికి కల్నల్ రాజు రాజకీయాల్లోకి రావడానికి సంసిద్ధమయ్యారు. అప్పటికే ఆయన జాతీయనాయకులు గాంధీజీ మొదలుకొని అందరితో మంచి పరిచయాలుండేవి. 1957 సార్వత్రిక ఎన్నికల్లో కల్నల్ డి.ఎస్.రాజు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెహ్రూజీతో పరిచయాలుండడంతో ఆరోగ్య, రక్షణ విషయాల్లో ఆయన కల్నల్ సలహాలు తీసుకొనేవారు. 1963లో జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశానికి భారత ప్రభుత్వపు ప్రతినిధిగా కల్నల్‌ని నెహ్రూజీ పంపడం విశేషం. 1962లో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రెండేళ్లు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. తర్వాత లాల్‌బహదూర్‌శాస్త్రి మంత్రివర్గంలో డిప్యూటీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆరోగ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలో, దేశంలో ఆస్పత్రుల్ని తనిఖీ చేసి సదుపాయాలు కల్పించారు.

కల్నల్‌రాజు ఎప్పుడూ దూరదృష్టితో వ్యవహరించారు. అప్పటి విశాఖ జిల్లా కోరుకొండలో సైనిక్‌స్కూల్ నిర్మాణానికి కృషి చేసి ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు పొంది పాఠశాల నిర్మించారు. ఆ పాఠశాల కోసం కల్నల్‌రాజు స్వయంగా నెహ్రూజీని కలిశారు. భూపతిపాలెంలో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించారు. ఆయన జీవనయానంలో మరో విశిష్టత కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాల స్థాపన! అలాగే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ని ఒప్పించి నెలకొల్పిన ముళ్లపూడి వెంకట్రామయ్య విద్యా సంస్థ. తోటలు పెంచారు. పేదలకు వైద్య సాయం చేశారు. అందరికీ తలలో నాలుకలా మెలిగారు. 1973 జూన్ 6న కల్నల్‌రాజు పరమపదించారు. ఆయన పలు వ్యవస్థల, సంస్థల నిర్మాత.భవిష్యత్తరాలు ఆయన సేవల్ని గుర్తుంచుకొంటాయి. ఆయనకి నమస్కరిస్తూనే ఉంటాయి.


(ఈనాడు సౌజన్యము )

Monday, March 30, 2009

గరుత్మంతుడు చెప్పిన విష్ణుమాయ గుణాలు, ప్రభావము

శ్రీ మహావిష్ణువు మహాత్వం ఏమిటి? ఎలా ఉంటాడు? ఆయనకు గరుత్మంతుడు ఎప్పుడు వాహనంగా, మరెప్పుడు ధ్వజంగా ఉంటాడు? అనే సందేహాలకు సమాధానాలు చెప్పే కథ మహాభారతం ఆనుశాసనిక పర్వంలో కనుపిస్తుంది.


పూర్వం ఒకసారి హిమగిరి మీద మునిగణాలన్నీ పురాణ శ్రవణం చేస్తూ ఆనందిస్తున్న సమయంలో అక్కడికి వినత కుమారుడైన గరుత్మంతుడు వచ్చాడు. ఆ ముని గణాలన్నీ ఆయనకు వినయంగా నమస్కరించి తమకు శ్రీమహావిష్ణువు వైభవాన్ని, మాయ, రూప విలాసాన్ని వివరించమని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు వైనతేయుడు (గరుత్మంతుడు) ఆనందించి వారందరికీ విష్ణు విలాసాన్ని చెప్పటం ప్రారంభించాడు. అయితే తనకే కాక ఎంతటి వారికైనా కూడా ఆ శ్రీమహావిష్ణుమాయ, స్వస్వరూప విషయాలను వర్ణించే శక్తిలేదని, తనకు తెలిసినంతలో తనకు అనుభవంలోకి వచ్చిన విషయాలను వివరించగలనని అన్నాడు.

గతంలో తన తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు దేవేంద్రుడితో పోరాడి అమృతభాండాన్ని స్వాధీనం చేసుకొని తరలిపోతున్న తరుణంలో తనకు ఒక ప్రేమపూరితమైన పిలుపు వినిపించిందని గరుత్మంతుడు చెప్పాడు. ఆ మాటలు వినిపించిన దిశగా మరికొంత ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో నీకొక వరం ఇస్తున్నాను. తీసుకో అన్న పలుకులు మళ్ళీ వినిపించాయని, అయితే ఆ పలుకుతున్న దెవరో? ఎటువంటివారో? తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆ శబ్ధం వచ్చిన దిక్కుకు చూస్తూ మీరెవరో నాకు పూర్తిగా మీ విషయాన్ని వివరించాకే వరం ఇవ్వవలసినదిఅని గరుత్మంతుడు అడిగాడు. అందుకు సమాధానంగా తనస్వరూపమేమిటోఇకమీదట పూర్తిగా అవగతమవుతుందని, అయితే ముందుగా గరుత్మంతుడు తనకు వాహనంగా మారాలని మళ్ళీ వినిపించింది. అలా అయినందువల్ల వృద్ధాప్యం, మృత్యువు లాంటివి లేకుండా ఉండే ఒక మహాత్తర శక్తి సంప్రాప్తిస్తుందని గరుత్మంతుడికి వినిపించింది. అనుకొని ఆ వర ప్రసాదానికి గరుత్మంతుడికి ఒళ్ళు పులకించింది. వెంటనే భక్తిపూరితంగా నమస్కరించి తాను వెంటనే వాహనమూర్తిగా మారి సేవించుకుంటానని ఒకవేళ ఆ అడుగుతున్న మహానుభావుడు రథాన్ని ఎక్కివుంటే ఆ రథానికి కేతనంగా ఉండగలనని అలా తనను అనుగ్రహించమని గరుత్మంతుడు వేడుకున్నాడు. అలాగే తాను అనుగ్రహిస్తున్నట్లు ఆ అద్భుతశక్తి పలికింది. ఆ తరువాత గరుత్మంతుడుఎంతో ఉత్సాహంగా తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చిజరిగిన విషయాన్నంతా వివరించాడు. కశ్యపుడు ఎంతగానో ఆశ్చర్యపడి ఆ మాటలు ఎవరివోకాదని, ఆ వరం ఇచ్చింది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని తెలియచెప్పాడు.

ఎంతో గొప్ప సమాధినిష్ఠతో తపస్సుచేస్తే తప్ప లభించని శ్రీమహావిష్ణువు అనుగ్రహం గరుత్మంతుడికి లభించిందని, వెంటనే వెళ్ళి శ్రీమహావిష్ణువు ఉండే బదరికాశ్రమంలో ప్రవేశించి ఆయనను భక్తితో సేవించమని కశ్యపుడు గరుత్మంతుడికి చెప్పాడు. ఆ వెంటనే గరుత్మంతుడు బదరికాశ్రమానికి వెళ్ళి శ్రీమహావిష్ణువును అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు పచ్చని వస్త్రాలతో, శంఖ, చక్ర, గదాది ఆయుధాలతో ఎనిమిది భుజాలతో చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనేఇక తనను అనుసరించమని గరుత్మంతుడితో చెప్పాడు.

అలా చెప్పిన వెంటనే ముందు శ్రీమహావిష్ణువు వెళుతుండగా గరుత్మంతుడు అనుసరించాడు. అలా చాలా యోజనాల దూరం వాయువేగంతో గరుత్మంతుడు వెళ్ళాడు. ఇంతలో ఒకచోట భయంకర అగ్నిజ్వాలలు ఎదురుపడ్డాయి. అక్కడ ఎటుచూసినా ఇంధనం కానీ, మరొకటి కానీ ఎమీలేదు. ఆ మంటలను లెక్కపెట్టక తీవ్రవేగంతో వాటిలోకి ప్రవేశించాడు గరుత్మంతుడు. అయినా అతడికేమీ ప్రమాదం సంభవించలేదు. మరికొంత ముందుకెళ్ళాక తీవ్రమైన తపస్సు చేస్తున్న పార్వతీపరమేశ్వరులు కనుపించారు. అక్కడినుండి ఇంకా ముందుకు వెళుతున్న విష్ణువును అనుసరిస్తున్న గరుత్మంతుడికి బాగా ఒడలిక కలిగింది. అయినా ఆ ఒడలికను లెక్కచేయక ముందుకు వెళ్ళాడు అక్కడ ఒకచోట గాడాంధకారమైన ప్రదేశం ఉంది. ఆ చిమ్మచీకట్లో దిక్కుతెలియని స్థితిలో చేసేది ఏమీలేక గరుత్మంతుడు బాధపడుతూ తనకేమీ కనుపించటంలేదని తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఇదిగో ఇటుచూడు, ఈ వైపురా అని అన్నాడు. ఆ శబ్ధం వినిపించిన దిక్కు చూడగానే చిమ్మచీకట్లన్నీ చెల్లాచెదురైపోయాయి.

దివ్వమైన తేజస్సుతో వెలుగొందుతున్న ఆ ప్రదేశంలో భగవానుడు అంతకన్నా ఎక్కువగా తేజరిల్లుతూ కనుపించాడు.అక్కడ మంగళవాద్య ధ్వనులు మారుమోగసాయి. అద్భుతమైన సరోవరాలు కమలాలతో నిండి కనుపించాయి. ఆ ప్రదేశాన్ని కన్నార్పకుండా చూస్తున్నంతలోనే మళ్ళీ విష్ణువు తన ప్రయాణం సాగించాడు. ఆయనను గరుత్మంతుడు అనుసరించాడు. మళ్ళీ ఇంతలో ఒక భీకరమైన జ్వాల కనుపించటంతో గరుత్మంతుడు తత్తరపడ్డాడు.

మళ్ళీ తన శక్తిమీద ఆశలువదులుకొని ఆ దేవదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు ఆనారాయణుడు అనుగ్రహించి దోవచూపి అగ్నిజ్వాలలు పోగొట్టి మరికొంతదూరం గరుత్మంతుడు తన వెంటరాగానే అదృశ్యమైపోయాడు. ఆ క్షణంలో గరుత్మంతుడు ఉన్న ప్రదేశమంతా ఎంతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ కనుపించింది. అక్కడున్న ఒక చక్కని సరోవరంలో శ్రీమన్నారాయణుడు జలకాలాడుతూ కనుపించాడు. ఆ సరోవరం ఒడ్డుకు గరుత్మంతుడు చేరుకోగానే విష్ణువు మాయమయ్యాడు. ఆ సంఘటనకు మళ్ళీ బాధపడ్డాడు గరుత్మంతుడు. దానికితోడు అక్కడ ఒక పక్క చతుర్వేదాల గంభీర ఘోష వినిపిస్తున్నా ఎవరూ అక్కడ ఉన్నట్లు కనుపించలేదు. మళ్ళీ అంతలోనే మహా భయంకరమైన గరుడ పక్షులెన్నెన్నో ఆ ప్రదేశమంతా తిరుగాడుతూ కనుపించాయి. గరుత్మంతుడిక ఆ పరిస్థితి నుండి తాను బయటపడేందుకు పరమాత్ముడొక్కడే తనకు దిక్కని ఎలుగెత్తి పలుకుతూ రక్షించమని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఆందోళన పడవద్దని తాను రక్షిస్తాననిపలికాడు. ఆ పలుకులు వినిపించిన మరుక్షణంలో శ్రీమన్నారాయణడక్కడ సాక్షాత్కరించాడు. ఆయనకు భక్తితో నమస్కరించి గరుత్మంతుడు చుట్టూఒకసారి తేరిపారచూడగా ఆ ప్రదేశం మరేమీకాదని ఒదరికా వనమేనని స్పష్టమైంది.


అలా తనకు శ్రీమహావిష్ణువు స్వస్వరూపాన్ని, తన మాయా విశేషాలను వివరించినట్లు గరుత్మంతుడు మునులకు చెప్పాడు. అహంకారభావంతో మనిషి ప్రవర్తిస్తుంటాడు. అహంకార భావాన్ని విడిచి భక్తితో, ఆర్తితో భగవానుడిని స్తుతించినప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని ఈ కథా భాగం వివరిస్తోంది.

( ఈనాడు సౌజన్యముతో )


Friday, March 27, 2009

తెలుగుజాతి కీర్తిని ఇనుమడింపజేసిన కొందరు తెలుగువారు

ముందుగా అందరికీ శ్రీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెల్పుతూ సందర్బముగా మన తెలుగు జాతికి కీర్తిప్రతిష్ఠలు కలుగజేసిన కొందరు మహనీయుల గురించి తెలుసుకొందాము.

* శంకరంబాడి సుందరాచారి: రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అన్న గేయాన్ని రచించి తెలుగు జాతికి అంకితమిచ్చిన మహాకవి. తిరుపతి వాస్తవ్యులైన వీరికి నిన్నమొన్నటి దాకా దక్కాల్సినంత పేరు దక్కలేదు. మధ్యనే తిరుపతిలో సుందరాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
* పొట్టి శ్రీరాములు (1901-1952): ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం ఆత్మార్పణం చేసిన త్యాగ ధనుడు. సత్యము, అహింస, హరిజనోద్ధరణ ప్రధానాశయాలుగా గాంధీజీ అడుగు జాడల్లో నడచిన మహనీయుడు. తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంకోసం నిరశన వ్రతం చేసి అసువులు బాసారు. తత్ఫలితంగానే నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణ.
* గిడుగు రామమూర్తి పంతులు (1863-19409): ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. గిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది.
* కందుకూరి వీరేశలింగం (1948-1919): గొప్ప సంఘ సంస్కర్త, సాహితీ వేత్త. కథ, నవల, వ్యాసం వంటి అనేక తెలుగు సాహిత్య శ్రీకారం చుట్టినవాడు. స్త్రీ విద్యను, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. వివేకవర్థిని పత్రికను స్థాపించి సమాజంలో అప్పటికే పేరుకుపోయిన మూఢాచారాలను, దురాచారాలను తూర్పార బట్టారు. అధికార వర్గాల్లోని అవినీతి, అక్రమాలను కలం బలంతో బట్టబయలు చేశారు.
* ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (19 శతాబ్దం పూర్వార్థం): దేశ స్వాతంత్య్రంకోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి పదేండ్లకు పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి నిలిచిన ధీరుడు.
* గురజాడ అప్పారావు (1862-1915): 'దేశమును ప్రేమించుమన్నా' అంటూ దేశ భక్తి గీతాన్ని ప్రబోధించిన నవయుగ వైతాళికుడు. భాషా సాహిత్యాలు, కళలు దేశ హితానికి ఉపయోగపడాలని ఆకాంక్షించిన సమాజోద్ధరణాభిలాషి. గురజాడ సృష్టించిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక అనే కావ్యాలు తెలుగు వారి కంట తడి పెట్టిస్తూనే ఆయన కాలం నాటికి సమాజంలో పాతుకుపోయిన మూఢాచారాలపై ధ్వజమెత్తాయి.
* రఘుపతి వెంకటరత్నంనాయుడు (1862-1939): సంఘ సంస్కర్త, బ్రహ్మ సమాజ ప్రచారకుడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థుల్లో రుజువర్తన, నైతిక శీలానికి ప్రాధాన్యమిచ్చినవాడు. మహామహులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావులు ఈయన శిష్యులేనంటే గురువుగా ఆయన ప్రభావమెంతటిదో అర్థమవుతుంది.
* టంగుటూరి ప్రకాశం పంతులు (1872-1957): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు. తెలుగు వారి గుండెలొల్లో ఆంధ్రకేసరిగా ఈయన స్థానం పదిలం. బారిస్టర్గా ప్రాక్టీసు పెట్టి కోట్లు సంపాదించే అవకాశమున్నా గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించాడు. సైమన్ కమిషన్ వచ్చినపుడు పోలీసుల తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డి నిలిచి ఆంధ్ర జాతి గుండెను గెలుచుకున్నారు.
* పింగళి వెంకయ్య (1878-1963): భారత జాతీయ త్రివర్ణ పతాక నిర్మాత. స్వాతంత్య్ర సమర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, గుండె నిండుగా దేశాభిమానమే కాదు, మెదడు నిండుగా విజ్ఞానాన్ని ధరించిన వాడు. కాంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి, పండించి వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు అనేక బంగారు, వెండి పతకాలను గెలుపొంది రాయల్ ఎగ్రికల్చర్ సొసైటీకి సభ్యుడుగా ఎన్నికయ్యారు.
* బండారు అచ్చమాంబ (1874-1905): స్త్రీ విద్యకు తీవ్ర వ్యతిరేక ఎదురవుతున్న ఆరోజుల్లోనే చదువుకోడమే కాకుండా రచనలు సైతం చేసిన ప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలను శోధించి వెయ్యి సంవత్సరాల స్త్రీల చరిత్రను 'అబలా సచ్ఛరిత్ర రత్నమాల' పేరుతో ఒక్క చేతితో రాశారు. భర్త మాధవరావుతో కలిసి స్త్రీ జనాభ్యుదయానికి పాటుపడ్డారు. స్త్రీ సమాజాలను స్థాపించారు.
* డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు (1895-1948): ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త. ఆధునిక వైద్యంలో అనేక అద్భుత ఆవిష్కరణలు చేసిన వ్యక్తి. ముఖ్యంగా బోదకాలు వ్యాధి నివారణకు ఉపయోగించే డై ఈథైల్ కార్బామజీన్ అనే మందును కనుగొన్నారు. 1945లో ఆరియోమైసిన్ అనే యాంటీబయోటిక్ మందును ఆవిష్కరించారు. పాండురోగ నివారణకు పోలికామ్లం, క్షయ రోగానికి పసోనికోటినికాసిడ్ హైడ్రోజన్లను కనుగొన్నారు.
(ఈనాడు సౌజన్యము )



శ్రీ విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు




కొత్త సంవత్సరము మన రాష్ట్రము,దేశము మరియు ప్రపంచము అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని
కోరుకొంటూ

సురేష్ బాబు



Thursday, March 26, 2009

ఆదర్శదాంపత్యం ఎలా ఉండాలి? (అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర)

ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలి? అనే విషయాన్ని ఓ రెండు పక్షుల మాటల్లో మనుచరిత్రలో పెద్దన ఎంతో అందంగా, సందేశాత్మకంగా వివరించి చెప్పాడు. మార్కండేయ పురాణం ఆధారంగా రూపొందిన మనుచరిత్ర ఆరో ఆశ్వాసంలో హంసి చక్రవాక సంవాదం అనే ఓ కథ ఉంది. ఇందులో చక్రవాక పక్షి హంసి (ఆడహంస)కి భార్యాభర్తల బంధం విలువను ఇలా తెలియజెప్పింది.

పూర్వం స్వరోచి అనే రాజు ఉండేవాడు. ఆయన విద్యావంతుడు, బుద్ధిమంతుడై ఉండి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుండేవాడు. అలాంటి స్వరోచి ఓ సంఘటనలో ఒకేసారి ముగ్గురిని పెళ్ళాడాల్సి వచ్చింది. తొలిగా మనోరమను, ఆ తర్వాత ఆమె స్నేహితురాళ్ళయిన విభావసి, కళావతి అనే మరో ఇద్దరు కన్యలనూ వివాహమాడాడు. మనోరమను వివాహమాడినందుకు ఆమె తండ్రి నుంచి ఆయుర్వేద విద్యను, విభావసి వల్ల మృగ, పక్షి జాతుల సంభాషణలను తెలుసుకొనే విద్యలను, కళావతి వల్ల సర్వ అభీష్టాలు తీర్చే పద్మినీ అనే విద్యను పొందాడు స్వరోచి. పద్మినీ విద్య ప్రభావంతో సంమృద్ధిగా అన్నపానీయాలు, వస్త్రాభరణాలు తరగని సర్వసంపదలను సొంతం చేసుకున్నాడు. నిరంతర సుఖ జీవనం ఆయనకు ప్రాప్తించింది.

నిత్యం తన భార్యలను తీసుకొని గంగానది ఒడ్డున ఉన్న అందమైన ఇసుక తిన్నెల మీద పూలతోటల్లో సరోవర తీరాలలోనూ హాయిగా విహరిస్తుండేవాడు. ఇలా విహరిస్తున్న రోజుల్లో ఓ రోజున స్వరోచి అందమైన చందన వృక్షాల సమీపంలో ఉన్న ఒక సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సరస్సులో ఆనందంగా విహరిస్తున్న ఓ ఆడహంస అక్కడికి సమీపంలో విహరిస్తున్న ఆడ చక్రవాక పక్షిని తన వద్దకు రమ్మని రహస్యంగా పిలిచింది. స్వరోచిని.. అతడి భార్యలను చూపించింది. ఇలా ఏ భేదమూ లేకుండా ముగ్గురు స్త్రీలు ఒక పురుషుడితో జత కూడి వినోదించటమంటే ఎంత అదృష్టమోగదా, వారు పూర్వ జన్మలలో ఎంత గొప్ప తపస్సు చేశారో కదా అని అంది.

అలాగే భార్యకు భర్తపైన, భర్తకు భార్యపైన వలపు కలగటం లోకసామాన్యమైన విషయమే కానీ భార్యాభర్తలిద్దరికీ ఒకరిమీద మరొకరికి కొద్దిగా కూడా తేడా లేకుండా వలపు సమానంగా ఉండటం మాత్రం పూర్వజన్మ పుణ్యఫలమనే నా భావన. ఈ ముగ్గురు స్త్రీల మీద రాజుకు ప్రేమ ఉన్నట్లే ఆ రాజుపై కూడా స్త్రీలకు సమాన ప్రేమ ఉంది. పువ్వు, పరిమళం పరస్పరం కలిసి ఉన్నట్టే వీరి ప్రేమానురాగాలు నాకు కనిపిస్తున్నాయి అని అంది ఆడహంస.

అప్పుడు చక్రవాకం హంసికి వాస్తవం ఏంటో నిర్మొహమాటంగా తెలియజెప్పాలనుకొని ఇలా అంది. 'చూడు హంసి.. పైపైకి కన్పిస్తున్న ఈ భోగాల మెరుగులు చూసి ఇవన్నీ గత జన్మపుణ్య ఫలాలని అనుకోవటం నాకు వింతగా అనిపిస్తుంది. ఈ రాజు ఒక స్త్రీతో మిగిలిన ఇద్దరిముందూ రమిస్తున్నా ఆ ఇద్దరూ వారిని ఏవగించటం, కోపగించటం ఏమీ చేయటం లేదు. ఆత్మ గౌరవాన్ని వదిలి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ప్రేమను నీవు కూడా సమర్థిస్తూ స్తుతించటం ఏమీ బాగాలేదు. ఇలాంటిది కపట ప్రేమ తప్ప మరేమీ కాదు.

ఒక పురుషుడికి అనేక స్త్రీల మీద, అనేక స్త్రీలకు ఒక పురుషుడి మీద అనురాగం కలగటంలో ఎప్పుడూ పారదర్శకత ఉండదు. స్వరోచికి అతడి భార్య మీదకానీ, భార్యలకు స్వరోచిపై కానీ నిజమైన ప్రేమ కొంచెం కూడా లేదన్నది నా భావన. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను విను. రాజు తనను సేవించే పరివారం అందరితో అనుకూలంగానే మాట్లాడినా అందరి మీదా అతడికి స్వచ్ఛమైన అనురాగం ఉండదు. అలాగే ఎంతమంది భార్యలున్నా మగవాడికి ఆ అందరి మీద గాఢానురాగం ఉండదు.

తన భర్త మరొక స్త్రీని తన ఎదుటే కలిస్తే ఏ స్త్రీ కూడా ఆ భర్తపై మమకారంతో మెలగదు. ఇది అక్షర సత్యం. కనుక ఈ స్త్రీలకు ఈ రాజుమీద అభిమానం, మమకారం అనేవి ఉండనే ఉండవు. మరి ఎందుకిలా కలిసి ఉన్నారంటావా? అదంతా ధనాన్ని ఆశించి మాత్రమే. దాసదాసీ జనం ధనవంతుడిని చేరినట్లే వీరూ అలా చేరారు. అందుకనే వీరి దాంపత్యాన్ని నేను గొప్ప దాంపత్యం అని అనడం లేదు. ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద, ఒక స్త్రీకి ఒక పురుషుడి మీద మాత్రమే కలిగిన అనురాగం శ్రేష్టమైంది. స్త్రీలలో నేను, పురుషుల్లో నా భర్త ఈ వాస్తవాన్ని గ్రహించి అలా మెలుగుతున్నాం కనుకనే మాది ఆదర్శ దాంపత్యం అయింది. ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఉంటేనే అన్ని విధాలా శ్రేయోదాయకం' అని ఆడ చక్రవాక పక్షి హంసితో చెప్పింది.


ఏనాడో పెద్దన చేతుల్లో రూపొందిన మనుచరిత్రలో ఈనాటి వారిక్కూడా ఆచరణ యోగ్యమైన నైతిక విలువలతో కూడిన ఒక జీవన సూత్రం ఇలా ఇక్కడ కనిపిస్తోంది. స్త్రీ లౌల్యాన్ని నిరసిస్తూ రెండు పక్షుల మాటల్లో అల్లసాని పెద్దన ఇంత చక్కటి సందేశాన్ని మానవాళికి అందించాడు.

Tuesday, March 24, 2009

కుహనా లౌకికవాదుల,మీడియా వక్రబుద్ధి

లౌకికవాదులమని చెప్పుకొనే కుహనా రాజకీయనాయకులు,ప్రసారమాధ్యమాలు,వార్తాపత్రికలు(మీడియా) వక్రబుద్ధిని తెలిపే ఈ ఉదంతం చూడండి.
ఈ మధ్య వరుణ్‌గాంధీ ముస్లిములకు వ్యతిరేకముగా ఏవో వ్యాఖ్యలు చేసాడని వార్తలు వచ్చాయి. అలా గనుక అతను చేసుంటే అది తప్పే ఖండించవలసిందే.ఈ విషయాన్ని ప్రముఖవార్తగా అన్ని ఆంగ్లపత్రికలు, అన్ని ఆంగ్ల TV ఛానళ్ళూ ప్రసారం చేస్తున్నాయి. ఇక TimesNow,NDTV,CNN-IBN లాంటి ఆంగ్ల ఛానళ్ళకైతే ఇదే ప్రముఖ వార్త. వీళ్ళు ఎన్నిసార్లు వేస్తారంటే అలా చూపించడం వలనే ఇంకా మతకలహాలు ఎక్కువ చెలరేగే అవకాశం ఉంది. సరే వారు నిజమే కదా ప్రసారం చేస్తున్నారు అనుకొందాం.
అలా ఐతే ఇలాంటి అన్ని విషయాలనూ అలానే ప్రసారం చేయాలి కదా, పత్రికలు కూడా అలానే ప్రచురించాలి కదా.
M.F.హుస్సేన్ అనే ప్రముఖ(???)చిత్రకారుడు హిందూ దేవతల చిత్రాలను నగ్నముగా గీస్తూ దానిని సృజనాత్మకత(creativity) అని చెప్పుకుంటుంటే అది వార్త కాదా? పైగా దానికి నిరసన తెల్పితే,తెలిపిన వారిపై పోలీసుకేసులు. దానికి హిందువుల మనోభావాలు దెబ్బతినవా? వరుణ్గాంధీ కేవలం రెచ్చగొట్టే మాటలు మాత్రం మాట్లాడాడు. కాని హుస్సేన్ చెసిందేమిటి? ఏకముగా హిందువుల దైవాలపైనే గురిపెట్టాడు.కాని అతనిపై ఈగ కూడా వాలనివ్వరు. ఇక ఈ మీడియా ఉందే, వారికి ఇవి ఏ మాత్రం పట్టవు. అసలు ఇలాంటి వార్తలను పత్రిక మధ్య కాగితాలలో వేసి ఇక చేతులు దులుపుకొంటారు. మొదటి కాగితములో మాత్రం అసలు వేయరు. ఏమంటే లౌకికవాదం అంటారు.ఇదా లౌకికవాదం?ఆంగ్ల TV చానళ్ళకైతే అసలు ఇది ఒక వార్తే కాదు.
అసలు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం గారి ప్రకారం మనుషులను రెచ్చగొట్టే,బాధపెట్టే వార్తలను పత్రిక మొదటి కాగితంలో అసలు వేయరాదు.
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి వారి వక్రబుద్ధిని తెలిపే సంఘటనలు.

Friday, March 20, 2009

అంగరంగవైభవముగా జరిగిన కదిరి నృసింహుని రథోత్సవం - దృశ్యమాలిక

గత 15 రోజులుగా కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్బముగా టపాలు వ్రాయడం కుదరలేదు. ఆ బ్రహ్మోత్సవాల దృశ్యమాలిక.














Tuesday, March 10, 2009

భావోద్వేగాలను నియంత్రించడం అంటే ఇదీ - నిజముగా జరిగిన సంఘటన

అందరూ అంటూంటారు "మేము ఎంత కటిన పరిస్థితులలోనైనా దృఢముగా ఉంటాము" అని. కాని చిన్న ఓటమి ఎదురవగానే పాతాళానికి కృంగిపోతారు. కాని క్రింద సంఘటన చదవండి. ఒక ఇంటర్వ్యూలో అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి అడిగిన ప్రశ్న. ఇది నిజముగా జరిగినది.
ఆ ప్రశ్న ఏమిటంటే:
"మీ అమ్మ గనుక వేశ్య ఐతే?"
చాలామంది అభ్యర్థులు ఈ ప్రశ్న విని నిశ్చేష్టులయ్యారు. కొందరు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. కొందరు ప్రశ్నించిన అధికారిని కొట్టబోయారు. ఇంచుమించు మనము కూడా అలానే ప్రవర్తిస్తామనుకోండి.
కాని ఒకే ఒక అభ్యర్థి తడుముకోకుండా ఆలోచించి చెప్పిన సమాధానం ఏమంటే:
"మా అమ్మ గనుక వేశ్య ఐతే మా నాన్న ఒక్కడే ఆమెకు విటుడు"
ఆశ్చర్యపోయారా ? ఎంతమందికి ఇంత మానసిక స్థైర్యం ఉంటుంది?
ఇది మన భారతదేశంలోని ఒక యాజమాన్య సంస్థ (management institute) లో నిజముగా అడిగిన ప్రశ్న.




Sunday, March 1, 2009

అంతా మోసం,ఈ రోజు నా పుట్టినరోజు కనబడటంలేదు

అందరూ బాగా తమ పుట్టినరోజులు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు. కాని రోజు మార్చ్ 1 వచ్చింది. ఫిబ్రవరి 29 రాలేదు. ప్చ్ ఏం చేయాలి? ఫిబ్రవరి 29 పుట్టాను. కాని లాభాలు కూడా ఉన్నాయండోయ్. ప్రతి సంవత్సరంఖర్చులు తగ్గుతాయి.అంతే కదా. సరే నాకు శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోకండేం.




Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు