తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, November 30, 2010

అద్వైతం లో ద్వైతం,విశిష్టాద్వైతాలు ఎలా కలిసిపోతాయో చూడండి - గణితం (లెక్కలు) ప్రకారం నిరూపణ

మనకు తెలుసు
ద్వైతం అంటే మనలోని జీవాత్మ,పరమాత్ముడు వేర్వేరు అని,
విశిష్టాద్వైతం అంటే జీవుడిలోనే పరమాత్మ ఆత్మగా వెలుగుతున్నాడని,
అద్వైతం అంటే జీవాత్మే మేఘాల(మాయ)చే కప్పబడిన సూర్యుడు(పరమాత్మ) అని అంటే జీవాత్మ కు పరమాత్మకు భేధం లేదని .

ఇంకా సరళంగా చెప్పాలంటే

ద్వైతం అనగా నేను వెలుగు లో ఉన్నాను అని,
విశిష్టాద్వైతం అనగా నాలో వెలుగు ఉందని,
అద్వైతం అంటే నేనే వెలుగు అని చెప్పవచ్చు.

ఇప్పుడు గణితం ప్రకారం చూద్దాం.


ద్వైతం ను A అని, విశిష్టాద్వైతమును B అని అనుకుందాము.

ఇప్పుడు ద్వైతం,విశిష్టాద్వైతములను అనగా A,B లను కలుపుదాము. అంటే నేను వెలుగులో ఉన్నాను,నాలో వెలుగు ఉంది అనే ఈ రెండు భావనలను కలిపామనుకోండి. అంటే (A+B). అపుడు నేను కు బయటా,లోపలా వెలుగు ఉంది అని అర్థం అవుతుంది. అంటే మొత్తం వెలుగే ఉంది, కేవలం నేను
అనే భావనే బయటి వెలుగును, లోపలి వెలుగును విడదీస్తోంది.

ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే కుండ లోని నీరు (విశిష్టాద్వైతం) , అదే కుండను ఒక నదిలో పూర్తిగా ముంచితే అపుడు కుండ నీటిలో ఉంటుంది (ద్వైతం) కదా. ఇపుదూ కుండలోనూ, కుండ బయటా కూడా నీరే ఉంది కదా. ఇపుడు బయటి నీరుకూ, కుండలోని నీటికీ అడ్డం కుండ కదా. ఈ కుండే నేను అనే భావన.

ఇప్పుడు కుండను పగలగొట్టేసామనుకోండి అప్పుడు బయటి నీరు,లోపలి నీరూ ఒక్కటే అయిపోయి కుండ అందులో కరిగిపోతుంది. ఇప్పుడు కుండకు అస్థిత్వం,లేక ఉనికి (Existance)ఎక్కడ ఉంది?కుండ కరిగిపోయి అంతా ఒకటే (నీరే) అయిపోయింది కదా! అదే కదా అద్వైతం.

అంటే ద్వైతం, విశిష్టాద్వైతాల కలయికే అద్వైతం అని గణితం ప్రకారం నిరూపించవచ్చు.

ఇక అద్వైతంలోని విభాగాలే ద్వైతం,విశిష్టాద్వైతం అని నిరూపిద్దాం.

గణితంలో సమితులు అనే భావన వినేఉంటారు.
ద్వైతం ను A అనే సమితి గానూ, విశిష్టాద్వైతం ను B అనే సమితిగానూ అనుకొందాము.
అప్పుడు A,B లను రెండూ కలిపితే A union B అంటే (A ∪ B).
ఇంతకుముందు నిరూపణ ప్రకారం A,B ల కలయికే అద్వైతం కదా. అంటే ఇక్కడ ఆ A(ద్వైతం),B(విశిష్టాద్వైతం) ల కలయిక (A ∪ B).

గణితంలోని సమితుల ప్రకారం A,B లు రెండు సమితులైతే A,B లు రెండూ (A ∪ B)కి ఉపసమితులు అవుతాయి.

అంటే A ⊂ (A ∪ B). ==>> A is subset of (A ∪ B) (A అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

B ⊂ (A ∪ B) ==> B is subset of (A ∪ B) (B అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

ఇలా నిరూపణ చేయవచ్చు.

అంటే నేను అనే భావనకు బయట ద్వైతం, లోపలి వైపు విశిష్టాద్వైతం ఉన్నాయని ఆ నేను అనే భావనను తొలగిస్తే అద్వైతం అనే భావన అని అర్థం చేసుకోవచ్చు. ఈ టపాలో "నేను" అనే భావనను "మాయ" అని, సూర్యుడిని కప్పిన "మేఘం", శరీరం అని ప్రయోగించాను. రమణమహర్షుల ప్రకారం "నేను" ను
ప్రయోగించలేదు.


Friday, November 12, 2010

సమాధి స్థితి, శృంగారం, గాఢనిద్ర - ఈ మూడింటిలో ఉన్న సారూప్యత ఏమిటి?

మనందరికీ తెలుసు ప్రతి మనిషీ పై మూడింటిలో మొదటిదైన సమాధి స్థితిని కాకపోయినా శృంగారం, నిద్రలను ఖచ్చితంగా కోరుకొంటారు. శృంగారాన్ని కోరుకోని సన్యాసులు కూడా ఉంటారనుకోండి. నిద్రను మాత్రం అందరూ కోరుకొంటారనే విషయంలో సందేహం లేదు.


సమాధి స్థితి విషయాన్ని కాసేపు పక్కన పెడదాము.
ఇంతకూ నెను చెప్పదలచుకొన్న విషయం ఏంటంటే ఎందుకు ప్రతి మనిషీ ఇంకా చెప్పాలంటే దాదాపు ప్రతిజీవీ నిద్రను,శృంగారాన్ని ఖచ్చితంగా కోరుకొంటాయి?

శరీరం అలసిపోతే అది నిద్రను కోరుకొంటుంది. గాఢనిద్ర నిద్రపోయి లేచినవారు ( ఎవరూ లేపకుండా వారంతకువారే మామూలుగా లేచినవారు ) ఎంత ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారో మనము చూస్తూనే ఉన్నాం. ఏమి నిద్రపోయానురా,బలే నిద్రపట్టిందిరా అంటూంటారు వారు. అంటే గాఢనిద్రలో వారు ఏదొ ఆనందం పొందారు అన్నమాట. అదేంటి?


ఇక శృంగారం లో సంపూర్ణ తృప్తి ని పొందిన వారు కూడా శృంగారం అయిపోయిన తర్వాత ఎంతో ఆనందంగా,ఉల్లాసంగా ఉండటాన్ని చూస్తున్నాము కదా. అక్కడవారు కూడా ఏదో ఆనందం పొందారన్నమాట.అదేంటి?


ఇక యోగుల,ఋషుల సమాధిస్థితి విషయానికి వస్తే సమాధిస్థితి లో మరియు అందు నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా వారు బ్రహ్మానందం లో విహరిస్తుంటారని మహాత్ముల జీవితాలలో ( ఉదా: రామకృష్ణులు, వివేకానంద, పరమహంసయోగానంద ) చూడవచ్చు. అంటె అందులో కూడా ఏదో ఆనందం ఉందన్న మాట. అదేంటి?

నిద్రకు, సమాధిస్థితికి గల తేడా ఏంటంటే నిద్రపోకముందూ,నిద్రపోయి లేచిన తర్వాత కూడా మనిషి కి ఉండే జ్ఞానంలో ఏ మార్పూ ఉండదు. అదే సమాధిస్థితి పొందిన మనిషి ఆ స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత పరమాత్మజ్ఞానం పొందుతాడని వేదాంతం చెబుతుంది.

పై మూడూ విషయాలకూ ఒకదానితో ఒకదానికి సంబంధం లేకపోయినా పై మూడింటిలో పొందే ఆనందానికి ఒకే మూలసూత్రం ఉందంటే మీరు నమ్మగలరా?


ఆ మూలసూత్రమే "తననుతాను మరిచిపోవడం" లేక వేదాంతపరిబాషలో "అద్వైతం". అంటే ఆ సమయంలో మరే భావనా చివరికి తను ఒకడిని ఉన్నాననే భావన కూడా లేకపోవడం. ఇంకా చెప్పాలంటే తనే ఆనందం,ఆనందమే తను అయిపోవడం.

ఇంతే విషయం. అయిపోయింది.

కాకపోతే కొద్దిగా కొనసాగింపు ఉంది.

గాఢనిద్రలోనూ, శృంగారం లోనూ ఈ అద్వైత భావన ఆ సమయంలో మాత్రమే ఉంటుంది. ఆ రెండూ లేని మామూలు సమయాలలో ఆ అద్వైతాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. అంటే పై రెండు విషయాలలోనూ ఈ అద్వైతాన్ని అనుభవించడం తాత్కాలికం మాత్రమే అంతే కాకుండా అక్కడ మన ఎరుక లేకుండానే మనము ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాము అంతే.

నిద్రల్లో గాఢనిద్ర ఎంత ఉన్నతమైనదో సమాధిస్థితులలో సహజసమాధిస్థితి అంత కన్నా ఉన్నతమైనది అని వేదాంతం చెబుతోంది. ఈ సహజసమాధిస్థితి పొందిన మనిషి ఎల్లప్పుడూ అంటే నిద్రలోనూ,మెలకువలోనూ కూడా అంతే కాక ఏ పని చేస్తున్నా కూడా ఆ అద్వైతస్థితిని అనుభవిస్తూనే ఉంటాడని వేదాంతం చెబుతోంది.
అందుకే శృంగారంలోని ఆనందం కన్నా సమాధిస్థితిలోని ఆనందం కోటిరెట్లు ఉన్నతమైనదని, అధికమని అందుకే సమాధిస్థితి పొందిన వ్యక్తి అంతకు ఎంతో క్రింది స్థాయి అయిన శృంగారం పై శ్రద్ద,ఆసక్తి ఏ మాత్రం చూపడని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మికతలోని లోతైన భావాలవైపు ఈ టపా పోతుంది. అవన్నీ చెప్పడానికి సందర్బం కాదు కాబట్టి ఈ టపాను ఇంతటితో ముగిస్తున్నాను.

Wednesday, November 10, 2010

ఎవరు నిజమైన త్యాగులు?

సాధువులు, యోగులు, భక్తులు,సన్యాసులు మొదలైన వారు మేము భగవంతుడి కోసం అన్నీ త్యాగం చేసామంటారు. కాని క్రింది విషయాన్ని గమనించండి.

సకల ఐశ్వర్యవంతుడు,సకల సద్గుణవంతుడు అయిన భగవంతుడి కొరకు చిన్నచిన్న అల్పమైన డబ్బు,బంగారం,కామం లాంటి వాటిని వదులుకునే యోగులు,భక్తులు నిజమైన త్యాగులా?

లేక

అల్పమైన పై వాటి కోసం భగవంతుడినే వదులుకునే వ్యక్తులు నిజమైన త్యాగులా?

ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన త్యాగులో?

Friday, October 8, 2010

హస్టల్లో ఉంచి చదివించినందుకు ప్రతిఫలం వృద్ధాశ్రమమా? ఒక యదార్థ సంఘటన.

సంఘటన నిజంగా రోజు నేను చూసిన సంఘటన.

స్టీరింగ్ (సెవెన్ సీటర్) ఆటోలో నేను వెళ్తుంటే అదే ఆటోలో ఒక తల్లీ,కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ఇది.


తల్లి: "ఏరా! చిన్నప్పటినుండి కష్టపడి మిమ్మల్ని చదివించి,జీవితంలో వృద్ధిలోనికి తీసుకువచ్చినందుకు వృద్ధాశ్రమంలోచేర్పించి మాకు బానే బుద్ధిచెప్పారు .ఒకే కొడుకువి మాకు మీదగ్గర ఉండాలని ,శేషజీవితం గడపాలని ఉంటుంది కదా"


కొడుకు: "ఏం నెలనెలా డబ్బు నేనేకదా పంపుతున్నది మీకు. అదీగాక మీరు నన్ను చూడాలని అనినప్పుడలా నేనువస్తూనే ఉన్నాకదా. మీతో గడుపుతున్నాకదా"


తల్లి: అలా డబ్బు పంపడం కాదు. మాకు మీదగ్గర ఉండాలని, మనవడిని ఆడించాలని ఉంటుంది కదా"


కొడుకు : చూడమ్మా. నువ్వు,నాన్న నాకు మిగతా బంధువుల కన్నా ఏమంత ఎక్కువకాదు. తేడా ఏంటంటే మీరుకష్టపడి మీ డబ్బుతో నన్ను చదివించారు.అంతే. అసలు నన్ను 2 తరగతిలోనే హాస్టల్లో వేసి చదివించారు. అప్పటినుండి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లల్లోనే జరిగింది. అప్పుడప్పుడు నెలకొకసారి వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఇంటికొచ్చి చదువుకుంటానంటే నీ భవిష్యత్తు కోసమే కదా మేము ఇద్దరమూ కష్టపడుతూ చదివిస్తున్నాము అన్నారు. ఏం నాకు మాత్రం మీవద్ద ఉండాలని అప్పుడు ఎంతబాధపడ్డానో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఐన విషయం ఎన్నిసార్లు చెప్పాలి. మీలాగే నేను కూడా డబ్బు పంపుతున్నా కదా. మీరన్నా అప్పుడు నెలకుఒకటిరెండుసార్లే వచ్చే వారు చూడడానికి.నేను మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నా కదా. ఇక టాపిక్ ఎప్పుడూమాట్లాడకు.


ఇక్కడ నేను ఆటో దిగేసాను. తర్వాత ఏం వాదం జరిగిందో నాకు తెలీదు.ఆమె చేతిరుమాలు అడ్డుపెట్టుకొని ఏడుస్తున్నట్లుఅనిపించింది.

కాని సంఘటన నాలో నేటి మానవసంబంధాలను గూర్చి ఏవేవో అస్పష్ట ఆలోచనలను రేకెత్తిస్తోంది .

Thursday, October 7, 2010

నేర్చుకోవడం అంటే ఇదీ............ నేటి మనుషులు అనుకుంటున్నట్లు కాదు

చాలా పెద్ద విరామం తర్వాత మళ్ళీ బ్లాగులోక దర్శనం. ఒక చిన్న కథ.

కౌరవపాండవులు ద్రోణాచార్యుల గురుకులం లో విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. ఒకసారి ద్రోణులు ఏదో పనిమీద కొన్ని రోజులు బయటకు నేర్చుకోవడం వచ్చింది. వెళ్తూవెళ్తూ తన శిష్యులకు కొద్దిగా ఇంటిపని(home work) ఇచ్చి వెళ్ళాడు. అతను వచ్చిన తర్వాత శిష్యులు తాము చదివినదంతా ద్రోణులకు అప్పజెపుతారు.

కాని ధర్మరాజు మాత్రం "ఒక వాక్యాన్ని మాత్రం చదివాను.అందులొని విషయాన్నే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్తాడు. ఇన్నిరోజులుగా ఒక్కవాక్యం మాత్రమే చదివి నేర్చుకొన్నావా? అంటూ కోపంతో ధర్మరాజును దండిస్తాడు.


ఐనా ధర్మరాజు ఏ మాత్రం చలించకుండాఉండడం చూసి ద్రోణులు ఆలోచనలో పడి ధర్మరాజును పిలిచి "నాయనా! నువ్వు చదివిన ఆ వాక్యం ఏమిటి?" అన్నాడు. అప్పుడు ధర్మరాజు పుస్తకం చూపాడు."ఎన్నడూ కోపం తెచ్చుకోవద్దు" అన్నదే ఆ వాక్యం. ద్రోణులు ఆనందభాష్పాలు రాలుస్తూ "నాయనా! నాకు నువ్వు ఈరోజు "నేర్చుకోవడం"అంటే ఏమిటో నేర్పావు" అన్నారు.


పైన చెప్పిన విధం నిజముగా నేర్చుకోవడం కాని చిలకలలా నేర్చుకొని తిరిగి వల్లించడం,వప్పచెప్పడం కాదు.

ఇప్పుడు చెప్పండి నేర్చుకోవడం అంటే ఏదో.

Thursday, July 29, 2010

ఏ విషయమైనా సమగ్రంగా నేర్చుకోవడానికి వేదాలు చెప్పిన పద్దతి చూడండి. ఎంత బాగుందో!

సాధారణంగా వేదమంత్రం ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి ఆరు పద్దతులు ఉన్నాయి. ఆ ఆరు పద్దతులనే మనం నిత్యజీవితంలో కూడా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

ఆ పద్దతులు ఏంటంటే ఉపక్రమం, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వత, ఫలం, అర్థవాదం, ఉపపత్తి.


ఉపక్రమమంటే ప్రారంభం. ఉపసంహారమంటే చివర. మొదటి పద్ధతి ఈ రెంటినీ గమనించటం - దీనినే ఉపక్రమ - ఉపసంహార పద్ధతి అంటారు. ఈ రెండూ ఒకే విషయం గురించి చెప్తే మొత్తం విషయమదేనని గ్రహించవచ్చు.


అభ్యాసమంటే ఒక విషయాన్ని పదేపదే చెప్పటం లేక వల్లెవేయటం లేక మననం చేయటం.


ఏ వ్యాసంలోనైనా ఒకే విషయం గురించి పదే పదే చెప్తూంటే విషయం యొక్క సారాంశమదేననీ, మనస్సుకి బాగా హత్తుకోవటానికే తిరిగి తిరిగి దాని ప్రస్తావనే జరుగుతోందని గ్రహించవచ్చు.
అపూర్వత అంటే అంతకు పూర్వం చెప్పబడనిది అని అర్థం. అంటే విషయసారాంశమదే నన్న మాట.


''ఉపపత్తి'' అంటే విషయం గురించి చెప్పి ఆ విషయం యొక్క మూలమూ, ఉద్దేశమూ, ఔచిత్యమూ గురించి తెలుసుకోవడం. వీటి వల్ల ఆ విషయం స్పష్టమవుతుంది.


అర్థవాదం అంటే విషయాన్ని అనేక కోణాలలో విషయాన్ని చర్చించడం. వివిద రకాలుగా అర్థవంతమైన వాదాలు చేసుకోవడం.


'ఫలం'' అంటే ప్రతిఫలం. ''ఈ విధంగా చేస్తే ఈ ఫలితం లభిస్తుంది'' అనటం లాంటిదన్నమాట. అంటే మనం నేర్చుకోవలసినదాని వైపు లేక పొందవలసినదాని వైపు మనలను నడిపించటం. దీనిని ''ఫలం'' అంటారు.



Wednesday, July 28, 2010

వేదాల ముందు,వెనుకలను నిర్ణయించడానికి నేటి పరిశోధకుల ప్రామాణికత్వం ఏంటి?

నేటికాలపు పరిశోధకుల దృష్టిలో ఋగ్వేదం పురాతనమైనది. తర్వాత యజుర్వేదం,సామవేదం, అధర్వణవేదం వచ్చాయి. అందరూ దీనినే నమ్ముతున్నారు.

ఈ పరిశోధకులు దేనిని ప్రామాణికంగా తీస్కొని ఇలా వర్గీకరించారో తెలియడం లేదు.

ఇలా ఎందుకంటున్నానంటే అసలు ఋగ్వేదంలోనే యజుర్వేదానికీ, సామవేదానికీ సంబంధించిన సమాచారం ఉంది.
అందుకే వేదాల ముందు,వెనుకల సందేహం వచ్చింది.

మనలో పురుషసూక్తము చాలామందికి తెలుసు. ఋగ్వేదం 10వ మండలంలోని పురుషసూక్తములోని 10 వ శ్లోకం చూడండి.

తస్మాద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాద జాయత ||


అర్థం:

ఈ సర్వహుత యజ్ఞం నుండి ఋగ్వేద మంత్రాలు పుట్టాయి,సామవేద మంత్రాలు పుట్టాయి.ఛందస్సు పుట్టింది,యజుర్వేదం పుట్టింది.


మరి ఋగ్వేదం తర్వాత పూర్తైన తర్వాత యజుర్వేదం,సామవేదాలు వచ్చాయనాలా? లేక ఋగ్వేదం రచిస్తుండగానే యజుర్,సామవేదాలు సమాంతరంగా(parallel) గా రచించారనాలా? లేక అన్నీ ఒకేసారి ఉన్నాయనాలా లేక పుట్టాయనాలా? కాని ఎవరూ ఇలా అనలేదు. అందరూ అనేదేమంటే మొదట చెప్పినట్లుగా ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం మొదలగునవి.


కాని పై శ్లోకం వలన
ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం అనే భావన ఎలా నిలబడగలదు?


ఇంకా ఇలాంటి ప్రస్తావనలు కల శ్లోకాలు ఏమైనా ఉన్నాయేమో నేనింకా చూడలేదు కాని పై శ్లోకం నాకు కనిపించింది.

Tuesday, July 27, 2010

ఈ తెలుగు పాటకు ఇంగ్లిష్ పాట ఎదో కనుక్కోండి చూద్దాం

క్రింది పాట ఒక తెలుగు సినిమాలోనిదే, కాకపోతే మొత్తం పాట అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆ పాట ఏదో కనుక్కోండి.

నా మొహం అద్దంలో చూస్కొని

ఆశ్చర్యపోయా కనిపించింది చూసి

నేను కేవలం ప్రయాణించే సిపాయిని

నేనవగలను కాగలిగిందంతా

ఇప్పుడు అసలు పాట ఏంటో కనుగొని ఆ శృతిలోనే ఈ పాట కూడా పాడుకొని నవ్వుకోండి.

Monday, July 26, 2010

ప్రాచీన భారత ఋషులు ఆఫర్లు పెట్టి సరుకులు అమ్మినారా?

టపా పేరు చూసి ఇదేదో బిజినెస్ కు సంబంధించినది అనుకోకండి.
ఇది నేను ఇంతకు ముందు రాసిన టపా "మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?" కి కొనసాగింపు.

రామాయణం లో ఒక శ్లోకం ఉంది. విభీషణుడు రావణుడితో చెప్పే శ్లోకం

సులభాఃపురుషా రాజన్‌ సతతంప్రియవాదినః

అప్రియస్యతుపథ్యస్య వక్తా శ్రోతాచదుర్లభః

అర్థం:
రాజా! నిత్యం ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా లభిస్తారు. కాని మన మనసుకు నచ్చకపోయినా మన మేలు కోసం చెప్పేవారూ, చెప్పినా వినేవారూ దొరకడం కష్టం.


కాని అందరికీ మంచిది అవుతుంది అన్న విషయం చెప్పితీరాలి. చెప్పినా వినేవారు దొరకడం కష్టం. ఇక్కడే మన ప్రాచీనఋషులు ఆలోచించారు. నేటి వ్యాపారస్థులు తమ సరుకులు అమ్ముడుపోవడం కోసం "ఒకటి కొంటే ఇంకోటి ఉచితం" లాంటి పథకమే ఆ ఆలోచన.

చెప్పాల్సిన విషయం లేదా సందేశం సరుకులాంటిది. ఆ విషయాన్ని లేక సందేశాన్ని కల్గి ఉన్న కథ ఆఫర్ లాంటిది. అంటే అసలు సరుకు చెప్పాల్సిన విషయం, కథ ఆఫర్ అన్నమాట. సరుకు అమ్ముడు పోవడం కోసం వ్యాపారి ఆఫర్ ఇస్తాడు. జనంలో చాలా మంది మళ్ళీ ఇలాంటి ఆఫర్ ఉండదేమోనని సరుకు కొంటారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కొందరైతే ఆఫర్ ఉంటేనే సరుకులు కొంటారు. ఎలాగైనా సరుకు అమ్ముడుపోవడం అనేది వ్యాపారికి ఎలా ముఖ్యమో, మంచి విషయం ప్రజలకు అందాలనేది ఋషి ఉద్దేశ్యము.

మనము సరుకు కొన్న తర్వాత అసలు సరుకు చూపించకుండా ఆఫర్లో వచ్చిన సరుకునే ఎక్కువగా పక్కింటివారికి లేక మరెవరికో ఎలా చూపిస్తామో కథలోని సందేశాన్ని కాకుండా కథనే ఎక్కువగా
పట్టించుకొంటాం. అది వేరే సంగతి.

సరే కథ చదివినంత మాత్రాన సందేశం అందుతుందా అంటే సందేహమే. ఇక్కడే మరో ఆలోచన వచ్చింది ఋషులకు.

మనిషి విన్నదాని కంటే చూస్తే ఎక్కువ గా ఆకర్షితుడవుతాడు.

కాబట్టి నాటకాలలో సందేశాలను జొప్పించి నాటకాలు వ్రాశి వాటిని ప్రదర్శిస్తే చూస్తున్నంతసేపు తనను తాను మరిచిపోతాడు. పాత్రలను మరిచిపోయి వాటిని నిజంగా భావించి అందులో లీనమవుతాడు.

బయటకు వచ్చినా ఆ ప్రభావం పోదు. నేటి సినిమాలు, సీరియళ్ళ లో ఈ విషయాన్ని బాగా గమనిస్తూనే ఉన్నాం కదా.

Sunday, July 25, 2010

ఈ ఇంగ్లీష్ పాటకు తెలుగు పాట కనుక్కోండి

గాడ్ హ్యాస్ గివెను స్ట్రీట్ వన్ను
నవ్ వై టౌను ,వై ఓన్ హౌసు
ఓ సిస్టరు

Saturday, July 24, 2010

ఈ పాటకు అసలు తెలుగు పాట ఏదో కనుగొనండి చూద్దాం

క్రింది పాట తెలుగు పాట. నేను పేరడీగా తెలుగు లోని పాటను ఆంగ్లం లోనికి అనువదించాను. అసలు పాట ఏదో కనుగొని ఆ పాట లాగే దీన్ని కూడా పాడుకోండి.



స్టైలు క్వీను యు ఆర్, స్టైలు మ్యాను ఐ యాం ( style queen you are, style man i am)

ఏజు మ్యాచు, కపులు మ్యాచు (age match, couple match)

డిసెండ్ ఫ్రం టెర్రస్ (desend from terrus)

Friday, July 23, 2010

చేసే ఏ పని కైనా ప్రేమే ముఖ్యకారణంగా ఉండాలి - శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు

మీరు చేసేపని ఏదైనాసరే! దానికి ప్రేమ ఒక్కటే ముఖ్యకారణంగా ఉండాలి. కార్యం అంటూ ఎప్పుడుఆరంభం అవుతుందో - ఆ కార్యానికి కర్త, కర్తకు వేరైన ఇతరులు ఉండనే ఉంటారు. కార్యం ఏదైనాసరే! దాని ఉద్దేశము, ప్రయోజనము, కారణము ప్రేమతప్ప ఇంకోటి కారాదు. ఇచ్చట నేను గాంధీగారు అవలంబించిన అహింసావ్రతాన్ని గురించి చెప్పటంలేదు. ఒక్కొక్కప్పుడు మనం హింసా పూర్వకములైన కార్యాలు కూడ చేయవలసివస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నేరములకు తగిన శిక్షను కూడ విధించవలసి వస్తుంది. యుద్ధాలు చేయవలసిన అవసరం కూడ కలుగుతుంది. కాని ఏ కార్యం చేసినా సరే! కర్తయొక్క ముఖ్యోద్దేశము ప్రేమయే అయిఉండాలి. ఇచ్ఛాద్వేషాలకు క్రోధమాత్సర్యాలకు అందులో తావుండరాదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఈ ప్రేమ అనేది అల్లుకోనిపోయి ఉంటే ప్రపంచంలో ఎట్టి గడ్డు సమస్యలనైనాసరే, మనం అవలీలగా సాధించగలం.

-శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు

Thursday, July 22, 2010

పండ్లు తినడానికి పండ్ల తోటలోనికి వెళ్లి పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెట్టడం ఎందుకు?

చాలా ఆకలి మీద పండ్ల తోటలోనికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక తీరా పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెడుతుంటే ఎవరికి నష్టం? కావాలంటే ఆకలి తీరాక ఆ పని చేసుకోవచ్చు.

కాని మన దురదృష్టం ఏంటంటే నేడు మనం చేస్తున్న పని లెక్కెట్టుకోవడమే, తిని ఆకలి తీర్చుకోవడం కాదు.సాధారణంగా వేదాలు కాని, మరేవైనా గ్రంధాలు కాని చదవాలని ఎందుకు అనుకొంటాము.

మనకు కావలసినది మనం చదివే పుస్తకాలలో నుండి మన జీవనమార్గాని కొక దీపం... నిజానికి ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైన చర్చలు అసలువిషయాన్ని మన దృష్టినుండి ప్రక్కకు తొలగిస్తున్నాయి. ఇట్లాంటి ప్రశ్నలవల్ల మన దృష్టిలో ఆ పుస్తకాల విలువ తగ్గిపోవడమేకాక వాటిపై నిరాదరణ ఏర్పడి వానిపై మనము ఉంచవలసిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా ఉంచలేకపోతాము. అది పిల్లలు తినడం కోసం పెంచబడుతున్న పండ్ల తోటలను బాటనీ లాబొరేటరీలుగా మార్చినట్లు అవుతుంది. అలా ప్రయోగశాలలుగా మార్చామనుకోండి, వివిధ రసాయనాలు అవీ కలపవలసివస్తుంది. అప్పుడు అసలు దేనికోసం ఆ పండ్ల తోటను పెంచుతున్నామో ఆ అసలు పని ఇక వీలు కాదు. మనం ప్రస్తుతం శాస్త్రాలను,గ్రంధాలను చదివేపద్దతి కూడా ఇలానే ఉంది.

లేదు, ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైనవి కనుగొనాలి అనేవారు ఉన్నారంటే అది వేరే సంగతి.వారు అందుకు చదువుతారు.అది వారు చదువుతున్న కారణం.

మన కారణం అది కానప్పుడు మన కారణం అందులోని విషయాలు ఏంటి? మనకు పనికొచ్చేవా,కాదా? ఆచరణలో పెట్టగలమా లేక పెట్టవచ్చా?అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? అయినప్పుడు కూడా పైన చెప్పినవారి పనే చేస్తుంటే ఎవరికి నష్టం?

మనం ఒక పదానికి అర్థం కావాలని నిఘంటువు(Dictionary) చూస్తాం. కాని ఆ పదానికి అర్థం వెదికే క్రమంలో అనేక ఇతరపదాలు కనపడి వాటి అర్థం కూడా చూస్తూ ఒక్కొక్కసారి మనం అసలు ఏ పదానికి అర్థం చూడాలనుకొంటామో ఆ పదాన్ని మరచిపోతుంటాం. తర్వాత ఆ పదం గుర్తుకు రాక అదేంటో అని ఆలోచిస్తూ నరకయాతన పడుతుంటాం. ఇది అందరికి అనుభవమే అనుకొంటున్నాను. మిగతా పదాల అర్థాలు తెలిసాయి కదా అని అంటారేమో మంచిదే, కాని మన అసలు పని కాలేదు కదా.

ఒక అడవిలో రాత్రి పూట అడవి జంతువులు,పురుగులు,పాములు మొదలగునవి మన వద్దకు రాకుండా మనం కాపాడబడడం కోసం మనం కట్టెలు పేర్చి మంట పెట్టామనుకొందాం. ఇక్కడ
"రక్షణ" అనేది ప్రధాన కారణం,లక్ష్యం. ఆ మంట వెలుగులో మన వద్ద ఏమైనా దుంపలు అవీ ఉంటే వాటిని ఉడికించడం,తినడం అంతేకాక చలిగా ఉంటే మనకు వెచ్చదనం రావడం అనే ప్రయోజనాలు
అనుషంగికం.అంటే మన అసలు కారణం చెడకుండానే ఇతర ప్రయోజనాలు కలగడం.

అలానే మనం దేనికోసం పుస్తకాలు చదువుతున్నామో దాని కోసం చదివేటప్పుడు ఇతర విషయాలు మనకు తెలిస్తే తెలియనీ! మేలే, కాని అసలు విషయం మాత్రం మనం మరిచిపోకూడదు.

ఎవరెందుకు చదువుతున్నారో అందుకే మొదట చదవాలి. కావాలంటే చదివిన కారణం తీరాక ఆ పుస్తకాన్ని వ్రాసిన రచయిత ఎవరు? అతను ఏ కాలం వాడు లాంటివాటిపై దృష్టి పెట్టి కనుగొనడానికి ప్రయత్నించవచ్చు.

Wednesday, July 21, 2010

యోగ్యుడైతే నీ విద్యను చెప్పు,ఎవరూ దొరకకపోతే నీలోనే ఉంచుకో - ఇదే వేదాల అభిప్రాయం

ఇది నా ౨౦౦(200)వ టపా.

మన వేద విద్య లేక విజ్ఞానం అన్నది గురుశిష్య పరంపరగా ప్రసరిస్తూ ఉంది. వ్రాతమూలకంగా వేదాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వేదాలు స్వరప్రధానం అయినందువలన విని వల్లెవేస్తూ నేర్చుకోవడం అవసరం అయింది. అందుకే వేదాలను ఇలా విని నేర్చుకోవడం వలెనే "శ్రుతి" అని కూడా పిలుస్తున్నాం. మనము వేదాలలోని విజ్ఞానాన్ని చూస్తూనే ఉన్నాం.

అసలు ఈ విజ్ఞానం లేక విద్య ఎవరికి అందాలి అన్న విషయంలో వేదాలు ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. క్రింది శ్లోకాలు చూడండి.

సామవేదం లోని ఉపబ్రాహ్మణమైన "సంహితోపనిషద్ బ్రాహ్మణం" లోని శ్లోకాలు ఇవి.

"విద్య వై బ్రాహ్మణం ఆజగామ తవహం అస్మి త్వం మాం పాలయస్వ-అనర్హతె మానినెమాదా
గోపాయ మా శ్రేయసీతె అహమస్మి విద్యా సార్ధం మ్రియెత్ నా విద్యాం ఊషరెవపెత్"(3-9,10)

అర్థం:
ఒకసారి "విద్య" ఒక తపస్వి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించింది." నేను నీ దానిని. నన్ను చక్కగా అభ్యసించి పాలించు. అయోగ్యుడు,దురభిమాని అయిన శిష్యుడికి నన్ను ఇవ్వకు.నన్ను
నీలోనే ధరించి కాపాడు. నీకు ఎన్నటికైనా మంచి(శ్రేయస్సు)నే చేస్తాను. ఎప్పటికీ ఊషరక్షేత్రం(ఉప్పుచవిటి నేల) లాంటి అయోగ్యుడి చేతిలో మాత్రం ఉంచకు."

ఈ శ్లోకపు భాష్యం:

"యోగ్యుడైన శిష్యుడు దొరక్కపోతే తన విద్యను తనలోనే ఉంచుకోవాలే కాని ఎన్నటికీ అలాంటి వారికి తను నేర్చుకొన్న విద్యను చెప్పరాదు. దానివల్ల వాడు లోకకళ్యాణం సాధించకపోగా
లోకవినాశనానికే కారణం అవుతాడు."

విజ్ఞానం లేక విద్య అనేది ఎవరికి,ఎలాంటివారికి అందాలి అనే విషయాన్ని వేదాలు ఇంత విస్పష్టంగా ప్రకటించాయి.

గార్గి - స్త్రీ జాతిలో ఒక ఆణిముత్యం

గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి.ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది.ఆ కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు.

ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగా కనిపించేది.ఈమె బ్రహ్మచారిని.పరబ్రహ్మం యొక్క ఉనికిని అన్వేషిస్తూ ఈమె అనేక సూక్తాలను రచించింది.జనక మహారాజు యొక్క సభలోని నవరత్నాలలో ఈమె కూడా ఒకరు.ఈమె యొక్క పేరు జనకమహారాజు నిర్వహించిన బ్రహ్మజ్ఞానుల సభ ద్వారా వ్యాప్తి చెందినది.ఆ సభలో ఆ కాలంలో అందరికన్నా గొప్పవాడైన "యాజ్ఞవల్క్య ముని"ని ఆత్మ,పరమకారణమైన పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలు అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

ఉపనిషత్తులలో గార్గి యొక్క ప్రస్తావన వస్తుంది. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్నవల్క్యముని తో సంభాషణలలో ఈమె జ్ఞానపు వెలుగులు మనలను,అందరిని నిశ్చేష్టులను చేస్తాయి. ఉపనిషత్తులలో ఆమెను ఒక గొప్ప సహజ వేదాంతజ్ఞాని గా పేర్కొన్నారు.

మహాతల్లి గార్గి వేదకాలం నాటిదైనందున
ఇంతకన్నా ఎక్కువ వివరాలు దొరకడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

Tuesday, July 20, 2010

పగలు,రాత్రి ఏర్పడే విధానాన్ని వేదకాలంలోనే స్పష్టంగా చెప్పిన మన పూర్వీకులు

నేను గతంలో భూమి గుండ్రం (వేదాలు) అని ఒక టపా వ్రాశాను. అందులో మన ప్రాచీనులు భూమి గుండ్రంగా ఉన్న విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో వ్రాసాను. ఈ టపాలో ఇంకా ఎంత చాలా స్పష్టం గా వివరించారో చూడండి. ఋగ్వేదం ఎంత పురాతనమైనదో మనకు తెలుసు.

ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో క్రింది శ్లోకాన్ని చూడండి.

" వా ఏష న కదాచనాస్తమేతి నోదేతి, తం యచస్తమేతీతి మన్యంతేహ్న ఏవ తదంత్వమిత్వాథాత్మానం విపర్యస్యతే- రాత్రీమేవావస్తాత్ కురుతేహః పరస్తాత్ ... య ఏవం వేద" 14.6

అర్థం:

సూర్యుడు ఉదయించడం,అస్తమించడం అంటూ అనేది ఎప్పటికీ ఉండదు. సాయంకాలం అతడు విపర్యాసాన్ని పొంది మనకు కనబడడు. మళ్ళీ తెల్లారేసరికి కనబడతాడు.ఈ గోళంలో
కొంతభాగానికి కొంతసేపు మిగతాభాగానికి కొంతసేపు చీకటి,వెలుగులను ప్రసాదిస్తూ రాత్రి,పగలు అనే వ్యవహారాన్ని కలిగిస్తాడు.

ఇందులో విపర్యసం అనే పదం నాకు అర్థం కాలేదు.

అసలు రాత్రి,పగలు అనేవాటిని ఎంత స్పష్టంగా ఆ కాలంలోనే వివరించారో చూడండి.
అంతేకాక గోళం అంటూ భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్తున్నారు.

వేదాల్లోని ఈ విషయాన్ని చూసి 19వ శతాబ్దపు వేద పరిశోధకుడు మోనియర్ విలియంస్ (Monier Williams) భారతీయుల సునిశిత మేధాశక్తిని ప్రశంసించిన విధానం చూడండి.

"Indians had made some shrewd astronomical guesses more than 2000 years before the birth of Copernicus" (The Vedas p.39)

ఇంకో తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే ఈ ఋగ్వేదపు ఐతరేయ బ్రాహ్మణంలోనే మొదటిసారిగా "ఆంధ్ర దేశం" అని ఉపయోగించబడింది.
ఇందుకు సంబంధించిన శ్లోకం

"తుంగా కృష్ణా తథా గోదా సహ్యాద్రి శిఖరావధి|
ఆ ఆంధ్రదేశ పర్యంతం బహ్వృచశ్చాశ్వలాయనీ" (33.6)

స్త్రీ మాత్రమే కాదు, మగవాడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణమైన మగవాడు అవుతాడు

అదేదో చిత్రంలో కథానాయకుడు ఒక స్త్రీ పరిపూర్ణత గల స్త్రీ ఎప్పుడు అవుతుంది అని మార్కులు వేస్తూ సంతానవతి ఐన తర్వాతనే ఆమె పరిపూర్ణత పొందుతుందని చెప్తాడు.

మరి మగవాడు పరిపూర్ణ మగవాడు ఎప్పుడు అవుతాడు? ఈ విషయం చాలా మందికి తెలియదు.

ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి.

శుక్ల యజుర్వేదం లోని "శథపథ బ్రాహ్మణం" లోని క్రింది శ్లోకాన్ని చూడండి.


అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి
సర్వో భవతి! సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి (5.2.1.10)


అర్థం :

భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.


కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.


మనం ఇంకోటి గమనిస్తే కనుక ఒకటి అర్థం అవుతుంది. పై శ్లోకంలో భార్య ద్వారా సంతానం పొందేవాడే పరిపూర్ణత పొందుతాడని చెప్పబడింది. అంటే కట్టుకొన్న భార్య ద్వారానే పొందాలి, ఇతరత్రా కాదు అన్న విషయం స్పష్టమవుతోంది.

Monday, July 19, 2010

జనానికి మంచి బదులు చెడు జరుగుతుందనే విమాన నిర్మాణం వ్రాయడం లేదు - భోజరాజు

భోజరాజు గురించి అతను ఒక గొప్ప మహారాజుగా మనందరికీ తెలుసు. ఇతని ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు ఉండేవాడని చరిత్ర చెప్తోంది.


కానీ ఇతను "సమరాంగణసూత్రం" అనే గ్రంధం వ్రాశాడని చాలామందికి తెలీదు.


ఈ గ్రంధంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయబడ్డాయి. "యంత్రాలు ఎలా తయారు చేయాలి?","ఆకాశంలో ప్రయాణించడం ఎలా సాధ్యం?" అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి.



అమరకోశం లో 'వ్యోమయానం విమానోస్త్రీ' అని ఉంది. అంటే "ఆకాశంలో ప్రయాణించే వాహనానికి విమానమని పేరు" అని అర్థం.


భోజరాజు తన 'సమరాంగణసూత్రం'లో విమాన నిర్మాణవిధానం గూర్చి వ్రాస్తూ భోజరాజు "విమాన నిర్మాణం గురించి స్థూలంగా తత్త్వము(theory) మాత్రమే వ్రాస్తున్నాను. దానిని నిర్మించే విధానం తెలిసే వదిలేస్తున్నాను,వ్రాయడం లేదు.చేయడం ఎలాగో చెప్పడం వల్ల సామాన్య జనానికి సుఖం బదులు కష్టమే ఏర్పడుతుంది అని ఇది వ్రాయడంలేదు' అని వ్రాశారు.



చిత్తశుద్ధి లేని వారి చేతిలో ఇలాంటివి పడితే పసిపిల్లల చేతిలో విషం ఉన్నట్లే కదా!


భోజరాజు గారు ఏమి ఆలోచించాడో ఏమో మనకైతే తెలియదు.


1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.


ఇతర దేశాలలో నూతనశాస్త్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మనదేశంలో ఉన్నశాస్త్రాలు కూడా నామరూపాలు లేకుండ నశిస్తున్నాయి. ఉన్న శాస్త్రాల ను ఉపయోగించుకొనే పద్దతి మనకు తెలియడంలేదు.


ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసికొనడానికి పరిశోధనలు చెయ్యాలి. మనకు అర్థము కాకపోయినా మన తర్వాతి తరం కొరకైనా వానిని రక్షించాలి. ఇప్పుడు అర్థము కాకపోయినా మరియొక కాలంలోనైనా అవి ఉపయోగపడతాయి.


మిగిలిన దేశాలు మొదట అజ్ఞానదశలో ఉండి క్రమేణ జ్ఞానదశకు వచ్చాయి. మన దేశము ఆరంభ కాలములో ఉచ్చస్థితిలోఉండి క్రమేణ క్షీణస్థితికి వచ్చి మళ్లీ ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్తోంది.



ఇప్పటికే ఎన్నో శాస్త్రాలు మనకు దొరకడం లేదు. ఉన్న శాస్త్రములను మూర్ఖంగా పనికిమాలినవని పారవేస్తే మనకే నష్టం. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి. నిరూపణ కానిదే దేనినీ ఖండించుటకు మనకు అధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం ఉంది.


సముద్రంలో ప్రయాణాన్ని వేదాలలో నిషేధించలేదు

ఋగ్వేదం 4 అధ్యాయం,9 అనువాకం,48 సూక్తం



उवासोषा उछाच्च नु देवी जीरा रथानाम

ये अस्या आचरणेषु दध्रिरे समुद्रे न शरवस्यवः



అర్థము:


ధనము కోరువారు సముద్రమున నావలు నడుపుతారు.ఆట్లే ఉదయాకాశమును ఉషోదేవినడుపుచున్నది.ఇంతకు పూర్వము కూడా నడిపినది.ఇప్పుడూ నడుపుచున్నది.



సముద్రమున నావలు నడపడం ధనం కొరకు అని అన్నప్పుడు,సముద్రయానం వ్యాపారం కొరకే అని కదా అర్థము.దీనినిబట్టి వేదకాలములోనే మన పూర్వీకులు సముద్ర ప్రయాణం (ఇతర దేశాలతో కూడా అయ్యుండవచ్చు) ద్వారావ్యాపారము చేస్తున్నట్టు అర్థం అగుచున్నది.



అంతేకాక సముద్రయానము నిషేదము అన్నది వేదకాలం తర్వాత ఎవరో మన గ్రంధాలలో చొప్పించారు అన్నది అర్థంఅవుతోంది.

Sunday, July 18, 2010

ఎపిక్ (Epic) - మన భారతదేశపు బ్రౌజర్



ఈ మధ్యనే నేను ఎపిక్ బ్రౌజర్ ను వాడుతున్నాను. చాలా బాగుంది.

దీన్ని mozilla fire fox ను ఆధారంగా తీస్కొని రూపొందించారు.
మామూలు firefox లోని అన్ని features ఇందులో ఉన్నాయి.

ముఖ్యం గా బ్రౌజర్ లో నే Anti virus సౌకర్యం ఉంది. దాన్ని download చేసుకొని activate చేసుకొంటే తర్వాత మనం ఏ download చెసుకొన్నా బ్రౌజరే స్కాన్ చేస్తుంది. ఈ anti virus ను మన కంప్యూటర్ ను కూడా స్కాన్ చేసి శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. బాగానే పనిచేస్తోంది.

దీని ప్రత్యేకతలు :
1.direct గా ఆంగ్లం తో పాటుగా ఏ భారతీయ భాష లో నైనా టైప్ చేసుకొనే సౌకర్యం ఉంది.
2.ఎడమ వైపు ఒక బార్ ఉంటుంది. అందులో చాలా అదనపు సౌకర్యాలు ఉంచారు.
3.బ్రౌజర్లోనే మనం word pad open చేసుకొని ఆంగ్లం తో పాటుగా ఏ భారతీయ భాష లో నైనా వ్రాసుకోవచ్చు.
4.ఇంకా twitter, orkut, gmail, facebook,yahoo, book marks, ఇంకా చాలా సైట్ల short cut లు ఎడమ వైపు బార్ లో ఉంచారు.
5.ఇంకా my computer ని కూడా బ్రౌజర్ లో నే (open) చేసుకోవచ్చు.
.6. fire fox లాగానే ఇందులో కూడా addons పెట్టుకోవచ్చు.
7. గేములు, backup కూడా ఎడమవైపు బార్ లో ఉన్నాయి.
8. ఇంకా ఎడమవైపు బార్ కు మనమే చాలా అదనం గా చేర్చుకోవచ్చు.
9.history కూడా ఈ బార్ లోనే ఉంటుంది.
10. ఇంకా అలారం కూడా పెట్టుకోవచ్చు. మనం నెట్ ఉపయోగిస్తూ సమయం మరిచిపోకుండా ఉండేందుకు అలారం ఉపయోగించుకోవచ్చు.
11. అలానే చేయవలసిన పనులు గుర్తు చేయడానికి To Do కూడా ఇందులో ఉంది.
12. ఏదైనా సైట్ లో మనకు నచ్చిన విషయం ఉంటే దాన్ని కాపీ చేసుకోవడానికి snippets అనే సౌకర్యం ఇచ్చారు.

ఇంకా చాలా ఉన్నాయి. ఇందుకోసం http://www.epicbrowser.com/ చూడండి.


ఈ బ్రౌజర్ ను క్రింది లంకె నుండి దింపుకోవచ్చు.
ఎపిక్(Epic)
(http://http.cdnlayer.com/href/epic-setup.exe)

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు