తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, September 30, 2008

మహనీయుల జీవితాలలో మధుర(హాస్య)ఘట్టాలు-(స్వామి వివేకానంద)

స్వామి వివేకానంద జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ శ్రేణిని ఆరంభిస్తున్నాను.

ఒకసారి రామకృష్ణమఠంలో ఒక సన్యాస సాధువు దిగాలుగా కూర్చుని ఉన్నాడు.వివేకానందులు కారణం ఏమిటని అడిగారు.అప్పుడు ఆ సాధువు "స్వామీజీ! కూరగాయలు,ఆకుకూరలు తరగడానికి ఒకే చాకు ఉంది.నేడు కూరలు తరుగుతుంటే ఆ చాకు విరిగిపోయింది "అన్నాడు.అప్పుడు వెంటనే వివేకానందులు దిగులు నటిస్తూ " నిజం చెప్పాలంటే ఈ చాకులు ఎంతో అదృష్టం గలవి.ఎందుకంటే వీటి ఆయుష్షు ఈ విధంగా ఒకేసారి తీరుతుంది.అదే మనుషులకైతే ఎన్నో రోగాలు,వ్యాధులూ" అని అన్నాడు.ఈ వ్యాఖ్యానం విని ఆ సాధువు పగలబడి నవ్వాడు.

ఇంకో సంఘటన.

స్వామివివేకానందుల తోటి స్వామి ఒకరికి వీరి మాటంటే ఇక తిరుగులేదు.ఒకసారి అందరూ భోంచేస్తుండగా వివేకానందులు ఉన్నట్టుండి తన తోటి స్వామితో " మీకు ఈ విషయం తెలుసా? ఈ సారి "గుడ్‌ఫ్రైడే" ఆదివారం వస్తోంది తెలుసా" అన్నాడు.అప్పుడు తోటి స్వామి అమాయకంగా "అవునా? ఇందులో విశేషం ఏముంది స్వామీజీ" అన్నాడు.మిగతా భోంచేస్తున్నవారు స్వామీజీ మాటలలోని అర్థం,హాస్యం గమనించి విరగబడి నవ్వారు.ఎందుకు నవ్వుతున్నారో తెలియని ఆ తోటి స్వామికి ఏమీ అర్థం కాలేదు.

ఇంకో సంఘటన.

స్వామీజీ రెండవసారి అమెరికా పర్యటనకు వెళ్ళిన తర్వాత అతను తిరిగి భారతదేశానికి వచ్చు సమాచారం మఠంలోని వారెవరికీ తెలియదు.ఒకరోజు వివేకానందులు ఏ విధమైన సమాచారం లేకుండా అమెరికా నుండి ఈజిప్ట్ ద్వారా బొంబాయికి ఓడలో వచ్చాడు.అక్కడి నుండి కలకత్తాకు రైలులో వచ్చాడు.స్వామీ వివేకానందులు అప్పుడు బ్రిటిష్ దుస్తులు ధరించి ఉన్నాడు.కలకత్తాలోని మఠం దగ్గరికి వెళ్ళి గోడ దూకి లోనికి వెళ్ళాడు.అప్పుడు మఠం లోని స్వాములు భోజనం చేయు సమయం.దూరం నుండి బ్రిటిష్ దుస్తులలో ఉన్న వివేకానందులను వారు గుర్తించలేక భయపడి స్వామి వివేకానందుల వద్దకు కర్రలతో పరుగెత్తుకొచ్చారు.దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తించి సంతోషం పట్టలేకపోయి మఠం అంతా చాటింపు వేశారు.తోటి స్వాములతో వివేకానందులు " మళ్ళీ ఆలస్యం ఐతే భోజనపదార్థాలు అయిపోతాయని గోడ దూకి వచ్చాను"అని అన్నాడు.అంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం అలసట లేక హాస్యాన్ని పండించడం చూసి ఆ స్వాములు ఆనందించారు.

Monday, September 29, 2008

ఐన్‌స్టీన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము


ఈ భాగంలో ఐన్‌స్టీన్ యొక్క ప్రత్యేక సాపేక్ష సిద్దాంతాన్ని తెలుసుకొందాము.తెలుసుకొనేముందు దీని ఆవిష్కరణకు పూర్వం జరిగిన సంఘటనలను గమనిద్దాం.1801 వ సంవత్సరం లో థామస్ యంగ్ అనే శాస్తవేత్త కాంతికి తరంగధర్మం ఉంటుందని కనుగొన్నాడు.ఐతే కాంతి ప్రసారానికి యానకం ఏమిటన్న ప్రశ్నకు ఈథర్ అని అనుకొన్నారు.ఈ ఈథర్ కు అనుగుణంగా కాంతి ప్రసారం అయ్యే వేగానికి,ఇదే ఈథర్ కు వ్యతిరేకంగా కాంతి ప్రసారం అయ్యే వేగం తక్కువ ఉంటుందని అనుకొన్నారు.కాని అల్బర్ట్ మైఖేల్‌సన్ మరియు ఎడ్వర్డ్ మోర్లే అను శాస్త్రవేత్తలు కాంతివేగం ఏ దిశలోనైనా ఒక్కటే అని ఆవిష్కరించారు.

ఐన్‌స్టీన్ ఆవిష్కరణ:పై ఆవిష్కరణ వలన ఐన్‌స్టీన్ ఈథర్ అన్నదేదీ లేదని కాంతివేగం పరిశిలకుడి వేగంతో సంబంధం లేకుండా కాంతివేగం అన్నిదిశలలోనూ ఒక్కటే అని మరియు కాలం,స్థలము అన్నవి సాపేక్షము అన్న నిర్ణయానికి వచ్చాడు.ఇదే ప్రత్యేక సాపేక్ష సిద్దాంత ఆవిష్కరణ.

ఈ విషయం అర్థం కావడానికి క్రింది ఉదాహరణ చూడండి.

A,B అనే ఇద్దరు ప్రయాణికులు రెండు అంతరిక్షనౌకలలో ఒకరికొకరు వ్యతిరేక దిశలలో కాంతివేగంలో ముప్పావువంతు(3/4)వేగంతో ప్రయాణిస్తున్నారని అనుకోండి.సులభంగా అర్థం కావడానికి పటాలు చూడండి.వారి నౌకలలో ఒక కాంతిజనకము,ఒక తెర ఉన్నాయనుకోండి.వాటి మధ్య దూరం 40మీటర్లు అనుకొందాం.ఇప్పుడు A దృష్ట్యా కాంతిజనకం నుండి కాంతి బయలుదేరి తెరను చేరడానికి 0.13 మైక్రోసెకను పడుతుంది(కాంతివేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు కాబట్టి 40 మీటర్లు ప్రయాణించడానికి 0.13 మైక్రోసెకన్ పడుతుంది. 40/300000=0.13మైక్రో).అలాగే B దృష్ట్యా కూడా.
కాని A దృష్ట్యా B నౌకలోని కాంతి జనకం నుండి కాంతి B లోని తెరను చేరేలోపు B నౌక A వైపుగా 30 మీటర్లదూరం ప్రయాణిస్తుంది.పైథాగరస్ సిద్దాంతం ప్రకారం(పటం చూడండి) B నౌకలో కాంతి ప్రయాణించినదూరం 50 మీటర్లు.కాంతివేగం అన్ని పరిశీలనల ప్రకారం ఒకటే కాబట్టి A లోని వ్యక్తి B లో కాంతి ప్రయాణానికి పట్టినకాలం 0.17మైక్రోసెకను గా గుర్తిస్తాడు(50/300000=0.17 మైక్రో).కానీ B నౌకలోని వ్యక్తి ప్రకారం కాంతి 40 మీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది కాబట్టి అతని ప్రకారం ఈ సమయం 0.13మైక్రోసెకన్ మాత్రమే.అలాగే A నౌకలో కూడా కాంతి ప్రసారానికి 0.17మైక్రోసెకను గా B లోని వ్యక్తి గుర్తిస్తాడు.అంటే ఒకరి దృష్ట్యా మరొకరి కాలం 0.04 సెకను తొందరగా నడుస్తోంది.దీనినే Time Dilation అంటారు.ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం ప్రకారం A,B ఇద్దరూ కొలిచే సమయమూ సరైనదే.ఐన్‌స్టీన్ మరియు పై పరిశీలన ప్రకారం A ప్రకారం T కాలం గడిస్తే B ప్రకారం గడిచిన సమయం T*(1-Vవర్గము/C వర్గము)యొక్క వర్గమూలము.ఇక్కడ v అనేది ఒకరిదృష్ట్యా మరొకరి వేగము,C అనేది కాంతివేగము.
కానీ ఈ Time dilation తో సమస్య ఏమంటే ఇద్దరు పరిశీలకులు రెండు సంఘటనల మధ్య దూరం విషయంగా ఏకాభిప్రాయానికి వచ్చినా ఆ సంఘటనల మధ్య ఎంత సమయం జరిగింది మరియు ఆ సంఘటనలు ఎంత వేగంతో జరిగాయి అన్న విషయం పట్ల ఒకే అభిప్రాయానికి రాలేరు.
ఈ సిద్దాంతం ప్రకారం వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క పొడవు దాన్ని చుస్తున్న వ్యక్తికి తక్కువగా కనిపిస్తుంది.అంటే కుచించుకుపోయినట్లు కనిపిస్తుంది.ఉదాహరణకు నేను మన భూమికి సమీపనక్షత్రం వద్దకు ప్రయాణిస్తున్నాని అనుకోండి.అప్పుడు నాకు,నక్షత్రానికి మధ్య దూరం నేను కొలిచినదానికన్నా భూమిపై నుండి చూస్తున్న మీరు కొలిచేదూరం ఎక్కువగా ఉంటుంది.అంటే దూరాన్ని నేను గనుక 1000 కిలోమీటర్లుగా కొలిస్తే మీరు 1000 కన్నా ఎక్కువగా కొలుస్తారు.దీన్నే length contradiction అంటారు.అమితవేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తి యొక్క ద్రవ్యరాశి అతన్ని చూస్తున్న మరొకరి దృష్ట్యా వేగం పెరిగేకొద్దీ ద్రవ్యరాశి కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.కాని ప్రయాణిస్తున్న వ్యక్తి దృష్ట్యా తన ద్రవ్యరాశి మారదు.ఈ సిద్ధాంతం ప్రకారం ఇద్దరూ సరైనవారే.

ఈ సిద్ధాంతం అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు అవసరము.వీటిని మరోసారి తెలుసుకొందాము.

Friday, September 26, 2008

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతం - 2


ఈ భాగం లో స్థలం వంగి ఉన్నదనే ఐన్‌స్టీన్ యొక్క అద్భుత ఆవిష్కరణ గురించి తెలుసుకొందాము. మనకు సాధారణంగా సూర్యుని వెనుక భాగాన గల నక్షత్రాలు కనపడవు.ఎందుకంటే సూర్యరశ్మి యొక్క ప్రభావం చేత.కానీ సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో వీటిని గమనించవచ్చు.ఐన్‌స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్దాంతంలో సూర్యుని వెనుకవైపు గల ఈ నక్షత్రాల కాంతి సూర్యుని వలన ఏర్పడిన స్థలకాలపు వంపు వలన సూర్యుని వద్ద వంగి ప్రయాణిస్తుందని ఆ వంపు ఎంతమేరకు ఉంటుందనే కోణం చెప్పాడు.దీనివలన ఆ నక్షత్రం యొక్క స్థానాన్ని మనం తప్పుగా చూస్తాము.ప్రక్క పటం గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.ఈ సిద్దాంతం లో ప్రస్తావించిన ఈ వంపు కోణాన్ని 1919 లో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఇద్దరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు కొలిచారు.అత్యద్భుతంగా ఐన్‌స్టీన్ చెప్పిన కోణానికి ఈ విలువ చాలా దగ్గరగా ఉంది.ఈ విధంగా స్థలకాలం వంగిఉందనే విషయం ఋజువైంది.

ఐన్‌స్టీన్ మాటల్లో సాధారణ సాపేక్షసిద్దాంతం
"ఒక్క మాటలో చెప్పాలంటే కాలము,స్థలము మరియు గురుత్వాకర్షణ మూడూ అస్వతంత్రాలు.ఇవి మూల పదార్థం కంటే వేరు కాదు."

సాధారణ సాపేక్ష సిద్దాంతం క్రింది సందర్బాలలో ఋజువైంది.
1.మెర్క్యురీ గ్రహం యొక్క చలనం (1915)
2.సూర్యుని వద్ద నక్షత్ర కాంతి వంగి ప్రయాణించడం (1919)
3.తెల్లని మరుగుజ్జు నక్షత్రాల వర్ణపటంలో ఎరుపు మొగ్గు (1924)
4.భూమి గురుత్వాకర్షణ క్షేత్రంలో గామా కిరణాల ఎరుపు మొగ్గు (1960)
5.శుక్ర,మెర్క్యురీ గ్రహాల పై రాడార్ సంకేతాల మధ్య సమయంలో తేడా కనుగొనడం(1968)
6.భూమి గురుత్వాకర్షణ వలన సమయాలలో ఎంత తేడా వస్తుంది అనే విషయం భూమిపై,అంతరిక్షంలో పరమాణు గడియారాల సహాయంతో కనుగొన్నారు.(1976)
7.మనకు,దూరంగా ఉన్న నక్షత్రాల మధ్య ఏవైనా బరువైన పదార్థాలు ఉన్నప్పుడు ఆ నక్షత్రాల గురుత్వబలాలు,కనిపించడం.(1980)
8.గురుత్వాకర్షణ తరంగాలు వెలువరిచే రేడియేషన్ వలన సక్తి నష్టం కలుగుతుందనే ఐన్‌స్టీన్ అంచనా ను జంట న్యూట్రాన్ నక్షత్రాల కక్ష్యలు వాటి మార్గం పరిశీలించడం వలన కనుగొన్నారు.(1982)

ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతం వలనే కాలం లో ప్రయాణించవచ్చనే ఊహ బయలుదేరింది.దీనికి సంభందించిన విశేషాలను ఇంకోసారి తెలుసుకొందాము.

Thursday, September 25, 2008

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతం - 1





మనకు తెలుసు ఐన్‌స్టీన్ ప్రపంచప్రఖ్యాతి పొందినది తను కనుగొన్న సాపేక్షసిద్దాంతాల వలన.ఇవి ప్రత్యేక,సాధారణ సాపేక్షసిద్దాంతాలని రెండు రకాలు.ఈ భాగంలో మనం సాధారణ సాపేక్ష సిద్దాంతం గురించి చూద్దాం.ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని ఐన్‌స్టీన్ 1915 వ సంవత్సరం లో ప్రతిపాదించాడు.(ఈ విషయంపై 1907 నుండి 1915 వరకు పరిశోధనలు చేసాడు).తర్వాతి
భాగాలలో ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం వివరాలు తెలుసుకొందాము.

మొదట సాపేక్షం అంటే ఏమిటో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకొందాము.మనం ఒక వస్తువు పొడుగ్గా ఉన్నది అంటున్నామంటే దాన్ని మనం దాని పొడవు కన్నా తక్కువ పొడవు ఉన్న వస్తువుతో పోల్చి పొడుగ్గా ఉన్నదని అంటాము.ఇలానే ఒకడు ఇంకకడికంటే వేగంగానో లేక ఆలస్యంగానో పరుగెడుతున్నాడని,ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ లేక తక్కువ మార్కులు తెచ్చుకుంటాడని చెప్తాము.అంటే ఒక వస్తువు లక్షణం దృష్ట్యా ఇంకో వస్తువు లక్షణం చెప్తున్నామన్న మాట.ఈ విధంగా మన దైనందిన జీవితంలో ప్రతివిషయాన్నీ ఇంకొక అదే లక్షణాలు గల
విషయంతో పోల్చి చూస్తుంటాము.దీన్నే "సాపేక్షము" లేక "సాపేక్షత" అంటారు.

ఇక అసలు విషయమైన సాధారణ సాపేక్ష సిద్దాంత విషయానికి వద్దాము.

ఈ సిద్దాంతము ప్రధానంగా గురుత్వాకర్షణ విషయాన్ని చర్చిస్తుంది.గురుత్వాకర్షణ విషయన్ని న్యూటన్ ప్రతిపాదించాడని మనకు తెలుసు.న్యూటన్ ప్రకారం సృష్టిలో ప్రతి వస్తువూ ఇంకొక వస్తువుని ఆకర్షిస్తోంది.ఏ రెండు వస్తువుల మధ్య ఆకర్షణశక్తి మొదట వాటి ద్రవ్యరాశి పై మరియు వాటి మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది.ద్రవ్యరాశులు పెరిగేకొద్దీ ఆకర్షణ పెరుగుతుంది.అలాగే దూరం పెరిగేకొద్దీ ఆకర్షణ తగ్గుతుంది.ఇలా సృష్టి మొత్తం ఈ నియమాలు పాటిస్తాయని న్యూటన్ కనుగొన్నాడు.ఇంతవరకు బాగానే ఉంది.కానీ అసలు అవి ఎందుకు ఆకర్షించుకొంటున్నాయో న్యూటన్ చెప్పలేదు.
సాధారణ సాపేక్షసిద్దాంతం ఈ విషయాన్ని గురించే చెబుతుంది.
మనకు తెలిసిన మూడు కొలతలు పొడవు,వెడల్పు,లోతు లతో పాటు ఐన్‌స్టీన్ నాల్గవ కొలత గా కాలాన్ని తీస్కొన్నాడు.ఈ నాలుగు కొలతలతోనే విశ్వమంతా ఉంటుంది.(మొత్తం 11 కొలతలు ఉంటాయని నేటి శాస్తవేత్తలు భావిస్తున్నారు.)ఈ నాలుగు కొలతలు గల ప్రదేశాన్నే "space time continuum" అంటారు.ఈ continuum లో ఏదైనా బరువైన వస్తువును పెట్టినప్పుడు ఆ వస్తువు పెట్టిన చోట ఒక గుంత లాగ ఏర్పడుతుంది.ఉదాహరణగా మనం దిండు(తలగడ) పైన ఏదైనా బరువైన వస్తువును ఉంచామనుకోండి.అక్కడ ఒక గుంత లాగ ఏర్పడినట్టు అన్నమాట.అర్థం కావడానికి ప్రక్క పటాలు చూడండి.ఆ గుంతకు సమీపంలోని వస్తువులు,పరిధిలోని వస్తువులు ఆ గుంతలోనికి దొర్లినప్పుడు మనకు ఆ దొర్లుతున్న వస్తువులు ఆ పెద్ద వస్తువుచేత ఆకర్షింపబడుతున్నట్టు కనబడతాయి.దీనినే ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్దాంతము అంటారు.ఎంతగా ఆ వస్తువులు దొర్లుతాయి అనే విషయం న్యూటన్ చెప్పిన సిద్దాంతం ద్వారా కనుగొనవచ్చు.

ఇది అర్థం కావడానికి సైన్సు లో ఒక ప్రసిద్ద ఉదాహరణను చెబుతారు.అది ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయాడనుకోండి.న్యూటన్ ప్రకారం ఆ విషయం వెంటనే భూమికి తెలిసిపోయి తన కక్ష్య నుండి తప్పి సరళరేఖామార్గంలో విశ్వంలోనికి వెళ్ళిపోతుంది.కాని నిజానికి అలా జరుగదు.ఎందుకంటే ఈ విశ్వంలో కాంతి కన్నా వేగంగా ఏ వస్తువూ,శక్తీ ప్రయాణించదని మనకు తెలిసిన సిద్దాంతాల ద్వారా తెలుస్తోంది.మనకు తెలుసు సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాలు తీసుకుంటాయని.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి చేరడానికి 8 నిమిషాల పైనే పడుతుంది.అప్పుడే భూమి తన కక్ష్య నుండి ప్రక్కకు తప్పుకుంటుంది.ఐన్‌స్టీన్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ సూర్యుడు మాయమైనందున space time continuum లో ఏర్పడిన గుంత మామూలు స్థాయికి వస్తుంది.ఇలా గురుత్వాకర్షణ తరంగాలు కాంతి వేగంతో వ్యాపించి ఆ continuum అంతా
బల్లపరుపుగా అవుతుంది.కాబట్టి సూర్యుడు అదృశ్యమైన విషయం భూమికి 8 నిమిషాల తర్వాతే తెలుస్తుంది.

స్థలకాలం వంగి ఉందన్న అద్భుతవిషయము,దానికి ఋజువులు మొదలగు వివరాలు తర్వాత టపాలో తెలుసుకొందాము.

Tuesday, September 23, 2008

క్షీరసాగర మధన సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దేవ దానవులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం అనే విషయం మన అందరికీ తెలుసు.మొదట ఈ కథను క్లుప్తంగా చూద్దాం.
ఈ మథనానికి మంధర పర్వతాన్ని కవ్వంగా,వాసుకి అనే పామును తాడుగా ఉపయోగించారు.పర్వతం మునిగిపోకుండా మహావిష్ణువు తాబేలు అవతారం దాల్చి తనపైన మోశాడు.దేవతలు పాము తోకభాగాన్ని,రాక్షసులు తల భాగాన్ని పట్టుకొని చిలకడం ప్రారంభించారు.ఇలా చిలుకుతుండగా చంద్రుడు,ఐరావతము,లక్ష్మీదేవి,కల్పవృక్షము,కామధేనువు,మద్యము,హాలాహలము అనే భయంకర విషము లభించాయి.హాలాహలమును శివుడు త్రాగగా,లక్ష్మీదేవిని విష్ణువు స్వీకరించాడు.మిగిలినవాటిని దేవతలు,రాక్షసులు పంచుకొన్నారు.చివరికి అమృతం లభించింది.ఇదీ సంగ్రహంగా విషయం.

మన ప్రయత్నానికి ప్రతీక పాము. మనం ఏదైనా లక్ష్యం సాధించాలి అనుకొన్నప్పుడు మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.మన లక్ష్యసాధనకు ఉపయోగపడే పరిస్థితులూ,వెనక్కు లాగే పరిస్థితులూ రెండూ ఉంటాయి. రెండు పరిస్థితులే దేవతలకు,రాక్షసులకు ప్రతినిధులు.అనుకూల పరిస్థితులకన్నా ప్రతికూల పరిస్థితులే ప్రభావం చూపిస్తాయి.కార్యసాధన జరిగేటప్పుడు సాధన వలన ఏవైనా తక్షణ పరిణామాలు ఎదురైతే వాటిద్వారా మన ప్రతికూలపరిస్థితులు తగ్గాలి.పాము విషం కక్కినప్పుడు రాక్షసులు మరణించడం లాగా అన్నమాట.దీనినే రాక్షసులు పాము తలభాగాన ఉండడము,దేవతలు తోకభాగాన ఉండడానికి ప్రతీకలు. రెండు పరిస్థితులను ఉపయోగించుకుంటూనే మనం మన లక్ష్యసాధనకు ప్రయత్నించాలి.వెనక్కులాగే పరిస్థితులనుండి మనం పాఠాలు నేర్చుకుంటూ,అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగాలి.లక్ష్యము సాధించాలంటే దృఢమైన పట్టుదల కావాలి. పట్టుదలే పర్వతానికి ప్రతీక.మన పట్టుదల జారిపోకుండా ఉండడం కోసం మనము మన యుక్తాయుక్త జ్ఞానము ఉపయోగించాలి. జ్ఞానమే మన పట్టుదలను వీడిపోకుండా భారం వహించే తాబేలు.మన కార్యక్షేత్రమే(సమాజము)పాలసముద్రము. కార్యక్షేత్రములో మనం పనిచేస్తున్నప్పుడు చిన్నచిన్న సంతోషాలు అనుకోకుండా కలుగుతాయి.అలానే చిన్నచిన్న కష్టాలూ,పెద్ద అవరోధాలూ ఎదురవవచ్చు. సంతోషాలే పాలసముద్రము చిలకగా వచ్చిన చంద్రుడు,ఐరావతము,కల్పవృక్షము,లక్ష్మీదేవి వంటివాటికి ప్రతీకలు కాగా మద్యం లాంటివి చిన్న కష్టాలకు,ప్రలోభాలకు,హాలాహలం వంటి విషము పెద్ద అవరోధాలకు ప్రతినిధులు గా చెప్పుకోవచ్చు.
చిన్నచిన్న సంతోషాల దగ్గరే ఆగిపోకుండా,అలానే కష్టనష్టాలకు,అవరోధాలకు వెరవకుండా ప్రయత్నం కొనసాగించినప్పుడే లక్ష్యసాధన అనే అమృతం మనకు లభిస్తుంది.

ఇక ఆధ్యాత్మికం గా తీసుకుంటే దేవతలు,రాక్షసులు మంచి,చెడు గుణాలకు ప్రతీకలు.కవ్వమైన పామును సాధనతోనూ,పర్వతాన్ని బుద్ధితోనూ,తాబేలును వివేకంతోనూ,పాలసముద్రాన్ని మనసుతోనూ పోల్చవచ్చు.చిలకగా మొదట వచ్చిన వస్తువులు సిద్ధులకు,అతీతశక్తులకు ప్రతీకలు.హాలాహల విషం మన సాధనను తప్పించడానికి వచ్చే పెద్ద అవరోధముల లాంటిది.వీటి దగ్గరే ఆగిపోతే శాంతి లేక మోక్షమనే అమృతం లభించదు.

Monday, September 22, 2008

నా కృతజ్ఞతలు

దేవుని దయ వలన భగవద్గీత తెలుగు భావాన్ని అంతర్జాలంలో(Internet)లో ఉంచాలనే నా కోరిక తీరింది.భావాన్ని తెలుగులో టైపు చేస్తున్నప్పుడు కానీ,పోస్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎటువంటి సమస్యలు ఎదురుకానందుకు భగవంతునికి హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను.
అలాగే ఇది టైపు చేయడానికి తమ ల్యాప్‌టాపులు ఉపయోగించుకోనిచ్చిన నా మిత్రులు కొండయ్యకూ,సుమన్ కూ నన్ను ఎంతో ప్రోత్సహించిన ఉదయ్,తేజ,గిరి,గణేష్ కూ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

దేవుడు దయ తలిస్తే భగవద్గీత యొక్క అంతరార్థాలను కూడా ఒక బ్లాగులో పోస్ట్ చేయడానికి కృషి చేస్తాను.

సినిమా ఎలా తీస్తారు?(సైన్సు)

మనమందరూ సినిమాలు చూస్తాము.కానీ సినిమాలు ఏ విధంగా తీస్తారు,బొమ్మలు ఎలా కదులుతున్నాయి అనే విషయం ఇంకా కొందరికి తెలియదు.

సినిమా తీయడానికి మూలాధారము తీసే కెమెరా,తీసిన సినిమాను చూపించే ప్రొజెక్టరు.

కెమెరా:
మన అందరికీ తెలుసు ఫోటో కెమెరా ఎలా పని చేస్తుందనే విషయం.కెమెరా క్లిక్ చేసినప్పుడు కెమెరా కు ముందున్న కుంభాకారకటకం(lens) ద్వారా మన బింబం యొక్క కాంతికిరణాలు కటకం వెనుక భాగమున ఉన్న
ఫోటోగ్రాఫిక్ ఫిల్ము పై పడి అక్కడ మన ప్రతిబింబమును ఏర్పరుస్తాయి. ఆ ఫిల్ము పై రసాయనాలు పూసిఉండడం వలన ఇది జరుగుతుంది.తర్వాత మనమే తర్వాత ఫిల్ము వచ్చేలా తిప్పాలి లేక దానంతటదే( ఆటోమేటిక్ ఐతే) తరవాత ఫిల్ము వచ్చేలా తిరుగుతుంది.ఇది కదలని చిత్రాలకోసం ఐతే.

మన కన్ను సెకనుకి 16 దృశ్యాలకంటే ఎక్కువ ఉంటే గనుక ఆ దృశ్యాన్ని గుర్తించలేదు.సరిగా ఇదే విషయాన్ని సినిమా కెమెరా నిర్మాణ విషయంలో ఉపయోగిస్తారు.

మామూలు కెమెరా లో లాగానే ఫిల్మురీలు ఉంటుంది.కానీ సెకనుకి 16 లేక అంతకన్నా ఎక్కువ ఫిల్ములు మారుతుంటాయి.వాటిపై తీయబడే దృశ్యాల ప్రతిబింబాలు పడతాయి.ఫిల్ము లో ఒక భాగంగా ఒక వైపు ఒక
నల్లని గీత, శబ్దము సంగ్రహించడానికి ఉంటుంది.

నేటి కెమెరాలు సెకనుకి 24 ఫిల్ములపైన తిప్పుతుంటాయి.దానివలన చిత్రంలో స్పష్టత వస్తుంది.

ఇలా తయారుచేసిన రీలును నెగెటివ్ అంటారు(మామూలు కెమెరా లో లాగానే).తర్వాత దాన్ని కడిగి(develop)ఇంకా కావలసినన్ని ఫిల్మ్ లపైన ముద్రిస్తారు.వీటిని పాజిటివ్ లు అంటారు.

ప్రొజెక్టరు:
ఇలా తీసిన ఫిల్మ్ రీళ్ళను ప్రొజెక్టరులో ఉంచుతారు.
ఈ ప్రొజెక్టరు నిర్మాణం ఎలాగుంటుందంటే ముందు ఒక కుంభాకారకటకం ఉంటుంది.దాని వెనుక మరి కొన్ని కటకాలు ఉంటాయి.వీటన్నిటి వెనుక ఫిల్మ్ రీలు ఉంటుంది.ఈ రీలుని తిప్పి పెడతారు.ఎందుకంటే కటకాల గుండా ప్రయాణించి ఇది మామూలు దృశ్యం గా వస్తుంది.ఫిల్మ్ రీలు గుండా శక్తివంతమైన కాంతి ని పంపిస్తారు.

ఈ కాంతి రీలు గుండా ప్రసరించి తెర పైన బొమ్మలను ఏర్పరుస్తుంది.ఈ రీలు తీసినప్పుడు సెకనుకి ఎన్ని ఫ్రేములు తిరిగి ఉంటుందో అన్ని ఫ్రేములుగా ప్రొజెక్టరు లోని మోటరు తిప్పుతుంది.నల్ల గీతపై శబ్దగ్రహణ సాధనం
తగులుతూ అందులోని శబ్దాన్ని గ్రహించి బయటకు ఇస్తుంది.సెకనుకు 16 పైన(ఇప్పుడు 24) ఫ్రేములు తిరగడం వలన మన కళ్ళు కనబడే దృశ్యాలను కదులుతున్నట్టుగా చూస్తుంది.

ఈ ఆధునిక కాలంలో డిజిటల్ కెమెరాలు వచ్చాయి.ఉపగ్రహం ద్వారా కూడా సినిమాలు చూపిస్తున్నారు.

Sunday, September 21, 2008

భగవద్గీత శ్లోకం - దాని అంతరార్థం

యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్దరః
తత్ర శ్రీ ర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ " (18 వ అధ్యాయం,78 శ్లోకం)

సామాన్య అర్థం:
ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారి ఐన అర్జునుడు ఉంటారో అక్కడ ఐశ్వర్యము, విజయము చేకూరుతాయి.

అంతరార్థము:
ఎక్కడ మనుష్య ప్రయత్నము,దైవానుగ్రహము రెండూ కలుస్తాయో అక్కడ ఐశ్వర్యము, విజయము చేకూరుతాయి.

Saturday, September 20, 2008

భగవద్గీత శ్లోకం - ఒక అపార్థం

భగవద్గీత 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్యయోగం లోని 32 వ శ్లోకం గమనించండి.
"మాం హి పార్థ! వ్యపాయేపి స్యుః పాపయోనయః
స్త్రీయో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం!"
అర్థము:
నన్ను(శ్రీకృష్ణున్ని) ఆశ్రయంచినవారు పాపజాతి వారు కానీ,స్త్రీ లైనా కానీ,వైశ్య,శూద్రులైనా కానీ మోక్షం పొందుతారు.
కాని ఈ శ్లోకం చాలా అపార్థాలకు గురైంది.
కారణం దీన్ని " పాపజాతి వారైన స్త్రీలు,వైశ్యులు,శూద్రులు " అని అపార్థం చేసుకొన్నారు.
అంటే స్త్రీలు,వైశ్యులు,శూద్రులు పాపజాతివారని అపార్థం చేసుకొన్నారు.
కొందరు పండితుల అనుకోని అనువాదం వలన వచ్చిన చిక్కు ఇది.

ఆంగ్లంలో మనకు తెలిసిన వ్యాకరణ దోషం వలన అర్థం మారిన "Leave him not hang him" అనేది.
Leave him not,hang him అనగా అతడిని వదలద్దు,ఉరి తీయండి అని.
Leave him,not hang him అనగా వదలండి ,ఉరి తీయవద్దు అని.

చూసారా కేవలం కామా(,) స్థానం మార్పు వలన మారిన అర్థాలు.

క్రింది సుమతి పద్యం గమనించండి.

అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారుటేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!

అవసరానికి అప్పిచ్చువాడు. జబ్బు వస్తే చికిత్స చేసేందుకు వైద్యుడు, ఎప్పుడూ ఎండిపోకుండా ప్రవహించే ఏరు, శుభ, అశుభ కార్యాలు చేయించే బ్రాహ్మణుడు ఉండే ఊరిలో మాత్రమే నివసించండి. వీరు లేని ఊళ్లో ఎన్నటికీ
ఉండవద్దు.

ఇక్కడ బద్దెన (సుమతి శతకం వ్రాసినవాడు) ఉద్దేశ్యము ఇలా ఉంటే "అప్పిచ్చువాడు వైద్యుడు" అని మనవారు అపార్థం చేసుకొన్నారు.

Friday, September 19, 2008

కృష్ణబిలాలు లేక కాలబిలాలు(Blackholes) - వివరణ

ఈ మధ్య బిగ్‌బ్యాంగ్ ప్రయోగం అనగానే అందరినీ భయపెట్టినవి కృష్ణబిలాలు అనే విషయం.అసలు వీటి కథాకమామీషు ఏమిటి?

కృష్ణబిలం అనగా ఒక నక్షత్రం పూర్తిగా నశించగా ఏర్పడే అత్యంత చిన్న పదార్థము(ఆ నక్షత్రము మునుపటి రూపంతో పోల్చుకుంటే). ఈ బిలం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పడిన కాంతి కూడా బయటకు రాలేనంత గురుత్వాకర్షణశక్తి దీనికి ఉంటుంది.మనకు తెలుసు భూమి యొక్క ఆకర్షణశక్తిని దాటుకొని అంతరిక్షంలోనికి వెళ్ళాలంటే సెకనుకు సుమారుగా 11 కిలోమీటర్ల వేగంతో పైకి ప్రయాణించాలి.కాని కృష్ణబిలంలో ఈ వేగం కాంతివేగం కన్న ఎక్కువ ఉండాలి.ఈ వేగాన్ని ఇంతవరకు కనుక్కోలేదు.

కృష్ణబిలాలు ఎలా ఏర్పడుతాయి:

ఒక నక్షత్రం కాంతిని వెలువరచాలి అంటే అందులోని హీలియం ప్రధాన కారణం.ఆ నక్షత్రంలోని హీలియం పూర్తిగా శక్తిగా మారిపోయిన తర్వాత ఆ నక్షత్రం తన స్వంత గురుత్వాకర్షణ ప్రభావం చేత తనలోని పదార్థం తన కేంద్రం వద్దకు ఆకర్షింపబడుతుంది.దీనివలన ఆ నక్షత్రపరిమాణం తగ్గుతూ తెల్లని మరుగుజ్జుగా,న్యూట్రాన్ తారగా మారతుంది.అలా మారుతూ ఒక నిర్దిష్టపరిమాణానికి చేరుకుంటుంది.ఆ పరిమాణం మన కంటికి కనిపించనంత సూక్ష్మపరిమాణం కూడా కావచ్చు.అది సెంటిమీటరులో కోటి వంతుకూడా కావచ్చు.కాని దాని ద్రవ్యరాశి వందలకోట్ల టన్నుల వరకూ ఉంటుంది.ఇవి సూక్ష్మ కృష్ణబిలాలు.ఇవి అత్యంత అధికసాంద్రత కల్గినవి.ఒక మిల్లిమీటరులో కొన్ని కోట్ల టన్నుల ద్రవ్యరాశి నిక్షిప్తమైన అధిక సాంద్రత కలిగి ఉంటాయి. వీటి గురుత్వాకర్షణ చాల ఎక్కువ కాబట్టి వీటి పరిమాణమును బట్టి తన చుట్టుపక్కల ఉన్న ద్రవ్యరాశిని తమలోనికి లాగుకుంటాయి.

వీటి గురుత్వాకర్షణశక్తి పరిధిని సంఘటనా క్షితిజము(Event horizon)అంటారు.ఈ క్షితిజములోనికి ప్రవేశించిన ఏ వస్తువూ (కాంతితో సహా) బయటకు రాలేవు. ఒక వేళ రెండు కృష్ణబిలాలు కనుక కలిస్తే వాటి ద్రవ్యరాశి,సంఘటనా క్షితిజం రెట్టింపు కన్నా ఎక్కువ అవుతాయి.

చంద్రశేఖర్ పరిమితి(Chandrasekhar limiT):

ఏ నక్షత్రమైనా కృష్ణబిలముగా మారాలంటే ఒక నిర్దిష్ట ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉండాలి.చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం(ఇతనికి నోబుల్ బహుమతి వచ్చింది)అనే భారతీయశాస్త్రవేత్త ఈ నిర్దిష్టద్రవ్యరాశి పరిమితిని కనుగొన్నాడు.ఈ పరిమితి మన సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.5(ఒకటిన్నర)రెట్లు అధిక ద్రవ్యరాశి. కృష్ణబిలాలు మరీ కారునలుపేమీ కాదు.ఇవి ఒక వేడివస్తువులాగానే ఉష్ణమును వెలువరుస్తుంటాయి.అత్యంత సూక్ష్మస్థాయిలలో గామా కిరణాలను వెలువరుస్తాయి.

కొన్ని విశేషాలు:

1.విశ్వము ఏర్పడినప్పుడు చాలా కృష్ణబిలాలు ఏర్పడిఉంటాయని నమ్ముతున్నారు.ఐతే అప్పటి కృష్ణబిలాలు ఇంకా ఇప్పటికి ఉండవని శాస్త్రవేత్తల అంచనా.

2.సగటున మన భూమికి,ప్లూటోకు ఎంత దూరం ఉంటుందో అంత పరిధిలోపల 100 దాకా కృష్ణబిలాలు ఉంటాయని అంచనా.

3.కృష్ణబిలాలూ తమ అంత్యదశలో బ్రహ్మాండమైన విస్పోటనం తో పేలిపోతాయి.

4.ఒక నక్షత్రం పేలిపోవడాన్ని సూపర్‌నోవా(SuperNova) అంటారు.

(వనరు(resourse): స్టీఫెన్ హాకింగ్ పరిశోధనలు )

Wednesday, September 17, 2008

కర్మసిద్దాంతము-సంక్షిప్త వివరణ

"కర్మసిద్దాంతం".అత్యంత చర్చకు లోనైన సిద్దాంతము ఇది.ఎన్నో అపార్థాలకు గురైన సిద్దాంతం ఇది.

ఈ వ్యాసంలో కర్మసిద్దాంతాన్ని గురించి చర్చించడం జరిగింది.సరే అసలు ఈ కర్మసిద్దాంతం అంటే ఏమిటి. ముఖ్యముగా ఈ సిద్దాంత విషయం ఏమిటంటే "కారణం లేని కర్మఫలితాలు (కార్యము) అనేవి ఉండవు"అని.
అంటే మనము అనుభవించేది సుఖమైనా కావచ్చులేక దుఖమైనా కావచ్చు
ఈ సుఖదుఃఖాలకు కారణం మనం పూర్వజన్మలలో చేసిన కర్మలైనా కావచ్చు,లేక ఈ జన్మలో చేసిన కర్మలైనా కావచ్చు.మరి మనము చేసిన కర్మల యొక్క ఫలితాలను
మనము ఖచ్చితంగా అనుభవించవలసిందేనా? ఖచ్చితముగా అనుభవించవలసిందే.భగవద్గీత లో శ్రీకృష్ణుడి వాక్కు చూడండి
"అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం".
అంటే "చేసిన కర్మల ఫలితం అది చెడైనా ,మంచైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే."
మీరు బాణం వదిలారు.ఇక అది ఎక్కడికి వెళ్ళేదీ మీ చేతుల్లోనే లేదు.మీరు వదలడంవలన అది ఖచ్చితంగా దేనికో ఒకదానికి తగలకతప్పదు. వేసే ముందే అది మన చేతుల్లోఉంది.
మరి, కొందరు ఈ కర్మసిద్దాంతం పేరు చెప్పి నానా తప్పులు చేస్తున్నారు కదా అని మీరనవచ్చు.నిజమే.వారికి నిజంగా సిద్దాంతం గురించి తెలియదనే అనుకోవాలి.ఇలాంటి వారిని డాంభికులు అంటారు.అంటే లోన ఒకటి ఉంచుకుని బయటికి మరోలా ఉండేవారు.
ఈ కర్మలు మూడు రకాలు.అవి ప్రారబ్ద,సంచిత మరియు ఆగామి కర్మలు.
ప్రారబ్దకర్మలనగా గతజన్మల కర్మల ఫలితాలు. సంచితకర్మలనగా ఈ జన్మలో ఇప్పటివరకు చేసిన కర్మల సంచితం.
ఆగామికర్మలనగా మన ప్రస్తుతము చేయబోవు పనుల ద్వారా భవిష్యత్తులో అనుభవించు ఫలితాలు.


ఈ కర్మసిద్దాంతం లో చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది.ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు."పల్లెటూళ్ళలో ఎద్దులనుకానీ,ఆవులను కానీ లేక గేదెలను గానీ ఒక తాడుతో గుంజకు కట్టిఉండడం చూసేఉంటారు.అవి ఆ తాడు యొక్క పరిధిలో ఏమైనా చేసుకోవచ్చు.ఎలా ఐనా తిరగవచ్చు.కానీ ఆ తాడు పరిధిని దాటి మా పోలేవు.వాటి స్వేచ్చ అంతా ఆ తాడులోపలే."
"అలానే మనకు భగవంతుడు కొంత స్వేచ్చను ఇస్తాడు.ఇక్కడ తాడు అనగా మన గత కర్మల ఫలితం.మన యొక్క నిష్కామ కార్యాల వలన దేవుడు తాడు పొడవు ఇంకా పెంచవచ్చు.అప్పుడు మరింత స్వేచ్చ మనము పొందగలము."

నిష్కామకార్యాలనగా నిస్సంగత్వంతో పనులు చేయడం.అంటే మన పనుల వలన మనలో ఎటువంటి వికారాలు అనగా ఆ పనికి సంబందించిన ఎటువంటి బంధము కూడా మన మనసులో ఉండరాదు.ఇదే కర్మయోగము అనబడుతుంది.అసలు కర్మలే చేయకుండా ఉండవచ్చుకదా అనుకోవచ్చు.కాని ఏ కర్మా చేయకుండా మనము ఒక క్షణము కూడా బ్రతకలేము.అందువలనే నిష్కామకర్మ చేయమని చెప్పారు.
అసలు తాడే లేకుండా చేసుకోవడానికి ఒక మార్గం ఉంది.అదే కర్మయోగం.క్రితం టపాలో దీని గురించి వివరించడం జరిగింది.క్లుప్తంగా మన పనులను నిస్సంగత్వం తో చేయడం.
ఈ సిద్దాంతంలో ముల్లును ముల్లుతో తీయడం అనేది ఉంది.చెడు కర్మలు అనే ముల్లును మంచికర్మలు అనే ముల్లు తో తీసివేసి తర్వాత ఈ ముల్లును కూడా పారవేయాలి.అంటే మంచిపనులు కూడా చేయకూడదా అని అడగవచ్చు.చేయాలి కాని నిష్కామముగా చేయాలి.నిష్కామకర్మ యొక్క పూర్తీ వివరాలకు భగవద్గీత యొక్క 2,3,4 అధ్యాయాలు చదవండి.

భగవద్గీతలోనే ఇంకో శ్లోకం లో "జ్ఞానాగ్ని దగ్ద కర్మాణం"అని ఉంది.అంటే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలఫలితాన్ని దగ్దం చేస్తుంది అని అర్థం.
కొందరు అంటారు ఈ జ్ఞానాగ్ని మన పూర్వజన్మల మరియు గత కర్మల ఫలితాన్ని దగ్దం చేయదు అని.కానీ చేస్తుంది.ఉదాహరణకు దశరథుడు చనిపోయినప్పుడు అతని ముగ్గురు భార్యలు ఒక్కసారే విధవలయ్యారా లేక ఒకొక్కరు ఒక్కసారి విధవ అయ్యారా? అలానే జ్ఞానాగ్ని కూడా మన కర్మలన్నిటిఫలితాన్ని దగ్దం చేస్తుంది.ఇక్కడ జ్ఞానం అనగా భగవత్‌జ్ఞానం అనగా సర్వ సృష్టి యందు ఒకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడనే జ్ఞానం.మరి ముందే చెప్పారుగా శ్రీకృష్ణుడు గీతలో ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అని.మరి ఇప్పుడేమో జ్ఞానాగ్ని కర్మలను దగ్దం చేస్తుంది అంటున్నాడు.కృష్ణుడు రెండు మాటలు చెప్తున్నాడా అనే సందేహం వస్తుంది.కాని ఆయన అలా చెప్పలేదు.మనకు తెలుసు అగ్ని ఒక వస్తువును పూర్తిగా దగ్దం చేసినా ఆ భస్మం చేసిన జాడ అక్కడే(అనగా బూడిద లేక మసి) ఉంటుంది.
అలానే మనము చేసిన కర్మల ఫలితం దాదాపు పూర్తిగా దగ్దమైనా ఇంకా వాటి జాడ లేశ మాత్రంగా ఉంటుంది.అదెలాగంటే మన గతకర్మల ఫలితంగా మన కాలు ఒక్కటి పోవలసింది అనుకొందాము.కాని మనం సంపాదించిన జ్ఞానాగ్ని వలన మనకాలికి ఒక ముల్లు గుచ్చుకోవడం వలన కర్మ ఫలితం పోవచ్చు.ఈ విధంగా మన కర్మఫలితం ఆ మేరకు తగ్గించబడడం జరుగుతుంది.
ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి భగవత్ప్రీత్యర్థ కర్మలు చేయడం(నిస్వార్థసేవ,సత్యవాక్పరిపాలన,కపటం లేకుండడం మొదలగునవి ),కర్మల పట్ల అసంగత్వం కలిగిఉండడం (కర్మయోగం) అవసరం.

Tuesday, September 16, 2008

గతాన్ని చూడవచ్చు(ఒక సాంకేతిక(సైంటిఫిక్)విశ్లేషణ)




నేడు సైన్సు విజ్ఞానము ఎంతో విస్తరిస్తోంది.కాలయంత్రాలు(Time Machines) ఊహ చాలాకాలంగా ఉంది.వీటిలో గతంలోనికి మరియు భవిష్యత్తు లోనికి ప్రయాణించాలని అనుకోవచ్చు.ఐతే భవిష్యత్తు లోనికి ప్రయాణించడం ఆచరణ సాధ్యం కాదు.ఎందుకంటే భవిష్యత్తు ఇంకా జరగలేదు కాబట్టి.
అలానే గతంలోనికి కూడా ప్రయాణించడం సాధ్యం కాదు.
ఐతే గతాన్ని,గతంలో ఒక ప్రదేశంలో జరిగిన సంఘటనలను ప్రత్యక్షంగా చూడడానికి ఆస్కారం ఉంది.ఇది అత్యంత కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు అని చెప్పడానికి ఈ ప్రయత్నం.ఈ విషయం అర్థం చేసుకోవడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు.సరే ఇక విషయానికి వద్దాము.

మొదట ఒక విషయం తెలుసుకోవాలి.అదేమంటే మనం ఒక వస్తువునిగానీ తద్వారా ఒక సంఘటనను చూడాలంటే ఆ వస్తువుపైన కాంతి పడి ఆ పడిన కాంతి మన కన్నులను చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలము.కాబట్టి మనం చూడాలంటే కాంతి అవసరము.

మనలో చాలామందికి తెలుసు కాంతి వేగం సుమారుగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు అని.ఈ విధముగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ఒక సంవత్సరం పాటు ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతిసంవత్సరము అంటారు.(ఒక కాంతి సంవత్సరము= 5,880,000,000,000 మైళ్ళు లేక 9,460,000,000,000 కిలోమీతర్లు లేక 63,240 A.U(ఆంగ్‌స్ట్రాం యూనిట్లు)). కాబట్టి కాంతి సంవత్సరము అంటే అది సంవత్సరాలను సూచించేది కాదు దూరాన్ని సూచించేది అని అర్థం చేసుకోవాలి.
సూర్యుని నుండి భూమికి కాంతి ప్రసారం కావడం గమనించండి.సూర్యుని నుండి భూమికి కాంతి చేరడానికి సుమారుగా 8 నిమిషాలు పడుతుంది.అంటే ఇంతకు ముందు మనము అనుకున్నదాని ప్రకారము మనము 8 నిమిషాల క్రిందటి సూర్యున్ని చూస్తున్నాము.ప్రస్తుతము(అంటే ఈ క్షణము)సూర్యునిలో ఒక గమనింపదగ్గ పెద్ద పర్వతము ఆకుపచ్చ రంగులోనికి మారిందనుకుందాము.ఆ సంఘటనకు సంబంధించిన కాంతి కిరణాలు మనలను చేరడానికి 8 నిమిషాల సమయం తీస్కుంటాయి కాబట్టి మనకు ఆ పర్వతం ఆకుపచ్చ రంగులోకి మారడం మనం ఇప్పటి నుండి 8 నిమిషాల తర్వాత మాత్రమే చూడగలము.
ఒక పరిశీలకుడు భూమి పైన గల ఒక ప్రదేశము నుండి 4 కాంతి సంవత్సరాల దూరంలో ఒక దూరదర్శిని(Telescope)ను కలిగిఉన్నాడనుకుందాము.ఈ పరికరము అంతదూరము నుండి కూడా స్పష్టంగా భూమిపైన గల ప్రదేశాన్ని చూపగలిగినదై ఉండాలి.

ఆ ప్రదేశము నుండి భూమిపైన గల ఒక ప్రదేశాన్ని అతను చూస్తున్నప్పుడు అతనికి 4 సంవత్సరాల క్రిందటి విషయము చూస్తుంటాడు.ఎందుకంటే ఇంతకుముందు మనము చెప్పుకున్న దాని ప్రకారము 4 సంవత్సరాల క్రిందటి కాంతికిరణాలు అతన్ని ఇప్పుడు(అతని సమయం ప్రకారం)చేరుతున్నాయి.మన కాలం ప్రకారం ఇప్పుడు మనకు జరుగుతున్న విషయాలు అతను చూడాలంటే 4 సంవత్సరాలు జరగాల్సిందే.అప్పుడు మాత్రమే ఈ క్షణమున మన వద్ద జరిగిన సంఘటనల కాంతి కిరణాలు 4 సంవత్సరాల తర్వాత అతనికి చేరి అతను అప్పుడు చూడగలడు.(ఇక్కడ పరిశీలకుడు మనము ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నాడని అనుకుందాము).

3 వ పటం గమనిస్తే పరిశీలకుడు ఒక కాంతిసంవత్సరము దూరం నుండి ఒక సంవత్సరం క్రిందటి సంఘటనలను,2 కాంతి సంవత్సరాల దూరం నుండి 2 సంవత్సరాల క్రిందటి సంఘటనలను అలాగే 3,4 కాంతిసంవత్సరాల దూరం నుండి 3,4 సంవత్సరాల క్రితం సంఘటనలను చూస్తాడని తెలుసుకోవచ్చు.(ఈ సంవత్సరాలనేవి మన దృష్ట్యా నేను చెప్తున్నాను.పరిశీలకునికి అవి అప్పుడే జరుగుతున్నట్లు అనుకుంటాడు).

ఇప్పుడు పటం(4) గమనించండి.ఇక్కడ పరిశీలకుడు భూమిపైన ఈ క్షణంలో కాంతివేగంతో ప్రయాణం మొదలు పెట్టాడనుకుందాము.అతను భూమిపైన తను బయలుదేరిన ప్రదేశాన్ని చూస్తూ వెనుకకు ప్రయాణిస్తున్నాడనుకుందాము.అప్పుడు భూమిపైన జరుగుతున్న సంఘటనల సమాచారాన్ని తీసుకువెళ్ళే కాంతి తో పాటు అతడు ప్రయాణిస్తుంటాడు.ఇక్కడ అత్యంత ఆశ్చర్యకర అనుభవాన్ని పరిశీలకుడు పొందుతాడు.అదేమంటే కాలం నిలిచిపోయినట్టు అతడికి అనుభవం అవుతుంది.అతడు బయలుదేరిన క్షణంలో సంఘటన ఐతే అతను భూమిపైన చూశాడో అదే సంఘటనను అతను చూస్తూనే ఉంటాడు.ఎందుకంటే అతను సంఘటనను చూపించే కాంతికిరణాలతోపాటే అదే వేగంతో(అంటే కాంతి వేగంతో) అతడు ప్రయాణిస్తున్నాడు.దానివలన అతను ఎంతదూరం పోయినప్పటికీ అతను చూసిన సంఘటన ను చూపించే కాంతికిరణాలు కుడా అతనితో పాటే వస్తుండడం వలన అతనికి సంఘటన తప్ప వేరే ఏమీ కనిపించదు.కాబట్టి కాలం నిలిచిపోయినట్లు అతడికి అనుభవం అవుతుంది.

ఇపుడు పటం(5) గమనించండి.ఇక్కడ పరిశీలకుడు కాంతికి రెట్టింపు వేగంతో ప్రయాణం మొదలుపెట్టాడనుకుందాము.ఆ సమయం సెప్టెంబరు 16,2008 అనగా ఈ రోజు అనుకుందాము.అతను ఈ రెట్టింపు వేగముతో రెండు సంవత్సరాల పాటు పైకి ప్రయాణించాడనుకుందాము.అప్పుడు మనకు సెప్టెంబరు 16,2010 అవుతుంది..ఇప్పుడు అతను అక్కడ ఆగి భూమివైపు చూస్తున్నాడనుకుందాము.కానీ ఇక్కడే విచిత్రము జరుగుతుంది.ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి.
పటం(5) గమనిస్తే అతను కాంతికి రెట్టింపువేగంతో 2 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత పరిశీలకుడు B స్థానం వద్ద,కాంతి A స్థానం వద్ద ఉంటుంది.అంటే కాంతి 2 సంవత్సరాల దూరంలో,పరిశీలకుడు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాడు.అంటే అప్పుడు మనకు సెప్టెంబర్ 16,2010 అవుతుంది.ఇప్పుడు మనం ఈ రోజు సెప్టెంబర్ 16,2010 అనుకుందాము.అంటే ఒకటవ కాంతి సంవత్సరం దూరానికి ఇప్పటి మన సంఘటనల కాంతికిరణాలు పోవడానికి ఒక సంవత్సరం పడుతుంది.ఒకటవ కాంతి సంవత్సరం దూరంలో సెప్టెంబర్ 16,2009 యొక్క సంఘటనలు చూడవచ్చు.2 కాంతి సంవత్సరాల దూరంలో సెప్టెంబర్ 16,2008 నాటిసంఘటనలు,3 కాంతి సంవత్సరాల దూరంలో సెప్టెంబర్ 16,2007 నాటి సంఘటనలు మరియు 4 కాంతి సంవత్సరాల దూరంలో అంటే మన పరిశీలకుని స్థానంలో సెప్టెంబర్ 16,2006 యొక్క సంఘటనల కాంతి కిరణాల కారణంగా పరిశీలకుడు సెప్టెంబర్ 16,2006 వ రోజును చూస్తుంటాడు.
అంటే అతను బయలుదేరింది సెప్టెంబరు 16,2008,కానీ అతను చూస్తున్నది సెప్టెంబరు 16,2006.
దీనిని బట్టి అతను 2 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత మన ప్రకారం సెప్టెంబరు 16,2010 చూడాల్సింది అతను గతం లోని సెప్టెంబరు 16,2006 చూస్తున్నాడు.అంటే మొత్తం అతను 4 సంవత్సరాల క్రిందటి విషయాలను ప్రత్యక్షంగా చూస్తున్నాడు.పైన జరిగిన సంఘటనలు కాంతి కన్నా రెట్టింపు వేగంతో పొయినప్పుడు జరుగుతున్నాయి.ఇక్కడ నిజానికి 2 సంవత్సరాలు గడిచిపోయి సెప్టెంబరు 16,2010 వచ్చినప్పటికీ ఇప్పటి సంఘటనలకు సంభందించిన కాంతి కిరణాలు పరిశీలకుని చేరడానికి ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది.అంటే మన ప్రకారం సెప్టెంబరు 16,2014 వ తేదీ అతను సెప్టెంబరు 16,2010 యొక్క సంఘటనలను చూడగలడు.కాబట్టి గతాన్ని చూడగలమని స్పష్టంగా అర్థం అవుతోంది.మనము చూడగలము కానీ గతాన్ని మార్చడంకానీ,గతంలో పాల్గొనడం కానీ చేయలేము.
కానీ ఇది ఆచరణసాధ్యం కాకపోవడానికి కొన్ని పరిమితులు అడ్డుగా నిలుస్తున్నాయి.

పరిమితులు(Limitations):

ఐన్‌స్టీన్ సిద్దాంతం ప్రకారం సృష్టి లో ఏ వస్తువూ కాంతివేగాన్ని మించి ప్రయాణించలేదు.అలా ప్రయాణించాలంటే ఆ వస్తువు ద్రవ్యరాశి అనంతం కావాలి.కాని నేటి శాస్త్రవేత్తలు కాంతి కన్నా వేగం గా ప్రయాణించే కొన్ని రకాలైన కిరణాలను కనుగొన్నారు.
కాబట్టి గతాన్ని చూడాలంటే మనిషిని కిరణాలుగా మార్చాలి.తిరిగి అంత దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి మనిషిగా మార్చాలి.ఇది మన ఊహకు అందని విషయం.
అందువలనే గతాన్ని చూడడం అనే విషయం అత్యంత కష్టమైన విషయం.దాదాపుగా అసాధ్యమైన విషయం.

పైన పేర్కొన్న నిరూపణ కేవలం జరగవచ్చు అని చెప్పగలము కానీ జరుగుతుంది అని అనలేము.
పైన పేర్కొన్న నిరూపణ ఐన్‌స్టీన్ యొక్క సాపేక్ష సిద్దాంతం ద్వారాచేయడం జరిగింది.
పై వ్యాసం ద్వారా కొన్ని కొత్త విషయాలు మనము గ్రహించవచ్చు.అవేమిటో ఇంకో సారి చూద్దాము.

Monday, September 15, 2008

కర్మయోగ రహస్యము

కర్మయోగమనునది నాలుగు యోగాలలో ఒకటి.ఈ యోగ సారాంశమంతా భగవద్గీత లోని రెండు శ్లోకములలొ ఉంది.
వాటి అర్థాలు:
1.కర్మ చేయుటకు నీకు అధికారము గలదుకాని దాని ఫలితమందు ఆసక్తి కలిగివుండుటకు లేదు.అట్లని కర్మలు చేయుట నీవు మానరాదు.

2.ఏ కర్మ చేయుచున్నను నీవు అసంగత్వం తో మరియు శ్రద్దగా నిపుణత్వం తో చేయాలి.అనగా నీవు కావాలనుకున్నప్పుడు ఏ క్షణము లో నైనా ఆ పనితో సంబంధం లేకుండా బయటకు వచ్చేయగలగాలి.

ఈ ప్రపంచములో గెలుపు,ఓటములు అనేవి కేవలము మన శ్రమ పైనే ఆధారపడిలేవు.ఒక పని కావడానికి మన శ్రమ అత్యంత ముఖ్యము ఐనప్పటికీ ఆ పని విజయవంతము కావడానికి ఇంకా చాలా పరిస్థితులు అనుకూలించాలి.ఆ పరిస్థితులలో చాలామటుకు మన చేతులలో ఉండవు.కాబట్టి మన భాద్యత ఏమిటటంటే ప్రయత్న లోపం లేకుండా మన పనిని మనము నిర్వర్తించడం.అటువంటప్పుడు పని సఫలమైనప్పుడు విజయానందం,ఒకవేళ కాకపొతే పనిని నిర్వర్తించిన ఆనందం కలుగుతాయి.అందువలనే పని యొక్క ఫలితంపైన ఆసక్తి ఉంచుకోరాదు.

రెండవ దానికి ఉదాహరణగా యజమాని ఇంట్లో పనిచేయు దాది ని చెప్పుకోవచ్చు. ఆ దాది తన యజమాని బిడ్డలను తన బిడ్డలగా భావించి పెంచుతున్నప్పటికి ఆమె ధ్యాస అంతా తన సొంత ఇంటి పైనే ఉంటుంది.అలా అని ఆమె తన యజమాని పని కూడా శ్రద్దగానే చేస్తుంది.ఏ లోటూ రానివ్వదు.అంటే మనము పని చేయుచున్నప్పటికి మన మనసు భగవంతుని దగ్గర ఉండాలి.ఇదే కర్మయోగ రహస్యము.

Saturday, September 13, 2008

శాంతి మంత్రము (పూర్తి శ్లోకము)

అసతోమా సద్గమయా

తమసోమా జ్యోతిర్గమయా

మృత్యోర్మా అమృతంగమయా

ఆవిరావిర్మయేతి రుద్రయిత్తే

దక్షిణమ్ ముఖం తేనమామ్ పాహినిత్యం

ఓం శాంతి శాంతి శాంతిః

అర్థము:

అసత్(భ్రాంతి) నుండి   సత్ (సత్యము) కు 
చీకటి (అజ్ఞానము) నుండి వెలుగు(జ్ఞానము) నకు
మృత్యువు నుండి అమృతత్వము వైపునకు మనము పోవుదము గాక.
అందుకొరకై దక్షిణముఖుడైన రుద్రున్ని మేము నిత్యమూ అనగా ప్రతిరోజూ ప్రార్థిస్తాము. 

ఓం శాంతి శాంతి శాంతి

Thursday, September 11, 2008

అనుకూల వేదాంతము

ఈ మధ్యకాలంలో మనుషులు తమ స్వార్థమునకు తగినట్టుగా పరిస్థితులను సమర్థించుకుంటున్నారు.ఒక హంతకునికి న్యాయమూర్తి మరణశిక్ష విధించాడు.అప్పుడు ఆ హంతకుడు జేబులోని భగవద్గీతను తీసి "చంపింది నేను కాదు,చచ్చినది వాడు కాదు;దీనికీ కృష్ణుడే సాక్షి,ఫలానా శ్లోకం చూడండి"అన్నాడు.జడ్జి కూడా తెలివితక్కువ వాడు కాదు."శిక్ష విధించింది నేను కాదు,చచ్చేది నీవు కాదు-చావు పొమ్మ"న్నాడు.ఆపత్సమయములో ప్రదర్శించే యుక్తి,కుయుక్తులివి.మరియు "చచ్చేది తానూ కాదు.చంపించేది జడ్జి కాదు"అని ఎందుకనుకోరాదు?

అన్ని సమయాలందు సమచిత్తాన్ని అనుభవించాలి.

అవసర అనుకూల విషయాలను మాత్రం తీసుకొని అననుకూల విషయాలను విరుద్ధమైనవిగా భావించుకోవడం సరైన ఆధ్యాత్మికం కాదు.

వేదాంతమంటే ఇది కాదు.మన కర్తవ్యనిర్వహణ మనం చేయాలి.అయితే సర్వము భగవత్ప్రీత్యర్థముగా వదలాలి.జగత్తులో ధర్మము అభివృద్ధి చెందవలేనన్న సద్గుణములే దీనికి పోషకములు."ధర్మదేవతా!నీవీ ప్రపంచములో ఉండకుండాపోవడానికి కారణమేమని"మార్కండేయమహర్షి అడుగగా "దుర్గుణములున్న చోట నిలువ"నని చెప్పింది ధర్మదేవత.సద్గుణములు,సద్భుద్ది,సత్యనిరతి,భక్తి,క్రమశిక్షణ,కర్తవ్యపాలనములను నేర్పేదే సరైన విద్య.ఇవి కల్గిఉండడమే సరైన ఆధ్యాత్మికత.ఈ ఆరే మిత్రషట్కములు.వీటితో స్నేహం చేసుకున్ననాడు జన్మ సార్థకం అవుతుంది. 

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు