తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, December 31, 2008

నిన్నటి చిలిపి ప్రశ్నలకు సమాధానాలు

దయచేసి తర్కాలను పట్టించుకోకండి.
1.శ్రీ మహావిష్ణువు ఏ అవతారము ఎత్తినప్పటికినీ భూమిపై ఆ అవతారము జరుగుతున్నా వైకుంఠములో నారాయణుడి రూపములో ఉండేవాడు.కాని చేప,పంది,నరసింహ అవతారాలు ఎత్తినప్పుడు స్వామే స్వయముగా రూపము మార్చుకొని వచ్చాడు.చేప,పంది అవతారాలు ఎక్కడ నుండీ పుట్టలేదు స్వయముగా ఆయనే దిగివచ్చాడు.కాని నరసింహస్వామి అవతారంలో స్థంభం నుండి పుట్టాడు.ఇక బ్రహ్మదేవుడు విష్ణువు నాభిలో నుండి పుట్టాడు కాబట్టి బ్రహ్మదేవుడికి నాయనమ్మగా "స్థంభాన్ని" చెప్పుకోవచ్చు.
2.చందమామ,లక్ష్మీదేవి ఇరువురూ సముద్రము నుండి పుట్టారు కావున సోదర సంబంధం ఉంది.
3.మహావిష్ణువుకు చెల్లిగా పార్వతీ దేవిని చెబుతారు(నారాయణ-నారాయణి).పార్వతీ దేవి హిమవంతుని పుత్రిక కాబట్టి హిమాలయాలు విష్ణువుకు తండ్రి వరుస అవుతాయి.

Tuesday, December 30, 2008

చిలిపి ప్రశ్నలు ( తర్కాలు(లాజిక్కులు) లాగకుండా సరదాగా సమాధానం చెప్పండి)

1.బ్రహ్మదేవుడి నాయనమ్మగా ఎవరిని చెప్పుకోవచ్చు?
2.చందమామ కు లక్ష్మీదేవికి చుట్టరికం ఏమిటి?
3.శ్రీ మహావిష్ణువుకు హిమాలయానికి గల బంధుత్వం ఏమిటి?

Monday, December 15, 2008

అంతా ఆంగ్లమే-అక్కడక్కడా తెలుగు-వీలైతే విదేశీ భాషలు

ఇదీ నేటి తెలుగు ఛానళ్ళ పరిస్థితి. మన తెలుగు ఛానళ్ళు తెలుగును దాటిపోయి చివరికి ఆంగ్లాన్ని కూడా దాటి ఇతర విదేశీ భాషలను కూడా చేరేసాయి.Grand Final అనేది ఆంగ్లము.Grand Finale(గ్రాండ్ ఫినాలె)అన్నది ఏ భాషో ఏమో.అలాగే program అన్నది కాస్తా programme(ప్రోగ్రామె) అయింది.ఏంటి ఇదంతా?
ఈ మధ్య మన తెలుగు ఛానళ్ళ వారు తమ కార్యక్రమాల పేర్లు కూడా ఆంగ్లంలోనే పెట్టుకుంటున్నారు.చివరికి వార్తలకు కూడా "న్యూస్ అట్ మార్నింగ్ ఎడిషన్" అని ఈవినింగ్ ఎడిషన్ అని,నైట్ ఎడిషన్ అని అంతా ఆంగ్లమే.ఇక ప్రతి కార్యక్రమానికీ ముందు special prograame అని కనిపిస్తుంది.మాట్లాడే బాషా కల్తీయే,వ్రాయడమూ కల్తీయే ఇప్పుడు చివరికి పేర్లు పెట్టడం కూడా అలానే అయిపోతోంది."అంతిమ సమరం","ఆఖరి పోరాటం","విశేష కార్యక్రమం" లాంటి పదాలు ఆకర్షణీయం కాదా? ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో కలిసిపోయిన పదాల గురించి మనం పట్టించుకోనవసరం లేదు.అలాంటివాటిని అలానే వాడుదాము.
ఇక వ్యాఖ్యాతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.వారు పోయే హొయలు సామాన్యులెవ్వరూ పోరు.వారు మాట్లాడుతుంటే పాలు కూడా విరిగిపోయేట్టు ఉంటాయి.వీరు "ఆంగ్లేయ తెలుగువారు".కొన్ని రోజులు పోతే Anglo Indians లానే Anglo Andhrans కూడా ఏర్పడి వారికి కూడా చట్టసభలలో,ఇతర రంగాలలో కొన్ని స్థానాలు ప్రత్యేకముగా కేటాయించవలసి వస్తుందేమో.
"తినగ తినగ వేము తియ్యగనుండు" అన్న చందముగా భాషను మాట్లాడుతూంటే తియ్యగా అవ్వదా? "నా performance చూసారుగా నాకు ఓటు వేయండి" అని పిల్లలు ముద్దుముద్దుగా అంటుంటారు. Performance బదులు "ప్రదర్శన" అనే తెలుగుపదం ఉపయోగిస్తే ఎంత మధురముగా ఉంటుంది.చిన్నచిన్న పదాల దగ్గరే తెలుగును పిల్లలకు అలవాటు చేయకపోతే ఇక వారికి తెలుగు పదాల మధురత్వం ఎలా అలవడుతుంది?
ఇక చాలామందిని మీ రాశి ఏది అని గనుక అడిగినట్లయితే వెంటనే స్కార్పియో అనో,లియో అనో ఆంగ్లరాశుల పేర్లు చెబుతారే కానీ మన భారతీయ రాశుల పేర్లు చెప్పలేరు.అసలు ఎంతమందికి ఇవి గుర్తున్నాయో చెప్పలేము.
మన భాష పరిస్థితి ఎలా తయారవుతున్నదంటే కొన్ని రోజుల తర్వాత వాడుక బాష కూడా గ్రాంధికం అయ్యేటట్లు అనిపిస్తోంది.sorry అనే పదం వాడుకగా "మన్నించండి" లేక "క్షమించండి" అనే పదం ఏదో పెద్ద తప్పు చేసినప్పుడు మాత్రమే ఉపయోగించే పదాలుగా తయారవుతున్నాయి.చాలా పదాల పరిస్థితి ఇలానే ఉంది. "తరగతి","పాఠము,వరుస,వ్యాపకము,స్వస్థలము,నమోదు" లాంటి అందమైన తెలుగు వాడుక పదాలు అవసానదశకు చేరుకుంటున్నాయి.వాటి స్థానంలో class,lesson,line,hobby,native place,register లాంటి పదాలు వాడుకలో చేరిపోతున్నాయి.
కొన్నిచోట్ల ఆంగ్లపదం బదులు తెలుగుపదం గనుక ఉపయోగిస్తే అది బూతులకు దారితీసే పరిస్థితి కూడా ఎదురవుతోంది.ఉదాహరణకు sex అనే ఆంగ్లపదాన్ని కొన్నిచోట్ల వాడుకలో ఉపయోగించకపోతే అదేదో సిగ్గుపడే వ్యవహారంగా,వాడకూడని పదంగా మారిపోయింది.

Saturday, November 22, 2008

మంచిపని కి ఆలస్యం ఎందుకు?(ఒక మంచి కథ)

ఒకసారి ధర్మరాజు కొలువుదీరి ఉండగా ఒక పేదవాడు వచ్చి తనకు ఉండడానికి ఇల్లు లేదని ప్రార్థిస్తాడు.అప్పుడు ఏదో అవసరమైన చర్చలలో ఉన్న ధర్మరాజు "రేపు రమ్మని" తప్పక సహాయం చేస్తానని అన్నాడు.వెంటనే శ్రీకృష్ణుడు ఒక మూల నుండి ధర్మరాజు తో "ఓ మహానుభావా! సర్వజ్ఞా,సర్వాత్మస్వరూపా" అంటూ సంభోదిస్తూ ప్రత్యక్షమయ్యాడు.ఇది విన్న ధర్మరాజు నిర్ఘాంతపోయి "బావా!ఏంటి అలా సంభోదించావు?" అని బాధపడ్డాడు.అప్పుడు శ్రీకృష్ణుడు "మీరు అతన్ని రేపు రమ్మన్నారు.మరుక్షణం ఏమవుతుందో తెలియదు.అలాంటిది మీరు అతన్ని రేపు రమ్మన్నారంటే మీరు రేపటి వరకు బ్రతికి ఉంటారన్న విషయం మీకు తెలిసి ఉండాలి.అలాగే ఆ పేదవాడు కూడా రేపటివరకు బ్రతికి ఉంటాడని మీకు తెలిసి ఉండాలి.ఒక సర్వజ్ఞునికి మాత్రమే కదా ఇలాంటి విషయాలు తెలిసేది.అందుకే మిమ్ములను అలా సంభోదించాను"అన్నాడు.ఇది విని తన తప్పు తెలుసుకున్న ధర్మరాజు ఆ పేదవాడికి వెంటనే అతను కోరుకున్నది ఇచ్చి పంపాడు.

Thursday, November 6, 2008

మతరహిత సమాజం ఆకాశపుష్పం

అగ్ని,నీరు మొదలగునవి ఉన్నాయి. ఇవి ఎల్లప్పుడూ తటస్థంగానే ఉంటాయి.మనం వీటిని ఉపయోగించేదానిని బట్టి అవి ఉపయోగం అవుతాయి. చలికాలంలో అగ్గి దగ్గర కూర్చొని చలి కాపుకుంటాము.ఎంతో హాయిగా అనిపిస్తుంది. కాని ఎండాకాలంలో అగ్గి అంటేనే బయపడతాము. అగ్గి చేతికి తగిలి కాలింది అనుకొందాము."అబ్బా ఈ అగ్గి ఎంత చెడ్డది" అనుకొంటాము.వాస్తవానికి అగ్గి చెడ్డదా?మంచిదా?.ఏమీ కాదు.అది తటస్థము.మనము ఉపయోగించేదాని బట్టి అది ఉపయోగపడుతుంది. నీటి విషయం కూడ అంతే.వాస్తవానికి అవి తటస్థంగానే ఉంటాయి.మనమే వాటికి గుణాలను ఆరోపిస్తుంటాము.

మతం విషయం కూడా అంతే. అందులోని మంచిని గ్రహించినవాడు అదే ప్రకారం ప్రవర్తిస్తాడు.చెడును గ్రహించినవాడు ఆ ప్రకారం ప్రవర్తిస్తాడు. ఇందుకు మనం మతాన్ని నిందించడం తగునా? ఈ మధ్య మతాలు ఉండనవసరం లేదని, చెడును ప్రోత్సహించే మతాలు ఉంటే ఏమి లేకపోతే ఏమి అని అంటున్నారు. వాస్తవానికి సృష్టిలోని ప్రతివిషయంలోనూ గుణ,దోషాలు అనేవి ఉండక తప్పదు. అలాంటప్పుడు మనం ఏమీ ఉండకూడదు అనలేము కదా. దీనికి మతం అనే విషయం మినహాయింపు కాదు.

మానవతను మించిన మతం లేదు అన్న విషయం సరైనదే. ప్రతి మతమూ మానవతను కూడా బోధిస్తుంది కదా? పైన పేర్కొన్నట్టు దోషాలు కూడా ఉంటాయి. సృష్టిలో ఏ ఒక్కటీ పరిపూర్ణం( perfect ) కాదన్న విషయం అందరికీ తెలుసు.మరి మతం అనేది మాత్రం పరిపూర్ణం అని ఎలా భావిస్తారు? సరే అసలు లోపాలే లేని మతం ఒకటి స్థాపిద్దాము అనవచ్చు. కాని పైన పేర్కొన్న విధంగా పరిపూర్ణం ఐనది లేదు కాబట్టి దానిలో కూడా దోషాలు ఉండక తప్పదు. అప్పుడు ఆ దోషాలు నచ్చనివారు ఇంకొక మతం స్థాపించవచ్చు.కథ మళ్ళీ మొదటికి వస్తుంది.

సుఖదుఃఖాలు,మంచిచెడులు మొదలగు ద్వంద్వాలు ఎలానో గుణదోషాలు కూడా అలాగే. అందరికీ తెలుసు సుఖదుఃఖాలనేవి సాపేక్షాలని.ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించడం మన అనుభవమే. కావున మతాలు అన్నింటినీ రద్దుచేసినా అవి కంటికి కనిపించకపోవచ్చు.కాని గుప్తంగా అవి ఉండనే ఉంటాయి. కాబట్టి ఏ మతం వారైనా సరే వారివారి మతాలలోని మంచినే గ్రహించి లోపం అనుకొన్నదానిని వదిలివేస్తే ఏ బాధా ఉండదు.

Sunday, November 2, 2008

సాయనాచార్యుడు (తెలుగు వారి వైభవం)

నేటికీ భారతీయులు కానీ,పాశ్చాత్యులు కానీ వేదాలను అర్థం చేసుకుంటున్నారంటే అది "సాయనాచార్యుడు" రచించిన వేదభాష్యము చేతనే.ఇతని భాష్యము పేరు "వేదార్థ ప్రకాశము".

నా టపా "కాంతివేగం వేదాలలోనే ఉంది" అనే దానిలో కాంతివేగమును సాయనాచార్యుడు తన ఋగ్వేదభాష్యములో ప్రస్తావించాడు అన్న విషయం ప్రస్తావించాను.ఇతను బుక్కరాయల ఆస్థానం లో మంత్రిగా ఉండేవాడన్న విషయం ప్రస్తావించాను.

ఇతను మన తెలుగువాడు కావడం మనకు ఎంతో గర్వకారణం.ఇతని జీవిత కాలం 1315 నుండి 1387.ఇతను తెలుగు బ్రాహ్మణుడు.భరద్వాజ గోత్రీకుడు.వీరి తల్లిదండ్రులు మాయన,శ్రీమతి గార్లు.ఇతని భాష్యము ఎంత ప్రఖ్యాతి పొందినదంటే "మాక్స్‌ముల్లర్" ,కీత్ పండితుడు మొదలగు పాశ్చాత్యులందరు సాయనాచార్యుని భాష్యము అనుసరించియే ఆంగ్లములోనికి,ఇతర విదేశీబాషలలోనికి వేదాలను అనువదించారు.ఇతను రాజనీతికోవిదుడు.ఇతను కంపరాజుకు, బుక్కరాయ, హరిహరరాయలకు మంత్రిగా వ్యవహరించారు.

సాయనాచార్యులు వేదాలకే కాక తైత్తిరీయ బ్రాహ్మణం,తైత్తిరీయ అరణ్యకం,ఐతరేయ బ్రాహ్మణం,ఐతరేయ అరణ్యకం,శతపథ బ్రాహ్మణం మొదలగు 13 పైన వ్యాఖ్యలు వ్రాశాడు.

Saturday, November 1, 2008

ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట


ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట భారతదేశంలోనే ఉంది.అంతేకాక నేటికీ అది చెక్కుచెదరకుండా ఉన్నదన్న విషయం అత్యంత ఆశ్చర్యకరం.కేవలం మరమ్మత్తులు మాత్రం చేశారు.నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ ఆనకట్ట నిదర్శనం.

ఈ ఆనకట్ట పేరు "కలనై".చోళరాజు "కరికాళ చోళుడు" కాలంలో క్రీ.శ 2వ శతాబ్దంలో నిర్మింపబడింది.తమిళనాడు లోని కావేరినది పై తంజావూరు పట్టణానికి 48 కి.మీ దూరంలో నిర్మింపబడి ఉంది.విచిత్రం ఏమిటంటే సిమెంట్ లాంటి ఏ అతుక్కోవడానికి ఉపయోగపడే (బైండింగ్ మెటీరియల్)దీని లో ఉపయోగించలేదు.
కావేరి నదీ జలాలను ఆనాటి నుండి నేటి దాకా నిరంతరాయంగా అనేక వేల ఎకరాలకు నీటిని అందిస్తూంది.
క్రీ.పూ 4వ శతాబ్దంలోనే గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద 'సుదర్శన జలాశయం' నిర్మింపబడింది.

Wednesday, October 29, 2008

మన తెలుగు బ్లాగుల వలన తెలుగు భాషకు ప్రయోజనం ఏమిటి?

మనం అందరము తెలుగులో బ్లాగులు వ్రాస్తున్నాము.ఎంతో కొంత ఐనా తెలుగు బాషకు ప్రయోజనం చేకూరుతున్నదని అనుకొంటున్నాము.గూగుల్ వారు,ఫైర్‌ఫాక్స్ వాళ్ళు తెలుగులో తమ సర్వీసులు అందిస్తున్నారు.బయటివారందరూ తెలుగు కు బాగానే ప్రాముఖ్యత ఇస్తున్నారు.కాని తీరా అసలు ప్రదేశమైన మన రాష్ట్రం వచ్చేటప్పటికి తెలుగు వాడకం ఎంతగా తగ్గిపోతోందో తెలుసు.

మనం మనవంతుగా దృష్టి పెట్టవలసిన నేను అనుకొంటున్న కొన్ని సంఘటనలను క్రింద తెలియజేసుకొంటున్నాను.

1.తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో వైభవం గా తెలుగు బాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.అందులో పాల్గొన్న మన ముఖ్యమంత్రి గారు తెలుగు కు ప్రాముఖ్యత ఇస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు.కాని అసలు జరిగింది ఏమిటి?ఆ ఉత్సవాలు ముగిసిన వారం లోపే ఆరవ తరగతి నుండి తెలుగును కేవలం ఒక పాఠ్య విషయంగా(సబ్జెక్ట్)గా మాత్రమే బోధించాలని మిగతా అంతా ఆంగ్ల మాధ్యమంలో నే ఉంచాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు.
యూరప్ దేశాలలో వారి విద్యావిధానం చూడండి.వారి విద్యావిధానంలో డిగ్రీ వరకు కూడా వారి మాతృభాషలోనే బోధన ఉంది.ఆంగ్లం కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే.కేవలం పిజి మాత్రమే ఆంగ్లమాధ్యమం లో బోధిస్తున్నారు.

2.ఇక రాష్ట్ర రోడ్డు రవాణా విషయానికి వస్తే ఇంకా అధ్వాన్నంగా పరిస్థితి ఉంది.స్థానికంగా మన రాష్ట్రం లోపల నడిపే బస్సుల విషయంలో మాత్రం తెలుగును అమలు చేస్తున్నారు.హైదరాబాదులో మహాత్మాగాంధీ బస్టాండులో వోల్వో(గరుడ) బస్సులు నిలిపే స్థలానికి ఎదురుగా విచారణా కేంద్రం వద్ద ఒక ఫలకం ఉంటుంది.అందులో మన ఆర్టీసి వాళ్ళు ఎంతో గొప్పగా "తెలుగు కనపడాలి","తెలుగు వినపడాలి""తెలుగు కన్నతల్లి లాంటిది" మొదలగు నినాదాలు వ్రాసిఉన్నారు.కాని ఆచరణలో వాళ్ళు చూపిస్తున్నది ఏమిటి? మన రాష్ట్రం నుండి బయలుదేరే అన్ని అంతరరాష్ట్ర బస్సుల పైనా పూర్తిగా తెలుగు తీసివేసి అంతా ఆంగ్లమయం చేసారు.ఇక గరుడ వోల్వో బస్సుల విషయంలో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది.రాష్ట్రంలోపల తిరిగే బస్సులను కూడా అంతా ఆంగ్లం తో నింపివేసారు.అంతర రాష్ట్ర బస్సుల విషయంలో అంతా తెలుగులోనే వ్రాయాలని అనడం లేదు.ఆంగ్లంతో పాటు తెలుగు కూడా వ్రాస్తేనే కదా,తెలుగు కనపడితేనే కదా మన బాషపై మనకు గల అభిమానం కనీసమైనా ఇతర రాష్ట్రాలవారికి తెలిసేది.కర్ణాటక వారి విషయానికి వస్తే వారి అంతర రాష్ట్ర బస్సులపై కన్నడ,తెలుగు, వోల్వో బస్సులపై కన్నడ,ఆంగ్లం,తెలుగు మరియు తమిళనాడు విషయానికి వస్తే వారి అన్ని అంతర రాష్ట్ర బస్సులపైనా తమిళం,ఆంగ్లంలలో వ్రాసి ఉంటుంది.ఆ విధంగా వారు తమ భాష ను ఇతర రాష్ట్రాలవారికి తెలిసేలా చేస్తున్నారు.తమ భాషా సంస్కృతిని ఇతర రాష్ట్రాలవారు తెలుసుకొనేలా చేస్తున్నారు.ఆంగ్లాన్ని వద్దనకుండానే తమ బాషా సంస్కృతిని కాపాడుకుంటున్నారు.కాని మన విషయం ఏమిటి?ఇంత మాత్రం జ్ఞానం కూడా మన ప్రభుత్వానికి లేదా?

3.ఇక హైదరాబాదు చూసిన వారందరికీ ఒక విషయం తెలుసు.ఒక రాష్ట్ర రాజధానికి ఉండవలసిన లక్షణాలు అన్నీ దానికి ఉన్నప్పటికీ అసలు లక్షణమైన బాషా సంస్కృతి లక్షణం అన్నది లేదు అని.హైదరాబాదులో తిరుగుతుంటే ఒక విదేశ నగరంలో తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు అనిపించదు.ఏ దుకాణం పై చూసినా పేరు సూచికలు పూర్తిగా ఆంగ్లంలోనే ఉంటాయి.ఇదే కర్ణాటక,తమిళనాడు విషయానికి వస్తే దుకాణాలపైన ఆంగ్లంతో పాటు ఆయా భాషలు కూడా తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది.ఎవరైనా అమలు చేయకపోతే ఆ దుకాణాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.

ఇతర బాషలను మనం ద్వేషించనవసరం లేదు.కాని మన మాతృబాషను మనం మరిచిపోతున్నాము.

మన బ్లాగర్లు ఈ విషయాలపైన ఏమీ చేయలేమా? మనం ఏ విధమైన కార్యాచరణ పథకం చేయలేమా? ఆలోచించండి. సంఘటనలు ఇంకా ముదిరిపోకముందే మనము సంస్థాగతంగా ఏదైనా చేయకతప్పదు.ఇలా ఏమీచేయలేనినాడు మనం మన బ్లాగుల ద్వారా ఒకరికి తెలిసిన సమాచారం మరొకరికి ఇచ్చిపుచ్చుకోవడం,అభిప్రాయాలు పంచుకోవడం మాత్రమే చేయగలము.ఇవి మాత్రమే ఉద్దేశ్యంగా గలవారికి ఏమీ చెప్పడం లేదు.తెలుగు బాషను బ్రతికించుకందామనుకొనే వారికి,కాపాడుకొందాము అనుకొనేవారికి నా ఈ అభ్యర్థన.ఇప్పటికిప్పుడు తెలుగుబాషకు ఏమీ ప్రమాదం లేదని అనుకోవచ్చు.కాని సమస్యా పరిష్కారానికి నడుము బిగించాల్సిన తరుణం ఇదే అని నా ప్రగాఢవిశ్వాసం.

మన బ్లాగుల ప్రధాన ఉద్దేశ్యం తెలుగు భాషా పునర్వైభవమే కాబట్టి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.
పైన పేర్కొన్నవి కేవలం కొన్ని సమస్యలు మాత్రమే.ఇంకా చాలా ఉన్నాయి.కాని పైన పేర్కొన్నవి తక్షణసమస్యలు అని అనుకొంటున్నాను.
బ్లాగుల ద్వారా ఎలానూ తెలుగుభాషకు సేవ చేసుకొంటున్నాము.ఇకనైనా మనము కార్యాచరణకు నడుము బిగించాలి అనుకొంటున్నాను.అందుకుతగ్గ కార్యాచరణను ఆలోచించండి.

Sunday, October 26, 2008

గణపతి ఆవిర్భావానికి సంబంధించిన కథలు

గణపతి కి సంబంధించిన కథలను చూస్తే మనకు ఆసక్తి కలుగుతుంది.అవేమిటో చూద్దాం.
1.దేవతలు తమ పనులకు కలుగు ఆటంకాలను తొలగించి వాటిని విజయవంతం చేసే ఒక దేవత కావాల్ని శివుడిని వేడుకొన్నప్పుడు ఆయనే స్వయంగా పార్వతీదేవి గర్భంలో వినాయకుడిగా జన్మించాడు.
2.ఒకసారి పార్వతీదేవి తను వంటికి రాసుకున్న లేపనంతో ఏనుగు తల గల ఒక బాలుడి బొమ్మను తయారు చేసి గంగానదిలో విసిరివేసింది.మరుక్షణమే అది సజీవమైంది.గంగాదేవి,పార్వతి ఇద్దరూ ఆ బాలుడిని తమ బిడ్దగానే పిలిచారు.దీనివలన ఆ బాలుడికి ద్వైమాతురుడు అనగా ఇద్దరు తల్లులు గలవాడు అనే పేరు వచ్చింది.
3.పార్వతీ దేవి నలుగుపిండి తో బాలుడిని తయారుచేయడం,అతన్ని పార్వతి కాపలాగా ఉంచుకోవడం,అతడు శివుడిని అడ్డగించడం,శివుడు కోపంతో అతని తలను నరికివేయడం,పార్వతి దుఃఖించడం,ఏనుగు తలను అతికించి ప్రాణం పోసి గణనాయకుడిని చేయడం ఇది అందరికీ తెలిసిన కథ.
4.గణపతి శివుని ముఖకవలికళనుండి ఉద్భవించాడు.అందరినీ మోహింపచేస్తున్న ఆ రూపం పట్ల పార్వతీ దేవి కోపంతో శపించడం వలన వికారరూపం ఏర్పడింది.
5.గణేశుడు మొదట మానవరూపంలోని కృష్ణుడే.అపకారబుద్దితో శనిగ్రహం ఒకసారి అతన్ని చూడడంతో అతడి తల తెగి కృష్ణుడి లోకమైన గోలోకంలో పడింది.తర్వాత ఏనుగుతలను ఆ బాలుడికి అతికించారు.

Saturday, October 18, 2008

ద్వాదశ జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తిపీఠాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు:

1.శ్రీ భీమశంకరేశ్వరుడు : భీమశంకర్

2.శ్రీ త్రయంబకేశ్వరుడు : త్రయంబకేశ్వరం,మహారాష్ట్ర

3.శ్రీ కేదారేశ్వరుడు : కేదార్‌నాథ్,హిమాలయాలు

4.శ్రీ విశ్వేశ్వరుడు : వారణాశి,ఉత్తరప్రదేశ్

5.శ్రీ రామలింగేశ్వరుడు : రామేశ్వరం,తమిళనాడు

6.శ్రీ మల్లిఖార్జునుడు : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

7.శ్రీ మహాకాళేశ్వరుడు : ఉజ్జయిని,మధ్యప్రదేశ్

8.శ్రీ ఓంకారేశ్వరుడు : ఓంకారేశ్వర్,మధ్యప్రదేశ్

9.శ్రీ సోమనాధేశ్వరుడు : సోమనాథ్,గుజరాత్

10.శ్రీ నాగేశ్వరుడు : దారుకావనం,గుజరాత్

11.శ్రీ వైద్యనాథేశ్వరుడు : వైద్యనాథ్,బీహార్

12.శ్రీ ఘశ్మేశ్వరుడు :ఎల్లోరాగుహ,మహారాష్ట్ర

అష్టాదశ శక్తిపీఠాలు:

1.శ్రీ సరస్వతీ దేవి : జమ్మూకాశ్మీర్

2.శ్రీ విశాలాక్షీ దేవి : వారణాశి,ఉత్తరప్రదేశ్

3.శ్రీ కామాక్షీదేవి : కంచి,తమిళనాడు

4.శ్రీ గిరిజాదేవి : ఓడ్గాపురి,కటక్,ఒరిస్సా

5.శ్రీ భమరాంబా దేవి : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

6.శ్రీ వైష్ణవీ దేవి : కాంగడా,హిమాచల్‌ప్రదేశ్

7.శ్రీ పురుహూతికా దేవి : పిఠాపురం,ఆంధ్రప్రదేశ్

8.శ్రీ శృంఖలా దేవి : ప్రద్యుమ్నం,బెంగాల్

9.శ్రీ మాధవేశ్వరీ దేవి : ప్రయాగ,ఉత్తరప్రదేశ్

10.శ్రీ మహాలక్ష్మీ దేవి : కొళ్హాపురం,మహారాష్ట్ర

11.శ్రీ ఏకవీరాదేవి : మహూర్యం,నాందేడ్,మహారాష్ట్ర

12.శ్రీ కామరూపిణీ దేవి : గౌహతి,అస్సాం

13.శ్రీ చాముండేశ్వరీ దేవి : మైసూరు,కర్ణాటక

14.శ్రీ మహాకాళీ దేవి: ఉజ్జయిని,మహారాష్ట్ర

15.శ్రీ మాంగల్య గౌరీదేవి : గయ,బీహార్

16.శ్రీ జోగులాంబా దేవి : ఆలంపురం,కర్నూలు

17.శ్రీ మాణిక్యాంబా దేవి : ద్రాక్షారామం,ఆంధ్రప్రదేశ్

18.శ్రీ శంకరీ దేవి : ట్రింకోమలి,శ్రీలంక.

Wednesday, October 15, 2008

ఒక జోకు

ఓ సారి జేమ్స్‌బాండ్,తెలుగువాడు కలిసి ప్రయాణిస్తున్నారు.తెలుగువాడు అడిగాడు "మీ పేరేమిటి?"
"బాండ్.....జేమ్స్‌బాండ్" అన్నాడు జేమ్స్‌బాండ్.
'నీ పేరు ' అని అడిగాడు.
'సాయి......వెంకట సాయి......శివ వెంకట సాయి.........లక్ష్మినారాయణ శివ వెంకట సాయి......శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి............రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి......సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస లక్ష్మినారాయణ శివ వెంకట సాయి..........అల్లంరాజు సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి............"
జేమ్స్‌బాండ్ మూర్చపోయాడు.

Tuesday, October 14, 2008

భాషతో ప్రయోగాలు - విచిత్రాలు- సరదాలు

enemy the= ఎనిమిది
way to=వేటు
సీ రియల్= చూడు నిజం
ఏమిటీ=ఏ కంపెనీ టీ
P.D.కిలి= పిడికిలి
P.C.నారి=పిసినారి
Six master=ఆరుగురు
ఫోర్మెన్=నలుగురు మగవారు
ఫోర్జరీ=నాలుగు జరీ(చీరలు)
though Say=దోసె
chest air=ఎదగాలి
100 ద్దీన్=నూరుద్దీన్
Earth Milk=నేలపాలు
సిగ్నేచర్=సిగ్గు పడే ప్రకృతి
వెన్నెల=WHEN నెల(ఎప్పుడు నెల)
వేలు= Way లు(దారులు)
Slow come=శ్లోకం
Low come=లోకం

Tuesday, October 7, 2008

త్యాగరాజ కీర్తన ( భావము )

ఎంత నేర్చిన ఎంత జూచినఎంత వారలైన కాంత దాసులే

సంతతంబు శ్రీకాంత స్వాంతసిద్ధాంతమైన మార్గ చింత లేనివా(రెంత)

పర హింస పర భామాన్య ధనపర మానవాపవాదపర జీవనాదులకనృతమేభాషించెదరయ్య త్యాగరాజ నుత (ఎంత)

భావము:

ఈ కీర్తన త్యాగరాజు గారి ఆవేదన ను మనకు తెల్పుతుంది.మనుషులు ఎంత నేర్చుకున్నా,ఎంత జ్ఞానము సంపాదించినా,ఎన్ని అనుభవాలు పొందినా కాంతకు అనగా కామానికి దాసులు గానే ఉన్నారు.ఇచ్చట కాంత అనగా స్త్రీని ఉద్దేశించి చెప్పినది కాదు కామాన్ని ఉద్దేశించి చెప్పినది.మనకు కామం యొక్క శక్తి తెలిసినదే.ఇది అగ్నిలాగా ఎంత అనుభవించినా ఇంకా దహించాలనుకొంటుంది అనగా అనుభవించాలనుకొంటుంది.


స్వాంతన(శాంతి లేక ఉపశమనం) కలిగించు ఆ శ్రీకాంతుని(శ్రీ మహా విష్ణువు)పైన భక్తి లేని ఎంత నేర్చుకున్నా,ఎంత జ్ఞానము సంపాదించినా అనగా కామానికి దాసులు గానే ఉంటారు.

ఓ త్యాగరాజు చే భజింపబడే రామా,ఈ మానవులు ఇతరుల ధనానికై,ఇతర స్త్రీలను ఆశించి ఇతరులను హింసించడానికైనా వెనుకాడక తమ మానాలను అనగా శీలాన్ని పోగొట్టుకుంటారు.అపవాదులను కొనితెచ్చుకుంటారు.పరులపై అధారపడి జీవించడానికి అబద్దాలు చెప్పుతుంటారు.

Monday, October 6, 2008

యుగం బట్టి ధర్మం - కాలం బట్టి ఉద్యోగం

కాలం బట్టి యువత ఎక్కువగా కోరుకొనే ఉద్యోగాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1900 సంవత్సర సమయాలలో : లాయరు(న్యాయవాది)
1920 నుండి 1947 వరకు : స్వతంత్రయోధులు
1947 నుండి 1990 ల వరకు : ప్రభుత్వ ఉద్యోగాలు
1990 నుండి 2000 ల వరకు : ఉపాధ్యాయ ఉద్యోగాలు
2000 నుండి ఇప్పడు కూడా : సాప్ట్‌వేర్ ఉద్యోగాలు
తర్వాతో.............

Thursday, October 2, 2008

లాల్‌బహదూర్ శాస్త్రి గారిని మరిచిపోయామే

నేడు మన అత్యంత నిష్పక్షపాత ప్రధాని ఐన లాల్‌బహదూర్ శాస్త్రి గారి జన్మదినమని ఎంతమందికి గుర్తుంది?మనమెంత కృతఘ్నులం?
ఐనా నేడు మహాత్మాగాంధీ జన్మదినమని కొంతమందికి గుర్తులేదు.
ప్రియతమ నాయకులారా జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
కానీ క్షమించండి.మీరు చూపిన బాటలో మేము ఎంత మాత్రమూ నడవడంలేదు.ఎప్పుడూ మేము ఎలా బ్రతకాలనే.ప్రక్కవారిని పట్టించుకోకుండా మేము మా స్వార్థాన్నే చూసుకుంటున్నాము.క్షమించండి.మీ బాటలోనే మేము నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.

Wednesday, October 1, 2008

త్యాగరాజ కీర్తన వినండి

క్రింది కీర్తన వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బాల! కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
శ్రీ రమాలోల! విధృత శరజాల!

శుభద కరుణాలవాల!ఘననీల నవ్యవనమాలికాభరణ!ఏల నీ దయ రాదు!!
పరాకు జేసేవేల సమయము గాదు!!

రారా!! దేవాది దేవ!!రారా!! మహానుభావ!!(2)
రారా!! రాజీవ నేత్ర! రఘువర పుత్ర!
సారతర సుధాపూర! హృదయ పరివార! జలధి గంభీర దనుజ సంహార!
దశరధ కుమార! బుధ జన విహార! సకల శ్రుతిసార! నాదుపై (ఏల)

రాజాధిరాజ ముని పూజిత పాద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య రాజ ధర నుత విరాజ తురగ సుర రాజ
వందిత పదాజ జనక దిన రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ (ఏల)

యాగ రక్షణ పరమ భాగవతార్చిత యోగీంద్ర సుహృద్ భావితాద్యంత రహిత నాగ శయన వర నాగ వరద పున్నాగ సుమ ధర సదాఘ మోచన సదా గతిజ ధృత పదాగమాంత చర రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత (ఏల)

Tuesday, September 30, 2008

మహనీయుల జీవితాలలో మధుర(హాస్య)ఘట్టాలు-(స్వామి వివేకానంద)

స్వామి వివేకానంద జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ శ్రేణిని ఆరంభిస్తున్నాను.

ఒకసారి రామకృష్ణమఠంలో ఒక సన్యాస సాధువు దిగాలుగా కూర్చుని ఉన్నాడు.వివేకానందులు కారణం ఏమిటని అడిగారు.అప్పుడు ఆ సాధువు "స్వామీజీ! కూరగాయలు,ఆకుకూరలు తరగడానికి ఒకే చాకు ఉంది.నేడు కూరలు తరుగుతుంటే ఆ చాకు విరిగిపోయింది "అన్నాడు.అప్పుడు వెంటనే వివేకానందులు దిగులు నటిస్తూ " నిజం చెప్పాలంటే ఈ చాకులు ఎంతో అదృష్టం గలవి.ఎందుకంటే వీటి ఆయుష్షు ఈ విధంగా ఒకేసారి తీరుతుంది.అదే మనుషులకైతే ఎన్నో రోగాలు,వ్యాధులూ" అని అన్నాడు.ఈ వ్యాఖ్యానం విని ఆ సాధువు పగలబడి నవ్వాడు.

ఇంకో సంఘటన.

స్వామివివేకానందుల తోటి స్వామి ఒకరికి వీరి మాటంటే ఇక తిరుగులేదు.ఒకసారి అందరూ భోంచేస్తుండగా వివేకానందులు ఉన్నట్టుండి తన తోటి స్వామితో " మీకు ఈ విషయం తెలుసా? ఈ సారి "గుడ్‌ఫ్రైడే" ఆదివారం వస్తోంది తెలుసా" అన్నాడు.అప్పుడు తోటి స్వామి అమాయకంగా "అవునా? ఇందులో విశేషం ఏముంది స్వామీజీ" అన్నాడు.మిగతా భోంచేస్తున్నవారు స్వామీజీ మాటలలోని అర్థం,హాస్యం గమనించి విరగబడి నవ్వారు.ఎందుకు నవ్వుతున్నారో తెలియని ఆ తోటి స్వామికి ఏమీ అర్థం కాలేదు.

ఇంకో సంఘటన.

స్వామీజీ రెండవసారి అమెరికా పర్యటనకు వెళ్ళిన తర్వాత అతను తిరిగి భారతదేశానికి వచ్చు సమాచారం మఠంలోని వారెవరికీ తెలియదు.ఒకరోజు వివేకానందులు ఏ విధమైన సమాచారం లేకుండా అమెరికా నుండి ఈజిప్ట్ ద్వారా బొంబాయికి ఓడలో వచ్చాడు.అక్కడి నుండి కలకత్తాకు రైలులో వచ్చాడు.స్వామీ వివేకానందులు అప్పుడు బ్రిటిష్ దుస్తులు ధరించి ఉన్నాడు.కలకత్తాలోని మఠం దగ్గరికి వెళ్ళి గోడ దూకి లోనికి వెళ్ళాడు.అప్పుడు మఠం లోని స్వాములు భోజనం చేయు సమయం.దూరం నుండి బ్రిటిష్ దుస్తులలో ఉన్న వివేకానందులను వారు గుర్తించలేక భయపడి స్వామి వివేకానందుల వద్దకు కర్రలతో పరుగెత్తుకొచ్చారు.దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తించి సంతోషం పట్టలేకపోయి మఠం అంతా చాటింపు వేశారు.తోటి స్వాములతో వివేకానందులు " మళ్ళీ ఆలస్యం ఐతే భోజనపదార్థాలు అయిపోతాయని గోడ దూకి వచ్చాను"అని అన్నాడు.అంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం అలసట లేక హాస్యాన్ని పండించడం చూసి ఆ స్వాములు ఆనందించారు.

Monday, September 29, 2008

ఐన్‌స్టీన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము


ఈ భాగంలో ఐన్‌స్టీన్ యొక్క ప్రత్యేక సాపేక్ష సిద్దాంతాన్ని తెలుసుకొందాము.తెలుసుకొనేముందు దీని ఆవిష్కరణకు పూర్వం జరిగిన సంఘటనలను గమనిద్దాం.1801 వ సంవత్సరం లో థామస్ యంగ్ అనే శాస్తవేత్త కాంతికి తరంగధర్మం ఉంటుందని కనుగొన్నాడు.ఐతే కాంతి ప్రసారానికి యానకం ఏమిటన్న ప్రశ్నకు ఈథర్ అని అనుకొన్నారు.ఈ ఈథర్ కు అనుగుణంగా కాంతి ప్రసారం అయ్యే వేగానికి,ఇదే ఈథర్ కు వ్యతిరేకంగా కాంతి ప్రసారం అయ్యే వేగం తక్కువ ఉంటుందని అనుకొన్నారు.కాని అల్బర్ట్ మైఖేల్‌సన్ మరియు ఎడ్వర్డ్ మోర్లే అను శాస్త్రవేత్తలు కాంతివేగం ఏ దిశలోనైనా ఒక్కటే అని ఆవిష్కరించారు.

ఐన్‌స్టీన్ ఆవిష్కరణ:పై ఆవిష్కరణ వలన ఐన్‌స్టీన్ ఈథర్ అన్నదేదీ లేదని కాంతివేగం పరిశిలకుడి వేగంతో సంబంధం లేకుండా కాంతివేగం అన్నిదిశలలోనూ ఒక్కటే అని మరియు కాలం,స్థలము అన్నవి సాపేక్షము అన్న నిర్ణయానికి వచ్చాడు.ఇదే ప్రత్యేక సాపేక్ష సిద్దాంత ఆవిష్కరణ.

ఈ విషయం అర్థం కావడానికి క్రింది ఉదాహరణ చూడండి.

A,B అనే ఇద్దరు ప్రయాణికులు రెండు అంతరిక్షనౌకలలో ఒకరికొకరు వ్యతిరేక దిశలలో కాంతివేగంలో ముప్పావువంతు(3/4)వేగంతో ప్రయాణిస్తున్నారని అనుకోండి.సులభంగా అర్థం కావడానికి పటాలు చూడండి.వారి నౌకలలో ఒక కాంతిజనకము,ఒక తెర ఉన్నాయనుకోండి.వాటి మధ్య దూరం 40మీటర్లు అనుకొందాం.ఇప్పుడు A దృష్ట్యా కాంతిజనకం నుండి కాంతి బయలుదేరి తెరను చేరడానికి 0.13 మైక్రోసెకను పడుతుంది(కాంతివేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు కాబట్టి 40 మీటర్లు ప్రయాణించడానికి 0.13 మైక్రోసెకన్ పడుతుంది. 40/300000=0.13మైక్రో).అలాగే B దృష్ట్యా కూడా.
కాని A దృష్ట్యా B నౌకలోని కాంతి జనకం నుండి కాంతి B లోని తెరను చేరేలోపు B నౌక A వైపుగా 30 మీటర్లదూరం ప్రయాణిస్తుంది.పైథాగరస్ సిద్దాంతం ప్రకారం(పటం చూడండి) B నౌకలో కాంతి ప్రయాణించినదూరం 50 మీటర్లు.కాంతివేగం అన్ని పరిశీలనల ప్రకారం ఒకటే కాబట్టి A లోని వ్యక్తి B లో కాంతి ప్రయాణానికి పట్టినకాలం 0.17మైక్రోసెకను గా గుర్తిస్తాడు(50/300000=0.17 మైక్రో).కానీ B నౌకలోని వ్యక్తి ప్రకారం కాంతి 40 మీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది కాబట్టి అతని ప్రకారం ఈ సమయం 0.13మైక్రోసెకన్ మాత్రమే.అలాగే A నౌకలో కూడా కాంతి ప్రసారానికి 0.17మైక్రోసెకను గా B లోని వ్యక్తి గుర్తిస్తాడు.అంటే ఒకరి దృష్ట్యా మరొకరి కాలం 0.04 సెకను తొందరగా నడుస్తోంది.దీనినే Time Dilation అంటారు.ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం ప్రకారం A,B ఇద్దరూ కొలిచే సమయమూ సరైనదే.ఐన్‌స్టీన్ మరియు పై పరిశీలన ప్రకారం A ప్రకారం T కాలం గడిస్తే B ప్రకారం గడిచిన సమయం T*(1-Vవర్గము/C వర్గము)యొక్క వర్గమూలము.ఇక్కడ v అనేది ఒకరిదృష్ట్యా మరొకరి వేగము,C అనేది కాంతివేగము.
కానీ ఈ Time dilation తో సమస్య ఏమంటే ఇద్దరు పరిశీలకులు రెండు సంఘటనల మధ్య దూరం విషయంగా ఏకాభిప్రాయానికి వచ్చినా ఆ సంఘటనల మధ్య ఎంత సమయం జరిగింది మరియు ఆ సంఘటనలు ఎంత వేగంతో జరిగాయి అన్న విషయం పట్ల ఒకే అభిప్రాయానికి రాలేరు.
ఈ సిద్దాంతం ప్రకారం వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క పొడవు దాన్ని చుస్తున్న వ్యక్తికి తక్కువగా కనిపిస్తుంది.అంటే కుచించుకుపోయినట్లు కనిపిస్తుంది.ఉదాహరణకు నేను మన భూమికి సమీపనక్షత్రం వద్దకు ప్రయాణిస్తున్నాని అనుకోండి.అప్పుడు నాకు,నక్షత్రానికి మధ్య దూరం నేను కొలిచినదానికన్నా భూమిపై నుండి చూస్తున్న మీరు కొలిచేదూరం ఎక్కువగా ఉంటుంది.అంటే దూరాన్ని నేను గనుక 1000 కిలోమీటర్లుగా కొలిస్తే మీరు 1000 కన్నా ఎక్కువగా కొలుస్తారు.దీన్నే length contradiction అంటారు.అమితవేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తి యొక్క ద్రవ్యరాశి అతన్ని చూస్తున్న మరొకరి దృష్ట్యా వేగం పెరిగేకొద్దీ ద్రవ్యరాశి కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.కాని ప్రయాణిస్తున్న వ్యక్తి దృష్ట్యా తన ద్రవ్యరాశి మారదు.ఈ సిద్ధాంతం ప్రకారం ఇద్దరూ సరైనవారే.

ఈ సిద్ధాంతం అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు అవసరము.వీటిని మరోసారి తెలుసుకొందాము.

Friday, September 26, 2008

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతం - 2


ఈ భాగం లో స్థలం వంగి ఉన్నదనే ఐన్‌స్టీన్ యొక్క అద్భుత ఆవిష్కరణ గురించి తెలుసుకొందాము. మనకు సాధారణంగా సూర్యుని వెనుక భాగాన గల నక్షత్రాలు కనపడవు.ఎందుకంటే సూర్యరశ్మి యొక్క ప్రభావం చేత.కానీ సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో వీటిని గమనించవచ్చు.ఐన్‌స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్దాంతంలో సూర్యుని వెనుకవైపు గల ఈ నక్షత్రాల కాంతి సూర్యుని వలన ఏర్పడిన స్థలకాలపు వంపు వలన సూర్యుని వద్ద వంగి ప్రయాణిస్తుందని ఆ వంపు ఎంతమేరకు ఉంటుందనే కోణం చెప్పాడు.దీనివలన ఆ నక్షత్రం యొక్క స్థానాన్ని మనం తప్పుగా చూస్తాము.ప్రక్క పటం గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.ఈ సిద్దాంతం లో ప్రస్తావించిన ఈ వంపు కోణాన్ని 1919 లో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఇద్దరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు కొలిచారు.అత్యద్భుతంగా ఐన్‌స్టీన్ చెప్పిన కోణానికి ఈ విలువ చాలా దగ్గరగా ఉంది.ఈ విధంగా స్థలకాలం వంగిఉందనే విషయం ఋజువైంది.

ఐన్‌స్టీన్ మాటల్లో సాధారణ సాపేక్షసిద్దాంతం
"ఒక్క మాటలో చెప్పాలంటే కాలము,స్థలము మరియు గురుత్వాకర్షణ మూడూ అస్వతంత్రాలు.ఇవి మూల పదార్థం కంటే వేరు కాదు."

సాధారణ సాపేక్ష సిద్దాంతం క్రింది సందర్బాలలో ఋజువైంది.
1.మెర్క్యురీ గ్రహం యొక్క చలనం (1915)
2.సూర్యుని వద్ద నక్షత్ర కాంతి వంగి ప్రయాణించడం (1919)
3.తెల్లని మరుగుజ్జు నక్షత్రాల వర్ణపటంలో ఎరుపు మొగ్గు (1924)
4.భూమి గురుత్వాకర్షణ క్షేత్రంలో గామా కిరణాల ఎరుపు మొగ్గు (1960)
5.శుక్ర,మెర్క్యురీ గ్రహాల పై రాడార్ సంకేతాల మధ్య సమయంలో తేడా కనుగొనడం(1968)
6.భూమి గురుత్వాకర్షణ వలన సమయాలలో ఎంత తేడా వస్తుంది అనే విషయం భూమిపై,అంతరిక్షంలో పరమాణు గడియారాల సహాయంతో కనుగొన్నారు.(1976)
7.మనకు,దూరంగా ఉన్న నక్షత్రాల మధ్య ఏవైనా బరువైన పదార్థాలు ఉన్నప్పుడు ఆ నక్షత్రాల గురుత్వబలాలు,కనిపించడం.(1980)
8.గురుత్వాకర్షణ తరంగాలు వెలువరిచే రేడియేషన్ వలన సక్తి నష్టం కలుగుతుందనే ఐన్‌స్టీన్ అంచనా ను జంట న్యూట్రాన్ నక్షత్రాల కక్ష్యలు వాటి మార్గం పరిశీలించడం వలన కనుగొన్నారు.(1982)

ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతం వలనే కాలం లో ప్రయాణించవచ్చనే ఊహ బయలుదేరింది.దీనికి సంభందించిన విశేషాలను ఇంకోసారి తెలుసుకొందాము.

Thursday, September 25, 2008

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతం - 1





మనకు తెలుసు ఐన్‌స్టీన్ ప్రపంచప్రఖ్యాతి పొందినది తను కనుగొన్న సాపేక్షసిద్దాంతాల వలన.ఇవి ప్రత్యేక,సాధారణ సాపేక్షసిద్దాంతాలని రెండు రకాలు.ఈ భాగంలో మనం సాధారణ సాపేక్ష సిద్దాంతం గురించి చూద్దాం.ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని ఐన్‌స్టీన్ 1915 వ సంవత్సరం లో ప్రతిపాదించాడు.(ఈ విషయంపై 1907 నుండి 1915 వరకు పరిశోధనలు చేసాడు).తర్వాతి
భాగాలలో ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం వివరాలు తెలుసుకొందాము.

మొదట సాపేక్షం అంటే ఏమిటో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకొందాము.మనం ఒక వస్తువు పొడుగ్గా ఉన్నది అంటున్నామంటే దాన్ని మనం దాని పొడవు కన్నా తక్కువ పొడవు ఉన్న వస్తువుతో పోల్చి పొడుగ్గా ఉన్నదని అంటాము.ఇలానే ఒకడు ఇంకకడికంటే వేగంగానో లేక ఆలస్యంగానో పరుగెడుతున్నాడని,ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ లేక తక్కువ మార్కులు తెచ్చుకుంటాడని చెప్తాము.అంటే ఒక వస్తువు లక్షణం దృష్ట్యా ఇంకో వస్తువు లక్షణం చెప్తున్నామన్న మాట.ఈ విధంగా మన దైనందిన జీవితంలో ప్రతివిషయాన్నీ ఇంకొక అదే లక్షణాలు గల
విషయంతో పోల్చి చూస్తుంటాము.దీన్నే "సాపేక్షము" లేక "సాపేక్షత" అంటారు.

ఇక అసలు విషయమైన సాధారణ సాపేక్ష సిద్దాంత విషయానికి వద్దాము.

ఈ సిద్దాంతము ప్రధానంగా గురుత్వాకర్షణ విషయాన్ని చర్చిస్తుంది.గురుత్వాకర్షణ విషయన్ని న్యూటన్ ప్రతిపాదించాడని మనకు తెలుసు.న్యూటన్ ప్రకారం సృష్టిలో ప్రతి వస్తువూ ఇంకొక వస్తువుని ఆకర్షిస్తోంది.ఏ రెండు వస్తువుల మధ్య ఆకర్షణశక్తి మొదట వాటి ద్రవ్యరాశి పై మరియు వాటి మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది.ద్రవ్యరాశులు పెరిగేకొద్దీ ఆకర్షణ పెరుగుతుంది.అలాగే దూరం పెరిగేకొద్దీ ఆకర్షణ తగ్గుతుంది.ఇలా సృష్టి మొత్తం ఈ నియమాలు పాటిస్తాయని న్యూటన్ కనుగొన్నాడు.ఇంతవరకు బాగానే ఉంది.కానీ అసలు అవి ఎందుకు ఆకర్షించుకొంటున్నాయో న్యూటన్ చెప్పలేదు.
సాధారణ సాపేక్షసిద్దాంతం ఈ విషయాన్ని గురించే చెబుతుంది.
మనకు తెలిసిన మూడు కొలతలు పొడవు,వెడల్పు,లోతు లతో పాటు ఐన్‌స్టీన్ నాల్గవ కొలత గా కాలాన్ని తీస్కొన్నాడు.ఈ నాలుగు కొలతలతోనే విశ్వమంతా ఉంటుంది.(మొత్తం 11 కొలతలు ఉంటాయని నేటి శాస్తవేత్తలు భావిస్తున్నారు.)ఈ నాలుగు కొలతలు గల ప్రదేశాన్నే "space time continuum" అంటారు.ఈ continuum లో ఏదైనా బరువైన వస్తువును పెట్టినప్పుడు ఆ వస్తువు పెట్టిన చోట ఒక గుంత లాగ ఏర్పడుతుంది.ఉదాహరణగా మనం దిండు(తలగడ) పైన ఏదైనా బరువైన వస్తువును ఉంచామనుకోండి.అక్కడ ఒక గుంత లాగ ఏర్పడినట్టు అన్నమాట.అర్థం కావడానికి ప్రక్క పటాలు చూడండి.ఆ గుంతకు సమీపంలోని వస్తువులు,పరిధిలోని వస్తువులు ఆ గుంతలోనికి దొర్లినప్పుడు మనకు ఆ దొర్లుతున్న వస్తువులు ఆ పెద్ద వస్తువుచేత ఆకర్షింపబడుతున్నట్టు కనబడతాయి.దీనినే ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతము అంటారు.ఎంతగా ఆ వస్తువులు దొర్లుతాయి అనే విషయం న్యూటన్ చెప్పిన సిద్దాంతం ద్వారా కనుగొనవచ్చు.

ఇది అర్థం కావడానికి సైన్సు లో ఒక ప్రసిద్ద ఉదాహరణను చెబుతారు.అది ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయాడనుకోండి.న్యూటన్ ప్రకారం ఆ విషయం వెంటనే భూమికి తెలిసిపోయి తన కక్ష్య నుండి తప్పి సరళరేఖామార్గంలో విశ్వంలోనికి వెళ్ళిపోతుంది.కాని నిజానికి అలా జరుగదు.ఎందుకంటే ఈ విశ్వంలో కాంతి కన్నా వేగంగా ఏ వస్తువూ,శక్తీ ప్రయాణించదని మనకు తెలిసిన సిద్దాంతాల ద్వారా తెలుస్తోంది.మనకు తెలుసు సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాలు తీసుకుంటాయని.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి చేరడానికి 8 నిమిషాల పైనే పడుతుంది.అప్పుడే భూమి తన కక్ష్య నుండి ప్రక్కకు తప్పుకుంటుంది.ఐన్‌స్టీన్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ సూర్యుడు మాయమైనందున space time continuum లో ఏర్పడిన గుంత మామూలు స్థాయికి వస్తుంది.ఇలా గురుత్వాకర్షణ తరంగాలు కాంతి వేగంతో వ్యాపించి ఆ continuum అంతా
బల్లపరుపుగా అవుతుంది.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి 8 నిమిషాల తర్వాతే తెలుస్తుంది.

స్థలకాలం వంగి ఉందన్న అద్భుతవిషయము,దానికి ఋజువులు మొదలగు వివరాలు తర్వాత టపాలో తెలుసుకొందాము.

Tuesday, September 23, 2008

క్షీరసాగర మధన సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దేవ దానవులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం అనే విషయం మన అందరికీ తెలుసు.మొదట ఈ కథను క్లుప్తంగా చూద్దాం.
ఈ మథనానికి మంధర పర్వతాన్ని కవ్వంగా,వాసుకి అనే పామును తాడుగా ఉపయోగించారు.పర్వతం మునిగిపోకుండా మహావిష్ణువు తాబేలు అవతారం దాల్చి తనపైన మోశాడు.దేవతలు పాము తోకభాగాన్ని,రాక్షసులు తల భాగాన్ని పట్టుకొని చిలకడం ప్రారంభించారు.ఇలా చిలుకుతుండగా చంద్రుడు,ఐరావతము,లక్ష్మీదేవి,కల్పవృక్షము,కామధేనువు,మద్యము,హాలాహలము అనే భయంకర విషము లభించాయి.హాలాహలమును శివుడు త్రాగగా,లక్ష్మీదేవిని విష్ణువు స్వీకరించాడు.మిగిలినవాటిని దేవతలు,రాక్షసులు పంచుకొన్నారు.చివరికి అమృతం లభించింది.ఇదీ సంగ్రహంగా విషయం.

మన ప్రయత్నానికి ప్రతీక పాము. మనం ఏదైనా లక్ష్యం సాధించాలి అనుకొన్నప్పుడు మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.మన లక్ష్యసాధనకు ఉపయోగపడే పరిస్థితులూ,వెనక్కు లాగే పరిస్థితులూ రెండూ ఉంటాయి. రెండు పరిస్థితులే దేవతలకు,రాక్షసులకు ప్రతినిధులు.అనుకూల పరిస్థితులకన్నా ప్రతికూల పరిస్థితులే ప్రభావం చూపిస్తాయి.కార్యసాధన జరిగేటప్పుడు సాధన వలన ఏవైనా తక్షణ పరిణామాలు ఎదురైతే వాటిద్వారా మన ప్రతికూలపరిస్థితులు తగ్గాలి.పాము విషం కక్కినప్పుడు రాక్షసులు మరణించడం లాగా అన్నమాట.దీనినే రాక్షసులు పాము తలభాగాన ఉండడము,దేవతలు తోకభాగాన ఉండడానికి ప్రతీకలు. రెండు పరిస్థితులను ఉపయోగించుకుంటూనే మనం మన లక్ష్యసాధనకు ప్రయత్నించాలి.వెనక్కులాగే పరిస్థితులనుండి మనం పాఠాలు నేర్చుకుంటూ,అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగాలి.లక్ష్యము సాధించాలంటే దృఢమైన పట్టుదల కావాలి. పట్టుదలే పర్వతానికి ప్రతీక.మన పట్టుదల జారిపోకుండా ఉండడం కోసం మనము మన యుక్తాయుక్త జ్ఞానము ఉపయోగించాలి. జ్ఞానమే మన పట్టుదలను వీడిపోకుండా భారం వహించే తాబేలు.మన కార్యక్షేత్రమే(సమాజము)పాలసముద్రము. కార్యక్షేత్రములో మనం పనిచేస్తున్నప్పుడు చిన్నచిన్న సంతోషాలు అనుకోకుండా కలుగుతాయి.అలానే చిన్నచిన్న కష్టాలూ,పెద్ద అవరోధాలూ ఎదురవవచ్చు. సంతోషాలే పాలసముద్రము చిలకగా వచ్చిన చంద్రుడు,ఐరావతము,కల్పవృక్షము,లక్ష్మీదేవి వంటివాటికి ప్రతీకలు కాగా మద్యం లాంటివి చిన్న కష్టాలకు,ప్రలోభాలకు,హాలాహలం వంటి విషము పెద్ద అవరోధాలకు ప్రతినిధులు గా చెప్పుకోవచ్చు.
చిన్నచిన్న సంతోషాల దగ్గరే ఆగిపోకుండా,అలానే కష్టనష్టాలకు,అవరోధాలకు వెరవకుండా ప్రయత్నం కొనసాగించినప్పుడే లక్ష్యసాధన అనే అమృతం మనకు లభిస్తుంది.

ఇక ఆధ్యాత్మికం గా తీసుకుంటే దేవతలు,రాక్షసులు మంచి,చెడు గుణాలకు ప్రతీకలు.కవ్వమైన పామును సాధనతోనూ,పర్వతాన్ని బుద్ధితోనూ,తాబేలును వివేకంతోనూ,పాలసముద్రాన్ని మనసుతోనూ పోల్చవచ్చు.చిలకగా మొదట వచ్చిన వస్తువులు సిద్ధులకు,అతీతశక్తులకు ప్రతీకలు.హాలాహల విషం మన సాధనను తప్పించడానికి వచ్చే పెద్ద అవరోధముల లాంటిది.వీటి దగ్గరే ఆగిపోతే శాంతి లేక మోక్షమనే అమృతం లభించదు.

Monday, September 22, 2008

నా కృతజ్ఞతలు

దేవుని దయ వలన భగవద్గీత తెలుగు భావాన్ని అంతర్జాలంలో(Internet)లో ఉంచాలనే నా కోరిక తీరింది.భావాన్ని తెలుగులో టైపు చేస్తున్నప్పుడు కానీ,పోస్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎటువంటి సమస్యలు ఎదురుకానందుకు భగవంతునికి హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను.
అలాగే ఇది టైపు చేయడానికి తమ ల్యాప్‌టాపులు ఉపయోగించుకోనిచ్చిన నా మిత్రులు కొండయ్యకూ,సుమన్ కూ నన్ను ఎంతో ప్రోత్సహించిన ఉదయ్,తేజ,గిరి,గణేష్ కూ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

దేవుడు దయ తలిస్తే భగవద్గీత యొక్క అంతరార్థాలను కూడా ఒక బ్లాగులో పోస్ట్ చేయడానికి కృషి చేస్తాను.

సినిమా ఎలా తీస్తారు?(సైన్సు)

మనమందరూ సినిమాలు చూస్తాము.కానీ సినిమాలు ఏ విధంగా తీస్తారు,బొమ్మలు ఎలా కదులుతున్నాయి అనే విషయం ఇంకా కొందరికి తెలియదు.

సినిమా తీయడానికి మూలాధారము తీసే కెమెరా,తీసిన సినిమాను చూపించే ప్రొజెక్టరు.

కెమెరా:
మన అందరికీ తెలుసు ఫోటో కెమెరా ఎలా పని చేస్తుందనే విషయం.కెమెరా క్లిక్ చేసినప్పుడు కెమెరా కు ముందున్న కుంభాకారకటకం(lens) ద్వారా మన బింబం యొక్క కాంతికిరణాలు కటకం వెనుక భాగమున ఉన్న
ఫోటోగ్రాఫిక్ ఫిల్ము పై పడి అక్కడ మన ప్రతిబింబమును ఏర్పరుస్తాయి. ఆ ఫిల్ము పై రసాయనాలు పూసిఉండడం వలన ఇది జరుగుతుంది.తర్వాత మనమే తర్వాత ఫిల్ము వచ్చేలా తిప్పాలి లేక దానంతటదే( ఆటోమేటిక్ ఐతే) తరవాత ఫిల్ము వచ్చేలా తిరుగుతుంది.ఇది కదలని చిత్రాలకోసం ఐతే.

మన కన్ను సెకనుకి 16 దృశ్యాలకంటే ఎక్కువ ఉంటే గనుక ఆ దృశ్యాన్ని గుర్తించలేదు.సరిగా ఇదే విషయాన్ని సినిమా కెమెరా నిర్మాణ విషయంలో ఉపయోగిస్తారు.

మామూలు కెమెరా లో లాగానే ఫిల్మురీలు ఉంటుంది.కానీ సెకనుకి 16 లేక అంతకన్నా ఎక్కువ ఫిల్ములు మారుతుంటాయి.వాటిపై తీయబడే దృశ్యాల ప్రతిబింబాలు పడతాయి.ఫిల్ము లో ఒక భాగంగా ఒక వైపు ఒక
నల్లని గీత, శబ్దము సంగ్రహించడానికి ఉంటుంది.

నేటి కెమెరాలు సెకనుకి 24 ఫిల్ములపైన తిప్పుతుంటాయి.దానివలన చిత్రంలో స్పష్టత వస్తుంది.

ఇలా తయారుచేసిన రీలును నెగెటివ్ అంటారు(మామూలు కెమెరా లో లాగానే).తర్వాత దాన్ని కడిగి(develop)ఇంకా కావలసినన్ని ఫిల్మ్ లపైన ముద్రిస్తారు.వీటిని పాజిటివ్ లు అంటారు.

ప్రొజెక్టరు:
ఇలా తీసిన ఫిల్మ్ రీళ్ళను ప్రొజెక్టరులో ఉంచుతారు.
ఈ ప్రొజెక్టరు నిర్మాణం ఎలాగుంటుందంటే ముందు ఒక కుంభాకారకటకం ఉంటుంది.దాని వెనుక మరి కొన్ని కటకాలు ఉంటాయి.వీటన్నిటి వెనుక ఫిల్మ్ రీలు ఉంటుంది.ఈ రీలుని తిప్పి పెడతారు.ఎందుకంటే కటకాల గుండా ప్రయాణించి ఇది మామూలు దృశ్యం గా వస్తుంది.ఫిల్మ్ రీలు గుండా శక్తివంతమైన కాంతి ని పంపిస్తారు.

ఈ కాంతి రీలు గుండా ప్రసరించి తెర పైన బొమ్మలను ఏర్పరుస్తుంది.ఈ రీలు తీసినప్పుడు సెకనుకి ఎన్ని ఫ్రేములు తిరిగి ఉంటుందో అన్ని ఫ్రేములుగా ప్రొజెక్టరు లోని మోటరు తిప్పుతుంది.నల్ల గీతపై శబ్దగ్రహణ సాధనం
తగులుతూ అందులోని శబ్దాన్ని గ్రహించి బయటకు ఇస్తుంది.సెకనుకు 16 పైన(ఇప్పుడు 24) ఫ్రేములు తిరగడం వలన మన కళ్ళు కనబడే దృశ్యాలను కదులుతున్నట్టుగా చూస్తుంది.

ఈ ఆధునిక కాలంలో డిజిటల్ కెమెరాలు వచ్చాయి.ఉపగ్రహం ద్వారా కూడా సినిమాలు చూపిస్తున్నారు.

Sunday, September 21, 2008

భగవద్గీత శ్లోకం - దాని అంతరార్థం

యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్దరః
తత్ర శ్రీ ర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ " (18 వ అధ్యాయం,78 శ్లోకం)

సామాన్య అర్థం:
ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారి ఐన అర్జునుడు ఉంటారో అక్కడ ఐశ్వర్యము, విజయము చేకూరుతాయి.

అంతరార్థము:
ఎక్కడ మనుష్య ప్రయత్నము,దైవానుగ్రహము రెండూ కలుస్తాయో అక్కడ ఐశ్వర్యము, విజయము చేకూరుతాయి.

Saturday, September 20, 2008

భగవద్గీత శ్లోకం - ఒక అపార్థం

భగవద్గీత 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్యయోగం లోని 32 వ శ్లోకం గమనించండి.
"మాం హి పార్థ! వ్యపాయేపి స్యుః పాపయోనయః
స్త్రీయో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం!"
అర్థము:
నన్ను(శ్రీకృష్ణున్ని) ఆశ్రయంచినవారు పాపజాతి వారు కానీ,స్త్రీ లైనా కానీ,వైశ్య,శూద్రులైనా కానీ మోక్షం పొందుతారు.
కాని ఈ శ్లోకం చాలా అపార్థాలకు గురైంది.
కారణం దీన్ని " పాపజాతి వారైన స్త్రీలు,వైశ్యులు,శూద్రులు " అని అపార్థం చేసుకొన్నారు.
అంటే స్త్రీలు,వైశ్యులు,శూద్రులు పాపజాతివారని అపార్థం చేసుకొన్నారు.
కొందరు పండితుల అనుకోని అనువాదం వలన వచ్చిన చిక్కు ఇది.

ఆంగ్లంలో మనకు తెలిసిన వ్యాకరణ దోషం వలన అర్థం మారిన "Leave him not hang him" అనేది.
Leave him not,hang him అనగా అతడిని వదలద్దు,ఉరి తీయండి అని.
Leave him,not hang him అనగా వదలండి ,ఉరి తీయవద్దు అని.

చూసారా కేవలం కామా(,) స్థానం మార్పు వలన మారిన అర్థాలు.

క్రింది సుమతి పద్యం గమనించండి.

అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారుటేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!

అవసరానికి అప్పిచ్చువాడు. జబ్బు వస్తే చికిత్స చేసేందుకు వైద్యుడు, ఎప్పుడూ ఎండిపోకుండా ప్రవహించే ఏరు, శుభ, అశుభ కార్యాలు చేయించే బ్రాహ్మణుడు ఉండే ఊరిలో మాత్రమే నివసించండి. వీరు లేని ఊళ్లో ఎన్నటికీ
ఉండవద్దు.

ఇక్కడ బద్దెన (సుమతి శతకం వ్రాసినవాడు) ఉద్దేశ్యము ఇలా ఉంటే "అప్పిచ్చువాడు వైద్యుడు" అని మనవారు అపార్థం చేసుకొన్నారు.

Friday, September 19, 2008

కృష్ణబిలాలు లేక కాలబిలాలు(Blackholes) - వివరణ

ఈ మధ్య బిగ్‌బ్యాంగ్ ప్రయోగం అనగానే అందరినీ భయపెట్టినవి కృష్ణబిలాలు అనే విషయం.అసలు వీటి కథాకమామీషు ఏమిటి?

కృష్ణబిలం అనగా ఒక నక్షత్రం పూర్తిగా నశించగా ఏర్పడే అత్యంత చిన్న పదార్థము(ఆ నక్షత్రము మునుపటి రూపంతో పోల్చుకుంటే). ఈ బిలం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పడిన కాంతి కూడా బయటకు రాలేనంత గురుత్వాకర్షణశక్తి దీనికి ఉంటుంది.మనకు తెలుసు భూమి యొక్క ఆకర్షణశక్తిని దాటుకొని అంతరిక్షంలోనికి వెళ్ళాలంటే సెకనుకు సుమారుగా 11 కిలోమీటర్ల వేగంతో పైకి ప్రయాణించాలి.కాని కృష్ణబిలంలో ఈ వేగం కాంతివేగం కన్న ఎక్కువ ఉండాలి.ఈ వేగాన్ని ఇంతవరకు కనుక్కోలేదు.

కృష్ణబిలాలు ఎలా ఏర్పడుతాయి:

ఒక నక్షత్రం కాంతిని వెలువరచాలి అంటే అందులోని హీలియం ప్రధాన కారణం.ఆ నక్షత్రంలోని హీలియం పూర్తిగా శక్తిగా మారిపోయిన తర్వాత ఆ నక్షత్రం తన స్వంత గురుత్వాకర్షణ ప్రభావం చేత తనలోని పదార్థం తన కేంద్రం వద్దకు ఆకర్షింపబడుతుంది.దీనివలన ఆ నక్షత్రపరిమాణం తగ్గుతూ తెల్లని మరుగుజ్జుగా,న్యూట్రాన్ తారగా మారతుంది.అలా మారుతూ ఒక నిర్దిష్టపరిమాణానికి చేరుకుంటుంది.ఆ పరిమాణం మన కంటికి కనిపించనంత సూక్ష్మపరిమాణం కూడా కావచ్చు.అది సెంటిమీటరులో కోటి వంతుకూడా కావచ్చు.కాని దాని ద్రవ్యరాశి వందలకోట్ల టన్నుల వరకూ ఉంటుంది.ఇవి సూక్ష్మ కృష్ణబిలాలు.ఇవి అత్యంత అధికసాంద్రత కల్గినవి.ఒక మిల్లిమీటరులో కొన్ని కోట్ల టన్నుల ద్రవ్యరాశి నిక్షిప్తమైన అధిక సాంద్రత కలిగి ఉంటాయి. వీటి గురుత్వాకర్షణ చాల ఎక్కువ కాబట్టి వీటి పరిమాణమును బట్టి తన చుట్టుపక్కల ఉన్న ద్రవ్యరాశిని తమలోనికి లాగుకుంటాయి.

వీటి గురుత్వాకర్షణశక్తి పరిధిని సంఘటనా క్షితిజము(Event horizon)అంటారు.ఈ క్షితిజములోనికి ప్రవేశించిన ఏ వస్తువూ (కాంతితో సహా) బయటకు రాలేవు. ఒక వేళ రెండు కృష్ణబిలాలు కనుక కలిస్తే వాటి ద్రవ్యరాశి,సంఘటనా క్షితిజం రెట్టింపు కన్నా ఎక్కువ అవుతాయి.

చంద్రశేఖర్ పరిమితి(Chandrasekhar limiT):

ఏ నక్షత్రమైనా కృష్ణబిలముగా మారాలంటే ఒక నిర్దిష్ట ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉండాలి.చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం(ఇతనికి నోబుల్ బహుమతి వచ్చింది)అనే భారతీయశాస్త్రవేత్త ఈ నిర్దిష్టద్రవ్యరాశి పరిమితిని కనుగొన్నాడు.ఈ పరిమితి మన సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.5(ఒకటిన్నర)రెట్లు అధిక ద్రవ్యరాశి. కృష్ణబిలాలు మరీ కారునలుపేమీ కాదు.ఇవి ఒక వేడివస్తువులాగానే ఉష్ణమును వెలువరుస్తుంటాయి.అత్యంత సూక్ష్మస్థాయిలలో గామా కిరణాలను వెలువరుస్తాయి.

కొన్ని విశేషాలు:

1.విశ్వము ఏర్పడినప్పుడు చాలా కృష్ణబిలాలు ఏర్పడిఉంటాయని నమ్ముతున్నారు.ఐతే అప్పటి కృష్ణబిలాలు ఇంకా ఇప్పటికి ఉండవని శాస్త్రవేత్తల అంచనా.

2.సగటున మన భూమికి,ప్లూటోకు ఎంత దూరం ఉంటుందో అంత పరిధిలోపల 100 దాకా కృష్ణబిలాలు ఉంటాయని అంచనా.

3.కృష్ణబిలాలూ తమ అంత్యదశలో బ్రహ్మాండమైన విస్పోటనం తో పేలిపోతాయి.

4.ఒక నక్షత్రం పేలిపోవడాన్ని సూపర్‌నోవా(SuperNova) అంటారు.

(వనరు(resourse): స్టీఫెన్ హాకింగ్ పరిశోధనలు )

Wednesday, September 17, 2008

కర్మసిద్దాంతము-సంక్షిప్త వివరణ

"కర్మసిద్దాంతం".అత్యంత చర్చకు లోనైన సిద్దాంతము ఇది.ఎన్నో అపార్థాలకు గురైన సిద్దాంతం ఇది.

ఈ వ్యాసంలో కర్మసిద్దాంతాన్ని గురించి చర్చించడం జరిగింది.సరే అసలు ఈ కర్మసిద్దాంతం అంటే ఏమిటి. ముఖ్యముగా ఈ సిద్దాంత విషయం ఏమిటంటే "కారణం లేని కర్మఫలితాలు (కార్యము) అనేవి ఉండవు"అని.
అంటే మనము అనుభవించేది సుఖమైనా కావచ్చులేక దుఖమైనా కావచ్చు
ఈ సుఖదుఃఖాలకు కారణం మనం పూర్వజన్మలలో చేసిన కర్మలైనా కావచ్చు,లేక ఈ జన్మలో చేసిన కర్మలైనా కావచ్చు.మరి మనము చేసిన కర్మల యొక్క ఫలితాలను
మనము ఖచ్చితంగా అనుభవించవలసిందేనా? ఖచ్చితముగా అనుభవించవలసిందే.భగవద్గీత లో శ్రీకృష్ణుడి వాక్కు చూడండి
"అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం".
అంటే "చేసిన కర్మల ఫలితం అది చెడైనా ,మంచైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే."
మీరు బాణం వదిలారు.ఇక అది ఎక్కడికి వెళ్ళేదీ మీ చేతుల్లోనే లేదు.మీరు వదలడంవలన అది ఖచ్చితంగా దేనికో ఒకదానికి తగలకతప్పదు. వేసే ముందే అది మన చేతుల్లోఉంది.
మరి, కొందరు ఈ కర్మసిద్దాంతం పేరు చెప్పి నానా తప్పులు చేస్తున్నారు కదా అని మీరనవచ్చు.నిజమే.వారికి నిజంగా సిద్దాంతం గురించి తెలియదనే అనుకోవాలి.ఇలాంటి వారిని డాంభికులు అంటారు.అంటే లోన ఒకటి ఉంచుకుని బయటికి మరోలా ఉండేవారు.
ఈ కర్మలు మూడు రకాలు.అవి ప్రారబ్ద,సంచిత మరియు ఆగామి కర్మలు.
ప్రారబ్దకర్మలనగా గతజన్మల కర్మల ఫలితాలు. సంచితకర్మలనగా ఈ జన్మలో ఇప్పటివరకు చేసిన కర్మల సంచితం.
ఆగామికర్మలనగా మన ప్రస్తుతము చేయబోవు పనుల ద్వారా భవిష్యత్తులో అనుభవించు ఫలితాలు.


ఈ కర్మసిద్దాంతం లో చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది.ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు."పల్లెటూళ్ళలో ఎద్దులనుకానీ,ఆవులను కానీ లేక గేదెలను గానీ ఒక తాడుతో గుంజకు కట్టిఉండడం చూసేఉంటారు.అవి ఆ తాడు యొక్క పరిధిలో ఏమైనా చేసుకోవచ్చు.ఎలా ఐనా తిరగవచ్చు.కానీ ఆ తాడు పరిధిని దాటి మా పోలేవు.వాటి స్వేచ్చ అంతా ఆ తాడులోపలే."
"అలానే మనకు భగవంతుడు కొంత స్వేచ్చను ఇస్తాడు.ఇక్కడ తాడు అనగా మన గత కర్మల ఫలితం.మన యొక్క నిష్కామ కార్యాల వలన దేవుడు తాడు పొడవు ఇంకా పెంచవచ్చు.అప్పుడు మరింత స్వేచ్చ మనము పొందగలము."

నిష్కామకార్యాలనగా నిస్సంగత్వంతో పనులు చేయడం.అంటే మన పనుల వలన మనలో ఎటువంటి వికారాలు అనగా ఆ పనికి సంబందించిన ఎటువంటి బంధము కూడా మన మనసులో ఉండరాదు.ఇదే కర్మయోగము అనబడుతుంది.అసలు కర్మలే చేయకుండా ఉండవచ్చుకదా అనుకోవచ్చు.కాని ఏ కర్మా చేయకుండా మనము ఒక క్షణము కూడా బ్రతకలేము.అందువలనే నిష్కామకర్మ చేయమని చెప్పారు.
అసలు తాడే లేకుండా చేసుకోవడానికి ఒక మార్గం ఉంది.అదే కర్మయోగం.క్రితం టపాలో దీని గురించి వివరించడం జరిగింది.క్లుప్తంగా మన పనులను నిస్సంగత్వం తో చేయడం.
ఈ సిద్దాంతంలో ముల్లును ముల్లుతో తీయడం అనేది ఉంది.చెడు కర్మలు అనే ముల్లును మంచికర్మలు అనే ముల్లు తో తీసివేసి తర్వాత ఈ ముల్లును కూడా పారవేయాలి.అంటే మంచిపనులు కూడా చేయకూడదా అని అడగవచ్చు.చేయాలి కాని నిష్కామముగా చేయాలి.నిష్కామకర్మ యొక్క పూర్తీ వివరాలకు భగవద్గీత యొక్క 2,3,4 అధ్యాయాలు చదవండి.

భగవద్గీతలోనే ఇంకో శ్లోకం లో "జ్ఞానాగ్ని దగ్ద కర్మాణం"అని ఉంది.అంటే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలఫలితాన్ని దగ్దం చేస్తుంది అని అర్థం.
కొందరు అంటారు ఈ జ్ఞానాగ్ని మన పూర్వజన్మల మరియు గత కర్మల ఫలితాన్ని దగ్దం చేయదు అని.కానీ చేస్తుంది.ఉదాహరణకు దశరథుడు చనిపోయినప్పుడు అతని ముగ్గురు భార్యలు ఒక్కసారే విధవలయ్యారా లేక ఒకొక్కరు ఒక్కసారి విధవ అయ్యారా? అలానే జ్ఞానాగ్ని కూడా మన కర్మలన్నిటిఫలితాన్ని దగ్దం చేస్తుంది.ఇక్కడ జ్ఞానం అనగా భగవత్‌జ్ఞానం అనగా సర్వ సృష్టి యందు ఒకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడనే జ్ఞానం.మరి ముందే చెప్పారుగా శ్రీకృష్ణుడు గీతలో ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అని.మరి ఇప్పుడేమో జ్ఞానాగ్ని కర్మలను దగ్దం చేస్తుంది అంటున్నాడు.కృష్ణుడు రెండు మాటలు చెప్తున్నాడా అనే సందేహం వస్తుంది.కాని ఆయన అలా చెప్పలేదు.మనకు తెలుసు అగ్ని ఒక వస్తువును పూర్తిగా దగ్దం చేసినా ఆ భస్మం చేసిన జాడ అక్కడే(అనగా బూడిద లేక మసి) ఉంటుంది.
అలానే మనము చేసిన కర్మల ఫలితం దాదాపు పూర్తిగా దగ్దమైనా ఇంకా వాటి జాడ లేశ మాత్రంగా ఉంటుంది.అదెలాగంటే మన గతకర్మల ఫలితంగా మన కాలు ఒక్కటి పోవలసింది అనుకొందాము.కాని మనం సంపాదించిన జ్ఞానాగ్ని వలన మనకాలికి ఒక ముల్లు గుచ్చుకోవడం వలన కర్మ ఫలితం పోవచ్చు.ఈ విధంగా మన కర్మఫలితం ఆ మేరకు తగ్గించబడడం జరుగుతుంది.
ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి భగవత్ప్రీత్యర్థ కర్మలు చేయడం(నిస్వార్థసేవ,సత్యవాక్పరిపాలన,కపటం లేకుండడం మొదలగునవి ),కర్మల పట్ల అసంగత్వం కలిగిఉండడం (కర్మయోగం) అవసరం.

Tuesday, September 16, 2008

గతాన్ని చూడవచ్చు(ఒక సాంకేతిక(సైంటిఫిక్)విశ్లేషణ)




నేడు సైన్సు విజ్ఞానము ఎంతో విస్తరిస్తోంది.కాలయంత్రాలు(Time Machines) ఊహ చాలాకాలంగా ఉంది.వీటిలో గతంలోనికి మరియు భవిష్యత్తు లోనికి ప్రయాణించాలని అనుకోవచ్చు.ఐతే భవిష్యత్తు లోనికి ప్రయాణించడం ఆచరణ సాధ్యం కాదు.ఎందుకంటే భవిష్యత్తు ఇంకా జరగలేదు కాబట్టి.
అలానే గతంలోనికి కూడా ప్రయాణించడం సాధ్యం కాదు.
ఐతే గతాన్ని,గతంలో ఒక ప్రదేశంలో జరిగిన సంఘటనలను ప్రత్యక్షంగా చూడడానికి ఆస్కారం ఉంది.ఇది అత్యంత కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు అని చెప్పడానికి ఈ ప్రయత్నం.ఈ విషయం అర్థం చేసుకోవడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు.సరే ఇక విషయానికి వద్దాము.

మొదట ఒక విషయం తెలుసుకోవాలి.అదేమంటే మనం ఒక వస్తువునిగానీ తద్వారా ఒక సంఘటనను చూడాలంటే ఆ వస్తువుపైన కాంతి పడి ఆ పడిన కాంతి మన కన్నులను చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలము.కాబట్టి మనం చూడాలంటే కాంతి అవసరము.

మనలో చాలామందికి తెలుసు కాంతి వేగం సుమారుగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు అని.ఈ విధముగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ఒక సంవత్సరం పాటు ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతిసంవత్సరము అంటారు.(ఒక కాంతి సంవత్సరము= 5,880,000,000,000 మైళ్ళు లేక 9,460,000,000,000 కిలోమీతర్లు లేక 63,240 A.U(ఆంగ్‌స్ట్రాం యూనిట్లు)). కాబట్టి కాంతి సంవత్సరము అంటే అది సంవత్సరాలను సూచించేది కాదు దూరాన్ని సూచించేది అని అర్థం చేసుకోవాలి.
సూర్యుని నుండి భూమికి కాంతి ప్రసారం కావడం గమనించండి.సూర్యుని నుండి భూమికి కాంతి చేరడానికి సుమారుగా 8 నిమిషాలు పడుతుంది.అంటే ఇంతకు ముందు మనము అనుకున్నదాని ప్రకారము మనము 8 నిమిషాల క్రిందటి సూర్యున్ని చూస్తున్నాము.ప్రస్తుతము(అంటే ఈ క్షణము)సూర్యునిలో ఒక గమనింపదగ్గ పెద్ద పర్వతము ఆకుపచ్చ రంగులోనికి మారిందనుకుందాము.ఆ సంఘటనకు సంబంధించిన కాంతి కిరణాలు మనలను చేరడానికి 8 నిమిషాల సమయం తీస్కుంటాయి కాబట్టి మనకు ఆ పర్వతం ఆకుపచ్చ రంగులోకి మారడం మనం ఇప్పటి నుండి 8 నిమిషాల తర్వాత మాత్రమే చూడగలము.
ఒక పరిశీలకుడు భూమి పైన గల ఒక ప్రదేశము నుండి 4 కాంతి సంవత్సరాల దూరంలో ఒక దూరదర్శిని(Telescope)ను కలిగిఉన్నాడనుకుందాము.ఈ పరికరము అంతదూరము నుండి కూడా స్పష్టంగా భూమిపైన గల ప్రదేశాన్ని చూపగలిగినదై ఉండాలి.

ఆ ప్రదేశము నుండి భూమిపైన గల ఒక ప్రదేశాన్ని అతను చూస్తున్నప్పుడు అతనికి 4 సంవత్సరాల క్రిందటి విషయము చూస్తుంటాడు.ఎందుకంటే ఇంతకుముందు మనము చెప్పుకున్న దాని ప్రకారము 4 సంవత్సరాల క్రిందటి కాంతికిరణాలు అతన్ని ఇప్పుడు(అతని సమయం ప్రకారం)చేరుతున్నాయి.మన కాలం ప్రకారం ఇప్పుడు మనకు జరుగుతున్న విషయాలు అతను చూడాలంటే 4 సంవత్సరాలు జరగాల్సిందే.అప్పుడు మాత్రమే ఈ క్షణమున మన వద్ద జరిగిన సంఘటనల కాంతి కిరణాలు 4 సంవత్సరాల తర్వాత అతనికి చేరి అతను అప్పుడు చూడగలడు.(ఇక్కడ పరిశీలకుడు మనము ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నాడని అనుకుందాము).

3 వ పటం గమనిస్తే పరిశీలకుడు ఒక కాంతిసంవత్సరము దూరం నుండి ఒక సంవత్సరం క్రిందటి సంఘటనలను,2 కాంతి సంవత్సరాల దూరం నుండి 2 సంవత్సరాల క్రిందటి సంఘటనలను అలాగే 3,4 కాంతిసంవత్సరాల దూరం నుండి 3,4 సంవత్సరాల క్రితం సంఘటనలను చూస్తాడని తెలుసుకోవచ్చు.(ఈ సంవత్సరాలనేవి మన దృష్ట్యా నేను చెప్తున్నాను.పరిశీలకునికి అవి అప్పుడే జరుగుతున్నట్లు అనుకుంటాడు).

ఇప్పుడు పటం(4) గమనించండి.ఇక్కడ పరిశీలకుడు భూమిపైన ఈ క్షణంలో కాంతివేగంతో ప్రయాణం మొదలు పెట్టాడనుకుందాము.అతను భూమిపైన తను బయలుదేరిన ప్రదేశాన్ని చూస్తూ వెనుకకు ప్రయాణిస్తున్నాడనుకుందాము.అప్పుడు భూమిపైన జరుగుతున్న సంఘటనల సమాచారాన్ని తీసుకువెళ్ళే కాంతి తో పాటు అతడు ప్రయాణిస్తుంటాడు.ఇక్కడ అత్యంత ఆశ్చర్యకర అనుభవాన్ని పరిశీలకుడు పొందుతాడు.అదేమంటే కాలం నిలిచిపోయినట్టు అతడికి అనుభవం అవుతుంది.అతడు బయలుదేరిన క్షణంలో సంఘటన ఐతే అతను భూమిపైన చూశాడో అదే సంఘటనను అతను చూస్తూనే ఉంటాడు.ఎందుకంటే అతను సంఘటనను చూపించే కాంతికిరణాలతోపాటే అదే వేగంతో(అంటే కాంతి వేగంతో) అతడు ప్రయాణిస్తున్నాడు.దానివలన అతను ఎంతదూరం పోయినప్పటికీ అతను చూసిన సంఘటన ను చూపించే కాంతికిరణాలు కుడా అతనితో పాటే వస్తుండడం వలన అతనికి సంఘటన తప్ప వేరే ఏమీ కనిపించదు.కాబట్టి కాలం నిలిచిపోయినట్లు అతడికి అనుభవం అవుతుంది.

ఇపుడు పటం(5) గమనించండి.ఇక్కడ పరిశీలకుడు కాంతికి రెట్టింపు వేగంతో ప్రయాణం మొదలుపెట్టాడనుకుందాము.ఆ సమయం సెప్టెంబరు 16,2008 అనగా ఈ రోజు అనుకుందాము.అతను ఈ రెట్టింపు వేగముతో రెండు సంవత్సరాల పాటు పైకి ప్రయాణించాడనుకుందాము.అప్పుడు మనకు సెప్టెంబరు 16,2010 అవుతుంది..ఇప్పుడు అతను అక్కడ ఆగి భూమివైపు చూస్తున్నాడనుకుందాము.కానీ ఇక్కడే విచిత్రము జరుగుతుంది.ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి.
పటం(5) గమనిస్తే అతను కాంతికి రెట్టింపువేగంతో 2 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత పరిశీలకుడు B స్థానం వద్ద,కాంతి A స్థానం వద్ద ఉంటుంది.అంటే కాంతి 2 సంవత్సరాల దూరంలో,పరిశీలకుడు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాడు.అంటే అప్పుడు మనకు సెప్టెంబర్ 16,2010 అవుతుంది.ఇప్పుడు మనం ఈ రోజు సెప్టెంబర్ 16,2010 అనుకుందాము.అంటే ఒకటవ కాంతి సంవత్సరం దూరానికి ఇప్పటి మన సంఘటనల కాంతికిరణాలు పోవడానికి ఒక సంవత్సరం పడుతుంది.ఒకటవ కాంతి సంవత్సరం దూరంలో సెప్టెంబర్ 16,2009 యొక్క సంఘటనలు చూడవచ్చు.2 కాంతి సంవత్సరాల దూరంలో సెప్టెంబర్ 16,2008 నాటిసంఘటనలు,3 కాంతి సంవత్సరాల దూరంలో సెప్టెంబర్ 16,2007 నాటి సంఘటనలు మరియు 4 కాంతి సంవత్సరాల దూరంలో అంటే మన పరిశీలకుని స్థానంలో సెప్టెంబర్ 16,2006 యొక్క సంఘటనల కాంతి కిరణాల కారణంగా పరిశీలకుడు సెప్టెంబర్ 16,2006 వ రోజును చూస్తుంటాడు.
అంటే అతను బయలుదేరింది సెప్టెంబరు 16,2008,కానీ అతను చూస్తున్నది సెప్టెంబరు 16,2006.
దీనిని బట్టి అతను 2 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత మన ప్రకారం సెప్టెంబరు 16,2010 చూడాల్సింది అతను గతం లోని సెప్టెంబరు 16,2006 చూస్తున్నాడు.అంటే మొత్తం అతను 4 సంవత్సరాల క్రిందటి విషయాలను ప్రత్యక్షంగా చూస్తున్నాడు.పైన జరిగిన సంఘటనలు కాంతి కన్నా రెట్టింపు వేగంతో పొయినప్పుడు జరుగుతున్నాయి.ఇక్కడ నిజానికి 2 సంవత్సరాలు గడిచిపోయి సెప్టెంబరు 16,2010 వచ్చినప్పటికీ ఇప్పటి సంఘటనలకు సంభందించిన కాంతి కిరణాలు పరిశీలకుని చేరడానికి ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది.అంటే మన ప్రకారం సెప్టెంబరు 16,2014 వ తేదీ అతను సెప్టెంబరు 16,2010 యొక్క సంఘటనలను చూడగలడు.కాబట్టి గతాన్ని చూడగలమని స్పష్టంగా అర్థం అవుతోంది.మనము చూడగలము కానీ గతాన్ని మార్చడంకానీ,గతంలో పాల్గొనడం కానీ చేయలేము.
కానీ ఇది ఆచరణసాధ్యం కాకపోవడానికి కొన్ని పరిమితులు అడ్డుగా నిలుస్తున్నాయి.

పరిమితులు(Limitations):

ఐన్‌స్టీన్ సిద్దాంతం ప్రకారం సృష్టి లో ఏ వస్తువూ కాంతివేగాన్ని మించి ప్రయాణించలేదు.అలా ప్రయాణించాలంటే ఆ వస్తువు ద్రవ్యరాశి అనంతం కావాలి.కాని నేటి శాస్త్రవేత్తలు కాంతి కన్నా వేగం గా ప్రయాణించే కొన్ని రకాలైన కిరణాలను కనుగొన్నారు.
కాబట్టి గతాన్ని చూడాలంటే మనిషిని కిరణాలుగా మార్చాలి.తిరిగి అంత దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి మనిషిగా మార్చాలి.ఇది మన ఊహకు అందని విషయం.
అందువలనే గతాన్ని చూడడం అనే విషయం అత్యంత కష్టమైన విషయం.దాదాపుగా అసాధ్యమైన విషయం.

పైన పేర్కొన్న నిరూపణ కేవలం జరగవచ్చు అని చెప్పగలము కానీ జరుగుతుంది అని అనలేము.
పైన పేర్కొన్న నిరూపణ ఐన్‌స్టీన్ యొక్క సాపేక్ష సిద్దాంతం ద్వారాచేయడం జరిగింది.
పై వ్యాసం ద్వారా కొన్ని కొత్త విషయాలు మనము గ్రహించవచ్చు.అవేమిటో ఇంకో సారి చూద్దాము.

Monday, September 15, 2008

కర్మయోగ రహస్యము

కర్మయోగమనునది నాలుగు యోగాలలో ఒకటి.ఈ యోగ సారాంశమంతా భగవద్గీత లోని రెండు శ్లోకములలొ ఉంది.
వాటి అర్థాలు:
1.కర్మ చేయుటకు నీకు అధికారము గలదుకాని దాని ఫలితమందు ఆసక్తి కలిగివుండుటకు లేదు.అట్లని కర్మలు చేయుట నీవు మానరాదు.

2.ఏ కర్మ చేయుచున్నను నీవు అసంగత్వం తో మరియు శ్రద్దగా నిపుణత్వం తో చేయాలి.అనగా నీవు కావాలనుకున్నప్పుడు ఏ క్షణము లో నైనా ఆ పనితో సంబంధం లేకుండా బయటకు వచ్చేయగలగాలి.

ఈ ప్రపంచములో గెలుపు,ఓటములు అనేవి కేవలము మన శ్రమ పైనే ఆధారపడిలేవు.ఒక పని కావడానికి మన శ్రమ అత్యంత ముఖ్యము ఐనప్పటికీ ఆ పని విజయవంతము కావడానికి ఇంకా చాలా పరిస్థితులు అనుకూలించాలి.ఆ పరిస్థితులలో చాలామటుకు మన చేతులలో ఉండవు.కాబట్టి మన భాద్యత ఏమిటటంటే ప్రయత్న లోపం లేకుండా మన పనిని మనము నిర్వర్తించడం.అటువంటప్పుడు పని సఫలమైనప్పుడు విజయానందం,ఒకవేళ కాకపొతే పనిని నిర్వర్తించిన ఆనందం కలుగుతాయి.అందువలనే పని యొక్క ఫలితంపైన ఆసక్తి ఉంచుకోరాదు.

రెండవ దానికి ఉదాహరణగా యజమాని ఇంట్లో పనిచేయు దాది ని చెప్పుకోవచ్చు. ఆ దాది తన యజమాని బిడ్డలను తన బిడ్డలగా భావించి పెంచుతున్నప్పటికి ఆమె ధ్యాస అంతా తన సొంత ఇంటి పైనే ఉంటుంది.అలా అని ఆమె తన యజమాని పని కూడా శ్రద్దగానే చేస్తుంది.ఏ లోటూ రానివ్వదు.అంటే మనము పని చేయుచున్నప్పటికి మన మనసు భగవంతుని దగ్గర ఉండాలి.ఇదే కర్మయోగ రహస్యము.

Saturday, September 13, 2008

శాంతి మంత్రము (పూర్తి శ్లోకము)

అసతోమా సద్గమయా

తమసోమా జ్యోతిర్గమయా

మృత్యోర్మా అమృతంగమయా

ఆవిరావిర్మయేతి రుద్రయిత్తే

దక్షిణమ్ ముఖం తేనమామ్ పాహినిత్యం

ఓం శాంతి శాంతి శాంతిః

అర్థము:

అసత్(భ్రాంతి) నుండి   సత్ (సత్యము) కు 
చీకటి (అజ్ఞానము) నుండి వెలుగు(జ్ఞానము) నకు
మృత్యువు నుండి అమృతత్వము వైపునకు మనము పోవుదము గాక.
అందుకొరకై దక్షిణముఖుడైన రుద్రున్ని మేము నిత్యమూ అనగా ప్రతిరోజూ ప్రార్థిస్తాము. 

ఓం శాంతి శాంతి శాంతి

Thursday, September 11, 2008

అనుకూల వేదాంతము

ఈ మధ్యకాలంలో మనుషులు తమ స్వార్థమునకు తగినట్టుగా పరిస్థితులను సమర్థించుకుంటున్నారు.ఒక హంతకునికి న్యాయమూర్తి మరణశిక్ష విధించాడు.అప్పుడు ఆ హంతకుడు జేబులోని భగవద్గీతను తీసి "చంపింది నేను కాదు,చచ్చినది వాడు కాదు;దీనికీ కృష్ణుడే సాక్షి,ఫలానా శ్లోకం చూడండి"అన్నాడు.జడ్జి కూడా తెలివితక్కువ వాడు కాదు."శిక్ష విధించింది నేను కాదు,చచ్చేది నీవు కాదు-చావు పొమ్మ"న్నాడు.ఆపత్సమయములో ప్రదర్శించే యుక్తి,కుయుక్తులివి.మరియు "చచ్చేది తానూ కాదు.చంపించేది జడ్జి కాదు"అని ఎందుకనుకోరాదు?

అన్ని సమయాలందు సమచిత్తాన్ని అనుభవించాలి.

అవసర అనుకూల విషయాలను మాత్రం తీసుకొని అననుకూల విషయాలను విరుద్ధమైనవిగా భావించుకోవడం సరైన ఆధ్యాత్మికం కాదు.

వేదాంతమంటే ఇది కాదు.మన కర్తవ్యనిర్వహణ మనం చేయాలి.అయితే సర్వము భగవత్ప్రీత్యర్థముగా వదలాలి.జగత్తులో ధర్మము అభివృద్ధి చెందవలేనన్న సద్గుణములే దీనికి పోషకములు."ధర్మదేవతా!నీవీ ప్రపంచములో ఉండకుండాపోవడానికి కారణమేమని"మార్కండేయమహర్షి అడుగగా "దుర్గుణములున్న చోట నిలువ"నని చెప్పింది ధర్మదేవత.సద్గుణములు,సద్భుద్ది,సత్యనిరతి,భక్తి,క్రమశిక్షణ,కర్తవ్యపాలనములను నేర్పేదే సరైన విద్య.ఇవి కల్గిఉండడమే సరైన ఆధ్యాత్మికత.ఈ ఆరే మిత్రషట్కములు.వీటితో స్నేహం చేసుకున్ననాడు జన్మ సార్థకం అవుతుంది. 

Friday, August 29, 2008

మైత్రేయి(మన ప్రాచీన తల్లులు)

విద్య కొరకు ఒకరికి రెండవ భార్యయై విద్యావతి ఐన సాధ్వీమణి మైత్రేయి.

మైత్రేయి మన పురాణ(వేదకాలపు) ప్రఖ్యాత స్త్రీ.ఈమె జనకమహారాజు సభలో అందరు పండితులను ఓడించిన యాజ్ఞవల్కుని రెండవ భార్య.ఇతని మొదటి భార్య కాత్యాయిని.

మైత్రేయి సకల వేదాలను,స్మృతులను ఔపోశన పట్టిన సాధ్వి.ఆమె కాలంలో మైత్రేయి "బ్రహ్మవాదిని" అను బిరుదు పొందినది.

మైత్రేయి మొదట గార్గి అను మహాయోగిని శిష్యురాలు.కాని యాజ్ఞవల్కుని తో జనకసభలో గార్గి కూడా పరాజితురాలవడం చూసి యాజ్ఞవల్కుని వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకొంది.తను అతని భార్య ఐతే సకల విద్యా జ్ఞానాన్నీ పొందగలనని భావించింది.ఈ విషయమై యాజ్ఞవల్కుని మొదటి భార్య ఐన కాత్యాయినిని సంప్రదించింది.తర్వాత కాత్యాయని అనుమతితో యాజ్ఞవల్కుని పెళ్ళాడి అతని రెండవ భార్య అయింది.

ఋగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి.

సప్తర్షులు (అధ్యాత్మికం)

హిందూ సంప్రదాయములోను, పురాణ గ్రంధాలలోను ఏడుగురు దివ్యశక్తి గల తపస్సంపన్నులను సప్తర్షులు అని ప్రస్తావించారు. భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానంలో ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు.

సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14)లో ఇలా చెప్పబడినవి - దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ గుణములు గల మహర్షులు "సప్తర్షులు"గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.

వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.

వీరు మన్వంతరానికి ఒకసారి మారుతుంటారు.
1.మొదటి మన్వంతరము,అధిపతి స్వాయంభువు,సప్తర్షులు
మరీచి,అత్రి,అంగీరస,పులహ,క్రతు,పులస్త్య మరియు వశిష్ఠ
2.రెండవ మన్వంతరము,అధిపతి స్వారోచిషుడు,సప్తర్షులు
ఊర్జ,స్థంభ,ప్రాణ,దత్తోలి,నిస్చర,ఋషభ మరియు అర్వరివత్తు
3.మూడవ నన్వంతరము,అధిపతి ఔతమి
సప్తర్షులు కౌకునిది,కరుంది,దలయ,సాంఖ,ప్రవహిత,మిత మరియు సమ్మిత
4.నాల్గవ మన్వంతరము,అధిపతి తామస మను
సప్తర్షులు జ్యోతిర్ధామ,పృధు,కవ్య,చైత్ర,అగ్ని,వనక మరియు పివర
5.ఐదవ మన్వంతరము,అధిపతి రైవతమనువు
సప్తర్షులు హిరణ్యరోమ,వేదశ్రీ, ఊర్ధబాహు, వేదబాహు, సుధామ, ఫర్జన్య మరియు మహాముని.
6.ఆరవ మన్వంతరము,అధిపతి చక్షూసమనువు
సప్తర్షులు శుమేధస్సు, విరాజస్సు, హవిష్మత్, ఉత్తమ, మధు, అభినామన్ మరియు సహిష్ణు.
7.ఏడవ మన్వంతరము,అధిపతి వైవస్వతమనువు (ఇది ప్రస్తుతకాలం)
సప్తర్షులు కష్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ.

విష్ణుపురాణం ఆధారంగా

Wednesday, August 27, 2008

స్త్రీలు,శూద్రుల వేదాధ్యయన అధికారం

మన హిందూమతం పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకువచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు.స్త్రీలు,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలాఅని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం.

భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు
"చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః"అన్నాడు.
దీని అర్థం"మొదట వారి గుణాలబట్టి,తర్వాత వారు చేసే పనులబట్టి నాలుగు వర్ణాలు(కులాలు) నాచే(భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి."అని అర్థం.

వేదాలలో నాలుగు వర్ణాల (కులాల)గురించి చెప్పారు కానీ వాటిమధ్య ఎక్కువ,తక్కువల గురించి చెప్పలేదు.మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు.సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.
1.యజుర్వేదం(26.2) శ్లోకం
"యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ"
అంటే "నేనెలా కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రులవరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి."అని అర్థము.
2.అధర్వణ వేదం (8వ మండలం,2వ అనువాకం) బ్రాహ్మణులకు,శూద్రులలో కూడా చివరివారికి
"సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద,నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే"
అంటే " మానవుడా!గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను.నేను దాస(శూద్ర),ఆర్య పక్షపాతము గలవాడను కాదు.నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను"అని అర్థము.
3.ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయబ్రాహ్మణమును,స్వయంగా ఋగ్వేదములోనూ మరియు శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
4.అలానే ఋగ్వేద ఒకటవ మండలం,17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిసకొడుకని ఋగ్వేదంలోనూ, శాయనభాష్యములోనూ,మహాభారతంలోనూ చూడవచ్చు.
5.అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు.సత్యకామజాబాలి వేశ్య కొడుకు.వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం(వేదాల చివరివి)ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
6.ఋగ్వేద ఒకటవమండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర,8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక,శాయనభాష్యములోనూ చెప్పబడింది.
"న స్త్రీ శూద్ర వేదం అధీయతాం"(స్త్రీలు,శూద్రులు వేదమును అభ్యసింపరాదు)అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ వాక్యము వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.
7.ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు.యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది.ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు.ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరుప్రఖ్యాతులు పొందింది.(బృహదారణ్యకోపనిషత్తు నుండి).
8.వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో,సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుషశూద్ర భేధము లేక అందరూ అర్హులే.

నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు,శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల(ఆత్మానుభవం పొందినవారు)మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.

దుష్టము,సంకుచితము ఐన నేటి కులవ్యవస్థ శాస్త్రీయము కాదని,ఇవి వేదాల తర్వాతి కాలంలోని గ్రంథాలలో చేర్చబడ్డాయని చెప్పవచ్చు.

Tuesday, August 26, 2008

సహారా(సాగర),కాలిఫోర్నియా(కపిలారణ్య) లకు రిఫరెన్సులు

నేను గత టపాలో సహారా,కాలిఫోర్నియా ల గురించి వ్రాశినాను.వాటికి రెఫెరెన్సులు

సహారా(సాగర) : http://www.csre.iitb.ac.in/ysrao/sahara.html
కాలిఫోర్నియా (కపిలారణ్య): http://www.salagram.net/VWH-World.html
ఇవి IIT బెంగళూరు,ముంబాయి ల ఉత్తరాల నుండి సేకరించినవి.

అలాగే సుశ్రుతుని ప్లాస్టిక్ సర్జరీ మొదలగు వివరాలకు వికీపీడియా(en.wikipedia.org/wiki/Sushruta_Samhita, en.wikipedia.org/wiki/Susrutha) చూడండి.

Monday, August 25, 2008

ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)

ఆర్యభట గురించి ఒక టపాలో చెప్పాను.ఇందులో అతని ప్రఖ్యాత ఆర్యభటీయం లోని విశేషాలను వ్రాయడం జరిగింది.
1.భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది.
2.సూర్యుని దృష్ట్యా గ్రహాల రోజులు కనుగొనడం
3.చంద్రుడు మరియు ఇతర గ్రహాలు సూర్యకాంతి వలనే ప్రకాశిస్తున్నాయి
4.గ్రహణాలు సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే వరుసలోనికి వచ్చినపుడు ఏర్పడతాయి.(ఇక్కడ పూర్తి వివరాలు ఇచ్చారు).
5.ఈ గ్రంథం ప్రకారం సంవత్సరం=365 రోజులు,6 గంటలు,12 నిమిషాలు,30 సెకన్లు.(ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇది 365 రోజులు,6 గంటలు,9 నిమిషాలు,10 సెకన్లు)
6.ఈ గ్రంథం ప్రకారం గణితశాస్త్రంలో "పై(π)" విలువ దాదాపు 62832/20000=3.1416....( ఇప్పటి విలువ=3.14159...)
7.భూమి చుట్టూకొలత=24,835 మైళ్ళు ( ఇప్పటి ప్రకారం 24,902 మైళ్ళు)
8.సమస్య ద్వికరణీ. ప్రమాణం త్రితీయెన వర్ధయెత్ తచ్చతుర్థానాత్మ చతుసస్త్రింషెనెన సవిషెషహ్
ఇది 2 యొక్క వర్గమూలం కనుగొనడాన్ని వివరిస్తుంది.
2 యొక్క వర్గమూలం=1 + 1/3 + 1/(3.4) - 1(3.4.34)...=1.41421569(5 దశాంశాలకు సవరిస్తే).
9.sin(15 డిగ్రీలు)=890 ( ఇప్పటి విలువ 889.820) (ఇతను sin ను అర్దజ్యా గా వ్యవహరించాడు).

సుశ్రుతుడు- శస్త్రచికిత్సా పితామహుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)

సుశ్రుతుడు క్రీ.పూ 4 వ శతాబ్దమునకు చెందినవాడు.ఇంతకు మించి వీరి వృత్తాంతము తెలియరావడం లేదు.

వీరు ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు.మరియు మత్తుమందు ఉపయోగించడంలోనూ,కంటి శుక్లాలు తొలగించడంలోనూ,మూత్రపిండరాళ్ళు తొలగించడంలోనూ మరియు విరిగిన ఎముకలు అతికించడంలోనూ అనుభవజ్ఞులు.
ప్రక్క చిత్రాలలో సుశ్రుతుడు శస్తచికిత్స చేయడాన్ని మరియు అతడు ఉపయోగించిన పరికరాలను చూడవచ్చు.


ప్రపంచంలో మొట్టమొదట సిజేరియన్ చేసినది కూడా వీరే.

ఇతని మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ వృత్తాంతం చరిత్రలో క్రిందివిధంగా నమోదు చేయబడింది.
"ఒక రాత్రి ఒక ప్రమాదన్లూ దాదాపు ముక్కును కోల్పోయిన ప్రయాణికుడు సుశ్రుతుని తలుపు తట్టాడు.అతని ముక్కు నుండి రక్తం ధారాళంగా ప్రవహిస్తోంది.సుశ్రుతుడు మొదట అతని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఏవో ఆకులను పిండి ఆ ఆకురసమును అతని ముక్కుపై పిండాడు.తర్వాత అతనికి కొద్దిగా ద్రాక్షరసం(వైన్) త్రాగడానికి ఇచ్చాడు.తర్వాత అతని ముక్కు పొడవును ఒక ఆకుతో కొలిచి అతని గడ్డం నుండి కొద్దిగా మాంసం ముక్కను కోశాడు.ఆ రోగి బాధతో మూలిగాడు కానీ ద్రాక్షరసం ప్రభావం వలన అతనికి నొప్పి తెలియలేదు.
తర్వాత గడ్డానికి కట్టుకట్టి రెండు గొట్టాలను ముక్కు రంధ్రాలలో పెట్టి ముక్కుతెగినచోట మాంసం ముక్కను ఉంచాడు.అక్కడ ఏదో మందుపొడిని,ఎర్ర చందనమును పూశాడు.మరియు మంగళివారు ఉపయోగించే లోహాన్ని ప్రవేశపెట్టాడు.తర్వాత నువ్వులనూనె తో పత్తిని తడిపి దానితో ఆ ముక్కుకు కట్టుకట్టాడు."

ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 26 శతాబ్దాలముందే చేయబడిన "ప్లాస్టిక్ సర్జరీ".వీరు ఈ విద్యలో కాశీ లోని దివోదశధన్వంతరి అను వారినుండి ప్రావీణ్యత సాధించారు.

వీరు రచించిన ప్రపంచప్రసిద్ద గ్రంథం "సుశ్రుతసంహిత".ఇందులో దాదాపు 101 రకాల శస్తచికిత్సకు ఉపయోగించే పరికరాలను తెలిపాడు.వీటికి జంతువులను సూచించు పేర్లను పెట్టాడు.

Sunday, August 24, 2008

కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)

వేదభాష్యకారులలో ఒకరైన శాయనాచార్యులు (క్రీ.శ.1315 -1387) విజయనగర రాజులలో ఒకరైన బుక్కరాయల అస్థానంలో మంత్రిగా ఉండేవారు.వీరు తమ ఋగ్వేద భాష్యంలో కాంతి యొక్క వేగాన్ని ప్రస్తావించాడు.

వీరు తమ ఋగ్వేద భాష్యంలో ఒక శ్లోకంపై వ్యాఖ్య లో (1.50 సూక్తము,4 వ శ్లోకం)
"ఓ! సూర్యదేవా నీ కిరణాలు అరనిమేషంలో 2202 యోజనాలు ప్రసరిస్తాయి"అన్నాడు.

మనకు తెలుసు
ఒక యోజనం=9.00625మైళ్ళు
మహాభారతం,శాంతిపర్వం ప్రకారం
అరనిమేషం= 8/75 సెకన్లు (ఇక్కడ 7.9789... ను సమీప 8 కు మార్చడం జరిగింది).

ఈ లెక్క ప్రకారం కాంతివేగం 186413.22 మైళ్ళు/సెకన్.
ఇప్పటి లెక్కప్రకారం ఈ వేగం 186300 మైళ్ళు/సెకన్.
ఇది అత్యంత ఆశ్చర్యజనకమైన ఫలితం.ఎంత దగ్గరగా మనవాళ్ళు లెక్కించారో.

Friday, August 22, 2008

కణాదుడు(ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)

పరమాణువుల గురించి పాశ్చాత్యులకన్నా ముందే కనుగొన్నవారు కణాదుడు.

వీరి తల్లిదండ్రుల గురించి,జన్మించిన స్థలం గురించి,మరణ వృత్తాంతం తెలియ రావడం లేదు.
వీరు క్రీ.పూ.6 వ శతాబ్దంలో జన్మించారు.వీరి అసలు పేరు కశ్యపుడు.చిన్నప్పటినుండే వీరు సునిశిత జ్ఞానం కలవారు.చిన్నచిన్న విషయాలను కూడా వీరు ఆసక్తిగా గమనించేవారు.

ఒకసారి వీరు ప్రయాగకు వారి నాన్న తో పాటు వెళ్ళారు.అక్కడి దారులపైన భక్తులు చల్లిన పూలు,బియ్యం గమనించి భక్తులు పూజల్లో నిమగ్నులై ఉందగా ఇతను మాత్రం ఆ గింజల్ని లెక్కించడం మొదలుపెట్టాడు.అది చూసి సోమశర్మ అను ఋషి చూసి ఎందుకలా లెక్కిస్తున్నావని అడిగాడు.అప్పుడు కణాదుడు ఆ గింజలు ఎంత చిన్నవైనప్పటికీ ఈ విశ్వంలో భాగమేకదా అన్నాడు.
ఈ విధంగా కణాదుడికి చిన్నచిన్న విషయాలపైన కూడా దృష్టి ఉండడంచూసి ఆ ఋషి అతనికి "కణాదుడు"(కణ అనగా ధాన్యపుగింజ) అని పేరుపెట్టాడు.

వీరు కనుగొన్నవి:
#ప్రపంచంలో మొట్టమొదట పరమాణుసిద్దాంతం ప్రతిపాదించారు.
#ఒక అణువులో కనీసం రెండు పరమాణువులు ఉంటాయని కనుగొన్నారు.
#ప్రతిపదార్థానికి మూలం పరమాణువులే అని వటిని విభజించలేమని,అవి కనపడవని తెల్పాడు.(ఇప్పుడు వాటినికూడా విభజించవచ్చని కనుగొన్నారు,కానీ ఆ కాలం లో కణాదుడిలా కనీసం ఎవరూ అణువును కూడా ఊహించలేకపోయారు).

కణాదుడు వైశేషికదర్శనం(మిగతా దర్శనాలు న్యాయ,సాంఖ్య,మీమాంస మొదలగునవి)ప్రతిపాదించాడు.ఇందులో విజ్ఞాన,మత మరియి వేదాంతాల సమన్వయం ఉంది.ఈ దర్శనాలు నవీన శాస్తజ్ఞులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు