తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

మంగళవారం 27 డిసెంబర్ 2011

పరమశివులపై ఆదిశంకరాచార్యుల వేళాకోళం

ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం పెరిగేకొద్దీ చనువు ఎక్కువై వారి మధ్య ఆటపట్టించుకొనే తత్వం కూడా పెరుగుతుంది. భగవంతుడు,భక్తుడు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆదిశంకరాచార్యులు తన దైవమైన శివుడిని కూడా ఇలాగే ఆటపట్టించారు.

క్రింది శ్లోకం చూడండి.

"జడతా పశుతా కలంకితా
కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ!
అస్తి యది రాజమౌలే!
భవదాభరణస్య నాస్మి కిం పాత్రం? "

అర్థం : ఓ శంకరా! నాలో బద్దకం లేదు. పశుత్వం అసలు మచ్చుకైనా లేదు. ఇక మచ్చ అంటావా? నా శరీరానికీ, జీవితానికీ కూడా మచ్చ లేనేలేదు.వంకర టింకర గా నడిచే లక్షణం నాకు ఎన్నడూ లేదు. ఈ గుణాలన్నీ మంచివేనంటావా? ఒకవేళ ఈ గుణాలే ఉన్నాయనుకో! నీకు ఆభరణాన్ని అవుతానుకదా."

తనంతట తాను కదలలేని నీరు (గంగమ్మ) శివుడి తలపై ఆభరణముగానూ, వాహనమైన నంది పశుజాతి వాడు, తనలో మచ్చ ఉన్న చంద్రుడు శివుడికి శిరోభూషణముగా మరియు వంకర గా అంటే మెలికలు తిరుగుతూ ఉండే పాము కూడా శివుడికి ఆభరణాలే.

కాబట్టి జడత్వం,పశుత్వం, కుటిల కదలిక ఉన్నా నీవు ఆదరిస్తావు. నాకు కూడా ఇలాంటి గుణాలు ఉంటేనే నన్ను కూడా ధరిస్తావేమో! అని ఆదిశంకరాచార్యులు ఆటపట్టిస్తున్నారు.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

నా బ్లాగును ఇష్టపడేవారు