తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Sunday, July 3, 2011

సుప్రభాతము "కౌసల్యా సుప్రజా రామా" అని మొదలవడములో ఏదైనా అంతారార్థము ఉందా?

చాలా రోజుల తర్వాత బ్లాగు లోకము లోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాను.


విశ్వామిత్రుడు రాముడిని నిద్రలేపుతూ

కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే !
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం!

అంటాడు.

మన తెలుగు లోగిళ్లు "కౌసల్యా సుప్రజా రామా" అను సుప్రభాతము తో మేల్కొంటాయి. అసలు సుప్రభాతము ఈ శ్లోకము తోనే ఎందుకు మొదలైంది అని ఆలోచిస్తే ఇందులో మనకు ఒకటి అర్థమవుతుంది.

"కౌసల్యా సుప్రజా రామా!" అంటే ఇక్కడ రాముడు అనగా మేలుకోబోయే వ్యక్తి. అతడిని మేలుకొలపాలి. గాఢముగా నిద్రపోతున్న వ్యక్తిని ఉన్నట్టుండి మేల్కొలపడము ప్రమాదకరము. ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు. అందువల్ల మొదట తల్లి పేరు పలికినారు. అంతేకాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు("రామా!") పిలుస్తున్నాము. సుప్రజా అంటే మంచిబిడ్డవు అని అర్థము.


తర్వాత మాత్రమే"పూర్వాసంధ్యా ప్రవర్తతే" అంటే తెల్లవారుతోంది నాయనా అంటున్నారు. అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు, ఉదయించడానికి తయారుగా ఉన్నాడు. తెల్లవారుఝామునే లేవడం ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు.అందుకే ఆ సమయానికే ఇక్కడ మేల్కొల్పడం జరుగుతోంది.


"ఉత్తిష్ఠ నరశార్దూలా" అంటే ఓ మనుషులలో పులి లాంటి వాడా లెమ్ము అంటున్నారు. మనము చూస్తూనే ఉంటాము పిల్లలను లేపేటప్పుడు లేవరా "దున్నపోతా! బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకొనే ఉన్నావు. పక్కింటి అబ్బాయి చూడు మంచి ర్యాంకు తెచ్చుకొన్నాడు, నువ్వూ ఉన్నావు పనికిరాని వెధవవు తినేకి,నిద్రపోయేకి ఎప్పుడూ తయారుగా ఉంటావు" అంటూ తిడుతూ లేపుతుంటారు.అందువలన లేచేటప్పుడే పిల్లలు ఒక విధమైన బాధతో లేస్తుంటారు. అలాకాకుండా తన శక్తిసామర్థ్యాలను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మేల్కొల్పితే ఎంత ఆనందముగా,ఉత్సాహము తో మేల్కొంటారు. తర్వాత ఆ రోజు ఎంత ఉత్సాహముగా తమ పనులను చేసుకొంటారు. అందుకే ఈ విధంగా మేల్కొల్పాలని మనకు నేర్పుతున్నారు.


"కర్తవ్యం దైవమాహ్నికం" అంటే నీకు దైవం చే విధించబడిన అంటే నీవు చేయవలసిన పనులు (చదువుకోవడం కావచ్చు లేక ఉద్యోగం కావచ్చు లేక మరే వ్యాపారమో,సేద్యమో ఏదైనా కావచ్చు)చేయవలసి ఉంది అని గుర్తుచేస్తున్నారు.అందుకని తెల్లవారుఝామునే లెమ్ము నాయనా అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని కల్గిస్తూ మేల్కొల్పడం చేయాలి.

రాముడిని నిమిత్తముగా చేస్కొని సకల జీవరాశులను ఇలా మేల్కొలుపుతున్నారన్నమాట.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు