తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

శుక్రవారం 8 జనవరి 2010

పాఠాలు నేర్పే గురువులను చులకనగా చూసేవారికి ఈ సంఘటన ఒక కనువిప్పు కావాలి.

ఈ సంఘటన నిజంగా జరిగిన సంఘటన.
కంచి కామకోటి పీఠంలో జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతులవారు పీఠాధిపతిగా ఉన్న రోజులవి.
ఒక రోజు ఆయన గదిలో ఉండగా ప్రొద్దునపూట అక్కడి వేదపాఠశాలలో చదివే పిల్లలు అరుస్తూ ఆడుకొంటున్న శబ్దం వినిపించింది. ఈ సమయంలో తరగతిలో చదువుకొనకుండా బయట ఎందుకు ఆడుకొంటున్నారని పరమాచార్యులవారు బయటికి వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు తరగతికి వెళ్ళలేదు? అని అడిగారు. గురువు గారు రాలేదని ఆ పిల్లవాడు చెప్పాడు. పక్కన ఆడుకొంటున్న ఇంకో పిల్లవాడు జోక్యం చేసుకొని "గురువు గారు పాఠం చెప్తున్నారు. మేమే బయటకు వచ్చి ఆడుకొంటున్నాము" అన్నాడు. ఇద్దరిలో ఎవరిది నిజమో కనుగొనడానికి పరమాచార్యులవారు ఇద్దరినీ వెంటబెట్టుకొని తరగతి గది వద్దకు వెళ్ళి చూస్తే గురువుగారు లేరు.

అప్పుడు పరమాచార్యుల వారు రెండవ పిల్లవాడితో అబద్దం ఎందుకు చెప్పావంటూ ప్రశ్నించారు. ఆ పిల్లవాడు ఏ మాత్రం భయపడకుండా " రోజూ వచ్చే మా గురువు గారు ఈ రోజు ఏదో అత్యవసర పని మీద రాలేకపోయుంటారు. వారు రాకపోయినా తరగతిలో కూర్చొని చదువుకోవలసిన బాధ్యత మాది. కాని మేము అలా చేయలేదు. అంటే తప్పు మాది. గురువుగారు రాలేదని మీరు ఆయనను కోప్పడతారు. మీ కోపాన్నుండి ఆయననను తప్పించడానికి చిన్న అబద్దం చెప్పడం నేను ధర్మమే అనుకొంటున్నాను. ఈ సమయంలో చదువుకోక ఆడుకోవడం మా తప్పే." అన్నాడు.

అంతటి నడిచే దేవుడిగా పేరొందిన పరమాచార్యులవారు కూడా ఆ పిల్లవాడి గురుభక్తిని చూసి ఆశ్చర్యం పొందారు.
" నీవురా నిజమైన శిష్యుడివి "అంటూ ఆ పిల్లవాడి భుజం తట్టారు పరమాచార్యులవారు.

నేడు కళాశాల విద్యార్థులైనంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్లు ప్రవర్తిస్తూ గురువులను అవమానిస్తున్న వారిని, అలా చేయడానికి ప్రోత్సాహం ఇస్తున్న సినిమాలు,TVలు, పత్రికలు పైన పేర్కొనబడ్డ అబ్బాయి కాలి గోటికి సరిపోతారేమో ఆలోచించండి.




9 వ్యాఖ్యలు:

  1. బాగా ఉదహరించారు సురేశ్ గారూ...అలాంటి గురువులూ...ఇలాంటి శిష్యులూ,దుర్భిణీ వేసి చూసినా ఈ రోజుల్లో కనపడట్లేదండీ

    ప్రత్యుత్తరంతొలగించు
  2. శ్రీ గురుభ్యోనమః
    మంచి సంఘటన తెలియజేశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. సురేశ్ బాబూ!
    చాలా చక్కని సన్నివేశం చెప్పావయ్యా! ధన్యవాదాలు.
    సంస్కృతంలో ఒక సూక్తి ఉంది...
    "....గురుం యో నాభిమన్యతే,
    షష్టివర్షసహస్రాణి విష్టాయాం జాయతే కృమి:"
    (ఎవడైతే గురువును అభిమానించడో వాడు అరవైవేలసంవత్సరాలపాటు అశుద్ధంలో పురుగౌతాడు)

    ప్రత్యుత్తరంతొలగించు
  4. గురువులు గౌరవార్హులయి కూర్మిని శిష్యులఁ జూడఁ గల్గినన్
    మరవఁగ లేని స్థానమును మంచిగ నిచ్చెడి శిష్య కోటి యీ
    ధరఁ గలరంచు తెల్పితి. యదార్థము. చక్కఁగ చెప్పిరయ్య!ఓ
    వరగుణ గణ్య! సజ్జనులఁ వర్ధిలఁ గోరెడి నీకు మేలగున్.

    ప్రత్యుత్తరంతొలగించు

నా బ్లాగును ఇష్టపడేవారు